హిమబిందు/ప్రథమ భాగం/7. సార్వభౌముని జన్మదినోత్సవములు

వికీసోర్స్ నుండి

 సిద్ధార్థినిక మితభాషిణి. తొమ్మిదియేండ్ల యీడుగల యా చిన్నబాలిక ఎప్పుడు నేదో యాలోచనముననే యుండును. ఇతర బాలికలతో కలసి యాడుకొనదు.

తల్లితండ్రులు బుద్ధపూజవేళ పాడుకొను ప్రాకృతగీతముల నాబాల యెప్పుడును తనలో తాను పాడుకొనుచుండును. ఆమెకంఠ మతి మధురమైనది. ఆమె యాటగది యందున్న బొమ్మలన్నియు బుద్ధారాధన సంబంధములైనవే. బుద్ధపాదములు, ఛత్రములు, ధర్మచక్రములు చిన్న చిన్నవి పాలరాతితో, వెండితో, దంతముతో గంధపుతరువుతో విన్యాసము చేసి ధర్మనంది తనయకు బహుమానము లిచ్చెను. ఆ గదినంతయు నవి యలంకరించుకొని యామె పుష్పములు సేకరించి, ఫలములు ప్రోగుచేసికొని, మహాలి నడిగి, ధూపవత్తియలు, సువాసనాద్రవ్యములు తెచ్చుకొని పూజలు సల్పుచుండును. అన్నగారి శిల్ప మాబాలికకు ప్రాణము. నాగబంధునిక కన్నగారి వీరవిద్య హృదయా నందకరము. అన్నగా రేనాడు కవులు రచించు కావ్యానికములు మనోహర గాంధర్వ యుతముగ పాడుకొనునో అప్పు డన్నగారికడ చేరి, యాతని యొడిలో తలనుంచుకొని పెద్దవియైన లేడికళ్ళరమూతలుగా నన్నగారి ముఖమును, ఆకాశము నవలోకించుచు సిద్ధార్థినిక వినుచుండును. అన్నగారు పాటలు పాడుకొనునప్పుడు నాగబంధునిక ఆ చుట్టుప్రక్కలకు రాదు.

అన్నగారు శృంగారరసభావపూర్ణములగు పాటలు పాడినప్పుడు నాగబంధునిక “ఛస్ ఈ శర్కరకేళిపండ్లు నాకిష్టముండవు” అని నవ్వుచు వెడలిపోవును. సిద్ధార్థినిక కప్పు డక్కపై అమితముగ కోపమువచ్చును. అన్న పాడు పాట అర్థమై కాదామె ఆనందించుట. అన్న పాటలలో దూరదూరమున యశోధరాదేవి యున్నదని యామె చిరుహృదయము, చిట్టి భావముల చిన్న ఆలోచనలతో ఉప్పొంగిపోవును.

ఈరోజున నాగబంధునిక సువర్ణశ్రీ వీపుపై ఒక గ్రుద్దు గ్రుద్ది “అన్నా! పదిక్షణము లీశిలము సంగతి మరచిపోకూడదా? రా; వృపభశాలకుపోవుదము. శైబ్య సుగ్రీవకము లేమిచేయుచున్నవో కనుగొందము. చెల్లి గిత్తలకడకు రానేరాదు. చిన్నదూడలు, ఆవులు, ఆబెయ్య లీ వెర్రితల్లికి ప్రాణము చెల్లీ! ఓ వెన్నమ్మగారూ! ఓ మామిడిపండురసంగారూ! ఓ చెరకు పానకంగారూ! ఈ వేళనైన కొన్ని మిరియములు తినవే! కొంచెము నల్లజీలకర్ర రుచిచూడవే. అల్లము లవణముతో కలిపి తినవే. రా; అన్నను పందెము నెగ్గించే కైలా సశిఖరములను చూచెదము రా; జజ్జమ్మతనము వదలు” అని నవ్వింది.

“ఓ మగక్కా! నీవు గడనెక్కి యాటలాడుము. భీమునివలె నేనుగులతో బంతులాడుము. తాటకివలె చంటిపిల్లలను మూటగట్టుకొనిపో. నిన్ను చూచిన నాకు భయము వేయుచున్నది. అన్నచాటున దాగు కొనవలెను” అని సిద్ధార్థినిక కోపము నటించుచు నవ్వసాగెను. 

