ఆంధ్ర వీరులు/ఖడ్గ తిక్కన

వికీసోర్స్ నుండి

ఖడ్గ తిక్కన.

ఆంధ్రులలో ఖడ్గతిక్కన మిగుల బ్రసిద్ధుడు. ఈతని పరాక్రమజీవితము పల్లెపదములందును జాటు పద్యములందును నిమిడియుండుటచే జిరకాలమునుండి యాంధ్రసోదరు లీశూరమూర్తిని స్మరించుచున్నారు. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. సిద్ధనామాత్యునకు బోలమాంబకు జనించిన యేడుగురు కుమారులలో బెద్దవాడు. గౌతమస గోత్రుడు. భారతమును రచించిన తిక్కనసోమయాజితండ్రియగు కొమ్మనామాత్యుడును, ఈవీరుని తండ్రియగు సిద్ధనామాత్యుడును నొక తల్లిబిడ్డలు. గాన నీవీరులిద్దరు నన్నదమ్ములు కొమారులు. ఖడ్గతిక్కన బాల్యమున సంస్కృతాంధ్రభాషలభ్యసించి రాజనీతిశాస్త్రమునందును. ధనుర్విద్యయందును బ్రసిద్ధిగడించి యాకాలమున బ్రసిద్ధుడై నెల్లూరురాజ్యమును బాలించుచున్న మనుమసిద్ధి నృపాలుని యొద్ద సేనానాయకుడుగ నుండి యాతడు గడించిన విజయము లన్నింటికి దానె యాధారమయ్యెను. ఈవీరవతంసుడు విద్యా వితరణ విక్రాంతులలో నిరుపమానుడై విక్రమసింహపుర రాజ్యమును, దానొక్కండె భుజపీఠిపై ధరించెనని చెప్పుదుమేని యిందతిశయొక్తి కలదని చరిత్రవిదులు వాకొనలేరు.

ఖడ్గతిక్కన మనుమసిద్ధి కేయేసంగ్రామములలో నెంతెంత సహాయపడినో నిర్ణయించు నాధారములు లభించుట
కలవు. వీరశిరోమణి యగు ఖడ్గతిక్కన యింత ప్రసిద్ధు డగుటకు నాతని తల్లియు వీరమాతయు నగు పోలమాంబ స్తన్యప్రభావమని వేఱుగా జెప్పబనిలేదు. ఖడ్గతిక్కన కేవలదండ నాయకుడుగ నుండి కులాచారములు విడనాడినవాడు కాడు. ఇతడు వేదగానలోలుడు. బ్రాహ్మణకుటుంబ పోషకుడు. దానకర్ణుడు. విరోధిఖండన చణుడు. ఈమహామహుని యాశ్రయమున "రాయవేశ్యా భుజంగరాజమూర్తి గంధవారణా"ది బిరుదము లన్వర్థములై ప్రశస్తిమంతము లయ్యెను. ఒకకవితా విషయమున జెప్పుట కాధారములు లేవుగాని పరాక్రమౌదార్య పాండిత్య రాజకీయ పరిజ్ఞానాది మహాపురుష ధర్మములలో దిక్కన సోమయాజికి ఖడ్గతిక్కన యించుకేనియు దీసిపోవ జాలడనియు బై పెచ్చు పయిజేయిగా నున్నాడనియు జెప్పనగును. కేతనకవి యీమహావీరుని గుణవర్ణనము మిగుల మనోహరముగా గావించి ప్రశంసించియున్నాడు. ఆయన వర్ణన భాగముల దిలకింతుమేని ఖడ్గతిక్కన నాంధ్రపరశురాముడని ప్రశంసింప వచ్చును.

ఖడ్గతిక్కన విజయము తెలుపు కథాగ్రంథములలో కాటమరాజుకథయొకటి. కొట్టరుపువంశతిలకుడగు ఖడ్గతిక్కన పరాక్రమ జీవితము, స్వామిభక్తి యీగ్రంథమువలన నెఱుంగవచ్చును. విద్యాప్రియులగు నాగరకులకు జిరకాలమునుండి కాటమరాజుకథ వినిపించి ఖడ్గతిక్కన జీవితచరిత్రమును విస్మృతి తరంగము చాటున నదృశ్యముకాకుండ గాపాడిన వీరకథా గాయకులకు బ్రకృతకథాపఠనావసరమున గృతజ్ఞత దెలుపుట మన విధులలో నొకటియై యున్నది.

