సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/డా. భీమ్‌రావ్ అంబేద్కర్

వికీసోర్స్ నుండి

భారతరత్న అవార్డు పొందిన భారత రాజ్యాంగశిల్పి

డా. భీమ్‌రావ్ అంబేద్కర్

భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.


బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.

లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన, రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించిన వాడు అంబేద్కర్. జననం 1891 ఏప్రిల్ 14న. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.

మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్‍కు రాలేకపోయారు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్‌రావ్ ను అవమానాలకు గురిచేశారు.

రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్ధి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు.

పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్ధిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడినది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది. మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు!

కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు.

32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు.

1927లో మహద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండినది: అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.

1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. ' అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది.

1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.

1927 డిసెంబర్ 25న అంబేద్కర్ 'మనుస్మృతి'ని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కల్గించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అపుడపుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు, మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు.

1931లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశ సన్నాహాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నాడు. "ఏ దేశంలో లేదా ఏ మతంలో తమను కుక్కలకన్నా, పిల్లులకన్నా హీనంగా చూస్తున్నారో అదేశాన్ని గురించి తానే విధంగాను భావించలేను అంటూ గాంధీజీ, 'ఐ హేవ్ నో హోమ్ ల్యాండ్'"అని చాటి చెప్పాడు. ఆ తర్వాత రౌండుటేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లాడు.

1932లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించాడు. "మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు." అన్నాడు అంబేద్కర్.

కొన్ని సంవత్సరాలు అస్పృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.

టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నాడు.

అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది.

కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు.

హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు.

నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు.

అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి.

ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు.

మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశాడు.