ఆంధ్ర కవిత్వ చరిత్రము/తృతీయప్రకరణము

వికీసోర్స్ నుండి



తృతీయ ప్రకరణము.


1. మానవధర్మమున రసము దేని నాశ్రయించికొనును?

రసస్వరూప మెట్లుండునో కొంతవఱకు నిరూపించితిని. రసమునకుఁగల వివిధావస్థలను పరిణామ భేదములనుగూడ వివరించితిని. ఈ ప్రకరణమున మానవధర్మమున రసమును, అది యాత్మగాఁగల కవిత్వమును వేని నాధారముగాఁ గొనునో సూచించి చర్చింప నెంచితిని.

మానవధర్మముయొక్క నిరీక్షణము. 

మానవధర మన నేమి? దానియుపయోగ 'మేమి? అందు రసమునకును, రసాత్మకమగు కావ్యమునకును నేమైనఁ దావుండునా? పై ప్రశ్నములకు జవాబు నొసఁగుట వివాదాంశము నింకొకదానినిఁ బై కి ద్రవ్వితీయుటయే యగును. అయినను నట్లు చేయక తప్పదు. మానవధర్మమునకు మూలస్థానము మాన వునియందున్న భగవదంశ మే యని గ్రహింపనగును. మాన వుఁడు భగవదంశాసంభూతుఁడని మనమత క ర్తలును వేదాంతు లునుగూడ నొప్పికొనిరి. వేదాంతులు మీఁదుమిక్కిలి మాన వుఁడును భగవంతుఁడును నొకటియే కానీ 'రెండు భిన్న వస్తు వులు కారని నిర్ణయించిరి. ఈమానవుని భగవదంశము నాధారముగఁ గొని మానవుఁడు తనజనమును సార్థకముఁ గావించి కొని భగవంతునిఁ జేరుటకుఁ దగినయుపాయములను నియమ ములను నిర్మించి మానవధర్మమును బ్రతిష్టాపనఁ గావించిరి. ఈమానవధర్మముయొక్క ముఖ్యోద్దేశమును సూచించితిని. మానవుఁడు తన కుచితమయిన పద్ధతుల జీవితముఁ గడపి సఫలీకృతుఁడు కావలెనని నిశ్చయించి 'ధర్మజ్ఞు లనేకములగు నియమముల నేర్పఱచిరి. ఆనీయమముల వ్యాప్తిని గూర్చియుఁ బ్రయోజనమును గూర్చియుఁ బ్రసంగించెద. జీవితమునందలి వివిధాంశములను, వాని కేవిధమున సామరస్యము కలుగునో యావిధమును, సట్టిసమగ్ర సామరస్యమున రసమునకుఁ గల ప్రాముఖ్యమును గమనింపఁదగిన విషయములు.

మానవజీవితము యొక్క భాగములు. 1.ఆత్మ జీవితము. 2. సాంఘిక జీవితము.


మానవజీవితమున రెండు ముఖ్యములగు భాగములు ఆత్త, జీవితము, సాంఘిక జీవితము నను పేర్లఁ బరఁగుచుండును. ఆత్త జీవితమునకు రెండు విధములుగ నర్థముఁ జెప్పుకొనవచ్చును. ఎట్లన: స్వలాభ మనునొకయర్గమును, ఆత్మకు సంబంధించిన జ్ఞానజీవితమును మానసికజీవితమును నని రెండవ యర్థమును, అట్లే సాంఘిక జీవితమునకును రెండర్థములు వర్తించును:--- ఒకటి: సంఘము యొక్క సమష్టి శ్రేయము, రెండు: సంఘము యొక్క సమష్టి ఆత్త వికాసము, ఆత్మజ్ఞానమును. ఈ రెండిటికిని జూల సంబంధ మున్నది. ఎట్లన:

మానవునకు సంఘమునకుఁ గలసంబంధము,

మానవుఁ డెంత భగవదంశసంభూతుఁ డైనను నిమిత్త మాత్రముగ నైనను శరీరమను నుపాధిఁ దాల్చి తల్లిదండ్రుల కడుపునఁ బుట్టి సంఘములో నొకసభ్యుండై దినదిన ప్రవర్ధ మానతఁ గాంచి జనాంతరసంస్కారవాసనా బలమున స్వీయా త్మోపలబ్దినిఁ బడయును. అందుచే బాహ్యసంఘాభివృద్ధి కొంత వఱకు 'మానవుని వికాసమునకుఁ దోడ్పడును. ఎట్లన - విద్వ త్కుటుంబములో జన్షించి యం దే పెరుఁగుబాలుఁడు విద్యా వంతుఁడై పేరు ప్రతిష్ఠల గడించును. మూర్ఖులయింటఁ బుట్టెడు బాలుఁడు తోడివారల దుర్నీతిని, జెడునడతను నేర్చికొని దుష్పథమునఁ జరించి చెడిపోవును, వరప్రసాదులై యీ నియమమును మీజి “తులశమ్మకడుపున దురదగొండి పుట్టుతుంది, దురదగొండికడుపున తులసి. పుట్టుతుంది" యని జను లాడు కొనెడు సామ్యమునకు గుఱియైనవార లుందురుగాక! సాధా రణముగఁ బైనఁ జెప్పఁబడిన సూత్రము నర్తించును. అందు కనియే మనవారు "కులమెరిగి కోతి యైనమే జేసికోనవలె" నని చెప్పుదురు. బొహ్య సంఘ ప్రవృత్తి మానవునిజీవితమున కొక విధమగు నాధారముగను చేయూతగను నుండును. అట్టి. చేయూతఁగొని మానవుఁడు స్వీయజన్మాంతర పంచిత ప్రతిభ చే మహామహుఁ డగును.

కాని సంఘము ప్రవృత్తియే మానవుని జీవితమును. బూర్తిగఁ బోఁతఁబోసినట్టు మార్పుఁ జేయు నని చెప్పుటకు వీలు లేదు. ఏలనన అట్లంటిమేని మహామహులందఱుసు సంఘ ప్రవృత్తివలన నుద్భవించి గొప్పతనము సంపాదించిరని చెప్పవలసి వచ్చును. అట్లు చెప్పిన నసత్యదోషమునకుఁ బాల్పడుదుము. ఎట్లన సంఘము ఆజ్ఞానాంధకారమగ్నము లై యున్న తరి పర ప్రసాదులగు మహామహులు సూర్యచంద్రాదులభాతి నుద యించి జ్ఞానజ్యోతులఁ గొని వచ్చి ప్రపంచము నెల్లను శోభాయ మాసముఁ గావించుచున్నారు. అట్టిమహామహుల వతరింపనిది సంఘ మభివృద్ధినొందక తొల్లింటి ప్రాకృతావస్థలోనే యుండుట

సంభవించును. కాని సంఘ మట్లు ప్రాకృతావస్థలో నుండక నిరంత రాభివృద్ధిఁ గాంచుచున్న దని యందఱకుఁ దెలిసినవిష యమే. అట్టిసంఘాభివృద్ధికి మహామహుల యద్భుతకృత్యములును, దివ్య చారిత్రములు నే కారణభూతములని యెఱుంగునది. అట్టిమహామహులు జనాంతర సంస్కారవాసనాబలమునఁ దమ యందున్న భగవదంశమును బాగుగ గుఱుతించి యనుభవించి ప్రపంచమునకుఁ బ్రదర్శితముఁ గావించి సంఘము నున్న తస్థితికి దేఁగలిగినారు. అట్టి మహాత్ములు సంఘమువలన గొప్పవా రైరని చెప్పుట యసత్యమగును కానీ అట్టిమహాత్ములు సైతము సంఘ ములో సభ్యులుగ సంచరించుచు నున్నంత కాలము సమష్టిసంఘ శ్రేయము వారికిఁ గూడ నభ్యర్థనీయమగు కామ్యార్థముగ నుండవలెను.

అట్లు గాక మహాత్ములు తమదారిని దామే పోవుచు సంఘ శ్రేయమునకుఁ బతికూలు రగుచో సంఘముతో వారికి సంఘట్టనము కలుగక మానదు. అందుకనియే మన నైతికులు కొన్ని యెడల జనవాక్యం తు కర్తవ్యం” అని బోధించి యున్నారు. పాశ్చాత్య దేశములలోఁ గూడ “Vox Populi Vox Dei" "ప్రజావాక్యమే దైవవాక్యము' అనునొర్యో క్తి కలదు.

ఆర్యధర్మము ఆత్మ జీవితమునకును,- సాంఘిక జీవితమునకును సమన్వయము , గూర్ప యత్నించును.

