ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/న్యాయవాదిపరీక్ష

వికీసోర్స్ నుండి

37. న్యాయవాదిపరీక్ష

మహబూబు పాఠశాలలో బోధకుఁడును, నాయఁడుగారి స్నేహితుఁడును నగు కుప్పురామయ్యగారు, సకుటుంబముగ వచ్చి మాయింట జనవరిలో 10 దినము లుండిరి. 11 యేండ్లవయస్సుగల యాయనకొమార్తె వితంతు వయ్యెను. ఆమెకుఁ బునర్వివాహము చేయఁ దన కుద్దేశముగలదని యాయన నాతోఁ జెప్పఁగ, కాకినాడలోని నామిత్రు లొకరు తప్పక చేసికొందు రని చెప్పితిని. 11 వ జనవరితేదీని నేను రాజమంద్రి వెళ్లి యక్కడనుండి యాస్నేహితునికి జాబు వ్రాసితిని. ధైర్యముచేసి వా రీపిల్లను వివాహమాడుట ధర్మమనియు, అట్లు చేయకున్న తమరి నిఁక నెవ్వరును నమ్మరనియును, నేను వ్రాసివేసితిని !

ఆదినములలో బోయరుయుద్ధము సాగుచుండెను. ఉభయసైన్యములలోను పెక్కండ్రు నిహతు లగుచుండిరి. ధైర్యాశాలులును, అల్ప సంఖ్యాకులును నగు పగతురదెస బ్రిటీషు వారికిఁ గల వైఖరిని మేము నిరసించుచుండువారము.

మాతమ్ముఁడు వెంకటరామయ్య నాతో న్యాయశాస్త్ర పుస్తకములు చదువుచు, తన వృత్తిపనులు చక్క పెట్టుకొను చుండువాఁడు. మాతండ్రి గతించుటకు మేము మిగుల వగచితిని. 16 వ తేదీని నేను మరల బెజవాడ వెడలివచ్చితిని.

మా మఱఁదలు చామాలమ్మ తనపిల్లలతో బెజవాడ వచ్చి, మాతోఁ గొన్ని రోజు లుండెను. ఆరోజులలో నామెకొమార్తె నగ యొకటి పోయెను. మాయింట 'పాచిపనులు' చేయు నొకపిల్లమీఁద మే మనుమానపడితిమి. కామశాస్త్రిగారు నేనును దానియింటికిఁ బోయి, నగ యిచ్చివేయు మనియు, లేనిచో చిక్కులలోని కది వచ్చుననియుఁ జెప్పివేసితిమి. నగసంగతి తనకుఁ తెలియదని యపుడు చెప్పినను, మఱునాఁ డాస్త్రీ మావస్తువు మాకిచ్చివేసెను.

26 వ జనవరి దినచర్యయం దిట్లుండెను : - "పాఠాశాలాధికారి క్లార్కుదొర వచ్చుటచేత నేను తమ్ముఁడును న్యాయశాస్త్ర పరీక్షలకుఁ జెన్న పురి బయలుదేఱలేక పోయితిమి. సాయంకాలము పాఠశాలలో నుపాధ్యాయులసభ జరిగెను. బోధకులు దినమున కైదు గంటలు విద్యాలయమునఁ బని చేయవలయు ననియు, అట్లు చేయనొల్లనివారు పాఠశాల వదలిపోవలయు ననియును, క్లార్కుదొర సగర్వముగ సేనానివలెఁ జెప్పి వేసెను ! భారతదేశవిముక్తికొఱకు పాటుపడెడి క్రైస్తవమత ప్రచారకులపద్ధతు లిట్టివి ! ఓ జీససా, నీయనుచరుల చర్యలనుగూర్చి యశ్రువులెట్లు నీకనుగవనుండి యొల్కుచున్నదో కద !"

