ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/మరల బెజవాడ (2)

వికీసోర్స్ నుండి

22. మరల బెజవాడ (2)

అనంతముగా రిపుడు సకుటుంబముగ బళ్లారిలో నివసించి యుండిరి. వారి యాహ్వానము ననుసరించి మే మపుడు మార్గమధ్యమందలి బళ్లారి పోయి యచట రెండుదినములు నిలిచితిమి. వారి స్నేహితులగు సి. యస్. సుబ్రహ్మణ్యమయ్యగారి యిల్లు మాకు విడిది యయ్యెను. అయ్యగారు సుప్రసిద్ధాంద్రులగు మీనాక్షయ్యగారి యల్లుఁడు. ఈ దంపతులు సాధుజనులు. అనంతముగారు మాకు బళ్లారినగరము చూపించిరి. పట్టణము చక్కనిదియె కాని, అందు దోమలబాధ మెండు. దివ్యజ్ఞానసామాజికులగు ఆర్. జగన్నాధయ్యగారును, వార్‌డ్లాపాఠశాలాధ్యక్షులగు కోటిలింగముగారును నా కచటఁ బరిచితులైరి. నా స్నేహితులును, బాలికాపాఠశాలల పరీక్షాధికారులునునగు శ్రీ పి. రామానుజాచార్యులుగా రచట నుండిరి.

30 వ నవంబరు ప్రొద్దున మేము మరల రెయిలులో కూర్చుండి డిశెంబరు 1 వ తేదీ యుదయమునకు బెజవాడ చేరితిమి. కడుఁ బ్రియమగు బెజవాడను మరలఁ గాంచి నా కన్నులనుండి యానందాశ్రువు లొలికెను. నాకొఱకు విద్యార్థులు రెయిలుస్టేషనులోఁ గనిపెట్టుకొని యుండిరి. మేము మాతోఁటబంగాళాకుఁ బోయితిమి. పెరటిలోని జామలు, సీతాఫలపుచెట్లును పండ్లతో నిండియుండి, మాకు సుస్వాగత మొసంగెను ! ఆసాయంకాలము టానరుదొరను, దాసుగారిని జూచి, మరల బెజవాడ పాఠశాలలోఁ బ్రవేశించితిని. మే మంత సంవత్సర పరీక్షలు జరుప నారంభించితిమి. డిశెంబరు 2 వ తేదీని మిత్రులతోఁ గలసి, రెయిలుస్టేషనులో వీరేశలింగముగారిని సందర్శించితిని. చెన్నపురిలోఁ గృషి చేయవలెనని గంపెడాసతోఁ గదలిపోవుచుండు పంతులుగారు నావలెనే విఫలమనోరథులై వెనుకంజవేయుదురేమో యని నేను వెఱగందితిని. దైవానుగ్రహమువలన వారి కన్ని శుభములు సమకూరవలయు నని కోరితిని.

నా సలహామీఁద శ్రీచిలుకూరి వీరభద్రరావుగా రిపుడు బెజవాడ రావలె నని యుద్దేశించిరి. 98 వ సంవత్సరారంభము నుండియు మే మిరువురమును గలసి యొక యాంగ్లాంధ్ర వారపత్రిక నెలకొల్ప నుద్యమించితిమి. రావుగారికిని వారి ముద్రాలయమునకు వలసిన యొక బస నేర్పాటు చేయుటకు మిత్రులు నేనును వెదకితిమి.

ఈ శీతకాలపుసెలవులలో కొంచెము జబ్బుగ నుండిన నా భార్యను జూచిపోవుటకు నా యత్తగారు, బావమఱఁదియు బెజవాడ వచ్చిరి. వెంకటరామయ్య రేపల్లెనుండి బెజవాడకు వచ్చి న్యాయవాదిపరీక్షకై మద్రాసు వెడలిపోయెను. తలిదండ్రులను జూచివచ్చుటకు నేను డిశెంబరు 18 వ తేదీని రాజమంద్రి వెళ్లితిని. కృష్ణమూర్తిభార్య నంజువ్యాధితో బాధపడుచుండెను. కుటుంబవ్యవహారములను గుఱించి తలిదండ్రులతోను, తమ్ముఁడు కృష్ణమూర్తితోను నేను మాటాడితిని. మా సంసారమున వ్యాధులవలెనే అప్పులును దినదినప్రవర్ధమాన మగుచుండెను ! బాధ్యతలు హెచ్చుచుండెను. దూరమున రాజమంద్రిలోనుండు జననీజనకులను నేను సరిగాఁ గనిపెట్టనేరకుంటిని కాన, పిల్లలతో వారు బెజవాడ వచ్చినచో, అందఱును సౌఖ్యమును మనశ్శాంతిని ననుభవింతు రని తలిదండ్రులకు బోధించి, వారలను విజయవాడ కాహ్వానించితిని. వా రొకవిధముగ సమ్మతించిరి.

పెద్దయప్పు లటుండనిచ్చి, మా చిల్లర యప్పులే రాజమంద్రిలో పెరిఁగిపోవుచుండెను ! మా సంసారము రాజమంద్రినుండి తరలించుటకు ముందుగ 250 రూపాయిలు కావలసివచ్చెను. సోదరినగలు కుదువఁ బెట్టినచో నీసొమ్ము మాకు దొరుకునని తెలిసెను. దీనికి చెల్లెలు సమ్మతించుటచేత, నగలతాకట్టుమీఁద సొమ్ము బదులు తెచ్చి యప్పులు తీర్చివైచితిమి. తలిదండ్రులను వెనుక నుండి రమ్మని చెప్పి, 22 వ తేదీని మామగారితో నే నేలూరు పయనమైతిని. అక్కడ వీరభద్రరావుగారిని గలిసికొని, వారితో మాటాడితిని. భూములు కొన్ని యమ్మివైచి, ఆ సొమ్ముతో ముద్రాలయము నొకటి కొని బెజవాడలో దాని నెలకొల్పెదనని ఆయన చెప్పిరి. నాకును గొంత సొమ్ము బదు లిచ్చెద మనిరి. మేము ఉభయులమును వారపత్రికను స్థాపింపఁబూనుకొంటిమి.

అంత నేను బెజవాడ వచ్చితిని. మద్రాసులో నారంభింపని న్యాయశాస్త్రపరీక్ష చదువులు బెజవాడలో నే నిపుడు మొదలు పెట్టితిని ! దాసుగారి నడిగి న్యాయశాస్త్రగ్రంథ మొకటి తెచ్చి ముందు వేసికొని కూర్చుంటిని. శరీరస్వాస్థ్యమునకై తొట్టిస్నానములు చేయఁబూనితిని. కాలక్రమమున మన యూహలందును క్రియల యందును మనకే విడ్డూరముగఁ దోఁచు విచిత్ర పరిణామ మొక్కొక తఱి నేర్పడుచుండెను !

23. "చిప్పలశివరాత్రి"

1898 జనవరి మొదటితేదీని మా యప్పులపట్టికను నేను దిరుగ వేసితిని. వడ్డితో మే మీనాఁటికి పద్దుపత్రముల మూలమున నీయవలసిన యప్పులును స్నేహితుల చేబదుళ్లును గలసి, సుమారు నాలుగువేల రూపాయి లగఁబడెను ! ఎట్లీ యప్పు తీర్చివేయఁగలమా యని నేను తల్ల డిల్లితిని. ఆరోజు దినచర్యపుటలో నే నిట్లు లిఖించితిని : - "ఈ