మానవజీవితముననున్న పై రెండుభాగములకును సరిగ వర్తించును మానవ జీవితముననున్న పై రెండు భాగములకునుసరిగ వర్తించు మానవధర్మమును శాసింప మన ధార్మికులెంతేని పాటు వడిరి, మనశాస్త్రజ్ఞులే కాదు, ప్రపంచమున సర్వదేశముల. యందలి ధర్మశాస్త్రజ్ఞులును నిరంతరమును బ్రయత్నము లిందు, కొఱకై సల్పుచునే వచ్చినారు; సల్పుచున్నారు. శాస్త్రమునకు ముఖ్యమగులక్ష్యమేమన, మానవుఁడు సంఘమునకు విరోధి కాకుండ సంఘ శ్రేయమునకుఁ బ్రతికూలుఁడు గాకుండ స్వీయ. భగవదంశమునకుఁ బరిపూర్ణత్వము సిద్ధింపఁ జేసికొనుటయు, స్వీయ క్షేమము సభివృద్ధి ' జేసికొనుటయు నేకాని వేఱుకాదు. ఎన్ని శాస్త్రములు పుట్టినను, ఎన్ని ధర్మములు వెలసినను నీపర" మార్గమును సాధించుకొరకే. ఎన్ని ప్రతిష్టాపనలు గావింపఁబడి" నను నీఫలితము లభించుట కొఱకే. అంతియగాక మన ధార్మికులు ఆత్మ జీవితమునకును సాంఘిక జీవితమునకును నొక్కొకదానికిని ద్వివిధములగునర్గముల నొప్పికొని యున్నారు. 'ఆత్మ జీవితమునకు మానవుని యొక్క బాహ్య జీవితమును, ఆంతరంగిక జీవితమును నను రెండు అర్థముల సంగీకరించి యున్నారు. సాధారణముగ జీవనము జరుగు నుపాయమును, భగవదంశము సంపూర్ణముగా సిద్ధం చెడి యుపొయమునుఁ గూడ మానవునికి నభ్యర్ధనీయములని మన ధార్మికు లా దేశించి యున్నారు. సంఘమునకుఁ గూడ ద్వివిధములగు శ్రేయము లవసరములని మన ధార్మికు లంగీకరించి యుండిరి. అవి యేవనఁగా, సంఘము యొక్క యార్థికాభివృద్ధి. యనఁగ ధనధాన్యాదిసంపదలును, మానసికాభివృద్ధియుఁ దదుప యుక్తములగు జ్ఞానసంపదయును నని మన ధార్మికులు తెల్పిరి. వ్యష్టిపరముగ నవసరమని చెప్పఁబడిన బాహ్య, ఆంతరంగిక జీవితములే సమష్టి సంఘఘుపరముగఁ గూడ నన్వయించును. ఇట్టి వ్యష్టి సమష్టుల రెండింటి శ్రేయమును సంపాదించుటయే, సమగ్ర మానవధర్మపరమోద్దేశమును, ముఖ్యక ర్తవ్యమును, బ్రధానలక్షణమును.

ఆర్యధర్మము ధరార్థ కామమోక్షయుతము.

ఇట్టి సమగ్ర మానవధర్మమును మనశాస్త్రజ్ఞులు ధర్మాత్మ కామమోక్ష యుతముగ నిర్వచించినారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము సనునాలుగు భాగములుకల మానవ ధర్మము సమగ్రమా? యసమ్మగమా, యని విచారించుట యప్రస్తుతము గాదు. ధర్మము మానవుఁడనుష్టింపవలసినవిధులను నిర్ణయించును. అర్థము మానవునకు జీవనమునకుఁ గావలసిన ధన ధాస్యసంపదలు లభించువిధమును దెలుపును.కామ మన్న చో మానవునిమనమున నుండుకోరికలను, కామ్యార్ధములను విశదీకరించును. జ్ఞానము మానవుని నిజభగవవంశమును గుర్తెఱుంగునట్లుఁ చేసి యాతనికి జన్మసాఫల్యముఁ గూర్పఁ బ్రయత్నించును. కావున మానవధర్మమున ముఖ్యాంశములుగ మనవారు విధులను, అర్థసంపదలను, కామ్యవిషయములను, నిష్కామత్వమును జ్ఞానమును గ్రహించిరి.

ఈధర్మార్థ కామమోక్షములు పైన 'నేనువివరించిన వ్యష్టి యొక్క భౌతిక జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును, సంఘము యొక్క భౌతిక జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును గూడ నభి వృద్ధి నొందించును. ధరార్థములు వ్యష్టియొక్కయు, సుంఘము యొక్కయు భౌతి శాభివృద్ధికిఁ దోడ్పడును. కామమోక్షములు వ్యష్టి యొక్కయు సంఘము యొక్కయు, నాంతరంగిక జీవితము సభివృద్ధిఁ జేయును. ధర్మము లేనిది అర్థసంరక్షణమును, కష్ట కార్యములగును. కామము. మోక్షమును 00 లేకున్న సంపద లెల్ల నిష్ప్రయోజనము లగును. ఈభావము నింకను విరళముగ విప్పి చెప్పెదను.

ధర్మ మనఁగా మానవుఁడు నిర్వర్తింపపలసినవిధులను నిర్ణయించెఁడు 'శాస్త్రజాలమే. అర్థముకూడ నొకశాస్త్ర మే! ఎట్లన, నర్ణమైనను కొన్ని విధుల ననుష్ఠింపనిది లభ్యము కాదు. అర్థమును "దుర్వృత్తివలన సంపాదింపక న్యాయమార్గమున సంపాదించి న్యాయమార్గమున వ్యయము గావించుచు" సంరక్షించుకోనవలె ననుటయే యర్థశాస్త్రముయొక్క యా దేశము. 'అంతియ కాక యర్థశాస్త్రము 'సంఘము యొక్క యార్థికసంపదయె యొభివృద్ధిఁ జెందునో సంఘము తద్విషయమున ననుష్ఠింప పలసినవిధు లెవ్వియో కూడ నిర్ణయించును. కావున శాస్త్ర జాల మొకవంక మానవుఁ డొనరింపవలసిన విధులను నిర్ణయించును. వేరొరవంక “కామము” మానవునికి సహజముగనుండు గోరికల స్వభావము, వానియొక్క తారతమ్యములను, మంచి చెడ్డ లను వ్యక్తీకరించి యుత్తమజీవితపథమును జూపించును. అట్లే మానవుడు సర్వకామితార్థముల ననుభవించి సర్వకామ్యార్థ ముల స్వభావమునుఁ బూర్తిగ గుర్తెరింగి యనుభవసంపన్నుల డై స్వకీయ భగవదంశమును దెలిసికొని భగవంతునిలోఁ జేరఁ బ్రయత్నించుటకు "మోక్ష” ముపకరించును. మానవుని భౌతిక జీవిత మేయడ్డంకులును లేకఁ తిన్నగ నెఱువేఱవలయుననిన ధరార్థములు రెండును లవసములు, మానవునియాంతరంగిక జీవిత మభివృద్ధి నొందవలయుననినిఁ గామమోక్షము లవసర ములు. ధర్మార్థముల రెండికిని జత కామమోశములకు రెండిఁ టికిని జత "కామి గాక మోక్ష కామి గౌఁడు.” అను ప్రసిద్దా ర్యో క్తియొక్క పరమార్గ మిదియే కదా? -

జీవిత సంరంభము యొక్క స్వభావము

కాఁబట్టి మానవజీవితము నొళవంకను కామ్యార్ధములు నడిపించును. వేదొకపంక శాస్త్రములు' విధిని షేధముల నిర్ల యించి మానవుని కామ్యార్థ ప్రవృత్తిని స్వచ్ఛంద ప్రవృత్తిని నడ్డగింపఁజూచును. కామ్యార్థ ప్రవృత్తి చే సూచితమగు మానవ స్వభావమునకును, శాస్త్రమునకును నిరంతర సంరంభమును, సంఘట్టనమును, జీవితమహాయుద్ధరంగమున జరుగుచునే యుండును. ఈసందర్భమునే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు “Struggle for Existence" (జీవితసంరంభ) మని పేర్కొ నినారు. ఈ జీవితసంరం' భముయొక్క' స్వభావమును, అందు రసమునకుఁ గలసంబంధ' మును నిరూపించుటయే ప్రస్తుతకరణీయము. . ఈ జీవితసంరంభ' మున నెగ్గి కామ్యార్ధములకును, శాస్త్రా దేశములకును సామ రస్యమును నెలకొల్పి నిర్వర్తితకాలములును, సఫలీకృతమనో రథులును నై విజయులైనవారే సిద్ధపురుషులు. సామాన్య మానవు నీసంరంభమున కాలుసేతుల 'విరుగఁగొట్టుకొనియో, ప్రాణములఁ బోఁగొట్టుకొనియో నశించుచున్నారు.

ధర్మశాస్త్ర నిరీక్షణము; విధులయొక్క- స్వభావము.