27 వ జనవరిని తమ్ముఁడు నేనును మద్రాసు బయలుదేఱితిమి. రెయిలులోకూడ మే మిరువురమును పరీక్షాపుస్తకములు తిరుగవేయుచుంటిమి. అంతకుముందె తెనాలిమీఁదుగ మధ్యమార్గమున రెయిలుచెన్న పురి పోవ నారంభించెను. కావున మఱునాఁడు ప్రొద్దునకే రాయపురము చేరితిమి. మిత్రుఁడు ములుకుట్ల సూర్యప్రకాశరావుగారు తిరువళిక్కేణిలో తమ బసయొద్ద మా కొకగది కుదిర్చి పెట్టిరి. 29 వ తేదీనుండి పరీక్షలు జరిగెను. మొదటి పరీక్షాపత్రము నందఱివలెనే నేనును పాడుచేసితిని. 2 వ ఫిబ్రవరితో పరీక్ష ముగియఁగా, తల తడివి చూచికొంటిని ! మంత్రిరావు వెంకటరత్నముతో మే మిరువురమును, పార్థసారథికోవెలను దర్శించితిమి. మఱునాఁడు ఫ్లెచ్చరు విలియమ్స్‌దొర యొసంగిన 'షేక్స్‌పియరును' గుఱించిన యుపన్యా సము విని, ఆయనతో మాటాడితిమి. 4 వ ఫిబ్రవరిని పరశువాకము వెళ్లి వీరేశలింగముగారిని జూచివచ్చితిమి. ఆయన యచట విశాలస్థలమున నొకభవనము కట్టి, అందు 'వితంతుశరణాలయము'ను నెలకొల్పి నడుపుచుండిరి. ఆసాయంకాలము మేము చెన్నపురి విడిచితిమి.

24 వ ఫిబ్రవరిని వీరభద్రరావుగారితోఁ గలసి నేను రెయిలు స్టేషనునకుఁ బోయి, వీరేశలింగముగారికొఱకుఁ గనిపెట్టుకొని యుంటిని. పంతులుగారు సకుటుంబముగ చెన్న పురినుండి ప్రయాణము చేయుచుండిరి. మేము కొనిపోయిన యన్నము వారు భుజించిరి. తాము విశాఘపట్టణముజిల్లా పోవుచున్నా మనియు, తమతో వచ్చెడి బాలవితంతువును న్యాపతి శేషగిరిరావుపంతులుగారి కిచ్చి యిక్కడ వివాహము చేతుమనియు, వివాహ మగువఱకు నే నీసంగతిని రహస్యముగ నుంచవలెననియును, పంతులుగారు చెప్పిరి. పెండ్లికుమారుని యన్న గారగు సుబ్బారావుపంతులుగారు రాజమంద్రిలో నుండుటవలన, ప్రమాదవశమున నీసంగతి వారికిఁ దెలిసినచో, వివాహమున కంతరాయము సంభవింపవచ్చు నని పంతులుగారి భయము !

ఈరోజుననే మాతల్లి, తమ్ముఁడు కృష్ణమూర్తి, చెల్లెలు కామేశ్వరమ్మయును, మమ్ముఁ జూచిపోవుటకు బెజవాడ వచ్చిరి. వైద్యుని బిలిపించి మాతల్లిని జూపించితిని. ఔషధ మిచ్చెద మని యాయన చెప్పిరి.

నాకు రెండువేలరూపాయిలు బదు లిచ్చెదరా యని నా పూర్వ శిష్యుల నిద్దఱిని నే నడుగఁగా, ఈయలేమని మోమోటముచేఁ జెప్ప లేక, వారు కొంత కాలయాపనము చేసిరి. ఈ సంగతిని స్పష్టముగఁ దెలిసికొనుటకై నేను వారియింటికిఁ బోఁగా, వారిలో నొకఁడు తన లెక్కలపుస్తకము నాముందు వేసెను. ఆయనయొద్ద దమ్మిడియైనను నిలువ లేనట్టుగ నంకె లందు వేయఁబడియుండెను ! లేదని చెప్పివేయుటకు శిష్యుఁడు త్రొక్కిన యీ చుట్టుత్రోవకు నాకు విస్మయము గల్గెను !

వీరేశలింగముగారు, వారిభార్యయు, 3 వ మార్చిని తిరిగి మద్రాసు వెడలిపోయిరి. మేము స్టేషనులో వారిని గలసికొంటిమి. ఈ పెండ్లి విషయమున పంతులుగారు చూపిన సాహసచాతుర్యములను మెచ్చుకొంటిమి.

