హిమబిందు/ప్రథమ భాగం/8. శకటచోదక పరీక్ష

వికీసోర్స్ నుండి

మందిరములు వారి వారి గౌరవముల ననుసరించి వెలుగుచున్నవి. సార్వభౌముని మందిరమునకు కుడిప్రక్కగా, అన్ని మందిరముల తుద సామాన్యజనము చూచుటకు తగిన పెద్ద పందిరియొక్కటి తగు అలంకారములతో నిర్మాణమొనర్చిరి.

రాజమందిరము ఎడమప్రక్కగా మూడు మందిరములావల చారుగుప్తుని మందిరము సూర్యకాంతమణివలె నా ప్రదేశమును వెలిగించుచు ఆ వచ్చిన లక్షలకొలది ప్రజల చూపుల నాకర్షించుచుండెను. మూడేండ్లనుండి వెలవెల పోవుచున్న ఆ మందిరము నేడు పూర్ణాలంకార మనోహరమై సుధర్మను పరిహరించుచున్నది. “రాజమందిరమునకు జోడగునది, ఆ మందిర మొక్కటియే” యని ప్రజ లొకరి నొకరు చూచి చెప్పుకొనిరి.

“పదునొకండవ ముహూర్తము మ్రోగించినారు. సార్వభౌముడు వచ్చువేళ అయినది” అని మహశ్రీచండకేతునితో ననియెను. వారిరువురు గుఱ్ఱముల పై నధివసించి రంగస్థలమున నిటు నటు తిరుగుచుండిరి. అంత చండకేతుడు పురమార్గమువంక చేయి నడ్డమునుండి చూచుచు “అదిగో సార్వభౌములు వచ్చుచున్నారు” అని అరచెను.

8. శకటచోదక పరీక్ష

మహాశ్రీ: ఆ వచ్చునది సార్వభౌములుకారు. ఎవరు చెప్పుమా అంతవైభవమున వచ్చుచున్నది?

చండకేతుడు: ఆర్యా! తెలిసినది, తెలిసినది! రత్నకలశధ్వజము! ఆర్యచారు గుప్తులవారు, కోటీశ్వరుల వైభవము ఒక్కొక్కప్పుడు భూమీశుల సంపదను మించిపోవును కదా!

మహాశ్రీ: అవునయ్యా! చారుగుప్తుడు సకల భారతవణిక్సార్వ భౌముడు. ఆయన ఎన్నికోట్లకు నాగదేవుల కాపుంచినాడో! ఎన్నిమందసముల రత్నరాసులున్నవో! వివిధదేశ సువర్ణము లెన్ని మందిరముల లెక్కకురాక, ప్రోవులుపడియున్నవో!

చండకేతుడు: మూడేండ్లనుండి చెన్నుదరగియున్న ఆ వర్తక చక్రవర్తి మండపము ఎంత పరమాద్భుతముగ నలంకరించినారు! ఏమి విశేషము స్వామీ?

మహాశ్రీ: విచార మెంతకాలము మానవునకు! ఆతని భార్య చనిపోయి మూడేండ్లయినది. ఇప్పుడు కొమరిత పదునారేండ్ల వయసునందినది. ఆంధ్రయోషా రత్నములలో ఆ బాలిక కౌస్తుభమే.

చండకేతుడు: ఆమె యందము తనివితీరని వేడుకతో చెప్పుకొందురు. అంత అందగత్తయా ఆర్యా?

మహాశ్రీ: ఓయి అజ్ఞానీ, అందగత్తె అనుమాటను కృష్ణానదీ గర్భమున పడద్రోయుము. ఆమె అపరాజితాదేవి. ఆమె ప్రజ్ఞాపరిమిత. ఆమె శ్వేతతార! ఆమె అనంత సౌందర్యభావోజ్వలమూర్తి!

చండకేతు: ఆర్యులు కవులగుచున్నారు.

మహాశ్రీ: దివ్యసౌందర్యాభిముఖుడగువాడు మొరకుడైనను మహాకవికాడా చండకేతూ?

చండకేతు: మీ వర్ణన విను నాకే కవిత్వము గంగోత్తరస్వరూప మందాకినీ ప్రస్రవణమై వచ్చుచున్నది, శకటాధ్యక్షులవారూ!

ఇంతలో చారుగుప్తుని రథము పరివారపరివేష్టితమై, ఆశ్విక గజవీర సంరక్షితమై, భేరీ మృదంగ శంఖ కాహళ వాద్యములు చెలగ మహాఖేలనాస్థలము దరిసినది. చండకేతుడు ముఖపతులతో, గణపతులతో, పదాతివీరులతో చారుగుప్తునకు ఎదురేగి, సార్వభౌమవాద్యమేళములు వణిక్సార్వభౌముని మేళములతో మేళకముగా సగౌరవముగ తోడితెచ్చి, చారుగుప్తుని మందిరముకడ విడియించుటయు, వారందరు రథావతరణ మొనర్చిరి. చారుగుప్తుడు ఇంద్రగోపుని చేయి నూతగొని రథము దిగెను. వేరొక రథమునుండి హిమబిందుకుమారియు, ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు, చెలియగు బాలనాగియు, అలంకారికయగు తారాదత్తయు దిగిరి, వేరువేరు శకటముల నుండి హిమబిందు సేవకురాండ్రు పెక్కండ్రు దిగినారు. అశ్వికులు మండపమువెనుక కావలి కాయుచుండిరి. చారుగుప్తాదులు వివిధాసనముల నాసీనులైరి.

రథమునుండి అవరోహించుచు హిమబిందుకుమారి మేలిముసుగు తీసి, వివిధాలంకారులు, వివిధవర్ణ వస్త్రశోభితులు, కోలాహలపూర్ణులైన యా మహాప్రజలను కౌతుకముగ పర్యాలోకించినది.