మానవజీవితరథమునకు రెండుచక్రము లనఁదగు కామ్యార్ధములయొక్కయు, విధులయొక్కయు స్వభావమును, సంబంధమును జర్చించెదను, విధు లనఁగా మానవుఁడు పరుల యెడ నడచుకొనవలసిన రీతు లనియే యర్థము. విధులనంత ములు. తల్లి దండ్రులయెడ నడచుకొనవలసినవిధులు, దాంపత్య ధర్మమువిషయమున ' నడచుకొనవలసినవిధులు, బిడ్డలయెడ నడచుకొనవలసినవిధులు, స్నేహితులయెడ నడచుకొనవలసిన విధులు, గురువులయెడ నడచుకొనవలసిన విధులు, రాజునెడ నడచుకొనవలసిన విధులు, ఇరుగుపొరుగువారియెడ నడచుకొన వలసినవిధులు, సంఘమునెడ నడచుకొనవలసిన విధులు, వ్యాపొ రమువిషయమునను, అర్థసంపొదనమువిషయమునను నడచు కొనవలసినవిధులు, స్వదేశ క్షేమమువిషయమున నడచుకొనవల. సినవిధులును, సర్వమానవ జాతియెడ నడచుకొనవలసిన విధులు, సర్వభూత కోటియెడ నడచుకొన వలసినవిధులు, తుట్టతుదకు భగవంతునియెడ నడచుకొనవలసి నవిధులును . సనంతములు, ఈవిధుల నన్నిటిని నిర్ణయించి శాసించుశాస్త్రము లెన్నియే నియుఁ గలవు. సంఘశాస్త్రము, అర్థశాస్త్రము, ,శారీరశాస్త్రము, ధర్మశాస్త్రము, నీతిశాస్త్రము మొదలగుశాస్త్రము లెన్ని యేని. గలవు. ఈశాస్త్రములయొక్క మూలసూత్రము లన్నియు నొకే విధముగ నుండును. సర్వశాస్త్రములకు సమానములగు సూత్ర ముల మీరి వర్తించుశాస్త్రమునకుఁ బ్రమాణాధికార ముండదు. కావుననే శాస్త్రా దేశము సర్వవ్యాప్తిఁ గలిగి యుండవలె ననియుఁ, దోడిశాస్త్రములతో సంబంధమును గలిగియుండవలె ననియు శాస్త్రజ్ఞులు వలుకుట.

కామముయొక్క స్వభావము.

ఇఁకఁ గామ్యార్ధము లనఁగా నేమి? గోరికలు మాసవుఁడు జీవిత కాలమునఁ గోరుకొనుచుండు కోరికలే. రుచ్యా హారములు కౌవలెనని కోరుట, చక్కనిగుడ్డలు కావలెనని కోరుట, చక్కనినగలు, చక్కని పూవులు, తీయనిపండ్లు, కమ్మని పిండివంటలు, చక్కని పెండ్లాము, చక్క-పిల్లలు, సుఖమరణము కావలెనని కోరుటయు మొదలుగాఁగలయవి. కోరికలు లేని ఆంధ్ర కవిత్వll మనుష్య 'లుండనే యుండరు. బ్రతికినంత కాలము నేవో కోరిక లుండనే యుండును. కోరికలును లేనిస్థితి యేది యున్నదో అవియే ముముక్షుత్వము, ఈశ్వరత్వము. ఏవిధము అయినకోరికలును లేనివాఁ డెవ్వడో అతఁడే ఈశ్వరుఁడు. గోరిక లెప్పుడు కలుగునో అప్పుడే యతఁడు మనుష్యుఁ డగును. చచ్చిపోవు వఱకును, చచ్చిపోవునప్పుడును గూడఁ గోరికలుం డును. స్వర్గమునకుఁ బోవ లెననుకోరిక, తనవంశ మాచంద్ర, తారార్క మభివృద్ధినొందవ లెనను గోరిక, ఇట్టి వెన్నియో మను ష్యున కుండును, "చావు కాలానికి లావు కోరిక” లందురుగదా! విల్లులు మరణశాసనములు) వ్రాసి భవిష్యత్కాలపు సంగతు లనుగూర్చి కట్టుబాటులఁ జేసి చచ్చువా రెందఱు లేరు? అందుల కనియే "తస్తాత్ జూగ్రతజూ,గ్రత" యనుకథలోని వెట్టివాడు జనుల నుద్దేశించి పల్కినశ్లోకములలో

ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా,
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత"

యని యుద్భోధించెను. అనుక్షణ సన్నిహితమృత్యువులయి యుండియుఁ గూడ మనుజు లూరక కోరికలఁ గోరుకొనుచు నాశాబద్దులుగ మృతినొందుచున్నారు. కావున మనుష్యత్వము నకుఁ బ్రథానలక్షణము కోరిక లుండుటయే. దీనినే మనవారు కామముగ నిర్వచించి యున్నారు.

కోరికలు వివిధములు.

కోరికలు వివిధములుగ నుండును. కోరికలలోఁ గొన్ని క్షణికానందము నిచ్చునవియుఁ, గొన్ని శాశ్వతానంద మిచ్చు నవియు నుండును. కోరికలలోఁ దారతమ్యములును నెచ్పు

తగ్గులును గోచరించుచుండును. ఎట్లనఁగ: వీధినిఁ బోవుచుండఁగా మనకనుల కెందఱో సుందరులు కనుపింతురు. ఎంత చక్కగా నున్నారు! ఎంత బాగుగానున్నారని సంతసింతుము. కానియిందరి కన్నను మనభార్యలే మన కెక్కువ యందముకల వారుగాఁ గనిపింతు రే! అదియేమి? వీథినిఁ బోవుచుండఁగా ముద్దుబిడ్డ లెందతో కనుపింతురు. వారియాటలు చూచినను, వారిమాటలు విన్నను ముచ్చటగానే యుండును. కాని వారి యందరకన్న మనగడుపునఁ గన్న బిడ్డలయం దంతతీపియు నంత మమకారమును నెట్లేర్పడును? చటుక్కున నొక్కమాటు వీథినిఁ బోవు చుండఁ గనుపించిన వారివైపు దృష్టిపోయినప్పటికిని తిరిగి తిరిగి పదేపదే, వారిని గలసికొని, సహవాసముఁ జేసి కొని యా సహవాసముమూలముగా శాశ్వతానందముఁ బొందుటకుఁ దగినవీలుండదు కావుననే ఊరక సుతోషింతుము. మనభార్యాపుత్రాదులవిషయ మట్టిది గాదు. ఏలనన, మనజీవిత ములును వారిజీవితములును భ్రమసూత్రముల చేఁ గట్టఁబడి యున్నవి. నిత్యమును జూచుచు సంభాషించుచుఁ గలసి మెలసి సౌఖ్య మనుభవించు చుండుటవలన మనయానందమునకుఁ జిర స్థాయి యేర్పడుచున్నది. అదియే చిరకాలము పాతుకొనియుం టచే శాశ్వతానంద మగుచున్నది. కారణాంతరములవల్ల వియోగ మేర్పడినప్పుడు వీధుల వెంటఁబోవు చున్నప్పుడుఁ గనిపిం చెడు సుందరులపైనను, బిల్లలపై నను మనసు లగ్నములౌదు. ఎంత సేపటికిని నాభార్య నాబిడ్డ లనియే మనసు పీకుచుండును. కాఁబట్టి శాశ్వతానందమునకు మానవునకు సహజమైన కామమును చిరానుభూతియుఁ గారణము లైయున్నవి. కోరికలన్నిటిలో నతీతానంద మిచ్చునది భగవంతునిలోఁ జేరవలె నను


కోరికయే. అదియే చిదానందము నొసఁగును. అదియే కామపరిణామము. దీనిని గూర్చి ముస్తుందు విచారించెదము.

కామ్యార్థములు భిన్న మగుచో నెట్లు?

కోరికల యొక్క స్వభావమును నిరూపించితింఈ కదా. ఇంక విధులనుగూర్చియు, గోరికలకును వానికిని గలసంబంధమును విచారించెదము. ప్రతిమనుష్యునకును భోరికలుండియే తీఱునని గదా యింతవరకు దేలినది? కాని ప్రపంచముననున్న మనుజు లందఱోరికలు నొకేతీరుగా నుండునా? ఉండవు. ఒకయింటి లోనే ఒకరికొకవస్తువిష్టము, ఇంకొకరి కింకొకటి యిష్టము, మఱియొకరికి మజీ యొకటి యిష్టము. ఇంటిలోనున్న, స్త్రీలలో గూడఁ గోరికలలో భేద ముండును. ఒక్కొక్కరిత గోక్కొ క్కరంగుగలవస్త్రము బాగుండును. ఒక్కొక్కరిత గోక్కొక నగపై మోజుండును, ఇట్టులనే ఒక్కొక దేశ మందు మొత్తము మీఁదఁ గొన్ని రకముల గుడ్డలపైనను, నగలపై నను, తినుబండ ములపై నను, ఆచారవ్యవహారములపై నను నాదరముండును. వేరొక దేశమున వానిపై నాదరము తక్కువగా నుండును. ఉదాహరణము:__మన ఆంధ్ర దేశమునఁ గారము పై నను, కాఱు రంగుల పై నను, గాఁటువాసనగలపూవులపై నను ఆదరము మెండు. పశ్చిమ దేశముల వీనిపై సాదరము తక్కువ. మన దేశమునఁ జల్లఁదనమన్నఁ బ్రోమసూచకమును, శాంతిసూచకమును నగునర్థమును, ధ్వనియును కలుగుచున్నది. చల్లనితల్లి కడుపు చల్లఁగా, చల్ల నికౌగిలి యసుపదముల యొక్క స్వారస్యము గమనించునది, పశ్చిమ దేశములఁ జల్లఁదనమున కంత యాదరము కానరాదు . “Warm embrace, warm welcome, warm blood"'

(వెచ్చని కౌఁగిలి, వెచ్చనిస్వాగతము, వెచ్చని నెత్తురు) "మొదలగు పదముల ప్రేమసూచకమగు నర్థమువచ్చు సందర్భముల వాడెదరు. శీతోష్ణస్థితులను బట్టియు, దేశ కాలపాత్ర ములనుబట్టియుఁ , జరిత్రము ననుసరించియు దేశములోనుండు మనుజులయొక్కకోరికలు మాటుచుండును. గృహవిషయమునను నట్లే.

