హిమబిందు/ప్రథమ భాగం/29. తల్లి అనుమతి

వికీసోర్స్ నుండి

భార్య దివంగతురాలైన రెండవసంవత్సరమున అమరనంది, ధర్మనంది ఇరువురు ఇదివరకున్న ఆమె ప్రతిమల విమర్శించి, తమ స్మృతి శక్తిని సహాయముగొని ప్రజాపతి మిత్రను పద్మాసనాసీనగా, ప్రజ్ఞాపరిమితాదేవిగా నిండు బంగారు విగ్రహముగ పోతబోసినారు. విగ్రహము హిమబిందు పూజాగృహమున పూజాపీఠ మలంకరించినది.

హిమబిందుకుమారి దినదినము ఉదయముననే స్నానాదికము లాచరించి సర్వాలంకారయుక్తయై శుభ్రవసనముల ధరించి మాతృవిగ్రహమును పూజసేయును, తన హృదయమంతయు తల్లితో నివేదింపని దినమామెకు లేదు. పూజయంతయు సలిపి, ఒకనా డాబాలిక ఆ స్వర్ణదేవి కడ మోకరించెను. ఆమె రెండుచేతులు తల్లి బంగారు తొడలపైనిడి మోమామె పద్మాసనముపై నుంచెను.

“అమ్మా! పలుక వేమి?”

29. తల్లి అనుమతి

“అమ్మా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడనుండి వచ్చితివి. అక్కడికే పోయితివి. నన్ను నీ గర్భమున గంటివి. అంత చిన్నతనములో నన్ను వదలి మాయమైపోతివి.”

ఉత్కృష్టశిల్పరూపమగు ఆ జాంబూనద విగ్రహము హిమబిందు మాటలకు ఏమి ప్రతి వచింపగలదు!

హిమబిందునకు చిన్నతనముననుండియు దూరమున తోచు ఏదియో ఆశ. అది ధనము కాదు, సంపదకాదు, వైభవముకాదు. మహారాణులు కనీ విని యెరుగని నగలామె మందసముల నున్నవి. మానవమాత్రు డూహింపజాలని విచిత్రవస్త్రాదికము లామె పేటికలలో పాముకుబుసములై, పలుచని మబ్బుల మడతలై, పుష్పపుటములై, స్వప్నములై, శ్రీమద్రామాయణ శ్లోకములై జాలువారుచున్నవి. చారుగుప్తు డాబాలిక ఊహకందని పూవుజాతులు దేశదేశమునుండి సేకరించి క్రీడావనముల పెంచుచున్నాడు. అవి జపాకుసుమజాతులు, ఇవి నీలనదీతరంగడోలార్ధ్ర సహస్రదళకమలములు. ఇవి మల్లికలు, అవి సంపెంగలు. ఇవి శేఫాలికలు, అవి కబంధములు. అక్కడ సూర్యకాంతములు, ఇచ్చట పారసీకమునుండి వచ్చిన గులేబకావళులు. ఇవి సంపూర్ణదాడిమీ పుష్పములు, అవి చీనాదేశమునుండి వచ్చిన అరుణచేరులు. ఇచ్చట కరవీరములు. అవి నాగ లింగములు, ఇవి వకుళములు. ఇవి మాలతీలతలు, అవి మాధవీలతలు.

తన చెలులకు పుష్పవనవాటులు చూపి హిమబిందు పొంగిపోయెడిది. పదునేడేండ్ల మిసిమి వయస్సున నున్న హిమబిందునకు నేడు పుష్పవనవాటులు, నగలు, నాణెములు, ఆటలు, పాటలు ఆనందము సమకూర్చ లేకపోయినవి.

