ఆంధ్ర వీరులు/కులోత్తుంగ చోడదేవుడు

వికీసోర్స్ నుండి

రాజుల వేడిరక్తముచే బూతమైన పుణ్యప్రదేశములలో రక్కెసకంపలు నిండిపోయినవి. ఆంధ్రరాజుల మహోన్నత దశనుగాంచి యానందించి విజయగీతములు పాడిన కృష్ణాస్రవంతి యిపుడు విపరీతకాల పరిణామమునకు బలవించుచు విషాదగీతికల బాడుచున్నది. ఆంధ్రుల దురదృష్టమువలె బెచ్చు పెరుగు పాటిదిబ్బలలో జారిత్రకరత్నము లెన్ని మరుగు పడియున్నవో సమగ్రమగు పూర్వచరిత్ర మాతృలోకమున కెన్నటికి జ్ఞాపకమునకు వచ్చునో యెవరు చెప్పగలరు?

_______

3. కులోత్తుంగ చోడదేవుడు.

భారతమును నన్నయభట్టారకునిచే ఆంధ్రీకరింప జేసి యంకితముగా గొన్న రాజరాజనరేంద్రుడు మనకు జిరపరిచితుడు. ఈతడు చాళుక్యవంశజుడు. చాళుక్యవంశజులు చంద్రవంశక్షత్రియులని భారతమునందు జెప్పబడెను. ఈనృపుని రాజరాజ విష్ణువర్ధనుడనియు రాజ రాజనియు గూడ వ్యవహరించుట కలదు. తన మేనమామయగు రాజేంద్రచోడుని కుమార్తెయైన అనుంగదేవి నతడు వివాహమాడెను. ఈ దంపతుల కుమారుడే మన కథానాయకుడగు కులోత్తుంగ చోడదేవ చక్రవర్తి.
కులోత్తుంగ చోడదవుడు. కులోత్తుంగ చోడదేవుని మొదటిపేరు రాజేంద్రుడు. ఇతడు యువరాజుగానున్న కాలమున బెక్కు రాజ్యములు దండయాత్ర లొనరించి విజయము గడించెను. దండయాత్రయం దీయువరాజు మధ్యమాగాణముల వాయిరా నగరమును బలపరాక్రమములతో ముట్టడించి యూధములను లోగొని విజయము గడించెను. పలు మాఱు బస్తరు రాజ్యములోని చక్రకోట్యమును కూడ జయించి సింధువంశజాతుడును విక్రమశాలియునగు వర్షుని సామంతరాజునిగ నొనరించెను. చాళుక్యుల ----లతో సంబంధము విమలాదిత్యుడు. రాజరాజు, -------చోడుల కాలమువఱకు వరుసగా మూడుతరముల కలసి వచ్చెను. ఈమువ్వురిభార్యలును చోడులయింట ఆడ పడుచులె. మేనమామలను దల్లులనుబట్టియో చోడులను జయించిన కారణము కారణముననో యీ రాజేంద్రుని రాజేంద్రుడనియు గులోత్తుంగ చోడుడనియు వ్యవహరించిరి. గరికాలచోడుడు, రాజనారాయణుడు అను బిరుదములు గలవు. ఎంతరాజకుమారు డైనను మాత జనకస్థానము మహారాజ్య సంబంధము గలవైనను క ---- మాత్రమితడు తొలుతనె పాల్పడెను. రాజరాజనరేంద్రుడు మరణించినంతనే తండ్రిరాజ్యమగు రాజమహేంద్ర --- కీకులోత్తుంగచోడదేవుడు రాజుగావలసియుండ యైన విజయాదిత్యుడు బలవంతుడై రాజకీయోద్యోగులను సైనికులను లోగొని యక్రమముగా భ్రాతృరాజ్యము నాక్రమించెను. కులోత్తుంగచోడుడు రాజ్యభ్రష్టుడై పినతండ్రిని సాధించి నిజ రాజ్యము నెటుల లోగొనవలయునా యని తీవ్ర యత్నములు గావించుచు సైనికబలమును సమకూర్చు చుండెను. విజయాదిత్యుడు ప్రసిద్ధ పరాక్రమశాలి కాకపోవుటయు, గులోత్తుంగుడు సైన్యమును జీలదీయుచుంటయు గమనించి చిరకాలమునుండి వేంగిదేశమును గబళింప వలయునని ప్రయత్నించుచున్న పశ్చిమ చాళుక్యులలోనివాడగు (నాఱవ) విక్రమాదిత్యుడు అమితసైనిక బలముతో గృష్ణా గోదావరీ నదులదాటి రాజమహేంద్రవరముపైకి దండయాత్ర కేతెంచెను. స్వదేశము పర రాజాక్రాంతముగా నున్న చనియు నిపు డూఱకయున్నయెడల వేంగిరాజ్యమునకు మనకు బ్రాప్తము తీరుననియు గులోత్తుంగచోడరాజు నిశ్చయించి పశ్చిమచాళుక్యుల నెదిరించెను. ఉభయపక్షములకు గౌతమీ తీరమున భయంకరసంగ్రామము జరిగెను. కడకు బశ్చిమ చాళుక్యుడగు విక్రమాదిత్యుడు ఓడిపోయెను. తన రాజ్యము సరిహద్దులవఱకు బశ్చిమచాళుక్యరాజును గులోత్తుంగచోడుడు తరిమి వేసి వెనుకకు మరలి తన రాజ్యమునకు జేరి యంతవఱకు దనకు వ్యతిరేకముగ రాజ్యమేలుపినతండ్రియగు విజయాదిత్యునే తనకు ప్రతినిధిగా వేంగిరాజ్యము బాలించు నటుల నేర్పాటు గావించెను. కులోత్తుంగుని సుగుణములలో విరోధియగు పినతండ్రిని క్షమించి యెప్పటివలె రాజప్రతినిధిగా నేర్పఱచుట యొకటి.