శాస్త్రము యొక్క యావశ్యకత.

.

కాని ప్రపంచమున ననేక ప్రకృతులుగల మనుజు లుందురే, అనేక విధములగు గోరికలఁ గోరుచుందురే, ఆకోరి కలు గోరుమనుజులలో వారిలో వారికి విరోధము సంభవించి నపుడును, ఒకమనుష్యుఁడు గోరు గోరికలలోనే యొకదానికి నింకొక దానికిని విరోధము కలిగినప్పుడు చేయఁదగినది యేమీ? లోకమునఁ గొందఱకోరికలు మిగిలినవారికి బాధాకరములుగా సుండును. ఉదాహరణము: ఒకనికి నరమాంసమనిన రుచి యనుకొందము. వాఁడు నరమాంసము రుచికదాయని రోజున గోకని బలిఁగోనుచుఁ నెడునెడల నందఱుగతి యేమికావలెను! ఇంకొకనికిఁ బరకాంతాసంగతి కడుఁ బ్రియమను కొందము. అట్టివాఁడు కుల కాంతలఁ జెఱఁబట్టు చుండఁ జూచి యోర్వం గలమా? ఇంకొకనికిఁ గన్పించినవారి నెల్లఁ గొట్టుటయుఁ దిట్టుటయు నిష్టమనుకొందము. వానికోరిక నెరవేఱ్చుటకై మనము దెబ్బలును దిట్లును పడఁగలమా? కాఁబట్టి లోకమున మను ష్యుఁడు కోరుకోరికలు తక్కుంగలమనుజుల బాధింపఁగూడదు. అట్లు బాధింపఁజూచిన మిగిలినవారలు ప్రతీకారము చేయం జూతురు. అట్టి ప్రతి క్రియ రాజశాసనము మరాలముగఁగాని, న్యాయశాస్త్రము మూలముగాఁగాని జరుగును. ప్రకృతవిషయమున

నట్టి ప్రతి క్రియనే శాస్త్రములు విధించుచున్నవి. అట్టికోరికల, వలన ణీతరులకు బాధ జనింపకుండుటకై శాస్త్రములు మానవుఁ డనుసరింపవలసిన విధులను నిర్ణయించును. అట్టివీధ్యు క్తమార్గానుసరణమే కర్మమార్గము, కర్మ యోగము నను పేర్లఁ బరఁగు చున్నది. “శాసతీతి శాస్త్రం” అనుసంస్కృత వ్యాఖ్య ప్రకారము శాస్త్రమునకు శాసనాధికారము కలదని మనశాస్త్రజ్ఞు లంగీక రించియున్నారు. అట్టిశాసనముల నన్నిటిని క్రోడీకరించి ధర్మ శాస్త్రము, నీతి శాస్త్ర మాదిగాఁగలశాస్త్రముల రచించి “ధర్మ:* మను పేర మానవధర్మమునఁ జొప్పించి యున్నారు. ప్రప్రథమ మున ధర్మము పేర్కొనఁబడియుంటచేఁ బ్రతివానికిని ధర్మాచరణము ముఖ్యమనియుఁ, దసమూలముగ నితరులకు బాధ కలుగఁ గూడదనియు, మనవారు బోధించిరి. శాస్త్రము నైచ్ఛికముగా వదలినచో నెల్ల రుసు శాస్త్రమును మీటియే సంచరింతురు. కావున నే మనజీవితమున ననుసరింపఁదగినవిధులను నిర్ణయించు రోజుకును, మసకోరిక లితరులను బాధింపకుండుటకును నొక శాస్త్రమును నిర్మించి యధికారరీత్యా మనజీవితముల సామర స్యముఁ గల్పింపఁ జూచినారు. ఈశాస్త్ర జూలము నే మనవారు ధరార్థ కామమోక్షసంయుతమగు మానవధర్మమునఁ బ్రప్రథమ మునఁ బేర్కొనినారు. విధులవిషయమున శాస్త్ర నిర్దిష్టమగు. ధర్మ మవశ్యాచరణీయము. లేనిచోఁ బ్రపంచమునఁ బరస్పర విరోధమును, వైపరీత్యమును, సంరంభమును సంఘట్టనమును.దప్పవు.

శాస్త్రము శామమును శాసింపఁజాలదు.

విధులనయితే ధర్మము నిర్ణయించి యడ్డగింపఁగలడు గాని మానసికములగు కోర్కుల నడ్డగింపఁగలదా? నాకు బ్రపంచమునకంతకును రాజును గావలెననుకోరిక యున్న దను కొందము. ఏశాస్త్రము నన్నడ్డగించును? మనస్సులోఁ బాలుఁద్రావు చో మనల నడ్డగించువా రెవ్వరు? ఆకోరిక ననుసరించి యితరులను బాధింపఁ జొచ్చినయప్పుడే సంరంభము జనించును. అంతవఱకును భయము లేదు. మానసికస్వాతంత్ర్యమును భగవంతుఁడు కూడ నడ్డగింపఁజూలఁడు. అట్టిచో శాస్త్ర మేవిధిని మానసిక స్వాతంత్ర్యము నడ్డగింప గలుగును? మృత్యువున కేమైన నీపని సాధ్యమగు నేమో? ఈశంకకుఁ గూడఁ బూర్వ పక్షమున్నది. ఎట్లన మృత్యుకాలమునఁ గోరిక లున్న చో నాకోరికలఁ దీర్చు కొనుటకొఱకు వేటోకజన్మ మెత్తవలసియుండునని శాస్త్రము, కావున నిచ్ఛాసామ్రాజ్యమునకు మనస్సు సర్వ సర్వంసహాచక్రవర్తి యనఁదగును. కావుసం గ్రియారూప మునఁ బరిణమింపని శుద్దమానసిక వ్యాపారములయం దెల్ల మనస్సునకుఁ బరిపూర్ణస్వాతంత్ర్యము కలదు. శాస్త్రము మన యిచ్ఛాసామ్రాజ్యముపై నధి కారము చలాయింపఁజాలదు.

శాస్త్రము రసమును, గవిత్వమును నిరోధింపఁజాలదు

రసమును, రసానుభూతియుఁ, దదాత్మకమగు కవిత్వ మును శుద్ధమానసిక వ్యాపారములని చిన్న పిల్లలుపై తము గ్రహింపఁగలరు. రసికునకు, రసానుభూతియందునను, కావ్య సందానుభూతియందునను నపూర్వమగుమానసికస్వాతంత్ర్యము కలదని మనమంగీకరింపక తప్పదు. ఇట్టి మానసికస్వాతం . త్ర్య మునే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు "Freedom of the will" అని తెల్పియున్నారు. అట్టిచో, రసమును, రసొనుభూతియు, కవిత్వా నందానుభవమును, గావ్యమున వర్ణితములగు భావములును, శాస్త్ర బద్దములును, శాస్త్ర బాధితములును గా నేరవు, శాస్త్రము నకును రసానుభూతికిని తదాత్మకమగు కవిత్వమునకును జాల దూరము సవతీపోరాటము. శాస్త్రము దేనిని గూడదనునో కవిత్వము దానినిసై తము స్వీకరించుచు మనోహరముగఁ జిత్రించును. శాస్త్రము దేని నవశ్యానుషేయమని నిర్ణయించునో కవిత్వము దానిని శుద్ద కోతి యవ్యాపారమని త్రోసి వేయును. ఉదాహరణము. శాస్త్రమునఁ గుల కాంతకుఁ బరపురుషునిసం గతి మహాపాతకమనియు, ఘోరనర కాపాదకమనియు నాదే శింపఁబడినది. కానీ, రాజరాజన రేంద్రుని భార్యగానుండి సవతి కుమారుఁడగు సొరంగధరునివలచి యతనికొరకైప్రాణముల సైతముఁ ద్వజించిన చిత్రాంగియు, గొల్లనిభార్య యయ్యు శ్రీకృష్ణునకు " హృదయసమర్పణముఁ గావించిన రాధయు, సాహితీ ప్రపంచవాసులలో ధన్యులు, మృతజీవులు, సాహితీ ప్రపంచవాసుల కుండవలసిన లక్షణములును, గుణములును, ప్రతిభలును వేఱుగ నుండును. అవి గతానుగతికులును శాస్త్ర నియమశృంఖలా బద్దులును నగుసామాన్యమానవులయెడఁ గన్నట్టవు; వారి కూహాతీతము లయియుండును. కవిత్వ మెప్పుడును శాస్త్రమువలె దేశ కాలపాత్ర ములనే యాధారముగఁ గొని వానినే యనుసరించుచు నుండదు. మీఁదుమిక్కిలి కవిత్వము దేశ కాలపాత్రముల కతీత మై స్వచ్ఛందసంచారము గావించు చుండును. శాస్త్ర దృష్టి యెన్న టికి హ్రస్వదృష్టియే. రససృష్టయుఁ గవిత్వదృష్టియు దీర్ఘము' లై యుండును, శావ్యదృష్టి యతీత


దృష్టి. దీనినిగూర్చి స్థలాంతరమున విపులముగల జర్చించియే యుంటిని. ప్రస్తుతవిషయమున కుపకరించుటకుఁ దేలిన దేమ నఁగా శాస్త్రమునకుఁ గవిత్వమునకు మొగ మెఱుకయే యనియు, శాస్త్ర నియమములు కవిని భాదింప నేరవనియుఁ గవి నిరంకుశుల డనియునే. అందుచే రసమును తదాత్మకమగు కావ్యమును మానవధరమునకు నంగములగు ధరార్థ కామమోక్షములందు శాస్త్ర సార మనఁదగు ధర్మము నాశ్రయించుకొని యుండవని సిద్ధాంతమగుచున్నది.