ఒకప్రక్క ఆప్రొదితీదేవి భౌతికవాంఛలు, గాఢకాంక్షలు, ఉడుకు రక్తములు, తీరని కోర్కెలు ఆమెకు వరమిచ్చినది. వేరొకప్రక్క సాధుమూర్తియై చతుర్విధ పురుషార్థ ప్రదాయినియైన మాయాదేవి శాంతమును, శ్రద్ధాభక్తులను అరణమిచ్చినది. ఈ రెండు మహాశక్తులు చిన్ననాటనే ఆమెకు తెలియక ఆమెలో మహత్తరగంభీర సుడిగుండముల జన్మింపజేసినవి. ప్రేమయన నెట్టిదో యెరుగని మొదటిదినాలలో తాను సమవర్తిని ప్రేమించితి ననుకొన్నది. ఆమెకు ప్రేమోదంతములు రహస్య కాంక్షలు అవ్యక్తాందో ళనమును కలిగించెడివి. గ్రీకు బాలికలు పురుషవాంఛలు తీర్చు దివ్యసౌందర్య మూర్తులు. పొంకములు తిరిగిన వారి యవయవముల ప్రత్యణువు పురుషస్పర్శ కాంక్షించును. భారతీయ బాలికలు పురుషులను ఉత్తమపథాలకు నడుపుకొని పోవు దేశికలు. ఇట్లు గ్రీకు యువతీ గాఢకాంక్షలు భారతీయాంగానాశేముషీసంపన్నతయు, స్వాతంత్ర్య భావ జనిత గాఢాభిలాషయు ఆమె హృదయ పథముల ప్రతిస్పందనము కలుగ జేయుచునే యున్నవి.

ప్రజాపతిమిత్ర పూర్ణభారతీయాంగన. ముక్తావళి పెంపుడు భారతీయ లలన. అయినను ఆమె యవనస్త్రీయే.

హిమబిందు తనకు తెలియరాని ఆవేదన తన్ను పొదివికొనినప్పుడు చిన్నతనములో తల్లికడకు పర్వెత్తి, ఆమెఒడిలో తలదూర్చి వెక్కివెక్కి ఏడ్చునది. ఆ అతిలోక సుకుమారాంగి తన కొమరిత మూర్ధము పై చేయి నిమురగనె హిమబిందున కారాటము తీరిపోయి ఏదియో దివ్యానందము ముంచి వేయునది.

నే డా బాలిక తల్లికడకు పర్వెత్తినది. తల్లి సువర్ణవిగ్రహము. హిమబిందు ఆ తల్లి వక్షమున మోమును పొదివికొని “అమ్మా! నా కీవేదన ఏమిటే? నాయనగారిని ఓడించి దేవతామూర్తివలె ఆ యువకుడు విజయసింహాసన మధిష్టించియుండ నేను వెఱ్ఱిదానివలె అతనిచుట్టు నాట్యముచేసితిని. అది తప్పా అమ్మా!” అని వాపోయెను.

ఆ బాలిక కన్నుల గిర్రున నీరు తిరిగిపోయినది. మోమెత్తి తల్లి మోమును చూచుచు “నాకిట్లు ఆతనిచూడ యీ విపరీతపుకోర్కెలేమి అమ్మా! ఆతని చూడకపోయిన నేను బ్రతుకలే నను భయము కలుగుచున్నది. అది తప్పు కాదూ? ఏమియో నాయనగారి ఆలోచనల కాతడు అడ్డమువచ్చినాడని నా నమ్మకము. అమ్మా, అతని గురించి ఆనాటి నుండియు నే నాలోచింపని క్షణ మొక్కటియు లేదే! అది ఎంత తప్పు!”

మరల హిమబిందు కన్నులనుండి ముత్యములు స్రవించి, కరిగి పాటలములగు ఆమె కపోలములనుండి దొర్లిపోయినవి.

“నే నేమిచేయవలెనో చెప్పవా అమ్మా?” తల్లి ముఖమును తదేక దీక్షతో చూచు ఆ బాలికకు ఆ విగ్రహము పెదవుల కదిపినట్లు తోచినది.

“నీవు పో తల్లీ, అంతయు శుభము జరుగగలదు” అని తనతల్లి చెప్పినట్లమెకు స్పష్టముగ కాకలీస్వనములు వినబడినట్లయినది.

మరుసటి క్షణమున ఆ బాలిక గంతువైచి లేచి మాతృవిగ్రహమునకు సాష్టాంగనమస్కృతులిడి కలకలనవ్వులు పూలగుత్తులవలె యామె మోమున ప్రత్యక్షముగా నాట్యమాడుచు పూజాగృహమును వీడి, “బాలనాగీ” యని కేకలువేయుచు పర్వెత్తినది.

ఒక్కచిటికెలో బాలనాగి వచ్చి యెదుట నిలిచినది.

“మా అమ్మమ్మ ఎక్కడ నున్నదే?” అని హిమబిందు అడిగినది.

“భోజన మైనప్పటినుండియు వారు విశ్రమించియున్నారు” అని బాలనాగి యుత్తరమిచ్చినది.