చోడరాజ్యమును బాలించు వీరరాజేంద్రుడు తన పినతండ్రి యగు విజయాదిత్యుని పక్షమవలంబించి తన కనేక విధముల నపకారము గావించెను. చోడరాజ్యము నందు వీర రాజేంద్రునకు బేరుప్రతిష్ఠలు గూడ దగ్గుచుండెను. వీర రాజేంద్రుని మట్టుపెట్టుట కొకమూల కులోత్తుంగుడు యత్నించుచుండ కుంతల దేశాధీశుడును బశ్చిమ చాళక్యుడు నైన విక్రమాదిత్యుడు చోళరాజ్యమును హరింపనెంచి దండయాత్రకు బయలువెడలెను. వీరేంద్రచోడుడు తన దుర్భలస్థితిని దా నెఱింగినవా డగుటచేత గొంత రొక్కమును దన కుమార్తెను విక్రమాదిత్యున కొసంగి సంధిచేసికొనెను. కులోత్తుంగడు మాత్రము చోళదేశము హరించుటకు దాను జేయుయత్నముల నొకటియు మానుకొనలేదు. కాలవశమున వీర రాజేంద్రుడు కులోత్తుంగచోడుడు యుద్ధయాత్రకు రాకముందె మరణించెను

మఱల జోడదేశమున నశాంతియు నరాజకము ప్రబలెను. సామంతులు తిరుగబడి స్వతంత్రులై ప్రతిఘటించు యత్నములో నుండిరి. పౌరులు రాజాజ్ఞ తిరస్కరించుచుండిరి. ఈ పరిస్థితు లెఱింగి విక్రమాదిత్యుడు సైన్యసహితముగ చోడదేశమునకు వచ్చి యరాజకమునంతయు నివారించి తన బావమఱంది యగు పర కేసరివర్మను సింహాసనాసీనుని గావించి చీలిపోయిన సామంతులను బౌరులను గూడబఱచి కొంతకాల మటనుండి రాజ్యమునందు శాంతి స్థాపించి తనదేశమునకు బోయెను. విక్రమాదిత్యు డటులబోయి పోకమున్నె మఱల జోళరాజ్యమునం దశాంతి పెచ్చరిల్లెను. ఈవృత్తాంతము విని విక్రమాదిత్యుడు వచ్చి మఱల మఱల శాంతినెలకొల్పి వెళ్లు చుండెను. చోడరాజ్యము నింక జూచుచున్నయెడ బరుల పాలగునని మార్గమధ్యముననే రాజేంద్రచోడుడు విక్రమాదిత్యుని నోడించి వెనుకకు బంపివైచి యమిత బలసహాయముతో జోడదేశమును జయించి పరకేసరివర్మను జంపి "కులోత్తుంగ చోడనామము" సమస్త సామంతులకు భయంకరమగునటుల జోళమండలము బాలించుచుండెను.