7. సార్వభౌముని జన్మదినోత్సవములు

ధాన్యకటకమునకు అయిదుగోరుతముల దూరమున కృష్ణానదీ కూలమున పురబాహ్యోద్యానమునకు సమీపముననే మహాఖేలనా ప్రదేశమున్నది. అది సుమారు నూరు నివర్తము లున్నది. (నివర్తము సుమారు మూడు ఎకరములు) ఆ విశాలస్థలమున సర్వకాలములయందు మల్ల యుద్ధములు, పందెములు, ఆటలు మొదలగునవి

జరుగుచుండును. ఒకచో మల్లయుద్ధ మొనర్చుచుందురు. ఒకచో రథములు పందెముల కొరకై పరుగెత్తించెదరు. ఒకచో ధనుర్విద్య నేర్చుకొనుచుందురు. వేరొకచో గుఱ్ఱపు స్వారియుందు నిమగ్నులయియుందురు. పలువురు మల్ల ముష్టి యుద్ధాల నలవరచుకొను చుందురు. మహావీరులకు ఉనికిపట్టయిన ఆ ప్రదేశమునకు చిక్కిపోయిన బక్కవారిని రానీయరు. అచటికి వెళ్ళలేనందుకు పలువురు ఆంధ్రబాలురు ప్రాణ త్యాగమునకైన ఆయత్తులగుదురట.

మహోత్సవములప్పు డచ్చట ప్రదర్శనములు, పందెములు జరుగుచుండును. ఆంధ్ర సార్వభౌముడు శ్రీముఖుని పుట్టినదినమున ప్రతిసంవత్సరమును మహోత్సవాల నేకము లందు జరుగును.

నగరమధ్యము, సార్వభౌముని కోటకు సుమారు రెండు నూర్లధనువుల దూరమున, నగర క్రీడామందిర మున్నది. క్రీడామందిరమును చుట్టి నగర వసంతోద్యానమున్నది. వసంతోద్యానకుడ్యములనాని చిన్నక్రీడా పర్వతమున్నది.

నగరనర్తశాల యా క్రీడా పర్వత శిఖరముపై నున్నది. పర్వత పాదము నుండి ఆ చిన్ననగరము అరువది అడుగుల ఎత్తు మాత్రము. నర్తనశాలలో సార్వభౌమ జన్మదినోత్సవ సంగీత సభలు, నాట్యప్రదర్శనములు జరుగును. కోటలో నున్న రాజనర్తనశాలకు, ఆనందమందిరమని పేరు. అచ్చట ముఖ్య నాట్యప్రదర్శనములు జరుగును.

ఉత్తమగాయకులకు, నటకులకు, కవులకు, శిల్పులకు, చిత్రకారులకు భూరి పారితోషకముల సార్వభౌము డర్పించును. దేశమంతయు సంతోషమున నోలలాడును. గ్రామములు, ఘంటా పథములు, పట్టణములు, నగరములు అలంకరింప బడును. కారాగృహముల బంధితుల విడుదల చేతురు. పల్లెల, పురముల నృత్య గానకావ్యాది వినోదములు ఎడతెగక జరుగును.

విస్తారాంధ్రమహారాజ్యమందెచ్చటను, ఏవిధమగు పన్నులను నెలరోజులవరకు వసూలు చేయరు. దేశమంతయు నానందడోలికల తేలియాడి పోవుచుండును.

ఖేలనాస్థలములలో ముష్టియుద్ధ, మల్లయుద్ధ, ఖడ్గయుద్ధాది ప్రదర్శనములు, గుఱ్ఱపు పందెములు, రథముల పందెములు, ఏనుగు పందెములు జరుగును. వీధినాటకములు, తోలుబొమ్మల నాటకములు, దొమ్మరవిద్దెలు, సాముగరిడీలు, గాథాకాలక్షేపములు ఎన్నియేని జరుగును. జనులు ఆనంద పరవశులై, శుభ్ర వస్త్రములు ధరించి, భూషణాలంకృతులై, మద్యాదికములు త్రాగువారును, జూదముల పాల్గొనువారును, ఆఖేటనోత్సాహులు నగదురు. ఆంధ్రసుందరీమణులు అప్సరసలే యై నృత్యగీతాదుల వినోదించుచు, ప్రదర్శనముల పాల్గొనుచు, సర్వభూషణాలంకృతులై ఒయారపు నడకల ఏ గంధర్వ నగరమునో తలంపునకు దెత్తురు.

ఆంధ్రులకు ఎడ్లబండి పందెములు (ఈవలావల ఎడ్లు, మధ్య గుఱమును కట్టిన బండ్లపందెములు), రథ పరీక్షలు అత్యంత ప్రీతికరములు. ఈ పందెముల పాల్గొనని ఉత్తమాంధ్రు డాయుగమున ఆంధ్ర మహాసామ్రాజ్యమునం దెచ్చటను గానరాడు.