కాటమరా జను యాదవవంశజుడు నెల్లూరుమండలమందుగల కనిగిరిసీమలోని యెఱ్ఱగడ్డపాడుప్రాంత భూతములను బాలించుచుండెను. ఇతడు గొప్ప భూస్వామియు నపరిమిత పశుధనము గలవాడునై సజాతీయుల కందఱ కధిపతియై మిగుల బలుకుబడితో గులపెద్దయను గౌరవముతో గాలయాపనము చేయుచుండెను. ఆ కాలమున గొన్నిసంవత్సరము లనావృష్టి తటస్థించుటచే బ్రజలకు బశులకు గూడ చాల చిక్కులు గలిగెను.

యాదవులు విశేష పశుగణము గలవారగుటచె దమ బీళ్లన్నింటను గడ్డిలేకుంట చూచి తృణజల సమృద్ధిగల తావులకేగి పశువుల మేపుకొని దేశము సుభిక్షమైనపిమ్మట తిరిగి యిండ్లకు జేరనిశ్చయించిరి. కొందఱు యాదవులు దూర దేశములకుబోయి పైరుపచ్చలు చల్లగానుండు ప్రదేశము తాము చూచినంతలో నెల్లూరిచెంతగల పాలేరుతీరమని వచ్చి తమ రాజున కెఱిగించిరి. కాటమరాజు పశుగణమును యాదవులను వెంటగొని నెల్లూరిప్రాంతములకేగి యట తనపశువులను బశుపాలకులను నాపి, ఆప్రాంతముల బాలించు మనుమసిద్ధి భూపాలుని దగ్గరకుబోయి తనకష్టములనెల్ల నెఱింగించి పాలేటి తీరమునగల బీళ్లు కొంతకాలము పశువులు మేపుకొనుటకు బుల్లరికి దీసికొనెను. పాలేటితీరమున గాటమరాజు కొన్నాళ్ళు నివసించి పశుగణమును బోషించుకొని కాలము గడుపుచుండు నంతలో ఎఱ్ఱగడ్డపాటినుండి కొందఱు గొల్లలువచ్చి వర్షములు కురిసినవనియు దేశము సుభిక్షముగా నున్నదనియు బశువులకు గూడ మేతగలదనియు వర్తమానము చెప్పిరి. కాటమరాజు ఆవార్త విన్నంతనె మిగులసంతసించి గంగమ్మకు జాతరులుచేయించి పరిమితివఱకు బశువుల మేపుకొనలేదు గాన మనుమసిద్ధికి మనము పుల్లరినీయ నవసరములేదని తమలోదాము నిశ్చయించుకొని యాదవులను బశువులను వెంటబెట్టుకొని పోవుచుండ మనుమసిద్ధిభటు లడ్డగించిరి. వారల దిరస్కరించి యాదవులు తమగ్రామము వెడలిపోయిరి. భటులవలన మనుమసిద్ధి యీవర్తమానము విని మండిపడి యాదవుల దురాగతమున కేవగించి అన్నము భట్టు అను నొక బ్రాహ్మణుని కాటమరాజువద్దకు పుల్లగి యొసంగుడని కోరుటకు బంపెను. యాదవులు పుల్లరి నీయవలసిన యవసరములేదనియు, గొలదికాలమె పశువులను మేపితిమిగాన నీయక పోవుటయె ధర్మమనియు, రాయబారములకు లొంగి కనకవర్షము గురిపించుటకు గొల్లలు పిచ్చి వాండ్రుకారనియు నందఱపక్షమున కాటమరాజు వర్తమానము చేసెను. యాదవులను వంచింపకున్న లాభములేదనియు పుల్లరి విడిచిపెట్టితిమేని పౌరులకు గూడ నలుసు కలుగుననియు మనుమసిద్ధి భూపాలుడు సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన యనుమతి చొప్పున సంగరమునకు తలపడియెను.