ఆమె అందాలప్రోవు, విలాసములమూట. ఒయారములకుప్ప. ఆమె పరమాద్భుత సౌందర్యమునకు ముగ్ధులై, ప్రజలును దళ ముఖ గణచమూపతులు, రాజోద్యోగులు, మంత్రులు, దండనాయకులు, ప్రాడ్వివాకులు, ఒకరననేల అందరును ఆమెనే చూచుచుండిరి.

మహాకాండూరనగరపు బంగారు సరిగపూవుల లతల దుకూలము, పనుపుపచ్చ ఎరుపు వెలుగునీడల నేతచీర ధరించి, నీల చీనాంబర స్తన వల్కలము బిగించి, ఆమె పాము కుబుసముబోలు కాశ్మీరసువర్ణమృగీ రాంకవము వల్లెగా ధరించినది.

పదునారేండ్ల ఎలప్రాయమున పాటలవర్ణ జాంబూనదభాసురయగుచు పారిజాత కుసుమమును దలపించిన దా బాల. ఆమె నాలోకించిన యువకులు పురుషులు ఎందరు నిట్టూర్పులు వదలిరో, ఎందరి గుండియలు కొట్టుకొనెనో, ఎంద రెట్టి స్వప్నలోక విహారులైరో, ఎందరు సమ్మోహనాస్త్ర పీడితులైరో? అప్పుడు ప్రజలు సార్వభౌముడు ఇంద్రునివలె, బోధిసత్వునివలె అరుదెంచుటయే గమనింపలేకపోయిరి.

శంఖ వేణు ముఖవీణ కాహళాది సుషిరములు, భేరి ఢంకా మృదంగాది వాద్యములు, తాళములు, తప్పెటలు సముద్రఘోషాగాంధర్వము సర్వదిశల నావరింప యథోచితవేషుడై, సూర్యుని రథాశ్వములవలె కలశాంభోధీ వీచికోపమానములైన ధవళతురంగములు పూన్చిన సువర్ణరథ మారోహించి, అతిరథుడైన శ్రీముఖశాతవాహన మహారాజు మంత్రులు, సామంతులు, దండనాయకులు, కవులు, ఆచార్యశ్రమణకులు, ఉత్తమ గాయకులు, మహాశిల్పి ధర్మనంది, సర్వసేనాధ్యక్షుడు, ఉపసేనాధిపతులు కొలువ ఇంద్రవైభవముగ విచ్చేసి రాజ మందిరము ముందాగి రథావతరణ మొనర్చెను. వందిమాగధులు కైవారములు చేయుచుండిరి.

సార్వభౌముని రథము పరివార సమేతమై వచ్చుచున్నదనగనే మహాఖేలనాప్రదేశస్థులగు ప్రజలెల్లరు జయజయధ్వానములు సలుపుచు, లేచి నిలుచుండిరి.

సార్వభౌముడు సింహాసన మధిరోహించుటతోడనే బ్రాహ్మణులు, శ్రమణకులు సామ్రాట్టుకు ఆశీర్వాదము లొసంగిరి.

ఇంతలో శకటాధ్యక్షులు, మహశ్రీ సార్వభౌమునికడకు వచ్చి మోకరించి, నమస్కరించి, లేచి, ఉక్షశకటపరీక్షకు వచ్చినవారి నందరిని సార్వభౌముననుజ్ఞకై మందిర ప్రాంగణమునకు తీసికొనివచ్చెను. వారందరు సార్వభౌమునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తమతమ నామధేయములు తెలిసికొని, చక్రవర్తి యనుజ్ఞనొంద, తమతమ శకటములకడకుబోయి, వాని నారోహించి ప్రారంభస్థానమున, ముందు కురకబోవు వృషభముల నయభయముల నిలువ వారింపుచుండిరి.

రథపరీక్షామార్గము విశాల సమతలము. దారి పొడుగునను దిమ్మెస చేసి, గట్టిచేసిరి. బయలుదేరిన స్థలమునుండి శకటములు ఒక గోరుతము దూరము పోయి యచ్చట నర్ధచంద్రాకృతిని కుడివైపునకు మళ్ళి, వేరొక విశాలమార్గమునవచ్చి, ప్రారంభ స్థలమునకు పోయి, మరలనట్లే ఇంకొక పర్యాయము తిరిగి గమ్యస్థానమునకు రావలెను.

ఆంధ్రు లందరకును తమవారిలో నొక్కడు నెగ్గితీరునని దృఢనిశ్చయము. శకటములు తేలికగల తరువాతి కాండముల నిర్మించినవి. లాక్షావర్ణాలంకృతములై, భూషణానేకసుందరములై, దేవవిమానముల నవి తలపించుచున్నవి.

ప్రారంభప్రదేశమందవి శ్రేణిగా నిలువబడియున్నవి. కండరములు కట్టి, లేడికాళ్ళవలె పలుచని కాళ్ళు కలిగి, పొట్టివియు, నెత్తయినవియు, శ్వేత, కపిల, శబల, ధూమ్ర, లోహితవర్ణవిగ్రహములై కొమ్ములకు వెండి బంగారు తొడుగులు, కాళ్ళకు వెండి బంగరుగజ్జెలు, నడుములకు పట్టుదట్టీలు, మూపుల వర్ణకంబళములు, కంఠముల బంగారువెండిమువ్వలు, ఘంటికలు, మూర్గముల చర్మపుదట్టీలు, బాసికపుదండలు కలిగిన కోడెలు, గోవృషభములు, ఉక్షములు - భయమున కొన్ని, గర్వమున కొన్ని, నిశ్చలత్వమున కొన్ని, రౌద్రమున కొన్ని, తొందరపాటుతో కొన్ని నిలిచి తోకలు ఇటునటు నాడించు చున్నవి. అంకెలు వేయుచున్నవి. డెక్కలెత్తి నేలను రాయుచు, కొట్టుచున్నవి. మోరలు చూచుచున్నవి. చెవులనాడించుచున్నవి. కన్నుల త్రిప్పుచున్నవి.