ఈ వివిధోత్సవములలో నానందించుటకు, వివిధపరీక్షల పాల్గొని బహుమతు లందుటకు ఆసేతుహిమాచలముననున్న దేశములందలి మహారాజుల, మండలాధిపతుల, సామంతుల, చక్రవర్తుల, అర్హతుల, కులపతుల, మహాభిక్షుకుల, ఋషుల, పండితుల, కవుల, గాయకుల, నటుల, వీరుల, పోటుమగల నాహ్వానింతురు. కురు, పాంచాల, సాల్వ, మద్ర, శూరసేన, మగథ, మాళవ, కుంతల, పాండ్య, చోళ, కాంభోజ, గాంధార, కామరూప, ఘూర్జర, త్రికళింగ, వంగ, లిచ్ఛవాది దేశముల కన్నింటికిని; సువర్ణ, యవ, బలి, పూర్వకాంభోజ, సింహళాది ద్వీపములకును, యవన, బాహ్లిక, తురుష్క పారశీక, రోమక, నీలకా, త్రివిష్టప, చీనాది లాతివిలాతులకును సందేశ గ్రాహకులు ఆహ్వానముల గొనిపోదురు.

ఆ యా దేశములనుండి వీరులు, పండితులు, రసజ్ఞులు, రసస్రష్టలు, ప్రభువులు ఈ యుత్సవముల పాల్గొని యానందతరంగడోలికల నూగిపోవుటకు యాత్రలుసాగి యరుదెంతురు.

వృషభశకట పరీక్షకు ఘనదారువినిర్మితరథములకు పూన్చిన కైలాసశిఖర సదృశములగు గిత్తలపూన్చి జయాభిలాషులై దేశదేశముల నుండి వీరు లరుదెంతురు.

మగథనుండి సుశర్మకాణ్వాయన చక్రవర్తి కాత్యాయనుని పంపినాడు. ఉజ్జయిని నుండి మహారధియగు పహ్లవుడు వచ్చినాడు. సౌరాష్ట్రమునుండి పొట్టివియు, బలము కలవియు, లేళ్ళవలె చురుకు గలిగిన పసరముల వివిధ వర్ణాలంకృతమగు రథమునకు పూన్చి జీవనప్రభువీరుడు వచ్చినాడు. నిడుపాటి కొమ్ములు కలిగి వాలుకన్నుల బెదరుచూపు చూచుచు, శ్రమయనునది యెరుగని నల్లగిత్తల గట్టుకొని దక్షిణమునుండి వీరత్తుణి వచ్చినాడు. ఆ రోజున నలుబదిమూడు దేశములు పందెమునకు తమతమ రధికులను పంపినవి.

తెలుగురౌతులు పదునేనుగురు పందెమునకువచ్చిరి. సమవర్తి మేనమామ బండినడుపుటకు నిశ్చయింపబడినది. శిల్పికుమారుడగు సువర్ణశ్రీ కూడ పరీక్షకై పేరిచ్చెను. పట్టణమంతయు కోలాహలముగా నున్నది.

సమవర్తి జయముగాంచునని అందరికీ దెలియును. పట్టణ ప్రజా సమూహమునకు సమవర్తియనిన ప్రేముడి యెక్కువ. లాతిదేశములకు బోయి యచ్చట జరిగిన ప్రదర్శనముల విజయమొంది ఆంధ్రగౌరవము నిలిపినది సమవర్తియేగదా! ఆతడు నడపజాలని రథములేదు, ఎక్కడ్రాలని గుఱ్ఱమునులేదు. ఆతడు చెప్పిన వినని బలీవర్ద మున్నదా?

మహాభేలనాస్థలమంతయు నలంకరించినారు. ఆంధ్రవైభవమంతయు నచట చిత్రితమయ్యెను. చిత్రవర్ణవస్త్రాలంకృతమై, వివిధాకృతమగు ప్రజ భూమి పై వాలిన మహేంద్రచాపముల తలపించెను. ఉత్తరాంధ్రదేశపు సన్నని దుకూలములు చిరుమబ్బుల వలె గాలికి తేలిపోవుచున్నవి. ఆంధ్రదేశమునకు వజ్రభూమి యని పేరు. ఆంధ్రులు రత్నాలరాజులు. స్త్రీలును, పురుషులును ఇప్పుడు మన మగవారివలె ఒక్క అందమగు వస్త్రమును పాదములవరకు రాకటి వస్త్రములు గట్టుకొందురు. ఒక వస్త్రము పైన గప్పుకొందురు. వలిపెముల కొందరు తలచీరలుగా ధరించి యుండిరి. కాళ్ళకు బంగారు కడియములు చేతులకు కంకణములు, మెడలో వివిధములగు హారములుండును. మొలనూళ్ళు ధరించిన యువతులచే నా ప్రదేశము మెరుగు లీనుచున్నది. అనేకులు రాజవంశమువారు తలపై వివిధరూపముల రత్నములు, ముత్యాలహారములు పొదిగిన కిరీటములు ధరించియుండిరి.

