పుట:Sakalaneetisammatamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

1. పరిచయము

ప్రాచీనాంధ్రకవి మడికి సింగన రచించిన 'సకలనీతిసమ్మతము' అను నీగ్రంథము క్రీ. శ. 1923లో శ్రీమానవల్లి రామకృష్ణకవి మహోదయులచే విస్మృతకవుల కృతులలో పదవదిగా ప్రకటితమైనది. కవిగా రాసంవత్సరముననే దీనిని ముద్రించినను, వా రిప్పటి కరువదేండ్లక్రిందటనే ఈ గ్రంథము నెఱుగుదురు. క్రీ. శ. 1910లో వారు ప్రకటించిన 'ప్రబంధమణిభూషణము' పీఠికలో నీ గ్రంథమునుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.[1]

"ఇట్టి సంచితకృతులు సంస్కృతమున విస్తారముగా గలవు. ఆంధ్రభాషలో నాకు లభించినంతవట్టు పరికింప నట్టికృతికర్తల మడికి సింగనయే ప్రథముఁడు, అతఁడు ప్రాచీనపంచతంత్రి, ప్రాచీనకామందకము, ముద్రామాత్యము, నీతిభూషణము, బదైననీతి, కుమారసంభవము, భారతము, మనుమంచిభట్టు నశ్వశాస్త్రము మొదలగు గ్రంథములలోని రాజనీతిపద్యముల నన్నియు నేఱి సకలనీతిసమ్మతమను గ్రంథమును గూర్చెను” (పుట 1).

కవిగా రీసకలనీతిసమ్మతమును ప్రకటించుటయేగాక, యెనిమిది పుటలలో విశేషవిషయవిలసితమగు నొకయుపోద్ఘాతము వ్రాసియున్నారు. దాని మూలమున మన ప్రాచీనాంధ్రవాఙ్ఞ్మయచరిత్రలో నెన్నికావ్యములు నష్టమైనవో తెలియుటయేగాక, తెలుగుసాహిత్యమున నీనాటికి పరిశీలనలేని, శాస్త్రవాఙ్ఞ్మయమును గూర్చిన నూతనవిశేషములు తెలియుచున్నవి. ఇది చాల విలువగల గ్రంథమైనను, నీ నలభై ఏడేండ్లనుండి దీనిని కూలంకషముగా గాకపోయిన - అథవా అలవోకగానైన - విమర్శకులు పరిశీలింపలేదు.

  1. వనపర్తి బ్రహ్మవిద్యావిలాసముద్రాక్షరశాలలో ముద్రితమైనది.