రసము అర్థమునాశ్రయింపదు.-

సరే, రసము ధర్షము నాశ్రయింపదు. పోనీ, అర్ధము నేమైన నాశ్రయించునా? అర్థసంపాదనమునకును, రసాను భూతికినిఁ బ్రబలవిరోధము, ధనార్జనపరుఁడగువానికి రసాను భూతి యుండదు. ఒక వేళ కొంచే మేమైన నున్నచో నది ధనార్జనమునకుఁ జేఁటు నాపాదించునేకానీ సాయము జేయఁ జూలదు. “బంగారువంటిగోమటి సంగీతము చేత 'బేరసారము లుడి గెన్” అనుపచ్య మే యీరహస్యమును వేనోళ్లఁ జాటు చున్నది. ధనార్జనమునకును,ధనసంరక్షణమునకును,రసజావమున కును జాలవైపరీత్యమును నిరోధముసుగలవు, ధనార్జనపరునకు ధనసంపాదనమే యొకపరమార్గ మగుచున్నది. అందు సర్వవిధ ములగు భావవి శేషములకుఁ దావు చేకూరిన ధనసంపాదనము నకుఁ జేఁటువచ్చును. "ఈధన మే, ఈధనమే, ఇహపర సాధన మీధనమే” యని పలవరించెడు . కలిపురుషుఁడే ప్రపంచమున ధనార్జనపరునీ రూపమున నవతరించి ప్రస్తుతము భూలోకము 'నంతయు నవిచ్చిన్న ముగ నేలుచున్నాడు. ఇట్టి కలిపురుషు లే

ప్రస్తుతై రోపావాసులు, అందులో నాంగ్లేయులు సాక్షాత్తు కలిపురుషావతారులు. అందుకనియే వారికి ద్రవ్య కాంక్ష మెండు. రసభావము మృగ్యము. ధనసంపాదనమను స్థాయీ భావమును దోహదముఁ జేయు విభావానుభావాదులు పిసిని గొట్టుతనము, దురాశ, యన్యాయవర్తనము, పరధనాపేక్ష, యసత్యము, అసూయ, అప్రమాణము, ఈర్ష్య, యేడుపు గొట్టుతనము, నిర్దయ, మొగమోటమి లేమి మొదలగు దుర్గుణములు. ఇట్టి దుర్గుణముల పరంపర తోడ రసభావమునకుఁ జెలిమి పొసఁగదు. కావున రసము అర్థము నాశ్రయింపదు.

రసము మానవసహజమగు కామము నాశ్రయించును.

ఇక రసము దేని నాశ్రయింప వలెను! కామము నాశ్రయించునా? విచారింతము. రసము, అనఁగ భావానుభూతి, దేనికి సంబంధించినది? మనుజున కుండుసహజములగు గోరి కలవిషయముననే భావానుభూతికిఁ బ్రసక్తి కలుగును. కామ్యార్గము గోరుటలో నొకవిధమగు భావానుభూతి, దానికొఱకుఁ బ్రయత్నించుటలో నొకవిధమగుభావానుభూతి, అది లభ్య మైనప్పు డొకవిధమగు భావానుభూతి, అది చేజాజిపోవునప్పు డొకవిధమగు భావానుభూతి, తిరిగి యది లభ్యమైనప్పుడు మఱి యొకవిధమగు భావానుభూతి, ఇంక నెన్ని యోవిధము లగు భావానుభూతుల మనుజుఁ డనుభవించు చుండును. ఆశ , ఉత్కర్ష, సంతోషము, దుఃఖము, శాంతి, శమము మొదలగు. భాషము లెన్నేని మనుజుఁ డనుభవించుచునే యుండును. జీవిత మంతయుఁ గామ్యార్ధములతో నిండియుండుటచే భావము లెప్పుడును ననుభూతము లగుచునే యుండును. అందుకనియే.


కొందఱు పాశ్చాత్య శాస్త్రజ్ఞులును “Life is a bundle of experi-- ences" జీవితము (భావానుభవములయొక్క సమూహము) అని చెప్పిన పలుకులయం దెంతయు సత్యము గోచరించుచున్నది.

కామము విశ్వవ్యాపి.-

జీవిత కాలమునఁ గామ్యార్ధములఁ గోరనివాఁడును, తన్మూలముగ వివిధ భావసంచలనమునకు లోనుగానివాఁడును బ్రపంచమున నరుదుగ నుండును. కేవలధనార్జనపరుఁడై సర్వ కామోపభోగముల ధనవ్యయమునకు వెఱుచి త్యజిం చెడు పీ నాశి యైనను ధనరాసులఁ జూచునప్పుడు సంతోషమును బొందక మానఁడు. నిశ్చల చిత్తుఁడై, సర్వసంగముల వర్ణించి, రాగరహితుఁడై యోగనిష్ఠ మెయిఁ దప మొనర్చు యోగీశ్వరుఁడును దివ్య తేజము కనుల యెదుటఁ బ్రత్యక్షమగునప్పుడు ఆనందము నొందక మానఁడు. చిత్తవి భ్రమమునొందిన పిచ్చివాఁడును, త్రాంగి మత్తిల్లి క్రిందఁబడియుండు తెగుఁబోతునుగూడ భావసంచ లనముఁ బొందుదురు గాని యాభావమిట్టిదియని తమలోఁ దామైనను గుర్తింప నేరకుందురు, చిట్టచివరకు శిశువులుఁగూడ మాతృ వదనదర్శనముఁ, గావించునప్పుడును, బరిచితులమోము లగుడు నప్పుడును నొకవిధమగు భావము ననుభవించుచునే యుందురు. కాని వారికిఁ గామ్యార్ధమును గూర్చినజ్ఞానము లేకుండుటచే భావానుభూతినిఁగూర్చిన స్వజ్ఞానమును లేకుండును. కామ్యార్థ మున్న యప్పుడెల్ల భావానుభూతి యగుచునే యుండును. కావున గామ్యమునకును భావానుభూతికిని యవి నాభావసంబంధ మున్నది. కావుననే భావానుభూతి యనఁదగురసము కామము నాశ్రయించుకొనునని చెప్ప సాహసించుచున్నాము! కామము

లేనివాఁ డెట్లు జగమున నరుదుగ నుండునో అట్లే భావసంచలనముఁ బొందనివాఁడును జగమున నుండుట యరుదు. అందుచే భావానుభూతి, అనఁగా రసము సర్వవ్యాపి యని తేలుచున్నది. రసమునకుఁ దావు లేనిచో ట్లుండవు. పపీలికాది బ్రహపర్యం తము రసభావము వర్తిలుచునే యుండును. ఎట్లనఁ గ్రిమికీటక ములలో సైతము భావానుభూతి విదిత మగుచున్నది. ఎవరైన గాని యేదియైన కాని యడ్డువచ్చినపుడు భయపడి పారి పోవుట నిజ ప్రాణపోషణమునకై యోరిమితోడను శ్రద్ధ తోడను బాటుపడుట సంతానరతుణమునకై ప్రాణములపైత మర్పించుటకు సిద్ధముగ నుండుట మొదలగు భావములయను భూతి చీమదోమ మొదలు సర్వజంతుకోటియందునను సువ్యక్త ములు. 'కావున భావానుభూతి లేని జంతువుసైత ముండదు.

ప్రకృతిశూడ భావసంచలనము నొందును జగదీశ ఛంద్ర పసువుగారి నూతన సిద్ధాంతము.

