ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తరిగొప్పుల మల్లన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

33. తరిగొప్పుల మల్లన

ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు -


సీ. ... ... ... ... ...

అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ

రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర

రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ

చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.


ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు నాకాలమునం దుండినవాడే. తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈకవి కవితా రచనను సూచించెడుపద్యములను రెంటిమూటి నిందు బొందుపఱుచు చున్నాను-


ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ

న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి

క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]


ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్

జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా

బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో

జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]


ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి

న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న

య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్

దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]


34. చరిగొండ ధర్మన్న


ఈకవి నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌండిన్య గోత్రుడు; తిమ్మయపుత్రుడు. ఇతడు చిత్రభారత మనెడి యెనిమిదాశ్వాసముల గ్రంథమును జేసి దాని నిమ్మలపల్లి పెద్దనామాత్యున కంకితము చేసెను. చిత్రభారతమునందు కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు -


సీ. కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నాపస్తంబసూత్రశోభనగరిష్ఠు

సర్వవిద్యాభిజ్ఞ జరికొండతిమ్మనామాత్యాగ్రణికి మాదమకునుగూర్మి

నందను నతిశాంతు నారాయణధ్యానతత్వజ్ఞ శ్రీరంగధామసదృశ

భట్టపరాశరప్రభురంగగురుపాదనీరేజబంభరు నిర్మలాత్ము