పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తురకల దశావతారములు

45

.

షియాలకు చాలాబాధలు కలుగుతూ వచ్చాయి. అందువల్ల ఖోజాలు ఏ యెండకు ఆ గొడుగు పట్టడం నెర్చుకున్నారు.

'దశావతార్ ' అనే మతగ్రంధం

ఈ ఖోజాలు షియామతస్థులతో తాము షియాల మంటారు. సున్నీ మతస్థులతో తాము సున్నీల మంటారు. అయితే వారికి ఈ షియామత మంటేనూ తెలియదు. సున్నీమతమంటేనూ తెలియదు వారికి స్వభాష అయిన కచ్చిభాషలో గాని, వ్యాపారం కోసం నేర్చుకునే గుజరాతీ భాషలోగాని, ఖొరాను తర్జుమాలేదు. ఈ ఖోజాలుండే గుజరాతు దేశాన్ని చాలాకాలం తురకరాజులు పరిపాలించినా ఖొరాను దేశభాషలోకి పరివర్తనం కాకపోవడం ఆశ్చర్యమే. ఈ ఖోజాలలో అరబ్బీ పారశీభాషలు వచ్చినవారెవ్వరూ లేరు. మహమ్మదీయ మతాన్ని గురించి చెప్పగల విద్యాంసులున్నూ లేరు. వారికి తెలిసిన మతగ్రంధం ఒకటి, అది కచ్చిభాషలో సింధీలిపిలోవ్రాయబడిన "దశావతార" మనే పుస్తకం ఇదే వారి మతగ్రంధం.

ఖోజాలందరు దీనిని పూజిస్తారు. అవసానకాలంలో చదివి వినిపించుకుంటారు. హిందూదేశంలోనూ ఖోజాలు వ్యాపారం చేసుకొని జీవించే ఆఫ్రికాతీరమున జాంజిబారులోను మస్కటు మొదలైన ప్రాంతాలలోనూ బొంబయిలోనూ జమాత్ ఖానా అనే ఖోజా మతసభలోనూ ఈ దశావతారమనే గ్రంధాన్ని పురాణంలాగ చదివిస్తారని 1850 లోనే ఒక వాజ్యంలో స్థాపించబడింది.

ఈదశావతారం అనే గ్రంధంలో ఏముందో తెలుసునా?

దాని పేరునుబట్టి అందులోని విషయం స్ఫురిస్తూనేవుంది. అది పది ప్రకరణాల గ్రంధం. ప్రతి ప్రకరణంలోనూ ఒక అవతారాన్ని గురించి యుంటుంది. మొదటి తొమ్మిది ప్రకరణాలలోనూ హిందువుల త్రిమూర్తులలో ఒకడైన విష్ణు మూర్తియొక్క తొమ్మిది అవతారాలను గురించి వర్ణించబడింది. పదియవ ప్రకరణములో పరమపూజ్యుడైన ఆలీయొక్క అవతారాన్ని గురించి వ్రాయబడింది.