అంతయేల? ప్రస్తుతము భారతీయ ప్రకృతిశాస్త్రజ్ఞులలో నెల్ల నగ్రగణ్యుడగు జగదీశచంద్రవసువు గారు ఇన్ని వేలసంవ త్సరములనుండియు మానవునిచే నచేతనములనియుఁ బ్రాణ శూన్యములనియు నెంచఁబడినవృక్షములు, తాలు, లోహ ములు, మొదలగు వానియందునను గూడ సంచలనమును భావానుభూతియు వివితము లేయని సప్రమాణముగ దిక్ప్రదర్శితముఁ గావించిరి. భగనదాత్త వినా ప్రపంచమున వేఱువస్తువు లేదని చెప్పిన యుపనిషద్వేదాంత సిద్ధాంత పరిణామము ప్రకృతి శాస్త్రమున శ్రీ జగదీశచంద్రవసువు గారినూతన సిద్ధాంతమునందు వ్యక్తమగుచున్నది, సర్వ ప్రపంచమునకుఁ గర్త యొక్కఁడే యనియు నతనికి విరుద్దమగు వేఱుపదార్థము లేదనియు, నతనిచే సృజింపఁబడిన సర్వపదార్ధములు నతని తేజముతో నిండియుండు ననియు, నట్టివస్తువు లన్ని టీయందుననుఁ జై తన్య ముండు ననియు, అట్టిచైతస్య బలమున సర్వవస్తువులును ప్రాణులమగు మనయట్ల భావసంచలనముఁ బొందుచునే యుండుననియు, భగ వంతునిసర్వమయత, యచేతనములనీ మనము తప్పఁదలఁచిన వస్తువులపట్లఁగూడ వర్తించుననియు, - అచేతనములు గదా యను తప్పుతలఁపున వానిని హింసించిన వానికి బాధ కలుగు ననియుఁ దెల్పి “తనయందు నిఖిలభూతములందు నొకభంగి సమహితత్వమును జరపువాఁడు” అనుభాగవతవచనము యొక్కయు “ఆత్మవత్సర్వభూతిని" యను నుపనిషద్వాక్యము యొక్కయుఁ బ్రామాణ్యమును ప్రాముఖ్యమును క్రూరులును, రాజ్య కాంక్షా పరులును, హింసారతులును, మాంసాశను లును, నాస్తికులును నగుపాశ్చాత్య శాస్త్రజ్ఞులకును సొశ్చాత్య జనులకును వెల్లడించి భారతీయ విజ్ఞాన ప్రాశస్త్యమును ఘంటా పథముగఁ జాఁటి తన్ను గన్న దేశమునకు ఖ్యాతియుఁ దన కశేష శేముషియును శ్రీవసువు గడించినాఁడు. ,

వాల్మీకి రామాయణమునుండి యుదాహరణములు.

మృగములకును, నదులకును, బర్వతములకును, వృక్షము లకును, లతలకుమగూడ భావసంచలనమును జైతన్యమును నుండుననుటకు వాల్మీకి రామాయణమున "రావణుఁడు కామో “కవశుఁడై సీత నెత్తుకొనిపోవునపుడు అనాథయై విలపించు సీతయొక్క దురవస్థకు మనసులు గరఁగి వాపోవు జంతువుల యొక్కయు నచల ప్రకృతులయొక్కయు విలాపమే నిదర్శనము. ఆది కావ్యమునుండి యీ క్రింది శ్లోకముల నుదహరింపక మానం జూలను:--

<శ్లో. ఉత్పన్న వాతాభిహతా నానాద్విజగణాయుతాః,
మాబై రీతి విధూతా గ్రా వ్యాజహ్రు రివ పొదపాః.స -36,
నళిన్యోధ్వ సకమలాస్త్ర సమానజ లేచ రాః,
సఖిమివ గతోచ్ఛ్వా సామన్వకోచంత మైథిలీమ్. 37
సమం తొదభిసంపత్య సింహవ్యాఘ్ర మృగద్విజాః:,
'అన్వభావం స్తదా రోహత్సీ తాం ఛాయానుగామినః. 38
జల ప్రపాతాశ్రుముఖాశ్శృంగైరుచ్చితబాహుభిః,
సీతాయాం ప్రాయమాణాయాం విక్రోశంతవ పర్వతాః,
శ్రయమాణాం తు వై దేహీం దృష్ట్వా దీనో దివాకరః,
ప్రతిధ్వ స్తప్రభ శ్రీమా నా సీత్పాండరమండలః. 40
సొస్తే ధర్మః కుతస్సత్యం నార్జవం నానృశంసతా,
యత్ర రామస్య వై దేహీం భార్యాం హరతి రావణః. 41
ఇతి సర్వాణి భూతాని గణశః పర్య దేవయః,
విత్ర స్తశా దీనము:ఖా రురుదుర్మృగపోత 'కాః; 42
ఉద్వీక్ష్యాద్వీశ్య నయనై రాస్రపాతావి లేక్షణా.
సుప్ర వేపితగా త్రాశ్చ బభూపుర్వన దేవతా!ః. 43


పాశ్చాత్యుల సిద్ధాంతము, 1. వర్డ్సువర్తు 2. టెన్ని సస్.


పాశ్చాత్యులలోఁ గూడఁ గొందఱు కవీశ్వరులు వర్డ్సు వర్తు మొదలగువారు ప్రకృతికిఁగూడ స్వతంత్రమగు చైతన్యము కలదని వర్ణించి కావ్యముల రచియించినారు. ఈభావమునే ***All the world is a cosmos, a single powerful, mighty, idea." అని పాశ్చాత్య తత్త్వవేత్తలు వర్ణించినారు. అగును. ఇం దా శ్చర్య మేమి కలదు? జంతుకోటికిని నచల ప్రకృతులకుఁ గూడ భావసుచలన మున్న దనుచున్నా మే యిందులకుఁ గారణము సర్వప్రపంచమును నడపుచుండు కామమేకాని వేరు కాదు. ఏదోయొకళోరిక సర్వప్రపంచమును నావహించుకొనియే 'యుండును. ఈభావమే "ఆశయా ఒద్ద్యతే లోకే కర్తగా బహుచింతయా” యమునార్యవచనమునందునను, “One idea, ave Reality, Ong God, and all creation moves towards it',అని “In memoriam' అనుకావ్యమునఁ జెప్పిన టెన్నీ సన్ కవి వాక్యము నను ధ్వనించుచున్నది. టెన్ని సన్ కవిభావ మేమనఁగ నొకటే భావము, నొకటే సత్యము, నొళఁడే భగవంతుఁడు, సర్వప్రపంచ మును నడపించుచున్నా రనియే. సృష్టి య చేతన కాదనియు, భావపూరితయును, సచేతనయు ననియే.

ఉపసంహారము. -

కావున నింతపఱకుఁ దెలియవచ్చిన దేమనఁగాఁ బ్రపం చము సర్వమును గామముచే నడపింపఁబడుచుండుట చే భావ పూరితమనియు, భావాస్పదముఁ గూడననియు, నందు చే బ్రకృతియందు రసమునకుఁ దావు లేనిపట్టే యుండదనియు, రసప్రవృత్తికి నేయడ్డును లేదనియు, జనాంతర సంచితచిత్తపరి పాకముఁ గలిగినకవికి జగత్తు సర్వమును రసభావోద్దీపకమే యనియు, రసము వినా జగత్తు శూన్యమనియును, కావున నే రసమునకు రసాత్త కమగు కావ్యమునకును మానవధర్మమునం గామమే యాశ్రయ మగును.


ఇక మోక్షమునకును రసభావమునకును గలసంబంధము నించుక విచారింతము. "మోక్షము” అని మనవారు మానవధర్మమునఁ బేర్కొనిన జీవిత భాగమునకు రెండర్థములు కలవు. ఒకటి భగవంతునిలోఁ జేరి యైక్యమై జీవన్ముక్తి, నొంద వలెనని మానవుని కుండుకాంక్ష. రెండవది యేగోరికలును. లేక రాగవిముక్తుఁడై నిశ్చలుఁడై మానవుఁడు పర బ్రహయగు నవస్థ. . 'మొదటియర్ధము ప్రకారము మోక్షముఁగూడ నొక కాంక్ష యగును. కామమే యగును. కావున రసభావముమోక్షకుఁ గూడ వర్తించును. మోక్ష కాంక్ష కలవాడు జడునిఁబోలె సూరకుండునా? మోక్ష, ప్రాప్తి నొడఁగూర్చుసాధ నములను సామగ్రిని గూర్చుకొని మోక్ష కామీ తత్సంబంధ మైన భావని శేషములకు లోనగుచు జీవితవీణను మోక్ష నాదము నిచ్చునటులఁ బుణ్యము, తపము, జ్ఞానమునను తంత్రుల మ్రోయించుచునే యుండును. ఇక రెండవయర్థము గ్రహించినను మానవుఁడు' పర బ్రహతో సమమగు సవస్థ ననుభవించు నప్పుడు చిదానందము నొందునని మన వేదాంతులంగీక రించినారు. అదియును నొక భావానుభూతియేకదా? కావునం బరమార్దము గ్రహించి విచారించిన మానవుని యాంతరంగిక జీవితొభివృద్ధికిఁ దోడ్పడు 'కామమోక్షములు రసాశ్రయము లగును. మానవుని భౌతిక జీవితాభివృద్ధికిఁ దోడ్పడు ధరార్థ ములు రసమున కాశ్రయములు కాజాలవు. కావున రసమునకుఁ బ్రభానముగఁ గామమును గొంతవఱకు మోక్షమును నాశ్రయములగునని చెప్పుటకు వీలగుచున్నది,

2. రసమునకును మానవజీవితమునకు గలసంబంధము.