4 వ మార్చి ఆదివారమున నా దినచర్య యిటు లున్నది : - "భోజన మాలస్యము, భార్యమీఁదికోపము ! చీ ! ఇట్టిబ్రదుకుకంటె మరణ మే మేలు? అవిధేయయగు భార్య, ఎక్కడఁ జూచిన నప్పులు, తగుమాత్రపు రాబడి, ఉన్నతాశయములు - వీనియన్నిటికిని సమన్వయ సామరస్యము లెట్లు పొసంగును ? * * * * * మేము ప్రార్థన జరిపితిమి. 'సత్యము, సర్వశ్వరుఁడు' అను విషయమున నేను ధర్మోపన్యాసము చేసితిని. అంత కృష్ణవైపునకు షికారు. మార్టినో విరచితమగు 'మతపఠనము'ను జదివితిని."

4 వ తేదీని మా కొక యాకాశరామన్న యుత్తర మందెను. లిపి బాగుగ లేనందున నందలిసంగతులు బాగుగఁ దెలియ లేదు. మఱునాఁడు వీరభద్రరావుగారికి నిట్టి యుత్తరము వచ్చిన ట్టాయన చెప్పి, నా కది చూపించెను. నాభార్య మాటకారి యనియు, గర్వి యనియు నం దుండెను ! నలుగురు విద్యార్థు లీయుత్తరముల వ్రాసె నని యందుఁ గలదు. ఇట్టి యాకాశరామన్న యుత్తరములు నే నెప్పుడు నెఱుఁగను! ఖిన్ను రాలగు నాభార్య యీసంగతి వీరభద్రరావుగారి సతితోఁ జెప్పఁగా, సర్వజ్ఞులగు కవు లింటనేయుండఁగా, పరులనుగుఱించి యనుమానప డెద రేమని సాభిప్రాయముగ నాసుదతి ప్రత్యుత్తర మిచ్చెను న్యాయవాది పరీక్షాఫలితములు 18 వ మార్చిని తెలిసెను. నేను తప్పిపోయితిని. వెంకటరామయ్య వెనుకటివలెనే రెండవతరగతిలోనే జయమందెను. రాజధాని యంతటిలోను మొదటితరగతిలో నొక్కరే గెలుచుటయు, నావలె రెండవతరగతి పరీక్షకు వచ్చినవారందఱు నపజయము గాంచుటయు, ఈపరీక్షలోని యైదుభాగములలో రెండింట నేను గృతార్థుఁడ నగుటయును, నాకుఁ గొంత యుపశమనము గావించెను !

'ఏలూరు యువజనసమాజ'సభలో వొక యుపన్యాస మీయుఁడని నా కిపుడు పిలుపువచ్చెను. "బాల్యస్వర్గము" అను విషయముపై నేనొక యాంగ్ల వ్యాసము వ్రాసి, 8 వ ఏప్రిలున ఏలూరులో జరిగిన సభలోఁ జదివితిని.

కొలఁది రోజులలోనే రాజమంద్రి ప్రార్థనసమాజవర్థంతి జరిగెను. ఆ సమయమున (15 వ ఏప్రిలు) మా తమ్ముఁడు "భూలోక స్వర్గము" అను తెలుఁగు వ్యాసమును, నేను "వీరసంస్కర్త" అను నాంగ్లవ్యాసమును జదివితిమి. వీరేశలింగముగారి జీవితవిమర్శనమే నా ప్రసంగమునకు ముఖ్యవిషయము. అఱవపల్లి సుబ్బారావుగారు మున్నగు విద్యాధికులు మెచ్చుకొనిరి గాని, నామిత్రుల కంతగ నారచనము రుచింపలేదు. 'పెరటిచెట్టు మందునకు రాదుగదా' యని తలపోసి నే నూఱడిల్లి తిని.

38. "బాల్యస్వర్గము"

మనుజుని రచనములు వాని యాలోచనముల ప్రతిబింబములు. 1900 వ సంవత్సరప్రాంతములందలి నాయూహాపోహములకును, ఆశయములకును, నే నాసంవత్సరమున లిఖియించిన రెండువ్యాసములు