హిమబిందు/ప్రథమ భాగం/30. శిల్పసందర్శనము

వికీసోర్స్ నుండి

ముక్తావళీదేవి పన్నీట మొగము కడుగుకొని పరిచారిక లందిచ్చు శుభ్ర వసనములచే తుడుచుకొనుచు నొక పీఠముపై నధివసించియుండెను. ఆమె మాటలలో యవనాపభ్రంశోచ్చారణ కొంచెము కానవచ్చుచుండును.

“అమ్మమ్మా, అమ్మమ్మా” అని ఇంతలో హిమబిందు వచ్చినంతట మొగము తుడుచుకొను వస్త్రము తీసి ముక్తావళీదేవి మనుమరాలిని చూచి....

“అమ్మడు! ఇదేమి? యిటుల వచ్చితివి? ఆ పరుగులేమి? నీవెప్పుడును అల్లరిపిల్లవు. నీకు ఒక్కక్షణము నిలకడలేదాయెను. ఏ మంత తొందర” యని ప్రశ్నించినది.

హిమ: అమ్మమ్మా, నీవు శక్తిమతీదేవిని ఎరుగుదువా?

ముక్తా: ఎరుగుదునమ్మా. నా కన్నతల్లియు, ఆమెయు చిన్నతనమున అతి స్నేహమున మెలగువారు. వారిరువురకు సంగీతమున, నాట్యమున, సాహిత్యమున గురువులందరు నొకరే. శక్తిమతియింటికి నా కన్నతల్లి పోవునది. మా యింటికి శక్తిమతి వచ్చునది. అవియన్నియు యెప్పటికిని మఱపురావు.

ముక్తావళి కన్నులనీరు గిఱ్ఱున తిరిగినది. ముక్తావళీదేవి కిప్పుడు యేబది తొమ్మిది సంవత్సరములు మాత్రమే యెనను, తలయంతయు కొమరితపోయిన గాఢవిచారమున ముగ్గుబుట్టవలె నెరసిపోయినది.

హిమ: అమ్మమ్మా, యీ దినమున మన మా శక్తిమతీదేవిగారి యింటికి పోవలెనే. వారి అమ్మాయి నాగబంధునికయు, నేనును చదువుకొంటిమి. శక్తిమతీదేవిగారి భర్త నెరుగుదువా?

ముక్తా: ఆ, ఎరుగ కేమి తల్లీ! ధర్మనందులవారు మహోత్తమ శిల్పి. మా గ్రీసుదేశపు శిల్పములకన్న వీరిశిల్పములం దేదియో విచిత్రత, ఏదియో మహోన్నతి నాకు తోచును.

హిమ : అవి అన్నియు చూడవలెనే.

ముక్తా: తల్లీ! యీ మూడేండ్లనుండియు ఎచ్చటికైన కదలుచుంటిమా మనము?

హిమ: అమ్మమ్మా, మనము వెళ్ళితీరవలెను. నాకు అమ్మజ్ఞాపకము వచ్చి ఈ దినమున అతి బెంగచే బాధపడిపోయినాను. మన మెక్కడి కైనను వెళ్ళకపోయినచో నాకు మతియే పోవును.

ముక్తావళి హృదయమున గజగజలాడి “అలాగునే అమ్మా. అమ్మాయి అమృతలతకు వార్త పంపెదను, మీ తాతగార లిరువురును సంఘా రామము విడిచి రారాయెను. అన్నగారు వినయగుప్తులవారు బౌద్ధ దీక్ష తీసికొనెదరని అందరును చెప్పుకొనుచున్నారు. ఈ దినము సాయంకాలము మనము మువ్వురము బాలనాగిని తీసికొని శక్తిమతీ దేవిగారి యింటికి పోదములే” అన్నది.