పై నఁ జెప్పఁబడిన ప్రకరణమున రసము ధర్మార్థముల నాశ్రయింపక కామమునే ప్రధానముగ నాశ్రయిం చుననియు, కొన్ని విధముల మోక్షమును గూడ నాశ్రయించుననియుఁ దెలిపి యుంటిని. ఇప్పుడు కవి యేమిపనిఁ గావించునో, రసభావము వృద్ధినొందుటవలన జీవితమున కవిలాభమో ఎట్టివికాసమో నిరూపింపఁ బ్రయత్నించెదను. అనంతకోటి జీవరాసులలోఁ గవి యెట్టివాఁడో, యేస్థానమున కర్షుఁడో, రసమువలన నెట్టి ప్రయోజనము సిద్దించునో తెలుప యత్నించెదను. ముందుగాఁ గొన్ని దుర్వాదములను, విపరీతాభిప్రాయములను గుళంకలను. నిర్మూలముగ ఖండించీ పిమ్మట కవియొక్క ప్రాశస్త్యమును గూర్చియు రసముయొక్క ప్రయోజనముఁ గూర్చియుఁ బ్రసంగించెదను.

కావ్యము యొక్క ప్రయోజన మానందజనకత్వ మే

గత ప్రకరణమున రసమునకును ధర్మార్థములగును విరోధమును వైపరీత్యమును గలదని తెలిపితిమి. ఆసిద్ధాంతమును బురస్కరించికొని "కవిత్వమునకు శాస్త్రమునకు సవతిపోరాట మనుచున్నారే. శాస్త్రము ధర్మమును బోధించుననుచున్నారు. కవి నిరంకుశుఁ డనుచున్నారు. వేరొకవంక శాస్త్రమునకు శాసనాధికారము కలదనుచున్నారు. ఇదియంతయుఁ జూడఁ గవి తాను విచ్చలవిడిగ శాస్త్రములను దిరస్కరించి సంచరించు టయేక యితరులఁగూడ శాస్త్రములమీరి నడచుకొనుఁ డనియు, నధర్మమూర్గమునఁ జరింపుఁ డనియు బోధించున ఆంధ్ర కవిత్వ-18

ట్లున్నాఁడు. ఇట్టివాఁ డున్నఁ బ్రపంచమునకు హాని రాదా ? భూమియు సంఘమును దలక్రిందులుగావా! జీవితమందలి సామరస్యము చెడదా? ఇది యేమో చిక్కు సంగతిగా నున్నది. మా కే కవిత్వమును వద్దు. మా కేరసముతోడను బని లేదు. మా జీవితములు చల్లఁగా నే యొడిదుడుకులును లేక వెళ్లిపోయినఁ జాలును. ఎందుల కీ బెడందలు. కవిత్వము మానెత్తిమీఁది కేమి బెడఁదఁ దెచ్చి పెట్టునో, వలదు వలదనుచుఁ దత్తరమున సామాన్యమానవుఁ డడుగుచున్నాఁడు. రసికుఁ డభయహస్త మొసఁగి యిట్టులు చెప్పుచున్నాఁడు: –

"ఓయీ! యేమియు భయము లేదు. రజ్జుసర్ప భాంతి యని యిట్టిదానినే మన వేదాంతులు చెప్పుచుందురు. అది యేమన, త్రాడును జూచి పామనుకొని భయమందుటయే. అట్టి రజుసర్పభ్రాంతి చీకటిని నడ చెడు ప్రతిమనుజునకును, మహా మహులకును సైతము కలుగుచు నే యుండును. కానీ యది వట్టి భ్రాంతియే. దీపము వెలుఁగునఁ జూచిన వట్టి తాడే, ఎంత భయ పడితి మనుచు వారు తమలోఁదామే సిగ్గుపడుదురుకదా! అట్లే కవిత్వమాహాత్మ్యమును, రసప్రాశస్త్యమును దెలియనివాడ వగుట నీ కిట్టిశంక కలిగినది. దీపము వెలుఁగున, జ్ఞానముబల మున నిజమరసికొనుము. కవి నిజముగ విచ్చలవిడి దిరుఁగు ఫొఁడా? అతఁ డధరమునే బోధించునా? కాదు, కాదు, ముమ్మాటికిని కాదు. అందలిసత్యము నెఱుకపటి చెదను వినుము. కవిత్వదృష్టికిని అనఁగా రసదృష్టికిని శాస్త్ర దృష్టికిని భేదమున్నది, ప్రపంచముననున్న వస్తువుల నే కవి వేఱుకన్నులతోఁ జూచును. కన్నుఁగలవారుసై తముఁ గాంచ లేనిచోద్యము లెన్నో, రహస్యము లెన్నో కవికన్నుల కగుపడును. అట్టి తీక్ష దృక్కులుగల


వాఁ డగుట చేతనే “రవి గాననిచోఁ గవి గాంచకుండు నే? " యసునార్యో క్తి కలిగినది. కవి సామాన్యమానవుల కగోచర ములగు రహస్యములను దనరసవృష్టి చేఁ గాంచి యనుభవించి, కవిత్వశ క్తి చేతఁ గాంచిన దానిని సుందరముగా రసముగఁ గవి త్వోచితరీతిని వర్ణించును. ప్రపంచమున నందరకును జీవితపరమావధియు జీవితపరమార్థమును నొక్క- టీయే, అది యే దనఁగఁ దన్నుఁదాను తెలిసికొని చేతనైనరీతిని తోడివారలకు సాయముఁ జేసి ముముక్షుత్వము నొందఁ గోరుటయే. ఈ విశాలవిశ్వమానవ మందిరమున భగవంతుఁడు ప్రతిమనుజున కొక్కొకగది యేర్పఱచినాఁడు. అట్టిగదులలోఁ గొన్ని పై యంతస్థులను, గొన్ని యడుగుభాగమునను నుండును. కొన్ని గదులకుఁ జక్కనిగాలియు వెలుతురును వచ్చును. కొన్ని టి కాసౌఖ్యసంపత్తి యుండనే యుండదు. కొన్ని రంగురంగుల గోడలతోను, అందమైనపటములతోను వచ్చుచుఁ బోవు వారలదృష్టి నాకర్షించుచుండును. కొన్ని చీకటి కోణములై మసి వారిన గోడలతోను, పొగతోను నసహ్యము లగును. చూడు మీభవనమున మన కవియుండు గది యేదో? అల్ల దే సౌధోపరిభాగమున నొక్కటేగది యున్న దే! ఆదియే. దానికి “జక్కనికిటికీ లున్నవి. వానినుండి నిరంతరము రకరకముల వెలుఁగులును, దేశ దేశముల, సీమసీమల గానామోదమును గొనివచ్చు వాయువులును నెల్లప్పుడును వచ్చుచునే యుండును. మనకవి యందుఁ గిటికిలోనుండి ప్రపంచమును దనివిదీజుఁ జూచి యానందించుచు, నాయానంద పారవళ్యమున నెడ తెగని పాటపాడుచు వచ్చిపోవు వారి నున్నతులం జేయుచుండును. ఎందరో తమతమపనుల నన్నియు మాని యాతనిపాట విను చున్నా రే! చూడుము. ఎల్లరచూపు లతని పైననే యున్నవే! అతని మాటలనిన, నతనిపాటలనిన నంతవ్యా మోహ మేల కలుగవ లెను? ఆవినువారిలో నొకని నడుగుము. ఏమనుచున్నాఁడు?: 'పగ లెల్లను పని చేసి చేసీ యలసట చేఁ బోవుచున్న మాకు వీనుల విందుగా నీ ప్రపంచసౌందర్యమును, నీ జీవితానందమును, భగ వత్స్వరూపమును వర్ణించుచు మనోహరగానము సేయుచుండ వినుటకన్న నెక్కు డదృష్ట మున్నదా? గాలి, వెలుతురనునవి లేక యెల్లప్పుడును పొగచేతఁ గన్నులు పోవున టుండునా ? శాస్త్రులగదులలోఁ గన్నులు మూసికొనియే పని చేసి చేసి,కొంచె ముసేపయినను జల్లనిగాలిలో వెలుతురులో కన్ను లపండుగు, నీసమయమున వీనులవిందుగఁ బాడుచుఁ గన్ను లఁగట్టినట్లుగ, నానాలోచిత్రములను మాకవిసోదరుఁడు వర్ణించుచుండఁగా వినుటకన్న నెక్కువ యేమీ కావలెను ? అదియేమి? కవి. యేమనుచున్నాఁడు?

 శ్లో. కావ్యం కరోమి నహి చారుతరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి:.
భూపాలమౌళిమణీరంజితపాదపీఠ
హేసాహసాంక, కవయామి, వయామి, యామి.