ఆ శకటముల నడుమ అద్భుతదారుశిల్ప సుందరమగు రథముపై పగ్గముల సడలించి పట్టి, లీలాభంగశరీరియై, చిరునవ్వున వెల్లకోడెలతో “శైబ్య! సుగ్రీవక! ఏమది? తొందరా మీకు?” అనుచు తీయతీయని మాటలాడు బాలకుని, ఆ ప్రక్కనే శకటచోదకుడై యున్న కరూరవుడు విని, కాళింగునకు కన్నుగీటినాడు.

“తెలుగుదద్దమ్మలకు తొందర ఏల అచ్చటనే యుండవచ్చునులే” అని పాలీభాషను కాళింగుడు కరూరవుని ముఖము చూచి పలికినాడు. సమవర్తి శాతవాహన వీరశ్రేష్ఠుడు సగర్వముగ ఛంగున నురికి తనకంబళివ్యాహకమారోహించి, పగ్గములుపట్టి ఆసీనుడైనాడు. చారుగుప్తుని వదనమున సంతోష హాసరేఖ లుదయించినవి.

హిమబిందు తన మేనబావ సమవర్తిని జూచి, ఆనంద ప్రపుల్ల వదనయై “సెబా” సనుకొన్నది.

9. శకట వేగములు

ప్రేక్షకులందరు తమతమ యాసనముల పై, మొదట నిశ్చల మనస్కులై కూరుచుండిరి. తరువాత వారి హృదయముల విజయలక్ష్మీ ధవుడెవ్వడగునా యను నాలోచనలు పొడసూపినవి. ఆ వెనుక సమవర్తి నెగ్గితీరవలయునని కొందరి హృదయముల, ఆంధ్రులలో నెవ్వరైనను సరియని కొందరి మనఃపథముల, కాంక్షలు మొలకెత్తి పెరిగి మహావృక్షములైనవి. అందువల్ల మాటలు, వాదనలు, కోపములు, హర్షములు, హాస్యములు వికటహాసములు చెలరేగినవి. పందె మింకను ప్రారంభముకాలేదు. ప్రజల హృదయములలో విసుగు, ఆవేగము పరువులెత్తినవి. నిశ్చలాసీనత వికలమై ఆసనములలో ఇటునటు కదలువారు, వంగువారు, వెనుకకు వాలువారు, చక్రవర్తి మందిరమువైపు చూచి, ఆలస్యమునకు కారణమేమి యనుకొనువారునై యుండిరి.

అంతలో సృష్ట్యారంభమం దుద్భూతమగు శబ్దబ్రహ్మముంబోలి, ఒక్కసారి పదునారు శంఖములు “భోం, భోం, భోం, భోం!” అని ధ్వనించినవి.

ఆ ధ్వనికి భీతచిత్తములై మాళవుని ఎద్దులు, పాండ్యుని వృషభములు అడ్డగోలుగా పరుగిడినవి. శకటములు తలక్రిందులై శతశకలములైనవి. తక్కిన బండ్లన్నియు సమవేగంబున పరువిడి వచ్చుచు, పరీక్షా పథమున నడ్డముగ పడియున్న బండ్లను తప్పుకొని, చుట్టి ముందుకు సాగినవి.

భరుకచ్చపువీరుని బండిగిత్తలు పడిపోయిన బండ్లను చూచి, ముందుకు సాగక, వెనుకకుతిరిగి, విశ్రమారామములవైపునకు పరుగిడిపోవ, గొల్లుమని ప్రజలొక్కుమ్మడి లేచిరి. అంత గజదళాధికారియగు ప్రమానందుడు అచ్చటనే యుండుటచే, నేనుగుపైనుండి పాశము విసరి ఒక్కఎద్దును పడగొట్టెను. తోడనే బండి తలక్రిందై పడినది. ఏ ప్రాణికిని అపాయము రాలేదు.

పందెపుబండ్లు. పడిపోయినబండ్లను దాటిపోవగనే పలువురు సేవకులు వైద్యులు అచటకు పరువిడి, శకటశకలములను, దెబ్బలుతిన్న వృషభములను, సారధులను కొనిపోయిరి. ఆ స్థలమును తక్కినబాటతో సమముచేసి వేసిరి.

కాళింగుడగు మల్లినాధునిబండి అన్నింటికి ముందు ఛెంగు ఛెంగున పరువిడి పోవుచున్నది. అతని వెన్నంటీ వీరత్తుణితలైయాళై తనబండిని తోలుకొనుచు అరవమున నేదియేని మాటలాడుకొనుచు పోవుచున్నాడు. వీరత్తుణికి ఎడమప్రక్క కేరళ, ఘూర్జర, వంగవీరులు రథముల పరువెత్తించుచుండిరి. ఆ వెనుక లిచ్ఛవుడు, మువ్వురాంధ్ర వీరులు సమముగ బోవుచుండిరి. వారిని వెన్నంటి సమవర్తి, సువర్ణశ్రీ, మాగథుడును, వారికి కొంచెము ఎడములో పలువురును బోవుచుండిరి.

సువర్ణశ్రీ నిర్మల నీలాకాశచంద్రమూర్తివలె నిర్వికారుడై పోవుచున్నాడు.

ఎద్దులన్నియు మోరలెత్తి ఊర్పులూర్పుచు, కనుకొలుకుల కెంపులు గ్రమ్ము, చిరునురుగులు సెలవుల ప్రసరింప, పాలసముద్రతరంగమువలె, ధవళ కాదంబినీ మాలలవలె, గంగానదీపతనములవలె గంగడోళ్ళాడుచుండ మహా వాయువేగమున పరుగు వారుచుండెను. తేలికయగు శకటము లిటునటు నాడి పోవుచున్నవి. సారథులు వంగి, ఎద్దుల నదలించుచు, పసరముల ప్రార్థించుచు, కోడెలతోటి సరసంభాషణములాడుచు బోవుచుండిరి.