30. శిల్పసందర్శనము

హిమబిందు కేలనో భయము వేసినది. ఏమియు తోచదు. అలంకారికురాలగు తారాదత్తను పిలువనంపి తనకున్న మంచివస్తువులను, వస్త్రములను తీయుమన్నది. పాము కుబుసములబోలు సన్నని దుకూలములు చిత్రచిత్రవర్ణములు జెలువొందినవి యామె దూరముగా ద్రోచినది. వలిపెములు సముద్రవీచికాఫేన సదృశములై జిలుగుల తళుకు మనునవి నచ్చలేదన్నది. మిలమిలలాడు మడతల కులుకులీను అంబరములు గని పెదవి విరచినది. ఎట్టకేల కామె బంగారువన్నె ఆంతరీయము ధరించినది. వివిధవర్ణ సురేంద్రచాప సౌందర్యముగ సుచేలకము కటిభాగ మలంకరించినది. రత్నతారకలు పొలుపారు సువర్ణమేఖల నొయారంబుగ నెన్నడుము క్రింద మొలనూలు తాల్చినది. వక్షోపరిసానువుల మేఘ మాక్రమించునట్లు ఆచ్ఛాదనోత్తరీయము నీలరుచుల వెలుగుగా సొబగుచేసినది. తుల్యరహిత హారపంక్తులు ఎత్తుపల్లముల ప్రవాహములుగా రచించినది. చంద్రబింబముపై రోహిణివలె రోహితలలాటికము తాల్చినది. వేణీభరమును ఆంధ్ర స్త్రీ లెప్పుడు నూహింపజాలని విధమున రచింపించుకొన్నది. వేణీరచయితలు మార్జనికలు, అలంకారికలు ఆమె యలంకారమగునప్పటికి నలిగిపోయినారు.

హిమబిందు ఠీవితో నొరులకడ గంభీరతవహించి సంచరించినను, చనవున్న వారికడ లో నడంగియున్న బాలికానందము మఱుగపరచలేదు. చంటి పిల్లవలె గంతులు వేయును, కలకల నవ్వును, ఆటలాడును. చిరు గాలులవలె సంతోషముమై సంచరించును, నెచ్చెలులతో హాస్యమాడును. చిన్నతనమునుండియు పిల్లలులేని చారుగుప్తుని కొమారిత బాలునివలె పెరిగినది. బాలికా విద్యతోపాటు బాలుర విద్యలును నేర్చినది.

నాల్గు ఉత్తమాశ్వములు పూన్చినరథము తెల్లకంబళి ఛత్రముగా గప్పబడినది. చిత్రశిల్ప కౌశల్యము కలిగి మెరుగులీనునది, ధర్మనంది మహాభవనముకడ ఆ సాయంకాలము పదమూడవ మూహూర్తనాదము పట్టణములో ననేక ప్రదేశముల ప్రతిధ్వనించునప్పటికి వచ్చి యాగెను. అందు స్త్రీ జనముండిరని తెలియుట తోడనే లోనుంచి పరిచారికలు వచ్చి వారి నెదుర్కొనిరి. తోరణముకడ మహాలియు, శక్తిమతియు ఎవరు? వీరా! యని యాశ్చర్యమందుచు ఎదుర్కొని తెలిసికొనిరి. సేవకురాండ్రు రజత పాత్రంబుల సుగంధజలంబుల నర్పించ కాళ్ళుగడిగికొని లోనికిపోయిరి. పరిచారికలు శుభ్రవసనముల వారిపదము లద్దిరి.

