పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రద్దాంజలి

సీమ రైతు కథాకిరీటి సింగమనేని

అభ్యుదయ కథా రచయిత, మార్క్సిస్టు భావాల వారధి, ప్రముఖ సాహిత్య విమర్శకులూ సింగమనేని నారాయణ గారు 25.02.2021 మధ్యాన్నం అనంతపురం ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. వీరు 26.06. 1943లో అనంతపురం దగ్గర రాప్తాడు మండలంలోని బండమీడపల్లెలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి సంజీవమ్మ, తండ్రి రామప్ప. వీరికి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు. వీరి ప్రాథమిక విద్వాబ్యాసం ఉండూరులో జరిగి పి.యు.సి.ని అనంతపురంలో ముగించి విద్వాన్‌ కోర్సును తిరుపతి ప్రాచ్య కళాశాలలో చదివి అనంతరం పండిత్‌ శిక్షణను కర్నూలులో పూర్తి చేసారు. 1969లో నార్పల జిల్లాపరిషత్‌ పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 2001లో రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేశారు.

బాల్యంలో తండ్రి రామప్ప మంచి కథల పుస్తకాలను చదివేలా చేసి తెలుగు భాషపట్ల సాహిత్యం వైపు మక్కువ పెంచాడు. పుస్తకాలు చదువుతూనే 17 యేళ్ల వయస్సులో “న్యాయమెక్కడ” అనే కథానిక రాస్తే దానిని కృష్ణాపత్రికవారు 02.07.1960 లో ప్రచురించారు. తరువాత విరివిగా నవలలు చదివి ఊహాలోకాల్లో విహరిస్తూ“ఆదర్సాలూ -అనుబంధాలు” “అనురాగానికి హద్దులు” “ఎడారి గులాబీ " అనే నవలలు(1964-1968 మధ్య) రాశారు. తరువాత వీరికి మార్క్సిజం పరిచయమయ్యింది. దానితో సింగమనేని నారాయణ చౌదరి అనే తన పేరులోని చౌదరి ని తొలగించుకొన్నాడు. కొన్నాళ్లు రాయడం మాని, మార్క్సి దృక్పథానికి సంబంధించిన పుస్తకాల్ని విస్త్రృతంగా చదివారు.

తాను మార్క్సి దృక్పథాన్ని వారి గురువు గారైన నాగసిద్దారెడ్డి గారు పరిచయం చేసిన శ్రీశ్రీ గారి “మహాప్రస్థానం” ద్వారానే ఆకళింపు చేసుకొన్నానని సింగమనేని చెప్పేవారు. అంతేకాక వీరు శ్రీశ్రీ తిలక్‌ల కవిత్వాల్ని పేజీలకు పేజీలు అనర్గళంగా తన ఉపన్యాసాల్లో సందర్భోచితంగా వినిపించేవారు.

ఇతని రచనలూ -తెల్లని మడత నలగని పంచెకట్టూ, అచ్చ తెలుగుతనానికి కొలమానాలు. బడిలో తెలుగుపాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడే కాక సీమ రైతుల సమస్యలపై కథారచనలు చేసిన అక్షరసేద్యగాడు. ఎంత సేపు ఉపన్యాసం చేసినా ఒక్క వ్యర్థం మాట లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని అరటిపండులా వొలిచి చెప్పగల ఉపన్యాసకుడు. వాస్తు మూఢనమ్మకాల మూర్థత్వాలను దెప్పిపొడుస్తూ రచనలు చేయడమే కాక తన రచనలకు అనుగుణంగా సిద్ధాంతాలకు కట్టుబడి చివరిదాకా బతికిన సాహసి. తెలుగు కథానికా ప్రక్రియను సుసంపన్నం చేసిన రెండో తరం రాయలసీమ కథకుల్లో ముఖ్యుడు.

ఏ పత్రికలో కొత్తతరం రచయిత కానీ, నూతన భావస్పోరకం కానీ కనిపించినా ఫోనులో పలకరించికానీ, ఇంటికి పిలిచి కానీ మెచ్చుకొని వెన్నుతట్టడమో, అందులోని తప్పొప్పులను ఎత్తి చూపడమో చేసేవాడు. యువతరంలో ఎటువంటి పురాభావాలు కనిపించినా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు ఖండిస్తూ కాలానుగుణమైన సామాజికస్పృహను ఎలా చెప్పాలో వివరించేవారు. ఆ విధంగా ఎందరో యువరచయితలకు మార్గదర్శకులైనారు(నాతో సహా).

వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు పరిశోధనలు చేసి పి. హెచ్‌.డి.లు పొందారు. కొన్ని యూనివర్సిటీలు వీరి కథల్ని పాఠ్యాంశాలుగా ఉంచాయి. వీరు రాయలసీమ నీటి సమస్యల మీద రచనలు చేస్తూనే “హంద్రీ నీవా జలసాధన సమితి " కి కన్వీనర్‌ గా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూ ఉండే సమయంలో జిల్లా అంతటా ఇతర రచయితలతో కలిసి “రైతు ఆత్మవిశ్వాసయాత్ర”లు చేసి వారిలో ఆత్మస్రెర్యం నింపారు.

వీరి కథలు (1)జూదం (2)సింగమనేని నారాయణ కథలు (3)సింగమనేని నారాయణ కథానికలు (4)జీవఫలం-చేదు విషం (5)నీకూ నాకూ మథ్య నిశీధి పుస్తకాలుగా వచ్చాయి.

వివిధ సందర్భాల్లో రాసిన వీరి వ్యాసాలు (1)సమయమూ-సందర్భమూ (2)సంభాషణం (3)కథావరణం(4)మున్నుడి పేరిట అచ్చయ్యాయి. (1)సీమ కథలు(2)తెలుగు కథకులు-కథన రీతులు (మూడు సంపుటాలు మధురాంతకం రాజారాం తో కలిసి)(3)విశాలాంధ్ర వారి తెలుగు కథ (4)ఇనప గజ్జల తల్లి పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. చాలా పుస్తకాలకు సమీక్షలు, ముందుమాటలూ రాశారు. ఆకాశవాణి కడప, అనంతపురం కేంద్రాల్లో వీరి ఎన్నో ప్రసంగాలు ప్రసారం అయ్యాయి. వీరివి సాహిత్యసేవలకుగాను ఎన్నో ఆవార్డులు లభించాయి.

రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా గ్రామీణుల, రైతుల జీవన సమస్యలు....దురాశాపరులై మితిమీరిన ధన సంపాదనా పరులయిన నగరవాసుల కృత్రిమ జీవనము, ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బతకనేర్చిన తనము, పరీక్షా ఫలితాల డొల్లతనమూ, పెత్తందార్లు దళితుల పట్ల మెలిగే విధానమూ, స్త్రీల అణచివేతల

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

46