ప్రేక్షకస్థలమధ్యమున రాజమందిరమున్నది, అనేక దంత హేమగంథాసనములు అందమర్చిరి. మధ్యమున సార్వభౌముని సింహాసనమును, దానిం జేరియే రాణుల పీఠములును గలవు. ఆ మందిరమున కీవలావల మంత్రుల, దండనాయకుల, సేనాధిపతుల మందిరములు వారి వారి గౌరవముల ననుసరించి వెలుగుచున్నవి. సార్వభౌముని మందిరమునకు కుడిప్రక్కగా, అన్ని మందిరముల తుద సామాన్యజనము చూచుటకు తగిన పెద్ద పందిరియొక్కటి తగు అలంకారములతో నిర్మాణమొనర్చిరి.

రాజమందిరము ఎడమప్రక్కగా మూడు మందిరములావల చారుగుప్తుని మందిరము సూర్యకాంతమణివలె నా ప్రదేశమును వెలిగించుచు ఆ వచ్చిన లక్షలకొలది ప్రజల చూపుల నాకర్షించుచుండెను. మూడేండ్లనుండి వెలవెల పోవుచున్న ఆ మందిరము నేడు పూర్ణాలంకార మనోహరమై సుధర్మను పరిహరించుచున్నది. “రాజమందిరమునకు జోడగునది, ఆ మందిర మొక్కటియే” యని ప్రజ లొకరి నొకరు చూచి చెప్పుకొనిరి.

“పదునొకండవ ముహూర్తము మ్రోగించినారు. సార్వభౌముడు వచ్చువేళ అయినది” అని మహశ్రీచండకేతునితో ననియెను. వారిరువురు గుఱ్ఱముల పై నధివసించి రంగస్థలమున నిటు నటు తిరుగుచుండిరి. అంత చండకేతుడు పురమార్గమువంక చేయి నడ్డమునుండి చూచుచు “అదిగో సార్వభౌములు వచ్చుచున్నారు” అని అరచెను.

8. శకటచోదక పరీక్ష

మహాశ్రీ: ఆ వచ్చునది సార్వభౌములుకారు. ఎవరు చెప్పుమా అంతవైభవమున వచ్చుచున్నది?

చండకేతుడు: ఆర్యా! తెలిసినది, తెలిసినది! రత్నకలశధ్వజము! ఆర్యచారు గుప్తులవారు, కోటీశ్వరుల వైభవము ఒక్కొక్కప్పుడు భూమీశుల సంపదను మించిపోవును కదా!

మహాశ్రీ: అవునయ్యా! చారుగుప్తుడు సకల భారతవణిక్సార్వ భౌముడు. ఆయన ఎన్నికోట్లకు నాగదేవుల కాపుంచినాడో! ఎన్నిమందసముల రత్నరాసులున్నవో! వివిధదేశ సువర్ణము లెన్ని మందిరముల లెక్కకురాక, ప్రోవులుపడియున్నవో!

చండకేతుడు: మూడేండ్లనుండి చెన్నుదరగియున్న ఆ వర్తక చక్రవర్తి మండపము ఎంత పరమాద్భుతముగ నలంకరించినారు! ఏమి విశేషము స్వామీ?

మహాశ్రీ: విచార మెంతకాలము మానవునకు! ఆతని భార్య చనిపోయి మూడేండ్లయినది. ఇప్పుడు కొమరిత పదునారేండ్ల వయసునందినది. ఆంధ్రయోషా రత్నములలో ఆ బాలిక కౌస్తుభమే.

చండకేతుడు: ఆమె యందము తనివితీరని వేడుకతో చెప్పుకొందురు. అంత అందగత్తయా ఆర్యా?

మహాశ్రీ: ఓయి అజ్ఞానీ, అందగత్తె అనుమాటను కృష్ణానదీ గర్భమున పడద్రోయుము. ఆమె అపరాజితాదేవి. ఆమె ప్రజ్ఞాపరిమిత. ఆమె శ్వేతతార! ఆమె అనంత సౌందర్యభావోజ్వలమూర్తి!

చండకేతు: ఆర్యులు కవులగుచున్నారు.

మహాశ్రీ: దివ్యసౌందర్యాభిముఖుడగువాడు మొరకుడైనను మహాకవికాడా చండకేతూ?

చండకేతు: మీ వర్ణన విను నాకే కవిత్వము గంగోత్తరస్వరూప మందాకినీ ప్రస్రవణమై వచ్చుచున్నది, శకటాధ్యక్షులవారూ!

ఇంతలో చారుగుప్తుని రథము పరివారపరివేష్టితమై, ఆశ్విక గజవీర సంరక్షితమై, భేరీ మృదంగ శంఖ కాహళ వాద్యములు చెలగ మహాఖేలనాస్థలము దరిసినది.