ఈవార్త యాదవులు విని కాటమరాజున కెఱింగించిరి. కాటమరాజు తన బంధువులు వీరులు నగువారికందఱకు వర్తమానము లంపి పిలువనంపి సైనికబలము నాయత్తపఱచెను. కొండపల్లి చల్లపిన్నమ్మనాయకుడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టామరాజు, కరియాపులరాజు, వల్లభన్న, నేతిముద్దయ్యనాయడు, పురుషోత్తమరాజు లోనగు సుప్రసిద్ధ యాదవప్రముఖులు సైనికసహాయులై కాటమరాజు పక్షమున జేరిరి. కాటమరాజు తనసేనకు గ్రమశిక్ష నొసంగి చిన్నమనాయని మంత్రిగను బ్రహ్మరుద్రయ్యయను బ్రాహ్మణుని సేనానాయకునిగను నేర్పఱచి సంగరమునకు సైన్యసహితముగ బయలుదేరెను. మనుమసిద్ధిపక్షమున సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన కొంతసేన్యమును వెంటగొని ఎఱ్ఱగడ్డపాటికి బయలుదేరెను. రెండు సైన్యములును బాలేరుయొడ్డున నున్న పంచలింగములకడ సంగరమునకు దలకొనెను. యాదవులు చెక్కు చెదరులేక మతావేశము స్వతంత్రదీక్ష నూతగాగొని ముక్కాకలదీరిన ఖడ్గతిక్కన సైన్యముతో మిగుల భయంకరముగా బోరాడిరి. ఖడ్గతిక్కన నిర్లక్ష్యభావముతో యాదవులను సరుకుసేయక స్వల్పబలమును మాత్రమె వెంటతెచ్చెను. ఐనను నిరుత్సాహపడక యాదవ సైన్యము నెదిరించి పట్టుదలతో బోరాడుచుండెను. యాదవ సైన్యము ఖడ్గతిక్కన సైన్యమును జాలవఱకు నాశనముగావించి ముందునకు వచ్చుచుండెను. ఈపరాజయ పరిస్థితులగాంచి యేని జంకక ఖడ్గతిక్కన హతశేషమగు సైన్యముతో జిరకాలము పోరాడెను. యాదవసైన్యము చుట్టుముట్టి ఖడ్గతిక్కనను నాతని స్వల్పసైన్యమును బట్టుకొనిరి. ఖడ్గతిక్కనను కాటమరాజు సమీపించి "బ్రాహ్మణోత్తమా! సంగరము మానుకొనుము. బ్రాహ్మణుల జంపిన మాకు బ్రహ్మహత్య వచ్చును. అగ్రవర్ణులగు మీరు మాతోబోరుట న్యాయముగాదు. మమ్ము గోపింపక సంగరయత్నము మానుకొను" మని ప్రార్థించి విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన చేయునదిలేక గుఱ్ఱమునెక్కి నెల్లూరి కేగి సైన్యముతో రాదలంచి గృహాభిముఖు డయ్యెను.