మొదటిసారి సగముదూరము పోవునప్పటికి లిచ్చవుని దూడలు పరుగిడలేక ఆగిపోయినవి. మొదటి చుట్టుకడకు పోవునప్పటికి కేరళ, కామరూప, గాంధారుల శకటములన్నియు వెనుకకుపోయినవి. చుట్టి, తిరిగి సగముదూరము వచ్చునప్పటికి మిగిలినవారు కళింగుడు, మాగథుడగు శివస్వాతి, సమవర్తి, సువర్ణ శ్రీకుమారుడు, ఇంక నిరువు రాంధ్రులు, సుశర్మ కాణ్వాయనుని రథము తోలు కరూరవుడు మాత్రము.

ప్రేక్షకుల ఆలోచనలు బిగుసుకుపోయినవి. ఆ మహారంగస్థల మంతట నిశ్శబ్దత ఆవహించినది. రెండవసారి మిగిలిన శకటములన్నియు తిరిగి ముందుకు పోవుచున్నవి. చెమటలు నిండ, నాల్కలు జాపుచు, నురగలు గ్రక్కుచు, నల్లగ్రుడ్డులు క్రిందికి తిరిగిపోవ, ముట్టెల క్రిందికి దించి ఎద్దులన్నియు పరుగిడిపోవుచున్నవి.

బండ్లన్నియు తిరిగి రెండవమార్గమున నర్ధచక్రాకార ప్రదేశమునకు వచ్చుసరికి, కరూరవుని రెండుగిత్తలు గరుడము, హనుమంతము అనునవి ఫెళ్ళున విరుచుకొని పడిపోయినవి. రథము పడిపోక ఆగిపోయినది. కరూరవునకు కొంచెము గాయములు తగిలినవి.

సుశర్మకాణ్వాయనుని ప్రియసూతుడగు కరూరవుడు విషాదము నొందుట మగథప్రజానీకము ఎన్నుకొని పంపిన కాత్యాయనునకు సంతోషమయ్యెను. ఇరువురును సుశర్మకు ప్రియులే. కాని వారికి అంతఃకలహములున్నవి. కాత్యాయను డిదివరకే సిగ్గునంది వెనుకకు పోవలసివచ్చెను. కరూరవుడు తనతోడివాడగుట కాతడు ప్రార్థించిన క్షుద్ర దేవతలు అతని కోర్కెనెరవేర్చినారు.

వృషభములన్నియు నలసిపోయినవి. అన్నిటికి వెనుకవచ్చుసువర్ణశ్రీగిత్తలు అలయిక లేక సునాయాసముగ తేలివచ్చుచున్నట్లునన్నవి. పావుగోరుతదూరము ఇట్లు పరుగిడి వచ్చిన పిమ్మట సమవర్తి తన చబుకు తీసికొని కామందక కులపాలకుల వీపులపై చురుక్కున నంటించెను. ఆ యుత్తమ బలీవర్దనములు తమ బలమంతయు చూపి కాళింగుని బండి దాటివేసినవి. కాళింగుడంత ధైర్యవిహీనుడై యొక్క పెద్ద నిట్టూర్పుబుచ్చి తన యెద్దులనుగూడ వడివడిగా తోల యత్నించెను. కానీ యవి యంత కన్న, నంతకన్న నీరసించి, వెనుకవచ్చు సువర్ణశ్రీ శకటముతో కలిసికొనెను.

ఆ యువకు డంత చిరునవ్వు నవ్వినాడు. ఆతని బండి వేగము సమవర్తి బండిని వెన్నంటిపోయినది. ప్రజలందరు గొల్లున నొక్కసారిలేచి “సమవర్తీ విజయ! సమవర్తీ విజయ!” అని గొంతులు బొంగురుపోవ నరచుచుండిరి. సమవర్తి వెనుకకు చూడవీలులేదు. ఒక్కసారి వెనుకకు చూచిన, అలసట చెందియు పౌరుషము చూపుచున్న ఆ విఖ్యాత వృషభములు తప్పక కూలిపోవును. కాని పందెకాని సూక్ష్మబుద్ధి, పాముచెవుల వంటిది. తనకు కొంచెమయిన ఎడములేక ఒక డతిసునాయాసముగ దూడల తోలుకొని వచ్చుచున్నాడని సమవర్తి తెలిసికొనెను. పందెము మొదటి నుండియు ఆతడా కొత్తపిల్లవాని గిత్తల చూచినాడు. పసరముల సంగతి బాగుగా తెలిసిన సమవర్తి గుండెలా లేళ్ళవంటి గున్నల చూడగానే నదటునొందినవి. కామందక కులపాలకుల అవయవముల పొంకము వానికి లేదు. కమ్మెచ్చులు కట్టి దిమ్మచెక్కలవలె వట్రువులైయుండి కైలాసగిరి శృంగములకు మూపురములుగల తన బలీవర్దముల ముందు ఆ కొత్తగిత్త లేమి చేయగలవు? కొమ్ములింకను వచ్చీరానట్లున్నవి. తన కోడెలకు, శంకరశూలవామదక్షిణపు మొనలవలె కొమ్ములు మెరయుచున్నవి. తన వృషభరాజములేడ, ఈ చిన్నగిత్తలేడ? అని సమాధానపడెను.

మొదటనుండియు సమవర్తి ఆ వచ్చిన నలుబదిబండ్ల ఎద్దులను చూచి పెదవి విరిచికొనెను. కలకలలాడు కాటుక కన్నులతో, మామిడిపిందెల బోలు నాసికా రంధ్రములతో గంభీరములై, శ్రీవక్షములగు ముట్టెలతో, వెలిపట్టు వస్త్రపు మడతలవలె నున్న గంగడోళ్ళతో, మెరుముల వలె, అస్త్రములవలె, సన్నమై మహావేగవంతములై కన్పట్టు కాళ్ళతో ఆ యువకుని గిత్తలు మాత్రము సమవర్తిని వికలుని చేసినవి. ఇంక విజయలక్ష్మీ ఆసీనయైయున్న తావు అర్ధగోరుతదూరము మాత్రమున్నది. తన్ను వెన్నంటివచ్చు పెనుభూతపు పిన్నవాని పిప్పిచేయవలేనని సమవర్తి తలపోసెను. అతని కన్నులయందు క్రోధము ఫాలాక్షుని మూడవచూపై, ఆ సుందర ముఖమును వికృత మొనర్చినది. అతని ముక్కుపుటములు కామందక కులపాలకుల ముక్కుపుటముల వలె విస్త్రతములైనవి. అతని పసరముల ముక్కులనుండి రక్తపంబొట్టులు తొలకరి సతుంపరులవలే చెదరిపోవుచుండెను.

