సత్యశోధన/రెండవభాగం/12. భారతీయులతో పరిచయం

వికీసోర్స్ నుండి

12. భారతీయులతో పరిచయం

క్రైస్తువులను గురించి వ్రాసే పూర్వం అప్పటి నా యితర అనుభవాల్ని గురించి కూడా కొంచెం వివరిస్తాను.

నేపాలు రాష్ట్రంలో దాదా అబ్దుల్లా గారెంతో ప్రిటోరియాలో సేఠ్ తైయబ్ హాజీ ఖాన్‌గారంత. అందరికీ ఉపయోగపడే ఏ ధర్మ కార్యమైనా ఆయన లేకుండా జరుగదు. నేను అక్కడికి వెళ్లిన మొదటి వారంలోనే వారిని పరిచయం చేసుకున్నాను. “నాకు ప్రిటోరియా యందలి భారతీయులందరితోను పరిచయం పెంచుకోవాలని వున్నది. యిక్కడి హిందూదేశస్థుల ఆనుపానులు నాకు తెలుసుకోవాలని వుంది. అందుకు మీ సాయం కావాలి.” అని నేను అనగానే అన్ని విధాల సహకరిస్తానని మాట యిచ్చాడు.

భారతీయులందరినీ ఒకచోట సమావేశపరిచి వారి స్థితిగతులు వారికి అవగతం చేయడం అవసరమని నాకు తోచింది. సేఠ్ హాజీ మహమ్మద్ అను వారి పేరట కూడా నా దగ్గర పరిచయ పత్రం వున్నది. సభను సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటు చేశాం. సభికులంతా మేమన్ వర్తకులు. హిందువుల సంఖ్య బహు స్వల్పం ప్రిటోరియాలో స్థాయి గల హిందువులు మాత్రం వచ్చారు.

నా జీవితంలో యిదే మొదటి ఉపన్యాసం. ఆ ఉపన్యాసం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఉపన్యాసంలోని విషయం సత్యం. కాని వాణిజ్యంలో సత్యం నడవదు, అసంభవం అని కొందరు వర్తకులు నాతో వాదించారు. నేను అప్పుడు వారి వాదాన్ని విశ్వసించలేదు యిప్పుడూ విశ్వసించలేదు. సత్యం, వ్యాపారం రెంటికీ పొంతన కుదరదు. అనే వర్తకులు యిప్పటికీ పున్నారు. వ్యవహారం వేరు, ధర్మం వేరు యిదీ వారి వాదన. వ్యవహారమందు శుద్ధ సత్యం అశక్యం, యధాశక్తి సత్యమాడటం శక్యం అని వారి అభిప్రాయం. నేను నా ఉపన్యాసంలో యీ విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించి వాణిజ్య వేత్తలు రెండింతలు సత్య ప్రపర్తన గలిగి వుండాలని చెప్పాను. స్వదేశంలో కంటే విదేశంలో సత్య నిష్ఠ ఎక్కువగా వుండాలనీ, అందుకు విశేషకారణం వుందనీ, విదేశంలో కొద్దిమంది భారతీయుల అసత్య ప్రవర్తనను చూచి భారతదేశంలో గల కోటాను కోట్ల భారతీయులంతా యిదే రకమని యిక్కడి జనం భావిస్తారనీ, నొక్కి వక్కాణించాను. నేను తెల్లవారిని ఉదాహరణగా చెప్పి నల్లవారు ఎంత అశుచిగా వుంటారో, ఎంత దుష్టంగా ప్రవర్తిస్తారో వివరించాను. పారశీకులు, క్రైస్తవులు, మరాఠీ, గుజరాతీ, మదరాసీ, పంజాబీ, సింధీ, కచ్ఛీ, సూరతీ మొదలుగా గల భేదాలు మరిచిపొమ్మని ఉద్భోదించాను. ఒక సంఘాన్ని స్థాపించి, భారతీయులు పడుతున్న కష్టాల గురించి అర్జీలు పంపవలసిన అవసరం ఎంతైనా వుందని చెప్పి అట్టి సంఘంలో జీతం తీసుకోకుండా నేను పని చేస్తానని చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. నా ఉపన్యాసం సభను ఆకట్టుకొని ప్రభావితం చేసిందని గ్రహించాను. దానిపై చర్చలు జరిగాయి.