పరాభవదు:ఖముతో ఖడ్గతిక్కన గృహము చేరెను. మంచములోనున్న సిద్ధానామాత్యుడు తన కుమారుడు పారి వచ్చినాడని తలంచి "ఛీ పాఱుబోతా! తుచ్ఛమగు ప్రాణము కాశపడి యిల్లు చేరిన నిన్ను జూచిన పాపమువచ్చు"నని ఖడ్గతిక్కనను నొవ్వనాడెను. తండ్రియొనరించిన తిరస్కారముచే ఖడ్గతిక్కనహృదయము కలగిపోయెను. ఇంటిలోనికిబోవ నతని భార్య చావమ్మ భర్తను సాదరంబున జూచి 'వంటయైనది, స్నానముచేయు' డని చెప్పి స్త్రీలు స్నానముచేయుతావున నొక మంచము చాటుజేసి పసుపుకుంకుమ యట పదిలపఱచెను. ఖడ్గ తిక్కన తన భార్యను జూచి యదియేమని యడుగ సంగరము నుండి పాఱివచ్చిన భర్తలను వీరపత్నులు గౌరవింపదగిన విధమిదియెకదా? యనిప్రత్యుత్తర మొసంగెను. తన ప్రమాదమునకు దాను నొచ్చుకొని యెటులోస్నానము గావించి ఖడ్గతిక్కన భోజనగృహములోని కేగెను. తల్లి ప్రోలమాంబ అన్నము వడ్డించెను. కుమారుడు భుజించుచుండెను. మజ్జిగకు మాఱుగా తల్లి పాలు వడ్డించెను. అవి విఱిగిపోయియుంటచే నిటులున్న వేమి యని ఖడ్గతిక్కన తల్లినడిగెను. ఆమె పక్కున నవ్వి "విరోధులను జయింపలేక పందవై నీవు వచ్చుటచే బశువులు విఱిగినవి, పాలును విఱిగె"నని చెప్పెను. ఆమాటవిని యెటులో భోజనవ్యాపారమును ముగించి ఖడ్గతిక్కన పరాభవ దు:ఖము నిష్ఠురోక్తులవలని రోసము మదిలో నుంచుకొని "జయించి విక్రమసింహపురమును జేరవలయును, లేదా సంగరమందె మరణింపవలయును. ఇదియె నా ప్రతిజ్ఞ"యని పలికి రాజమందిరమున కేగి క్రొత్తసైన్యమును దనవెంట గైకొని రివ్వున సంగ్రామరంగము చేరెను.

ఖడ్గతిక్కన సైన్యసహాయుడై సంగరరంగము నలంకరించుచున్నాడని యాదవు లాలించి వారును రణరంగము నలంకరించిరి. ప్రళయకాల నటునివలె విజయముపై లక్ష్యముంచి నిశ్చలముగా బోరాడు ఖడ్గతిక్కనవిక్రమమునకు వెఱచి సైనికులు త్రోవనీయసాగిరి. కాటమరాజు సైన్యము చలించెను. కడకు గర్తవ్యము దోచక కాటమరాజు రణరంగమున బ్రవేశించి తనకడ్డముగానున్న ప్రతిపక్ష సైన్యమును దెగటార్చుచు ఖడ్గతిక్కనను సమీపించి నమస్కరించి "బ్రాహ్మణోత్తమా! పోరుడుగుము, పోరుడుగుము. బ్రహ్మహత్యా పాపము మాకంఠముల జుట్టకుము. చేతులార నిన్ను వధింపజాలము. వెనుకకు మరలిపొ"మ్మని దోసిలియొగ్గి సవినయముగా బ్రార్థించెను. ఖడ్గతిక్కన యాతని నగౌరవించి "చేతగాకున్న పుల్లరినొసంగి శరణు గోరుము. శక్తియున్న నెదిరింపుము. పెక్కుమాటలేల? బ్రాహ్మణుని జంపదగదని ధర్మశాస్త్రములు వల్లింప దలంచితిరేని మీకు సంఘవిలయము తప్పదు పొమ్మ"ని తిరస్కరించెను. కాటమరాజు చేయునదిలేక తన సైన్యమును ఖడ్గతిక్కనమీదికి బఱపి కాటమరాజు స్వయముగా సంగ్రామభారము వహించెను. రెండు మూడు మాఱులు మంచి యవకాశము లభించినను భ్రాహ్మణ భక్తుడగు కాటమరాజు ఖడ్గతిక్కనను విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన యట్టి యవకాశము తనకు జిక్కినపుడు చేతనైనంతవఱకు బ్రతిపక్షసైన్యమును మారణము చేయుచుండెను. ఈ పరిస్థితులను గమనించి సేనానాయకుడగు బ్రహ్మరుద్రయ్య కాటమరాజువద్దకేగి, "నృపాలకా! నీవాగుము. బ్రాహ్మణుడని ఖడ్గతిక్కనను నీవు వదలుటచే నాతడు మనసైన్యమును రూపుమాపుచున్నాడు. వర్ణాశ్రమ ధర్మములు విచారింపవలసినది సంగ్రామరంగమందా? పేరునకు నీవు సేనాధీశ్వరుడుగ నుండుము. నేను జయము సాధింతు"నని ఖడ్గతిక్కనను సైన్య సహాయముతో నెదిరించెను. ఉభయులు రణకౌశలులగుటచే జిరకాలము జయాపజయ నిర్ణయముల కనువుగానటుల బోరాడిరి. కాలవశమున వీరవతంసుడగు ఖడ్గతిక్కన మరణించెను. స్వామిభక్తిగల యాతనియశ్వము ఖడ్గతిక్కన శిరమును నోట దగిలించుకొని నెల్లూరిలోని తన యజమాని యింటివద్దకు జేరి సకిలించెను. ఇంటిలోని వారందఱువచ్చి చూడఖడ్గతిక్కనశిరము గోచరించెను. ఖడ్గతిక్కన రణరంగమున మరణించినవా ర్త వినినంతనె నగరమంతయు క్షోభించెను. వీరవతంసు లందఱు కన్నీరు గార్చిరి.