చారుగుప్తుడు వంగిపోయి తనపీఠము గట్టిగా పట్టుకొని గృధ్రపుదృక్కుల పరుపుచు పందెకాండ్రవైపు చూచుచుండెను. ఆతడి పెదవులు వణకుచుండినవి. అస్పష్టమై ఏవియో మాటలు పైకి వెలువడుచున్నవి. మొదటినుండియు తన వృషభములు తప్పక నెగ్గితీరునని యాత డనుకొన్నాడు. ఆ సందడిలో నా కొత్తబాలుని బండిదూడల కనుగొన్నవారు లేనేలేరు. మొదటిసారి వెళ్ళివచ్చి, మరలివెళ్ళువరకు ఎవ్వరును ఆ యువకునివైపే కనుగొనలేదు. ఇప్పుడాతడు చారుగుప్తునకు ఎక్కడనుండియో అవతరించిన విఘ్నరాక్షసునివలె తోచినాడు. ఆ బాలుడు తనకును, తన కోర్కెలకును ఎడబాటుమంత్రమైనాడని చారుగుప్తుని గుండెయందు గుభిల్లని ఆలోచన కలిగినది. ఒక్కసారి లేచి సునాయాసముగ పరుగిడివచ్చు నా కొత్తబండిగిత్తల కూల్పవలెనని యాతనికి వెర్రియాలోచన పుట్టినది.

ప్రజలందరు చెప్పగారాని ఆలోచనాభావమున తన విజయనాదములు మానివేసినారు. ఒకసారి వాన వెలిసినట్లు, నిమ్మకు నీరువోసినట్లు హృదయభీకరమగు నిశ్శబ్దత నింగి నావరించినది. అందరును చారుగుప్తుని మందిరమువైపు చూచినారు. మరల పరుగిడు పందెకాండ్ల పరికించినారు.

ఇంక పావుగోరుతమున్నది. సమవర్తి “కా-మం-ద-క! కుల-పాలక!న-డు-డు!” అని వగర్చుచుండెను. వజ్రతుల్యమగు నా శూరుని శరీరము వణకినది. కామందక కులపాలకులు ప్రజలోకమునకు విస్మయము కలుగునట్లు ఆతని పలుకుల నాలకించగనే మహాజవమున అరపావుగోరుతము కనుమూతలో గడచిపోయినవి. కాని పాడునీడవలె యా కుర్రవాని బండి ఆతని బండిని వెన్నంటియే వచ్చినది. ప్రథమమున జనులు “కామందక విజయ! కులపాలక విజయ!” అని యరచినారు. ఉత్తరక్షణముననే వెన్నంటివచ్చినయా పిల్లవాని చూచిరి. వారందరి హృదయములు నాతనిపట్ల కోపముచే క్రూరములైనవి.

10. విజయలక్ష్మీధవుడు

ఇంకను కొన్ని ధనువులు గడచినవి. సమవర్తికి తన్ను వెన్నంటు పిశాచరూపుని బండి ఇంకను కూడనున్నదనే తోచినది. ఇంతలో మెరుమువలె ఆతనికి ఒక్కసంగతి గోచరించినది. ఆతని ముఖము ప్రఫుల్లమయినది. ఆతని పెదవులపై మబ్బులు కమ్మినరాత్రి మబ్బులమాటునుండి తొంగిచూచు చంద్రరేఖవలె చిరునవ్వు కలకలలాడినది. గుండెలపైనుండి పెద్దబరువు తీసివేసినట్లయినది. కొన్ని పసరములు మంచి పరుగుగలగిత్త లైనను, తమంతట తాము దారిని పరుగిడలేవు. ఏ బండియైనను ముందుండిన తాము వెనుక నడువగలవు. ఆ ముందుబండి ఎంత వేగవంతమైన అంతవేగమున ఆ విచిత్రజాతి వృషభములు పరుగిడగలవు. అంతియ. ఈ ఆలోచన సమవర్తికి వేయి ఏనుగుల బలము నిచ్చినది. క్రుంగిపోయిన మనుష్యుడు ఒక్కుమ్మడిలేచి కామందక, కులపాలకలను ఎలుగెత్తి పిలుచుచు, “ఇదిగో గమ్యస్థానము ఒక్కఅడుగు, వెనుదీయకండి, పౌరుషము నిలబెట్టుడు!” అని అరచినాడు. ఆ ఉత్తమ బలీవర్దములును తమ శక్తికి మించిన బలమును తెచ్చుకొని పది ధనువులురికినవి.

చారుగుప్తుడు, సమవర్తి మోమును చూచినాడు. ఆతని ఆలోచనా పథము తనకును సువ్యక్తమై తోచుటతోడనే చిరునవ్వున ఆతనిమోము ప్రఫుల్లమైనది.

హిమబిందు తండ్రివదనమును, తమ శకటమును, వెనుకవచ్చు ఆ ఆంధ్ర యువకుని శకటమును, ఆ విచిత్రంపు కోడెలను, ఆ వెనుకబండ్లను ఆలోచనారహితయై, అదటువహించిన హృదయముతో పరిశీలించుచుండెను. వ్యాకుల మేఘాచ్ఛాదితమైన జనకుని వదనము ఇంతలో నిర్మలమై హాసయుక్తమగుట కనుంగొని, యామె ధైర్యమువహించి, యా నూత్నబాలకునివైపు అపహాసము పరపినది.