తమ తమ కష్టాల్ని చెప్పడానికి కొందరు ముందుకు వచ్చారు. నాకు కూడా ఉత్సాహం కలిగింది. వారిలో ఇంగ్లీషు వచ్చిన వారు కొద్దిమందే. యీ పరదేశంలో ఇంగ్లీషు రావడం అవసరమనీ, ప్రయోజనకరమనీ వారికి చెప్పాను. పెద్దవారైనా సరే చదువుకోవచ్చునని చెప్పి కొందరి పేర్లు ఉదాహరణగా పేర్కొన్నాను. మీరు ఇంగ్లీషు నేర్చుకొంటానంటే నేను బోధిస్తాను, మీకు తీరిక వున్న సమయం తెలిపితే నేనే స్వయంగా వచ్చి మీకు ఇంగ్లీషు నేర్పుతానని చెప్పాను. కొందరు నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. వారిలో యిద్దరు మహమ్మదీయులు. ఒకరు మంగలి, ఒకరు గుమాస్తా, మూడవ వాడు హిందువు. ఒక చిన్న దుకాణదారు. నేనందరికీ అనుకూలుడనైనాను. బోధన చేయగలిగాను. కాని నా శిష్యుల్లో కొందరు ఏమరుపాటు చూపించారు. కాని నేను మాత్రం ఓర్పుతో వ్యవహరించాను. వారి గృహాలకు వెళ్లాను. కాని వారికి సమయం చిక్కలేదు. ఇంగ్లీషులో పండితులు కావాలని వాళ్లకు కోరిక లేదు. అయినా యిద్దరు మాత్రం ఎనిమిది నెలలకు కొంత తేలారు. జమా ఖర్చులు వ్రాయడం, రాతకోతలు నేర్చారు. తన ఖాతాదారులతో కొంచెం ఇంగ్లీషుతో మాట్లాడగలిగితే చాలని మంగలి ఉద్దేశ్యం. వారిలో యిద్దరు ఇంగ్లీషు నేర్చుకొని ధనార్జన చేయసాగారు కూడా.

సభ వల్ల కలిగిన యీ ప్రయోజనం చూచి నాకు సంతోషం కలిగింది. అట్టి సభలు ప్రతి వారమూ ప్రతినెలా జరపాలని నిర్ణయం చేశాం. మొత్తం మీద మేమనుకున్నట్లుగా సభలు జరుగుతూ వున్నాయి. యీ సభలలో ఒకరి అభిప్రాయం మరొకరు తెలసుకోగలిగేవారు. యీ కారణం వల్ల ప్రిటోరియలో గల ప్రతి భారతీయునితో నాకు పరిచయం ఏర్పడింది. తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అందువల్ల యిక అక్కడ వున్న బ్రిటిష్ ఏజంటుతో పరిచయం పెంచుకోవాలని భావించాను, వారిని దర్శించాను. ఆయన పేరు జాకోబ్స్ డీనెట్. హిందూ దేశస్థులపై ఆయనకు మంచి అభిప్రాయం వున్నది. కాని అతనికి అక్కడ తగిన పరపతి లేదు. సమయం వచ్చినప్పుడు సాయపడతాను, అవసరం అయినప్పుడు వచ్చి నన్ను కలవమని ఆయన చెప్పాడు.

ఇక రైల్వే వారితో చర్చలు ప్రారంభించాను. మీ నియమాల ప్రకారం హిందువులకు కష్టాలు కలుగకుండ చూడమని వాళ్లను కోరాను. సరియైన వేష భాషలుంటేనే పెద్ద తరగతి టిక్కెట్లు యివ్వబడతాయని రైల్వే వారినుండి సమాధానం వచ్చింది. అయితే వీని వల్ల ప్రయోజనం చేకూరదు. వేష భాషలు సరిగా వున్నాయా లేదా అని నిర్ణయించే అధికారి ఎవరు? స్టేషను మాస్టరే అట్టి అధికారి. అందువల్ల ప్రయోజనం శూన్యం అని ప్రకటించాను.

హిందువులకు సంబంధించిన కొన్ని పత్రాలు బ్రిటీష్ ఏజంటు చదవమని నాకు యిచ్చాడు. ఇట్టివి కొన్ని తైయబ్జీ గారి దగ్గర కూడా నాకు లభించాయి. ఆరెంజి ఫ్రీస్టేటు నుండి భారతీయులు ఎంత నిర్దయగా వెళ్లగొట్టబడ్డారో ఆ కాగితాలు చదవడం వల్ల నాకు తెలిసింది.

ట్రాన్సువాలు ఫ్రీ స్టేటుల్లోని భారతీయుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సమస్తం నాకు బోధపడ్డాయి. వీటిని చదవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు.

ఆ ఏడు గడిచిన తరువాత, దావా వ్యవహారం తేలిపోగానే ఇంటికి వెళ్లాలని నా భావన. కాని దైవేచ్ఛ వేరుగా వుంది.