ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/అయ్యలరాజు రామభద్రుడు

వికీసోర్స్ నుండి

11. అయ్యలరాజు రామభద్రుడు

ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు. ఇత డొంటిమెట్టలో నున్నకాలములో నచ్చటి వీరరాఘవస్వామిమీద నొకశతకమును జేసెను. ఇతడు మొట్టమొదట గృష్ణదేవరాయల యంతిమదశలో విజయనగరములో బ్రవేశించి కృష్ణదేవరాయనిచేత దద్విరచితమయిన సకలకథాసారసంగ్రమును తెనిగింప గోరబడెను. కాని గ్రంథపూర్తి కాకముందే కృష్ణదేవరాయలు పరమపదము నొందినందున రామభద్రకవి గ్రంథము నాతని కంకితము చేయక యవతారికయందు కృష్ణదేవరాయల ప్రార్థనచేత దానాగ్రంథమును రచించితినని మాత్రము వ్రాసెను. ఈసకల కథాసారసంగ్రహము శ్రీరామ పురూరవశ్చరిత్రాదులనుగల తొమ్మిది యాశ్వాసముల గ్రంథముగా నున్నది. ఈగ్రంథమునందును రామభద్ర కవి సూక్ష్మబుద్ధి గలవాడని యూహించుటకు దగినమార్గము లనేకములు గానబడుచున్నను, కవిత్వము ప్రౌడముగాక వ్యాకరణదుష్టమయి బాలవిరచిత మని సూచించుచున్నది. 1530 వ సంవత్సరమున కొకటి రెండేండ్లుముం దీకవి గ్రంథరచనకారంభించినట్లు తోచుచున్నది. ఈకవి సకల కథాసారసంగ్రహముయొక్క యవతారికయందు దాను గ్రంథరచన చేయబూనుటనుగూర్చి యీక్రిందిపద్యమును వ్రాసి యున్నాడు-


ఉ. నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే

కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని

త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం

పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్.


ఈబాలకావ్యమయిన సకలకధాసారసంగ్రహమునుగూర్చి యిందు విస్తరించి వ్రాయక యందలి పద్యములను మాత్రము రెంటిమూటి నిందుదాహరించు చున్నాను.


సీ. కానకకన్న సత్సూనుండు నేటికి

గానకకన్న సత్సూను డయ్యె

బుణ్యజనోత్కీర్ణ పురుషుండు నేటికి

బుణ్యజనోత్కీర్ణ పురుషు డయ్యె

ద్విజముఖ్యులనుగూడితిరుగుబాలుడు నేడు

ద్విజముఖ్యులనుగూడి తిరుగుటయ్యె

గోత్రపావను డైనకొమరుండు నేటికి

గోత్రపావను డైనకొమరు డయ్యె మత్తగజదానధారార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగువాడు

మత్తగజదానధార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగుటయ్యె.


చ. చదువు వివేకమూల మని సద్గురుసన్నిధి ధర్మశాస్త్రముల్

చదివి సుధాకరుండు నిజసద్గురుపత్నిని దా రమించుటన్

జదు వవివేకమూలమయి సంభవ మయ్యె నదేమనందు నా

మదనమహత్త్వ మెన్న నసమానపరాక్రమ మెన్నిభంగులన్.


చ. వినుతనిజాంఘ్రుల న్విడిచిపెట్టక పట్టుక నేలవ్రాలి లే

వనిగయుకు న్నరుండు బలుబాసల నమ్మిక లిచ్చి యాదరం

బున గరమంది లేవనిడి భూతదయాంచితమానసోన్నతిన్

దనరినయాత్మవంశకథనంబు వచించిన లేచె వాడొగిన్.


సకలకధాసారసంగ్రహమును ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-


రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం

భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!

ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత


సీ.మోహాపదేశ తమోముద్రితము లైన

కనుదమ్ముల హిమంబు లునుపరాదు

శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక

ముల జంద్రనామంబు దలపరాదు

శీర్యదాశావృంత శిథిలతాసులతాంత

మసియాడ వీవనల్విసరరాదు

పటుతాపపుటపాక పరిహీణతను హేమ

మింక బల్లవపుటా ర్చిడగరాదు

లలన కానంగకీలికీలాకలాప

సంతతాలీడ హృదయపాత్రాంతరాళ చ. ప్రమద మెలర్ప నుగ్రమృగబాధ హరింపగ వేటమై నర

ణ్యమునకు రా నఘం బొదవె నక్కట| ధర్మము చాలు గుక్క బ

ట్టు మనుట యెంచి విల్లబు తటుక్కున ధారుణి వైచి సారమే

యముల మరల్ప బంచె మృగయాక్రియ మాని విభుండు ఖిన్నుడై. [అ.2]


ఉ. అక్కట! కోసలక్షీతివరాత్మజ కానకకన్నముద్దులే

జక్కనిమంచిరాకొమరుజందురు డెక్కడ ? యధ్వరావనం

బెక్కడ ? దైత్యసంహరణ మెక్కడ ? ఘోరవనాంతరశ్రమం

బెక్కడ ? యెట్టు లంపుమనియె న్ముని ? నో రెటులాడె నింతకున్ ? [అ.4]


ఉ. వింధ్య మధిత్యకాకటకవిస్ఫుటపాదపపుష్ప గుచ్ఛసౌ

గంధ్యము హేమధాతుమయకల్పితసంధ్యము బద్ధమేరుసా

గంధ్యము చండకేసరనికాయనిరాకృతభద్రదంతిద

ర్పాంధ్యము గ్రుంగద్రొక్కితి మహాగుణభూషణ సత్యభాషణా. [అ.5


ఉ. చూచుటలే దశోకవని జొచ్చి యటుంజని చూచెదంగదా!

యాచపలాక్షి మజ్జినని యచ్చటనుండినయేని లెస్స లే

దా చతురాననుండు మొదలైన నుపర్వు లెఱుంగ జిచ్చులో

వై చెదగాక యీయొడలు వానరవీరులమ్రోల వైతునే ? [అ.6]