ఇంక నూటయిరువది ధనువుల దూరమున మాత్రమే గమ్యస్థానమున్నది. అప్పుడే ప్రజలు విజయ మెట్లయినను సమవర్తిదే యని కేకలు వేయుచుండిరి.

ఇంతలో దావానలాంతరాళమునుండి జనించి శిఖల నన్నింటిమీరి గుప్పున దుముకుజ్వాల సామ్రాజ్ఞివలె, అనేక వాయుసమీకరణోద్భవమై మహాపవనము లన్నింటి దాటి విసవిసబోవు సుడిగాలిరీతి, పూర్వాదిసమీపమున సంభవించి చదలుదాక లేచి అమితవేగమున తరలి తరలి సాధారణ కల్లోలములపై దూకివచ్చు ఉత్తుంగకల్లోలము విధాన, సునాయాసముగ వెనుక వచ్చు నా కుమారుని ఎద్దుబండి సమవర్తి శకటమును దాటి ముందునకు గడిచిపోయినది. ఆ సమయమున నా ప్రఖ్యాతవీరుడు రౌద్రమూర్తియై, గాఢక్రోధమున ఎట్లయిన తన విరోధి బండిని నిలుపు దురుద్దేశమున విడిగానున్న యొక పగ్గపుత్రాడు చటుక్కున అత్యంత నిపుణముగ తన యెదిరివాని యెద్దుల మెడలమీదికి విసరెను. అది చూచి అంద రొక్కసారి హాహాకారముల సలిపిరి. కాని మగటిమి గల ఆ కుర్ర పోటీదారుడు తన చబుకు చురుక్కున పేలించి సమవర్తి చేతిపై మేరుమువలె, బాణమువలె, నాటించి పగ్గము హస్తమునుండి సడలిపోవునట్లొనర్చెను.

సమవర్తిచేయి పట్టువీడిన పగ్గముతాడీడ్చుకొనుచునే ఆ బాలకుని బండి గమ్య స్థానమునకుబోయి నిలిచెను. ఆ గిత్తలు వగర్చుచు ముట్టెలు భూమి నాన్చి, నాల్కలుజూచి, డొక్కలెగురవేయుచు నిలిచియున్నవి.

ఇరువది ధనువులవెన్క సమవర్తి వచ్చెను. శివస్వాతియు, కాళింగుడగు మల్లినాథుడును మూడవవారుగా వచ్చిరి.

ఒక్కుమ్మడి ప్రజలందరు “ఇదిమాయ! తంత్రము! ఇంద్రజాలము! వీడు బ్రాహ్మణ మాంత్రికుడు! వీనిపట్టుడు! కొట్టుడు! చీల్చివేయుడు!” అని కేకలువేయుచు దగ్గరనున్న ఆయుధముల సేకరించి హుమ్మని విజయలక్ష్మీ ధవుడగు నా బాలకునికడ కురికిరి. అచ్చటనున్న రక్షకభటులు ఇట్టిరంగ ముద్భవిల్లునని కలనైన తలచియుండకపోవుటచే, ఆ మూకల నాపుచేయలేకపోయిరి. చక్రవర్తి అంగరక్షకులు కొందరు తమ గుఱ్ఱముల నా విజయునికడకు బరువెత్తించి ఆతని చుట్టును శూలముల జళిపించుచు నిలిచిరి. వారి నెట్లు తప్పించుకొనిరో నల్వురైదుగురు వీరులు సువర్ణశ్రీ బండిని కత్తులెత్తుకొని సమీపించిరి. ఆ బాలుడు తనకుకలిగిన ఆయాసము నడంచుకొనుచు, చిరునవ్వు మోముతో నీ గడబిడ చూచుచు, తనదూడల పల్కరింపుచు, ప్రేమచే వాని మూపురములు, గంగడోళ్ళు, ముట్టెలు దువ్వుచు, వాని ఆయాసము తీర్చుచు, తనపై దుముకువారివైపు చూచుచుండెను. ఎప్పుడీ నల్వురు కత్తులెత్తుకొని తనమీదికి దూకిరో, అప్పుడా బాలుడుచేతనున్న బంగారు కట్లుకట్టిన, మణులు పొదగిన పెద్ద పులితోలు తాళ్ళుగలిగిన, దంత కశాయుధము పట్టుకొని ముందున్న వాని మోముపై చురుక్కున నంటించెను. “హో” యని యార్చియాతడు కత్తి పారవైచి, కశాఘాతంబుచే రక్తము స్రవించు మోముపై చేతులనుంచుకొని కూలిపోయెను.

ఇంతలో అపరభీమునివలె మహాసత్వుడై పర్వతమువలె ఉన్నతుడై ఆజానుబాహుడై, అమూల్యవస్త్రధారియై, చిరుగంటలు గలిగిన పెద్దగదను ధరించి యొక పురుషుడు రాజాయము కడనుండి పరుగునవచ్చి, సువర్ణశ్రీ కుమారునికడకురికి, పిడుగుమాటలతో “ఎవ్వరీబాలుని స్పృశింప దలంతురో వారు ముందే గదాయుధంబు రుచిచూతు” రని పలికెను.

ధనుర్వేదాచార్యుండును, చండవిక్రముండును, సమస్తవీరహృదయా నందుడును, పవిత్రుడగు సోమదత్తు డానూత్న బాలునకు సహాయియై వచ్చెనని చూడగనే ప్రవాహము వలెవచ్చు ప్రజానీకము పర్వతము అడ్డమురా నాగినట్లయ్యెను. అందరును వెనుకకు తిరిగిరి. అప్పుడు సార్వభౌముని గజ తురగ రథ సైనికులు జవంబున విచ్చేసి మూకల నిటునటు తరిమివేసిరి. సార్వభౌముని కడకు విజయుని గొనిరా రాజాజ్ఞయయ్యెను.