వారందరు అభ్యంతరమందిరములకు పోయిరి. అచ్చట సుఖాసీనయై వివిధవార్తల ముచ్చటించుకొనిరి. కొమార్తెను తలంచుకొని ముక్తావళీ వాపోయెను. అందరును కండ్లనీరు పెట్టుకొనిరి. ముక్తావళీదేవి శక్తిమతిని పిల్లలెంతమందియని యడిగెను. ఏమి చేయుచున్నారనెను. వారిరువురు యెరిగియున్న కాంతలగూర్చి మాట్లాడిరి. ఈలోన సిద్ధార్థినిక వీరువచ్చిరని అక్కతో అన్నతో చెప్పుటకుపోయినది. నాగబంధునిక సత్వరము వచ్చి హిమబిందును కలసికొన్నది. హిమబిందును నాగబంధునికయు నెయ్యముతో ముచ్చటించుకొనిరి, నవ్వుకొనిరి. నాగబంధునికకు హిమబిందు నే డేల యింత విచిత్రముగ, యింత సౌహార్ధముగ తమయింటికి వచ్చి తనతో మాట్లాడుచున్నదో అర్థమైనది.

అందరును ఇల్లు చూచుటకు బయలువెడలిరి. వైభవమునకు, వైశాల్యమునకు, ఔన్నత్యమునకు చారుగుప్తుని మహాభవనముతో ధర్మనంది సౌధము సరిపోకపోయినను సౌందర్యమునకు దానితో నేమాత్రము తీసిపోదు సరిగదా మించియుండును. హిమబిందు కళానిధి యగుట నా మందిరములు చూచి ఆనందించెను. ముక్తావళీదేవియు, అమృతయు, శక్తిమతియు వెనుకబడుటచే నాగబంధునికయు, హిమబిందు ముందుబోయిరి. హాస్యములాడుచు కెవ్వున నవ్వుకొనిరి. చప్పట్లు కొట్టుకొనిరి. అట్లా మందిరము లన్నియు తిరిగి బాలికలు సిద్ధార్థినికతోకూడి తోటలోనున్న శిల్పమందిరమునకు జనిరి. అచ్చటి మహా శిల్పభవనములు విశ్వబ్రహ్మలోకములే! ఆ మందిరముల ఎన్ని సభాభవనములున్నవో వారు విభ్రమమంది గమనించ లేకపోయినారు.

ఆ విశాల శిల్పశాలలలో స్తంభములు గుండ్రముగ నునుపులైన పద్మశిరోపరి భాగముల పటములను మోయుచున్నవి. స్తంభములపై, పటములపై, చిత్రికలపై చిత్రలేఖనములు సహస్రమూర్తియుతములై, వివిధ వర్ణికాభంగసమ్మోహనములై, లలితాంగహారాంకితములై, సకలచిత్రలేఖన కళాలంకారశిల్పరూప మృగ్రపక్షితరులతా పుష్పసమన్వితములై, రసజ్ఞుల వివశులచేయుచున్నవి.

ఆ మందిరముల ఎందరో విద్యార్థులు పనిచేయుచున్నారు. చిత్రములు లిఖించుచున్నారు. రాళ్ళు సరిచూచుచున్నారు. శిల్పకర్మకు ఉచితములైన శిలల శాస్త్రవిధానమున సరిచూచుచున్నారు, చెక్కుచున్నారు. కొలతలు చూచుచున్నారు. నునుపు చేసిన రాలపై చెక్కుటకు బొగ్గుచే రూప విన్యాసము చేయుచున్నారు.

ధర్మనందులవారు కొందరి శిల్పముల సరిచూచుచున్నారు. సరియైన రాల నేరి పరీక్షించుచున్నారు. విన్యాసములు సరియై యున్నదియు లేనిదియు కనుగొనుచున్నారు. కొందరికి శాస్త్రమునుండి సూత్రముల వివరించి, ఇది యిట్లు, అది అట్లు అని చెప్పుచున్నారు.

అతిథులై వచ్చిన యా ఉత్తమాంగనల తనభార్య కొనిరా ధర్మనందియు, బాలకులు లేచి నిలుచుండి వారికి గౌరవమొనర్చిరి.

ఆ బాలకులందరు హిమబిందు అందము చూచి, పనిమాని గురువుగారు చెంతనున్న మాటయే తలపక తదేకదీక్షతో నామెవంక చూడసాగినారు. ఈ దృశ్యము చూచి ధర్మనందియు నాశ్చర్యమందెను.