హిమబిందు విసవిస తన ముత్తవ గదిలోనికి పోయినది. ఆమె యప్పుడే లేచి మొగము కడుగుకొనుటకు స్నానగృహమునకు చనినది. హిమబిందు బాలనాగి వెంటరా నా గృహంబునకు పోయినది. ముక్తావళీదేవి పన్నీట మొగము కడుగుకొని పరిచారిక లందిచ్చు శుభ్ర వసనములచే తుడుచుకొనుచు నొక పీఠముపై నధివసించియుండెను. ఆమె మాటలలో యవనాపభ్రంశోచ్చారణ కొంచెము కానవచ్చుచుండును.

“అమ్మమ్మా, అమ్మమ్మా” అని ఇంతలో హిమబిందు వచ్చినంతట మొగము తుడుచుకొను వస్త్రము తీసి ముక్తావళీదేవి మనుమరాలిని చూచి....

“అమ్మడు! ఇదేమి? యిటుల వచ్చితివి? ఆ పరుగులేమి? నీవెప్పుడును అల్లరిపిల్లవు. నీకు ఒక్కక్షణము నిలకడలేదాయెను. ఏ మంత తొందర” యని ప్రశ్నించినది.

హిమ: అమ్మమ్మా, నీవు శక్తిమతీదేవిని ఎరుగుదువా?

ముక్తా: ఎరుగుదునమ్మా. నా కన్నతల్లియు, ఆమెయు చిన్నతనమున అతి స్నేహమున మెలగువారు. వారిరువురకు సంగీతమున, నాట్యమున, సాహిత్యమున గురువులందరు నొకరే. శక్తిమతియింటికి నా కన్నతల్లి పోవునది. మా యింటికి శక్తిమతి వచ్చునది. అవియన్నియు యెప్పటికిని మఱపురావు.

ముక్తావళి కన్నులనీరు గిఱ్ఱున తిరిగినది. ముక్తావళీదేవి కిప్పుడు యేబది తొమ్మిది సంవత్సరములు మాత్రమే యెనను, తలయంతయు కొమరితపోయిన గాఢవిచారమున ముగ్గుబుట్టవలె నెరసిపోయినది.

హిమ: అమ్మమ్మా, యీ దినమున మన మా శక్తిమతీదేవిగారి యింటికి పోవలెనే. వారి అమ్మాయి నాగబంధునికయు, నేనును చదువుకొంటిమి. శక్తిమతీదేవిగారి భర్త నెరుగుదువా?

ముక్తా: ఆ, ఎరుగ కేమి తల్లీ! ధర్మనందులవారు మహోత్తమ శిల్పి. మా గ్రీసుదేశపు శిల్పములకన్న వీరిశిల్పములం దేదియో విచిత్రత, ఏదియో మహోన్నతి నాకు తోచును.

హిమ : అవి అన్నియు చూడవలెనే.

ముక్తా: తల్లీ! యీ మూడేండ్లనుండియు ఎచ్చటికైన కదలుచుంటిమా మనము?

హిమ: అమ్మమ్మా, మనము వెళ్ళితీరవలెను. నాకు అమ్మజ్ఞాపకము వచ్చి ఈ దినమున అతి బెంగచే బాధపడిపోయినాను. మన మెక్కడి కైనను వెళ్ళకపోయినచో నాకు మతియే పోవును.

ముక్తావళి హృదయమున గజగజలాడి “అలాగునే అమ్మా. అమ్మాయి అమృతలతకు వార్త పంపెదను, మీ తాతగార లిరువురును సంఘా రామము విడిచి రారాయెను. అన్నగారు వినయగుప్తులవారు బౌద్ధ దీక్ష తీసికొనెదరని అందరును చెప్పుకొనుచున్నారు. ఈ దినము సాయంకాలము మనము మువ్వురము బాలనాగిని తీసికొని శక్తిమతీ దేవిగారి యింటికి పోదములే” అన్నది.

30. శిల్పసందర్శనము

హిమబిందు కేలనో భయము వేసినది. ఏమియు తోచదు. అలంకారికురాలగు తారాదత్తను పిలువనంపి తనకున్న మంచివస్తువులను, వస్త్రములను తీయుమన్నది. పాము కుబుసములబోలు సన్నని దుకూలములు చిత్రచిత్రవర్ణములు జెలువొందినవి యామె దూరముగా ద్రోచినది. వలిపెములు సముద్రవీచికాఫేన సదృశములై జిలుగుల తళుకు