ఈ కోలాహలమంతయు సమవర్తి జూచుచునేయుండెను. జనులు తన్నోడించిన యాబాలునిపై గవిసినప్పుడు సమవర్తిమోము హర్షప్రఫుల్ల మయ్యెను. సోమదత్తుడువచ్చి ఆ కుర్రవానిని ఆపదనుండి రక్షించునప్పుడు సమవర్తి పండ్లు బిగించి సోమదత్తునివైపు చురచుర చూచెను.

ఆ బాలుడు తన్ను రక్షింపవచ్చిన తన గురునకు పాదాభివందన మాచరించి ఆనందాశ్రువులతో నాయన మోము దిలకించెను. సోమదత్తుడు సంతోషమున శిష్యుడగు నా బాలుని బిగవుగిలించుకొని మూర్ధము ముద్దు గొనియెను. వారిద్దరు గజగమనముతో రాజమందిరము సమీపించిరి. ఈలోన ప్రజలకు కోపముతగ్గి ఎట్టి బహుమాన మా బాలుడు బడయునో, సార్వభౌముడేమి చెప్పునో ఆ బాలుడెవరో తెలిసికొన కుతూహలము కలిగి, ఎప్పటియట్లు తమ స్థానముల ఇష్టము చేతనైననేమి, సైనికుల యొత్తిడి చేతనేమి యధివసించిరి. అంతయు నిశ్శబ్దమయ్యెను. చీమ చిటుక్కుమన్న వినిపించునట్లుండెను.

సార్వభౌముని మందిరముకడ అమాత్యులు, సచివులు, సైన్యాధికారులు మొదలగు గొప్ప యుద్యోగులు, సామంతనృపాలురు, ఆంధ్రపండితులు, కవులు, వీరులు-అందరు అధివసించి యుండిరి. శ్రీముఖ సాతవాహనమహారాజు దేవేరితో గద్దెపై నధివసించి యుండెను. రాజసింహాసనము కుడిప్రక్కగా యువరాజాసనముపై చక్రవర్తి పెద్ద కుమారుడగు శ్రీకృష్ణసాతవాహనుడును, ఆ ప్రక్కపీఠికపై శ్రీముఖుని తమ్ముడగు సుధన్వ సాతవాహనుడును కూర్చుండిరి. వెనుక పరిచారికలతో అంతపుర స్త్రీలోకము మణిమయ స్వర్ణపీఠముల ఉపవిష్టమైయుండెను.

సోమదత్తు తనశిష్యుని రాజుమ్రోలకుం గొనిపోయినాడు. ఆ బాలకుడు సార్వభౌమునకు సాష్టాంగప్రణామ మాచరించి, యాతనిచే ననుజ్ఞాతుడై లేచి నిలువబడెను, అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనియె “వ్యాయామాచార్యా! సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను.

“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది తనయుడు. సువర్ణశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్పరచి అందు విజయుడగువాని నీ ఉత్సవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రోగించినారు. జయ జయధ్వానము లొనర్చినారు. వైతాళికులు కీర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల పల్కించిరి.

11. విజయ బహుమానము

సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి.

అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని చుట్టును “ధర్మవిజయము”ను అద్భుతాభినయపూర్వకముగ నాట్యమొనరింప నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కోటీశ్వరుడగు చారుగుప్తుని పుత్రి హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొననుత్తమవంశ సంజాతలగు యువతీ రత్నములకే అర్హత.

మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను.

ఈ విజయ గీర్తింప
ఈ వియచ్చరులెల్ల
గగన పథముల వచ్చి
కాంతితో ప్రసరించి
పూలవర్షము కురిసి
తేలుచున్నారదిగొ
ఈ విజయ గీర్తింప”


బాలిక లప్సరసలవలె నభినయించుచు,

“ఓయి యౌవనమూర్తి
ఓయి సుందరస్వామి
రావయ్య జయదామి
కావక్షుడవు కమ్ము”

నాట్యమాడిరి.

నాట్యగురువు:

ఇంద్రుడిచ్చును కీర్తి
చంద్రుడిచ్చును విద్య
వాయుదేవుడు బలము
వరుణుడిచ్చును శక్తి.

బాలికలు నాట్యము సలుపుచుండిరి.

నాట్యగురుని శిష్యుడు మారువేషమున,

“ఎవడవోరీ మానవాధమా!
ఇవ్వనవాటిని నిలుచున్నావూ?

ఇరువురు శిష్యులు అహంకారుడు, స్వార్థుడు అను దేవతలుగా పాడుచు తాండవింతును.

“లోకముకొరకై సేవనుమానుము
లోకము నిన్నేకొలుచునురా!”

మారుడు :

మారుడ నేనే, శూరుడ నేనే
మాయలకంతకు నేతను నేనే
జగము లన్నిటిని కాలనుత్రొక్కెద
జగములు నన్నే పూజలు సేయును
నన్నుకొలిచికొనువారికే విభవము,
నాకము వారికి పాదాక్రాంతము,
ఛత్రచామరము సర్వరాజ్యములు
సర్వసంపదలు వారికె దక్కును;
రారా! రారా! విజయరూపుడా!
రారా, వచ్చియు నన్ను కొలువురా!

కొందరు బాలికలు మారుని కొమరితలవలె దివ్య వేషములప్రవేశించి:

జగంబంతట వీరహృదయులు
జిఘృక్షులుగా మోకరింతురు,
మాదగు సౌందర్యమ్మును చూచి
మమ్ములనే కామించి వత్తురు.

జగం.

మనృణకినలయబాహువల్లరి
మధురముగ నిను కౌగలించును
వినముకాదిది వాతెరసుధరా
మెనవరా దేవుడై వెలిగెదవు.

జగం.

ఇంతలో రాజపుత్రికలు, హిమబిందు, రాజబంధు తనయలు, అష్టమార్గ మూర్తులవలె విచ్చేసి నాట్యముచేయ నారంభించిరి. చక్రవర్తి ప్రథమతనయ మాయాదేవి విజ్ఞానదేవిగా, ద్వితీయ పుత్రిక శాంతశ్రీ సత్యచింతనాదేవిగా, హిమబిందు ధర్మకర్మదేవిగా, నాగబంధునిక ఉత్తమాశయదేవిగా, ఇతర బాలికలు తక్కినవారుగా నటించిరి.