మంచములోనున్న సిద్ధానామాత్యుడు కుమారుని వీరమరణవార్త వినినంతన యానందబాష్పములు విడుచుచు బరలోక మలంకరించెను. ఆయన తల్లియగు ప్రోలమాంబ కుమారుని శిరము ముద్దాడి యిప్పటికి వీరమాత ననిపించుకొంటినని ప్రాణములు విడిచెను. చానమ్మ భర్తతల నొక కాష్ఠమునందుంచి తానును నందుజొచ్చి సర్వజన ప్రశంసాపాత్రురాలై కీర్తివహించెను. ఖడ్గతిక్కన భౌతికస్వరూప మేనాడో నశించినది. చరిత్రాభిరతులు నుత్సాహశాలురునగు నాంధ్రయువక హృదయములం దామహావీరునితేజము నేటికి బ్రకాశించుచున్నది. ఈవీరునిజన్మకాలము తెలియదుగాని క్రీ.శ. 1200-1260 వఱకున్న తిక్కనసోమయాజికి సమకాలికుడును, సోదరుడును గాన నించుమించుగా నాకాలముననే యున్నటుల విశ్వసింపవచ్చును. స్వామిభక్తిపరాయణతయందును. శూరత్వమునందును నీవీరవతంసుడు ఆంధ్ర వీరసందోహమునందవతంసప్రాయుడై యున్నాడు. ఆంధ్రుల పునరభ్యుదయమున కీవీరుని సంకల్పము దోహద మొసంగుగాక.

______

ప్రతాపరుద్ర చక్రవర్తి.

మన కథానాయకుడగు ప్రతాపరుద్రచక్రవర్తి క్షత్రియ వంశజుడు. వీరాధివీరుడగు నీరాజసింహుని చరిత్రము తెలిసికొనుటకు ముం దీయన పూర్వులను గుఱించి తెలిసికొనుట యావశ్యకము. తొలుత కళ్యాణపురరాజులగు పశ్చిమచాళుక్యులకడ దండనాయకుడుగ నున్న ప్రోలరాజను వీరుడు తద్రాజ్యపతనానంతరము హనుమకొండ రాజధానిగా జేసికొని స్వతంత్రపతాకము స్థాపించి యాంధ్రదేశములో జాలభాగము తన పరిపాలనమున జేర్చుకొనెను. ఈనరపాలుని పుత్రుడగు రుద్రదేవుడు పితృసంపాదితమగు రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ఈ నరపాలుడు శిల్పములకు లలితకళయగు కవితకు గూడ నభివృద్ధి మార్గముల నన్వేషించెను. ఈయన యనంతరము ఇతని తమ్ము డగు మహ దేవరాయల పుత్రుడు గణపతి దేవుడు రాజ్యమునకు వచ్చెను. ఈనృపుని కాలమునాటికి ఓరుగల్లుకోట పూర్తి