అతఁ డేదివర్ణించినను అందముగా, మనోహరముగా, ఆనంద జనకముగా నుండును. మనకు దేనియందుఁ బ్రీతికలదో దానినే యతఁ డెంతో సుందరముగా వర్ణించి మన ప్రీతిని వేయి.మడుంగు లెక్కువ కావించును. అతనివలననే మాజివితముల లోని సంసార బాధనంతయు, శ్రమమునంతయు, మఱచి యానంద మనుభవింపఁగలుగుచున్నాము, ఎవరున్నను,ఎవరు పోయి "నను మాకవీశ్వరుఁడు మాకున్నఁ జాలు' ననుచున్నాఁడా! ఆహా! కవిచేయుపనియుఁ గవిమాహాత్మ్యమును నిప్పటికైన నీకు బోధపడినదా! ఇట్టివానినా నీవు మొదట సంశయించితివి? ఇట్టివానినా దుర్నీతిబోధించువాఁడని చేరి సావాసముఁ జేయ భయంపడి వెనుదీసితివి? కర్తయను పొగచేఁ గన్నులుమూసీ కొనిపోయిన మీకు నానందతేజముఁ జూపించి యానందదృష్టి నిచ్చినవాని నేనా, దుర్నీ తీపరుఁడను నీలాపనిందపాలు చేసితివి? ఇట్టివాని నేకదా మనవారు,

 ఉ. మూఁపున వామకుండలము, మోవి నొకిం చుకమోడ్పు
నందము, జూ పెడునోరచూపు, సొగసుంబొమ, యొక్కట
నిక్కుఁ గన్పడర్, గ్రేపులు సొక్కఁ గల్పకము క్రిందఁద్రిభం
 గిగ నిల్చి యంగుళీ వ్యాపితవంశ పూర్తియయి వర్తిలు
మోహనమూర్తిఁ గొల్చెదన్ .

అని శ్రీకృష్ణ కర్ణామృతమున లీలాశుకయోగీంద్రునిచే వర్ణింపఁ బడిన మురళమోహనుఁడగు శ్రీకృష్ణునిగను;

 శ్లో. లోకా నాహూయ సర్వాణ డమరుకనినదై !
ఘోరసంసారమగ్నా౯
దత్వా భీతిం దయాళుః ప్రణతభయహరం
కుంచితం పొదపద్మమ్;
ఉద్ధృత్యేదం విముక్తే రయన మితి కరా
ద్దర్శయన్ ప్రత్యయార్థం
భిశ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం
య స్ప పొయాన్న టేశః

అను ధ్యానశ్లోకమున వర్ణింపఁబడిన ప్రళయోత్సపరతుఁడగు శ్రీనటరాజమూ ర్తినిగాను, ఆదర్శపురుషులుగను, అధిష్టాన దేవతలుగాను నిర్ణయించి పూజించిరి? సాక్షాద్దైవమువోలె బూజింపఁదగుకవిని నిష్కారణముగ నీలాపనిందకుఁ బాలునేసి పాపముఁగట్టికొంటివే! కవియంతటి యుపయోగకారి, బాథానివారకుఁడు, మహాత్తుఁడు వేరొకరి ధరిత్రిని గలఁడా? కవి యధరమును బోధించుటకు మాఱుఉత్తమో త్తమధర్మ మును లోగో త్తరసౌందర్యయుతమగు లీల వర్ణించును. అతఁడు పెట్టిన దే యానందభిక్ష, సౌఖ్యభిత. సౌఖ్యమును, నానంద మును లేనిది నీధర్మ మెందులకు? నీయర్దసంపద "లెందులకు? అజాగళ స్తనములుంబోలె నిరర్థకములు కావే! సర్వసంపదలకును ఫలము దాని ననుభవించుటయును సుఖపడుటయును ఆనందమునొందుటయు నేకదా? వెనుకటికి కవి' యేమనినాఁడు?

ముక్తి యెద్దిరా,
రక్తి యెద్ది రా?
పొడుడబ్బుసంచులతోఁ
గూడఁ బెట్టి యనుభవింప
జూడ లేక ప్రాణమైన
వీడెడుదురవస్థయేన?
మనసుగొన్న కన్నియకై
ధనముఁ బ్రాణమైన నిచ్చి
ప్రణయపు నిర్వాణమున
దనివి గొనుటశాక యెద్ది?

ముక్తి యెద్దిరా రక్తి యెద్దిరా?

కావునఁ గవిత్వము సర్వార్ణములసత్ఫలమును, సర్వశాస్త్రముల సారమును, సర్వజ్ఞానసమన్వయమును నని యెఱింగి నీ భ్రాంతి వీడి యుత్తమకావ్యపఠనమువలన రసానుభూతినొంది. రసజగత్తున నిచ్చలు సంచరించుచు నానందముఁగనుము, పోయి వచ్చెదను.

ఆ కావ్యమునకునుశాస్త్రములకును,బరమార్థమున విశేష భేదము లేదు.

రసికునకును సామాన్యమానవునకును' జరిగిన పై సంభాషణమువలన మనకుఁ గ్రోత్తసంగతులు కొన్ని తెలిసినవి. అవియేవన. గావ్యమునకును శాస్త్రములకును దృష్టియందు "భేదమున్నను పద్దతులయందు భిన్న త్వమున్నను, రెండును తుట్టతుద కొక్క పరమార్థమునే సంగ్రహించుటకుఁ దోడ్పడు చున్నవి. కావ్యమునకు శాస్త్రమునకుఁ బ్రబలవిరోధ మున్న దనుటకన్న శాస్త్రములు చేయుపనినే సంగ్రహించు పరమార్గమునే, కావ్య మింకొక పద్దతిని జేసి సఫలము గాంచునని తెలియం దగును, శాస్త్రమున శాసనముల 'నేర్పాటుఁ జేయవలె నసు కాంక్ష యెక్కువగఁ గన్పించును. కావ్యమునఁ బరమార్గము సుందరముగను, నానందజనకముగను, రసవంతముగను జిత్రింపం బడును. శాస్త్రము విధిని షేధములమూలమున ,మానవుని యందుఁ బాపభీతిఁ గలిగించును. కావ్యము రససహాయముతో బుణ్యమునం దాసక్తి గలిగించును. శాస్త్రము నివృత్తిమార్గ మును బోధించును. కావ్యము ప్రవృత్తిమార్గమును బోధిం చును. సర్వశాస్త్రములయొక్కయు, సర్వధర్మములయొక్కయు, సర్వమతముల యొక్కయు, సర్వార్థములయొక్కయుఁ బ్రయో జనమును గావ్యము రససాహాయ్యబలమున నతిరమణీయ ముగను హృదయంగమముగను మనోరంజకముగను వర్ణించి ధర్మానురక్తి మానవునియం దుదయింపఁ జేయును.

పాశ్చాత్యుల మతము. 1, ఆర్నాల్డు. 2. వర్డ్సువర్తు.

..

అందుకనియే (Arnold) ఆర్నాల్డను నాంగ్లేయవిమర్శకుఁడు “Poetry is a criticism of life which has the power to sustain, to console and to cheer man with the high ideals of connduct it presents" (కావ్యము జీవితమును విమర్శించి యుత్తమజీవితపథమును జూపించి మానవునకు ధైర్యమును, సంతోషమును, శాంతిని గూర్చుననియు, వర్డ్సువర్తు అనుకవి "Poetry is the breath and the finer spirit of all knowledge, (Words worth) (కావ్యము సర్వశాస్త్రములయొక్క, సారమును, రమణీయస్వరూపమును నై యున్నదనియు వ్రాసిరి.

పూర్వఋష్యాశ్రమములు రసభావపూరితములు.

ఇట్టి రసభావమే ప్రపంచమును నేకముఖమునకుఁ దెచ్చి లోకకళ్యాణమునకుఁ దోడ్పడునని యిదిపటికే విన్నవించితిని. ఇట్టి రసభావమాహాత్మ్యమునే భారతమున నన్నయ కణ్వాశ్ర, మము వర్ణించుపట్టున,

సీ. శ్రవణసుఖంబుగా సామగానంబును
జదివెడిళుకములచదువుఁ దగిలి
కదలక వినుచుండు కరులయుఁ గరికర
శీతలచ్ఛాయఁ దచ్ఛీక రాంబు

కణముల చల్లనీగా డ్పాసపడి వానిఁ
జెంది సుఖంబున్న సింహములయు
భూసుర ప్రవరులు భూతబలుల్ దెచ్చి
పెట్టునీవా రాన్న పిండతతులు
కడఁగి భక్షింప నొక్కటఁ గలసి యాడు
చున్న యెలుకలపిల్లుల యొండుసహజ
వై రిసత్వంబులయు సహవాస మపుడు
చూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది.

.

(భారతము, ఆదిపర్వము. 8. ఆశ్వాసము.)

అనుపద్యమున వర్ణించియున్నాఁడు. అట్టిరసభావమే పూర్వ పుఋష్యాశ్రమములలో నుండెననియు, అట్టి యాశ్రమముల వలన లోకకల్యాణము నెఱువేఱుచుండెననియుఁ, బులులను మేఁకలను నేకజలాశయమున సుఖముగ నీరు ద్రావఁ జేయఁగల తపశ్శక్తియు రసభావమును నేఁటినాగరికతయందు మృగ్యమగు చుండిన కతముస నే ప్రస్తుతము జీవిత సంరంభముఘోరముగను, దుర్బరముగను నున్నదని రవీంద్ర నాథరాకూరు కవితన “Messages of the forest" (అరణ్యసం దేశ) మనువ్యా సమునందు వ్రాసెను. అట్టి సనాతన రసభావము తిరిగి మన దేశమున శాంతిని నెల గొల్పెడుఁగాక!

--*****--