విజ్ఞానదేవి :

జన్మంబు మాయరా
జగమే హుళక్కిరా
సర్వభోగము లవియు
ఛాయలే ఎరుగరా,

సత్యచింతన :

జగములో ఎవ్వరికి
సలుపకోయీ హింస
పాపకాంక్షలు నీకు
చూపవుర నిజపథము.

ధర్మకర్మదేవి :

ప్రేమయే నీ కర్మ
ప్రేమయే నీ దారి
సర్వ ప్రాణులు నీవె
సర్వబాధలు నీవే!

ఉత్తమాశయదేవి :

మూడురత్నము లివిగొ
చూడరా! వేడరా!
నాల్గు సత్యాలనే నమ్మరా, ఎరుగరా!

సత్యవచనదేవి :

అనృత మాడబోకు
ఆనంద మొందరా
 కానిచో మాటయే
కంఠాన రానీకు.

న్యాయజీవితదేవి :

పరధనము వలదురా
పరకాంత వలదురా
 వలదురా పరభూమి
వదలరా వాసనల.

శీలదేవి :

 వలదు భోగము మనకు
వలదు యశములు మనకు
కలలైన జన్మాలు
గాఢశత్రులు మనకు.

ఆనందదేవి :

ఏమి లేకుండుటే
ఎరుగు నిర్వాణంబు
కర్మరహితంబైన
 జన్మరహితంబౌన
 అదియ ఆనందమౌ
 అదియె నిర్వాణమ్ము.

హిమబిందుకుమారి సమవర్తి ఓడిపోయి రెండవవాడుగా మాత్రము వచ్చుట చూచి వెలవెలపోయినది. ఆమె హృదయము క్రుంగిపోయినది.

పెన్నిధి పోగొట్టుకొనినవానివలె క్రుంగిపోయిన తండ్రిని జూచి, యామె కన్నుల నీరు తిరిగెను. ఇంతకు నా నూత్నబాలకు డెవ్వరో తన తండ్రికి దుఃఖకారణుడైనాడు. ఆతడు పిశాచి, రాక్షసుడు. ఆమె ఆ బాలకుని ఇచ్ఛామాత్రమున నాశనముచేయ నూహించినది.

విజయము నందుటకుగాని, ఓడిపోవుటకుగాని ఆ పందెమున ఎద్దులే కారణమయినను, సారథిని కారకునిగా ఎంచి నిందించువారిలో చారుగుప్తుడును చేరినాడు. ఇంతలో అతనికి జ్ఞానోదయమై, తన్ను తానే నిందించుకొనినాడు.

తా నెన్నివేల ఫణములు పెట్టి కొనిననేమి? మహోత్తమ వృషభముల కనుగొనలేక పోయినాడు. ఆ చక్కని గిత్త లెచ్చటివి? ఏ జాతివి? తన గోపాలురకు, గోరక్షకులకు తెలియకుండ నెచ్చట పెరిగినవి? అలాంటి దివ్యవృషభములు లక్షఫణములు మూల్యమిచ్చికొన్ననేమి?

తన స్వప్నములు పటాపంచలైనవి. తాను కౌశికునివలె పన్నిన మొదటి ఎత్తే విచ్ఛిన్నమైనదేమి? ఇది అపశకునమా? ఛా, ఎన్నిసారులు ఓడిపోయి చాణక్యదేవుడు జయమందలేదు? అదిగో తన బంగారు ప్రోవు, దివ్యమూర్తి. హిమబిందు తన్నుజూచి బెంగపెట్టుకొన్నది.

అనుకొనుచు చారుగుప్తుడు కలకల నవ్వుచు, “మనమును విజయునకు కాన్క నీయవలె, హిమబిందూ! హరగోపా! అలంకారికుని, కుయవుని ఇటు రమ్మను!” అని ఆజ్ఞ యిచ్చినాడు.

కుయవానందుడు అద్భుతశిల్పి, అలంకారికుడు. ఆయన మందిరము వెనుక ప్రక్కనుండి ముందునకు వచ్చి, చారుగుప్తునితో రహస్యముగ మాట్లాడి అశ్వము నెక్కిపుర మార్గమున వెడలిపోయెను.

తండ్రిగారి సంతోషము కనుంగొని హిమబిందు హర్షవదనయై నాట్యమున కలంకరించుకొన చక్రవర్తి మందిరము వెనుకనున్న నేపథ్య మందిరమునకు బోయెను.

అచ్చటనున్న యా చకోరాక్షుల, ఆ యిందీవరనేత్రల, ఆ కురంగ లోచనల నడుమ హిమబిందు మహాపద్మనేత్రయై, తారకామధ్యచంద్ర బింబమువలె కాంతులీనుచుండెను. రావి వనములోని వటవృక్షమువలె విలసిల్లెను. మొదట హిమబిందును సమవర్తి చూచుచునే యుండెను. ఆమెవదన మవనతమై సమవర్తి హృదయమును గ్రుంగజేసినది. చేయి పెట్టి కలచివేసినది. తన దురదృష్టముచే మేనమామకు అపజయము కలిగినది కదా యని యాత డనుకొనెను. ఇంతలో చారుగుప్తుడును నవ్వెను. సమవర్తి మనస్సు చకితమై వికారమునందెను. పదునారేండ్ల ఎలప్రాయపు ఆ జవ్వని తన మనస్సంకల్పమునకు, భావనేత్రమునకు ఇదివరకు గోచరము కాని పొంకముతో, అత్యద్భుతసౌందర్య రూపమున ఎదుట ప్రత్యక్షమై నప్పుడు అతనికి మరేమియు కన్పట్టలేదు. నాగస్వరము నూదు పాముల వాని అభినయముల తదేకదీక్షతో చూచు సర్పమువలె నాతడు హిమబిందుగమనము చూపులతో ననుసరించుచుండెను.