ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/వెల్లంకి తాతంభట్టు

వికీసోర్స్ నుండి

12. వెల్లంకి తాతంభట్టు.

ఇతడు కవిచింతామణి యనులక్షణగ్రంథమును జేసిన గొప్పకవి. ఈతడు వైదికబ్రాహ్మణుడు; ఈతని తండ్రి యబ్బయ్య; తల్లి యెర్రమ్మ. ఈకవి కృష్ణరాయని రాజ్యారంభకాలమునం దుండినవాడు. కొంద రీతడు కృష్ణదేవరాయని కాలమునకు బూర్వమునందేయుండెనని చెప్పుదురుగాని యితడు తనకవిచింతామణిలో నైషధము, భోగినీదండకము, జైమినిభారతము మొదలగు గ్రంథములనుండి యుదాహరణములు గైకొని యుండుటచేతను, జైమినిభారతమును రచించిన పిల్లలమఱ్ఱి పినవీరన్న కృష్ణదేవరాయని తండ్రితాతలకాలములోనే యున్నవా డగుటచేతను,తాతంభట్టు కృష్ణరాయనికాలమునకు బూర్వమునం దుండినవా డయినట్టు తోచదు. ఇతడు కవిచింతామణి యందు వ్యాకరణమును, ఛందస్సును, కావ్యలక్షణమునుగూడ గొంత వఱకు జెప్పియున్నాడు. ఈలక్షణవేత్త కవిచింతామణియందు దన్ను గూర్చి వేసికొన్నపద్యము నిం దుదాహరించుచున్నాను.-


సీ. శుచి యెఱ్ఱమాగర్భశు క్తిముక్తామణి యబ్బధీమణిసూను డనఘబుద్ధి,

పావనవశితశాలావతగోత్రు డహార్యధైర్యుండు రామార్యుతమ్ము,

డష్టభాషాప్రక్రియాలబ్దవర్ణుండు సన్నుతసాహిత్య చక్రవర్తి,

యనవద్యసర్వవిద్యాపారదృశ్యుండు విద్వజ్జనవ్రాతవిశ్రుతుండు,

సకలహరిదంతరాళవిశ్రాంతవిశద

కార్తికిక చంద్రికాయతకీర్తి కాంతి

హరినిభుం డాస్యవాణీవిహారవసతి

తామసోల్లంఘి వెల్లంకితాతసుకవి.

ఈతడు రచియించినది లక్షణగ్రంథమగుటచే గవిత్వనైపుణినిగూర్చి పూరితన్నేహపూరంబు పొంగిపొగల

జల్లనిపటీరసలిలంబు చల్లరాదు.


అనుపద్యమును చేయించి తాము రచియించిన పద్యముగా జెప్పి తమగురువునకు సమర్పించినట్లును రామరాజభూషణుడాపద్యముయొక్క చమత్కృతికిసంతోషించి దానిని తనవసుచరిత్రమునందు వేసికొన్నట్లును, ఒక పుక్కిటపురాణము కలదు గాని యది యెంతమాత్రమును విశ్వాసపాత్ర మయినదికాదు. కృష్ణదేవరాయలకాలములో రామరాజభూషణుడు కవిత్వమును జెప్పుట కారంభించినట్లే కనబడక పోవుటచేత నాతని కప్పటికే శిష్యబృంద మున్నదన్నవార్త యసందర్భ మగుటనుబట్టియు, వసుచరిత్రము కృష్ణదేవరాయల యనంతరమున ముప్పదియేడు సంవత్సరముల వఱకును బ్రకటింపబడక పోవుటచేత నంతటి మహాప్రౌడ గ్రంథమును రచియించిన రామరాజభూషణు డొక్కపద్యమును రచించుట కశక్తు డయి యంతకాలమునకు తరువాత నితరకవియొక్క పద్యమును దనదిగా దనపుస్తకమునందు జేర్చుకొనె ననుటకంటె హాస్యాస్పద మయినమాట వేఱొకటి లేకపోవుటనుబట్టియు. ఈగ్రంథచౌర్యకథ కల్పననిపుణులదేకాని కవిది కాదనుట స్పష్టము.

రామభద్రకవియొక్క కవితాపటిమనుజూచి రామరాజభూషణుడు మాత్సర్యగ్రస్తు డయి యతడుచేసిన రామాభ్యుదయము యొక్క ద్వితీయాశ్వాసములోని "సింహ నఖాంకురచ్ఛిన్నే" త్యాది పద్యమును జదివినప్పుడు "పృథుల షడ్జస్వరోగ్గీతభిల్లపల్లనాధరాగీతికాకర్ణ నాతిభీతిపరవశాత్మపటీరకోటరకుటీరలీఫణి" యనుచో వీణానాదమునకు ధణులు బెదరుట స్వభావవిరుద్ధమని తప్పుపట్టె ననియు, దాని పయిని రామభద్రకవి నెమలియొక్క షడ్జస్వరముచేత బాములు భయపడుట స్వబావసిద్ధమే యని సమాధానముచెప్పి యాతని గర్వ భంగము చేసె ననియు, మఱియొకకథ చెప్పుదురు. కొంచెము మంచి గ్రంథమును రచించిన కవికెల్ల నతని యిష్టదేవతయో సరస్వతియో వచ్చి గ్రంథరచనము చేసి పెట్టినట్లుగా మనలో జెప్పుకొనెడు వాడుక ప్రకారముగా రామభద్రకవికిని రాజువొద్ద దా నాఱునెలలలో గ్రంథమును జేసి తెచ్చెదనని ప్రతిజ్ఞనుపట్టి తేలేక పోయినప్పుడు మితిపెట్టిన కడపటి దినమురాత్రి యాతని యిష్టదైవమయిన శ్రీరామమూర్తియే రామాభ్యుదయమును జేసిపెట్టి కవియొక్క మానము కాపాడెనని జనప్రతీతి యొకటికలదు. సకలకథాసారసంగ్రహమునందున్న రీతి పద్యములలో ననేకము లీరామాభ్యుదయము నందు గానబడుచున్నవి. వానిలోనొక్కదాని నిందుదాహరించుచున్నాను-


సీ. కానకకన్న సంతానంబుగావున

గానకకన్న సంతానమయ్యె,

నరయ గోత్రనిధానమై తోచుగావున

నరయ గోత్రనిధానమయ్యె నేడు,

ద్విజకులాదరణవర్ధిష్ణుండు గావున

ద్విజకులాదరణవర్ధిష్ణు డయ్యె,

వివిధాగమాంతసంవేద్యుండు గావున

వివిదాగమాంతసంవేద్యు డయ్యె

గటకటా దాశరథి సముత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకమార్గ

గామి యెట్లుచరించు నుత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకతటుల.


ఈకవి రేఫ శకటరేఫములభేదమును పాటింపక యతిప్రాసములందు యథేచ్ఛముగా మైత్రి కలుగ జేసినవాడు. ఈతని కవిత్వరీతి దెలుపుట కయి రామాభ్యుదయములోని కొన్ని పద్యములు నిందు వ్రాయుచున్నాను