హిమబిందు తనముత్తవ మేనత్తలతో బాటా శిల్పపుంబనుల గమనించి యాశ్చర్యమందినది. లోన ఉబుకు ఆరాటమునకు కారకుడైన విజయి యగు నా బాలశిల్పి యేడి యని యాశ్చర్య మందినది. సిద్ధార్థినిక ఆ బాలికతో నడుచుచు తనతోటలో నున్నాడని చెప్పినది.

వారంద రా మందిరములలోని అనేక స్థితులలో నున్న శిల్పము, చిత్రలేఖనము లన్నియు తోటలో పరిశీలించినారు. ఆ మందిరములనుంచి వినిర్గమించి వేరొకచోట నున్న సువర్ణశ్రీ శిల్పమందిరములు చూడ బోయిరి.

అచ్చట హిమబిందునకు పరవశత్వమే కలిగినది. ఏమి ఈతని పనితనము! అవి అతని శిల్పములా, అవి చిత్రలేఖనములా!

అదేమిటి! ఆ గోడపై త్రిభంగిగా నిలుచుండిన బాలికామూర్తి ఎవరు? తానే! తా నేల? ఓహో! అందరును ఆ బొమ్మను గుర్తించిరి. హిమబిందును చిత్రలేఖనముగా రచించుట సువర్ణశ్రీ కేమి యవసరము? అని ముత్తవ ముక్తావళి అనుకొన్నది. ఎంత అందముగా నున్నదా బొమ్మ! అచ్చముగ హిమబిందు. ఆమెను అచ్చట నొక దేవీమూర్తివలె రచించినా డీ బాలుడు.

అమృతలతాదేవికి తన మేనకోడలిని ఈ బాలకుడిట్లు లిఖించుట ఇష్టము లేకపోయినది. హిమబిందు పొందిన ఆశ్చర్యమునకు మేరయేలేదు. ఎందు కీ బాలుడు తన చిత్రము లిఖించినాడు? ఎంత పనితనము! ఏమి యా చిత్ర చమత్కృతి! ఆ వస్త్రాదికములు, ఆ నగలు పందెముదినమున నాట్యసమయమున తాను ధరించినవే.

ఆమె హృదయము రాగములు పాడినది. అమృతలత అందరిని ఆలస్యమైనదని కేకలువేయుచు త్వరితముగ బయటకి కొనివచ్చినది. హిమబిందున కెంతమాత్ర మట్లు పోవుటకు ఇష్టములేదు.

సువర్ణశ్రీ యెచ్చటను కనబడడేమి? దాగుకొనినాడా ఊర లేడా? ఎక్కడికైన ప్రయాణమై పోయినాడా? ఆమెకు ఆరాటము ఇనుమడించినది. ఒక అదనున ఆమె సిద్ధార్థినికను “మీ అన్న యేడి?” యని చెవిలో రహస్యమున నడిగినది. సిద్ధార్థినిక పరుగెత్తిపోయి హిమబిందును, ఆమె చుట్టములును, వచ్చినారని అక్కతో చెప్పుటకు వేగమున వెళ్ళినప్పుడు కృష్ణాతీరమున వారిరువు రుండుట చూచి యక్కడకు బోయి యక్కతో చెప్పి పంపించి మరల తాను వచ్చినది. అన్న అక్కడ యుండు ననుకొని ఇప్పుడు నామె యచ్చటకు బోయినది. అత డక్కడ లేడు.

తోటయంతయు వెదకినది. తోటమాలీల నడిగినది. వారిచే వెదకించినది. తన భవనముల వెదకినది. సేవకులచే వెదకించినది. సువర్ణశ్రీ ఎచ్చటను లేడు. ఏమైపోయినాడు?

