ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చరిగొండ ధర్మన్న

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి

క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]


ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్

జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా

బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో

జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]


ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి

న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న

య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్

దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]


34. చరిగొండ ధర్మన్న


ఈకవి నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌండిన్య గోత్రుడు; తిమ్మయపుత్రుడు. ఇతడు చిత్రభారత మనెడి యెనిమిదాశ్వాసముల గ్రంథమును జేసి దాని నిమ్మలపల్లి పెద్దనామాత్యున కంకితము చేసెను. చిత్రభారతమునందు కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు -


సీ. కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నాపస్తంబసూత్రశోభనగరిష్ఠు

సర్వవిద్యాభిజ్ఞ జరికొండతిమ్మనామాత్యాగ్రణికి మాదమకునుగూర్మి

నందను నతిశాంతు నారాయణధ్యానతత్వజ్ఞ శ్రీరంగధామసదృశ

భట్టపరాశరప్రభురంగగురుపాదనీరేజబంభరు నిర్మలాత్ము ధర్మనాహ్వయు సత్కవితాధురీణు

దాంతు శతలేఖినీసురత్రాణబిరుద

కలితు నను వేడ్క బిలిపించి కరుణమీఱ

దేనియలుగుల్క నిట్లని యానతిచ్చె.


మ. శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణచి

హ్నితనామా చరికొండధర్మసుకవీ నీవాగ్విలాసంబు లా

శితికంఠోజ్జ్వలజూటకోటరకుటీశీతాంశు రేఖాసుధా

న్వితగంగాకనకాబ్జనిర్భర రసావిర్భూతమాధుర్యముల్.


గీ. కావున విచిత్రగతి నలంకారసరణి

మీఱ రసములు చిప్పిల మెప్పు లొసగ

దెనుగు గావింపు నాపేర ననఘసుకవి

ధీరు లరుదందగా జిత్రభారతంబు.


పై పద్యములనుబట్టి వైష్ణవభక్తుడనియు, శతలేఖినీసురత్రాణబిరుదము గలవాడై శతలేఖిన్యవధాన పద్యరచనయందు సమర్థు డనియు, తెలియవచ్చుచున్నది. కృతిపతియైన పెద్దనమంత్రి మాదనకుమారుడు; నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు. అతడు మానభూనాధుని మంత్రియైన ట్లీక్రిందిపద్యములలో జెప్పబడియున్నది-


సీ. అనువత్సరరీబుబ్రాహ్మణులకు గోసహస్రము లిచ్చు నృగనరేశ్వరునిరీతి

కంధులనెనయు పాకాలచెర్వాదిగాదగు చెఱువులు నిల్పు సగరుకరణి

దీవ్యత్ప్రతాపుడై దిగ్విజయంబు గావించు మాంధాతృభూవిభునిలీల

దేవభూదేవతార్థిశ్రేణి కగ్రహారము లిచ్చుభార్గవరాముపగిది

నిందు శేఖరపాదారనిందయుగళ

భావనాపరు డంగనాపంచబాణు

డతులధైర్యాభిభూతహిమాచలుండు

మానభూనాథ చిత్తాబ్జభాను డతడు. శా. ఆరాజేంద్రశిఖావతంసనిజబాహాయుక్తవిశ్వంభరా

ధౌరేయుండు విరోధిమంత్రిముఖముద్రాదక్షు డుద్యద్దయా

పారీణుండు పటీరతారకసుధాపాణింధమశ్రీయశో

హారుం డిన్ములపల్లి మాదవిభు పెద్దామాత్యు డుల్లాసియై.


ఈమానభూనాథు డెవ్వరో గ్రంథమువలన స్పష్టపడదుగాని యెనిమిదవయాశ్వాసాదియందలి యీక్రింది కృతిపతి సంబోధనపద్యము వలన నతడు శ్రీరంగరాయని రాజ్యకాలములోని యొక మండలేశ్వరుడని యూహింపదగియున్నది-


క. శ్రీరంగరాజసేవా | పారంగతహృదయ ! కమలభవ వంశపయ:

పారావార సుధాకర ! మారసమానావతార ! మాదయపెద్దా !


మొదటి శ్రీరంగరాజు విజయనగరసంస్థానమును 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును పాలించెను. రెండవ శ్రీరంగరాజు 1614 వ సంవత్సరమునకు తరువాత రాజ్యమునకు వచ్చెను. ఈకవి యీ యిరువురు రాజులలో నొకరికాలము నందుండినందున, పదునాఱవశతాబ్దముయొక్క యంతమునందో పదునేడవశతాబ్దముయొక్క యాదియందో యుండి యుండుటకు సందేహములేదు. ఇదిగాక కవియొక్క కాలమును నిర్ణయించుటకు గ్రంథమునందే యింకొక యాధారము కనబడుచున్నది. కృతినాయకునివంశమును వర్ణించుచు కందాళ అప్పలాచార్యులు కృతిపతియొక్క తండ్రికిని పెదతండ్రికిని గురువైన ట్లీక్రిందిపద్యములో జెప్పియున్నాడు-


శా. వందారువ్రజదోష మేఘపవనున్ వారాశిగంభీరు నా

నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞ విశ్వంభరా

మందారక్షితిజాతమున్ నిగమసన్మార్గప్రతిష్ఠాపరున్

గందాళప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.

క. ఆదేశికపదకమలము
లాదరమున హృదయవీధి ననవరతంబున్
మోదమున నిలిపి శ్రీలల
నాధవుని గొలుతురు నారనయు మాదనయున్.

ఈపద్యములనుబట్టి యీచిత్రభారతకృతిపతియు పాండురంగమాహాత్మ్య కృతిపతి కాలములోనివా డయిన ట్లేకగురుశిష్యత్వము వలన దేటపడుచున్నందున, ఈధర్మకవి యించుమించుగా తెలాలిరామకృష్ణుని కాలపువాడే. కందాళ అప్పలాచార్యులుగారు చిత్రభారత కృతిపతితండ్రికి గురువై నందున, ధర్మకవి రామకృష్ణునికి గొన్ని సంవత్సరములుతరువాత నుండిన నుండవచ్చును. చిత్రభారతకవిత్వ మనర్గళ మయిన ధారకలదయి సలక్షణముగా నున్నది. ఈకవియొక్క చరిత్రమునుగూర్చి యిప్పుడు చెప్పినదానికంటె నధిక మేమియు దెలియరానందున, చిత్రభారతమునుండి కొన్నిపద్యముల నుదాహరించుటతోనే తృప్తినొందవలసి యున్నది.


చ. అనిమిషనాధు డమ్మునితపోనలకీలల నబ్ధి యింకినన్
దనకు విపక్షుడై యచట దాగిన యాహిమవన్నగాత్మజున్
గినిసి విపక్షు జేయ గమకించి ప్రచేతనునింట నిర్గమం
బనిచెడువిల్లనంగ నపరాశ సురేశ్వరచాప మొప్పెడున్. [ఆ.2]


సీ. ప్రవహించుశృంగారరసపూర మమ్మునిమేనికి జలకంబుగా నొనర్చి
తళతళత్కాంతిచే దనరెడుదరహాసచంద్రి కావితతి వస్త్రముగ నొసగి
మువ్వంపు దేనియల్ చివ్వున నిడువాక్యములు ప్రసూనములుగా బూజచేసి
చొక్కంపునిడువాలు జూపు మెఱుంగులుపొసగనీరాజనంబులు జేసి
యమృతరసములు చిప్పిలునధరబింబ
మదన నై వేద్యముగను నియ్యగ దలంచి