ఇటు చోడరాజ్యము, అటు వేంగిరాజ్యము తన హస్తగతములైనను అంతతో దృప్తినొందక తిరుగబడిన రాజుల నందఱ జయించి తనరాజ్యము మిగుల విస్తరముజేయ సంకల్పించి కులోత్తుంగ చోడదేవుడు చెంగల్పట్టు ఉత్తరార్కాడు మండలములోని పులియారునాడు, ఎళుమూరునాడు గూడ జయించెను. కుంతలదేశమును బాలించుపశ్చిమచాళుక్యులలో బ్రసిద్ధుడగు విక్రమాదిత్యునిగూడ నతని సోదరుడగు జయసింహ సహితముగా నోడించి పూర్వవైరమునకు బ్రతి క్రియగావించెను. మైసూరురాజ్యమునందలి కొంతభాగమును పాండ్యదేశమును జయించి పంచపాండ్యుల నంకితుల గావించుకొనెను. ఇంతతో దృప్తినొందక మలబారుదేశములోని పశ్చిమ భాగమగు కుడలైనాడునుగూడ జయించి మేటివీరుల ననేకుల బొరిగొని యాదేశమునంతయు లోగొనెను. చేరరాజునకుగల నావికాబలమును సైన్యమును గూడ మట్టుపెట్టి కులోత్తుంగచోడుడు చేర దేశమునందు గూడ దన స్వతంత్ర పతాకమును నిలువబెట్టెను. ఇంచుమించుగ నితడు గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యమునకు సమానవైశాల్యముగల యాంధ్రభాగమును బాలించెనని చెప్పవచ్చును. వేంగిదేశమును గుళోత్తుంగునకు బ్రతినిధిగ బరిపాలించు నతనిపినతండ్రియగు విజయాదిత్యుడు కొంతకాలమునకు (క్రీ.శ.1099) పరలోక గతుండయ్యెను. తరువాత దనకుమారుడగు రాజరాజును వేంగిదేశమునకు బాలకునిగా నియోగించెను. ఎల్లపుడును ఆధ్యాత్మిక చింతామగ్నుడగు రాజరాజు కొంత కాలమునకు రాజ్యభోగములపై విరాగమూని తన పరిపాలనాభారము మఱల దండ్రికప్పగించెను. తరువాత మఱియొక కుమారుడగు వీరచోడుని నియమించెను. ఇతడు దాదాపుగ నాఱు సంవత్సరములు వేంగిరాజ్యము పాలించి కాంచీనగరమునకు బోయెను. తనకుమారుల నందఱను వేంగిదేశము పాలించుట కిటుల నొకనివెంట మరియొకని నియోగించుచు చోళ, వేంగి దేశముల రెంటిని సమానముగ దిలకించుచుండెను. కులోత్తుంగచోడుడు కళింగదేశముపైకి రెండు మాఱులు దండయాత్రకు బయలుదేరి విజయము గడించెను. పరిపాల నారంభమున నొకమాఱు పరిపాలనాంత్యమున నొకమాఱు నని యితని కళింగ దేశ దండయాత్రలకు సంకేతము లిడవచ్చును. కులోత్తుంగుడు తన పుత్రియగు రాజసుందరిని కళింగదేశపాలకున కొసంగెను. మనుమడగు అనంతవర్మ కళింగ దేశమును బాలించుతఱి గొందఱు కాళింగులు తిరుగబడి యరాజక ప్రయత్నములు చేయుచుండిరి. రెండవ దండయాత్రలో నరాజకముల నడంచి అనంతవర్మ రాజ్యమును సంస్కరించి తనపేర కులోత్తుంగ చోడనగరమును గట్టించెను. తరువాతి కాలమున నీనగరము విశాఖపట్టణమను వ్యవహార నామము వహించెను.