ఆమెవచ్చి హిమబిందు చెవిలో అన్న ఎచ్చటకో పోయినాడని చెప్పినది. హిమబిందునకు ఆశ్చర్యము, కోపము, విసుగు, విచారము వచ్చినవి.

ఇంక నామె కేమియు తోచలేదు. తొందర తొందరగ అన్నియు చూచుట ముగించి “వెళ్ళెద” నని శక్తిమతితో నామె యనినది.

నాగబంధునికయు, శక్తిమతియు వారిని ఇంకను ఉండుడని కోరిరి. ముక్తావళీదేవి శక్తిమతితో నింతవరకు తనతనయను గూర్చి ఎన్నియో చెప్పి వాపోయినది. ఆమె కన్నుల అశ్రుధారలు ప్రవాహములై పోయినవి. శక్తిమతియు దన స్నేహితురాలి సుగుణముల వేనోళ్ళ పొగడుచు కన్నుల నీరునిండ విచారించినది. అందరికిని అశ్రుధారలు వాకలైనవి.

అమృతలతాదేవి వేగిరముచేయ వారు మువ్వురును బాలనాగియు బయలుదేరిరి.

కస్తూరిచే సమ్మిళితమగు కుంకుమబొట్టు శక్తిమతీదేవి ముక్తావళీ దేవికిని, హిమబిందునకును మోమున నుంచినది. నాగబంధునిక వారి పాదములకు లత్తుక నలదినది.

పద్మరాగమున నెఱ్ఱవారి, చిరుతామర మొగ్గలరీతి మంజులములై ఆర్ధ్రములై నవకంబులీను వేళ్ళతో, ముక్తావళి హిమబిందుల ఇరువురి పాదంబులు తన చేతికాంతులతో వియ్యమొందునప్పుడు నాగబంధునిక ఆపాదద్వితీయ సౌందర్యమునకు నాశ్చర్య మందినది. హిమబిందు పాదములు తన యన్నగారి శిరస్సును, సత్యాదేవి పాదములు శ్రీకృష్ణుని శిరస్సునువలె తాడన మొనర్ప తగునని యామె యాలోచనల మునింగినది.

గంధ మలంది, సువాసనద్రవ్యము లర్పించి, చూతఫలములు, నారంగములు, ఖర్జూరములు, దాడిమాదిఫలములు, బాదమిపప్పు, చారపప్పు మొదలయిన పప్పులు; లవంగ, దాల్చిన, ఏలకీ, జాజి, జాపత్రి మొదలయిన సువాసనద్రవ్యములు, సుందర వస్త్రములు ముక్తావళీ హిమబిందులకు శక్తిమతీదేవి యర్పించినది. సిద్ధార్థినిక లోనికిపోయి అయిదు లిప్తలలో పరుగునవచ్చి హిమబిందునకు సువర్ణపాత్ర నొకటి అత్యంత మనోహర శిల్పవిన్యాసము కల దానిని తన తండ్రిగా రిమ్మనినారని చెప్పుచు సమర్పించినది. ఆ పనితనమునకు ఆ బాల ఎంతయో ముదమందినది.

వారందరు తమ స్యందన మారోహించి తమ భవనమునకు బోవుచుండ హిమబిందున కేమి తలంపు కలిగినదో, “అమ్మమ్మా, మహాచైత్యమునకు బోయి, ఆరాధన చేయవలె” నని యన్నది. ఆ మాటలకుముత్తవ ప్రతి అడకుండగనే సూతునకు రథము మహాచైత్యముకడకు పోనిమ్మని ఆజ్ఞ యిచ్చినది.

ఏ మథురభావఫలశ్రుతి నాశించి హిమబిందచ్చటకు పోగోరెనో అది అచ్చటనే ఆమెకు సిద్ధించి సువర్ణశ్రీ దర్శనమిచ్చినాడు. అది ఏమి విచిత్రమో తన కాతడు మోకరిల్లినాడు.


***