కులోత్తుంగ చోడునకు నలువురు ధర్మపత్నులు గలరు. వారిపేరులు మధురాంతక దేవి, దీన చింతామణి, ఎళిశైవల్లభి, త్యాగవల్లి. మధురాంతక దేవియందు ఈరాజన్యునకు ఏడుగురు పుత్రులు ఒకపుత్రియు జనించిరి. పుత్రిక అనంతవర్మ తల్లియగు రాజసుందరి. పుత్రు లేడుగురిలో రాజరాజ చోడగంగు, రాజరాజ ముమ్మడిచోడుడు, వీరచోడు డను మువ్వురె చరిత్రవిదులకు బరిచితులు. కులోత్తుంగ చోడునకు జోడరాజ్య మాక్రమించికొన్న పిదప గంగయకొండపురము, గంగయకొండ చోడపురము అని వ్యవహరింపబడు గంగాపురము కొంతకాలము, కాంచికానగరము మిగిలిన కాలమంతయు రాజధానిగా నుండెను.

కులోత్తుంగచోడుడు ఉత్తరదిక్కున కళింగము, దక్షిణము కన్యాకుమారి, తూర్పుదిక్కున సముద్రము, పడమటి దిక్కున కుంతలదేశము, సరిహద్దుగాగల విశాలమగు దేశమును ఏకచ్ఛత్రాధిపత్యముగా నించుమించుగ నేబది సంవత్సరములు పరిపాలించెను. ఇతనిరాజ్యకాలము క్రీ.శ. 1070-1120 వరకని చరిత్రకారులు నిశ్చయించినారు. కులోత్తుంగచోళుని పరాక్రమజీవితము సంస్కృత ద్రవిడగ్రంథములలో విశేషించి కీర్తింపబడెను. ఆంధ్రభాష కీనృపాలు డెంత సహాయము గావించినో ఆకాలమున బయలువెడలి యాంధ్రకావ్యము లెవ్వియో యెఱుగ నవకాశము చిక్కలేదు. కులోత్తుంగచోడ మహారాజు శైవమతాభిమాని. విష్ణ్వాలయముల ననేకముల గూలద్రోయించెననియు విశిష్టాద్వైతమత ప్రవర్తకుడగు రామానుజాచార్యుని మతప్రచారమును సాగకుండ జేసెననియు ఆపాపముచే నీతడు గతించెననియు వైష్ణవమత గ్రంథములందును రామానుజ చరిత్రమునందును గలదు. ఈరాజు మరణమునుగూర్చి కొన్నికథ లాగ్రంథమున గలవుగాని వాని సత్యాసత్యచర్చతో మనకు బనిలేదు. కులోత్తుంగుడు మరణించువరకు రామానుజు డతని రాజ్యమున నెట్టి ప్రచారము చేయక మైసూరురాజ్యమున నున్నమాట వాస్తవము. కులోత్తుంగుడు తన రాజ్యము సుభిక్షముగా నుంటకై యనేక తటాకముల నిర్మించి రైతులకు బెక్కు సౌకర్యములు కలుగజేసెను. ప్రజలు ధాన్యరూపముగ బన్నులు చెల్లించు నట్లును గ్రామమునుండి వసూలుగావలసిన సిస్తులపై యధికారము గ్రామాధికారిపైననె యుండునట్లును కట్టుదిట్టములుచేసి వ్యాపారము నభివృద్ధిలోనికి దెచ్చెను. కులోత్తుంగచోడుని కాలమున మిగులనభివృద్ధిలోనికివచ్చిన యీయాంధ్రరాజ్యము రానురాను అతని యనంతరము క్షీణించి కడకు కాకతీయ సామ్రాజ్యములో మఱికొంతకాలమునకు లీనమైపోయెను.

చేర, చోళ, పాండ్య కళింగాంధ్రాదిదేశముల నేకధాటిగా బరిపాలించిన యీయాంధ్రచక్రవర్తి జీవిత చరిత్రము మనము పూర్తిగా మఱచినారము. పూర్వరాజుల ప్రతిష్ఠాలేశముల నాలపించు శిలాశాసనాదులకడ కేగితిమేని ప్రశాంతసమయమున గులోత్తుంగచోడుని యశోగీతికల నాలింపవచ్చును. స్వామిభక్తి పరాయణులగు నాంధ్రశూరుల రక్తముచే దడిసిన పుణ్యభూములు త్యాగజీవితమును దెలుపు శాసనరాజములు మాసిపోయిన చాళుక్యనృపుల ప్రతిష్ఠను జరిత్రవిదులకు జ్ఞాపకము చేయుచున్నవి. మహత్తరమగు నా రాజ్యముతో బాటు నాంధ్రసోదరుల విక్రాంతియు మఱపునకు వచ్చుట దురదృష్టము.