సత్యశోధన/నాల్గవభాగం/15. మహమ్మారి - 1

వికీసోర్స్ నుండి

15. మహమ్మారి - 1

మునిసిపాలిటీ వారు ఈ లొకేషను యాజమాన్యం పట్టా పుచ్చుకొని అక్కడ వుండే హిందూదేశస్థుల్ని వెంటనే తొలగించలేదు. వారికి అనుకూలమైన మరో చోటు చూపించాలి. వారు స్థలం నిర్ణయించనందున వెళ్ళమని చెప్పలేదు. తత్ఫలితంగా హిందూ దేశస్తులు ఆ ‘మురికి’ లొకేషన్‌లోనే వున్నారు. కాని రెండు మార్పులు జరిగాయి. హిందూ దేశస్థులు గృహయజమానులుగా వుండక, మునిసిపాలిటీ వారికి బాడుగ చెల్లించేవారుగా మారారు. దానితో లొకేషనులో మురికి బాగా పెరిగిపోయింది. మొదట హిందూ దేశస్థులకు యాజమాన్యం హక్కు లభించియున్నప్పుడు, ఇష్టం వున్నా లేకపోయినా భయం వల్ల పరిసరాలను కొద్దిగా శుభ్రంగా ఉంచుకొనేవారు. ఇప్పుడు మునిసిపాలిటీ వ్యవహారం కదా! ఎవరికీ ఎవరన్నా ఏమీ భయం లేదు. ఇండ్లలో కిరాయిదారులు పెరిగిపోయారు. వారితోపాటు మురికి, అవ్యవస్థ పెరిగి పోయింది.

ఇలా వ్యవహారం నడువసాగింది. ఇది చూచి హిందూ దేశస్థులకు భయం పట్టుకుంది. ఇంతలో భయంకరంగా ప్లేగు అంటుకుంది. అది ప్రాణాంతకమైన మహమ్మారి. ఊపిరితిత్తులకు సంబందించిన ప్లేగు, నల్ల ప్లేగుకంటే ఇది ప్రమాదకరమైంది. అదృష్టవశాత్తు మహమ్మారికి కారణం లొకేషను కాదని అందుకు కారణం జోహన్సుబర్గు సమీపంలోనున్న బంగారుగనుల్లో గల ఒక గని అని తేలింది. అక్కడ హబ్షీ శ్రామికులు ఉన్నారు. అక్కడి పారిశుధ్య బాధ్యత తెల్ల యజమానులది. ఈ గనిలో కొందరు హిందూ దేశస్థులు కూడా పనిచేస్తున్నారు. వారిలో 23 మందికి అంటురోగం సోకింది. ఒకనాటి సాయంత్రం భయంకరమైన ప్లేగు రోగంతో వారంతా లొకేషనులోగల తమ చోటుకు చేరుకున్నారు.

అప్పుడే భాయిమదనజీత్ ఇండియన్ పత్రికకు చందాదారుల్ని చేర్చడానికి చందాలు వసూలు చేయడానికి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆయన భయపడలేదు. ఆ రోగుల్ని చూచాడు. ఆయన గుండె దడదడలాడింది. పెన్సిలుతో వ్రాసి ఒక చీటీ నా దగ్గరికి పంపించాడు. అందులో ఇలా వ్రాశాడు. “ఇక్కడ హఠాత్తుగా నల్లప్లేగు అంటుకుంది. మీరు వెంటనే వచ్చి ఏమైనా చేయాలి. లేకపోతే భయంకరమైన పరిణామం ఏర్పడుతుంది. త్వరగా రండి” మదనజీత్ ఒక ఖాళీగా ఉన్న ఇంటిని నిర్భయంగా ఆక్రమించి ఆ రోగుల్ని అందులో చేర్చాడు. సైకిలుమీద నేను వెంటనే లొకేషను చేరాను. అక్కడినుండి టౌన్‌క్లర్కుకు జాబు పంపి ఏ పరిస్థితుల్లో ఆ గృహాన్ని ఉపయోగించవలసి వచ్చిందో వ్రాశాను.

డాక్టర్ విలియం గాడ్‌ఫ్రే జోహన్సుబర్గులో డాక్టరుగా వున్నారు. సమాచారం అందగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు. రోగులకు తానే డాక్టరు, నర్సు అయిపోయాడు. కాని 23 మంది రోగులకు మేము ముగ్గురం ఏం సరిపోతాం? ఇలాంటి సమయంలో మన విధానం సరిగా ఉంటే కష్టాల్ని ఎదుర్కొనేందుకు సేవకులు తప్పక లభించి తీరతారని అనుభవం మీద తెలుసుకున్నాను. నా ఆఫీసులో కళ్యాణదాసు, మాణిక్‌లాల్ మరియు మరో ఇద్దరు హిందూ దేశస్థులు వున్నారు. చివరి ఇద్దరి పేర్లు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేవు. కళ్యాణదాసును అతని తండ్రి నాకు అప్పగించాడు. అతని వంటి పరోపకారి కేవలం ఆజ్ఞను పాటించునట్టి వారు బహు కొద్దిమందే ఉంటారు. అదృష్టవశాత్తు కళ్యాణదాసు బ్రహ్మచారి. ఎంతటి ప్రమాదకరమైన పని అయినా అతనికి అప్పగించే స్థితిలో నేను ఉన్నాను. రెండో సజ్జనుడు మాణిక్‌లాల్. అతడు నాకు జోహాన్సుబర్గులో లభించాడు. అతడికి కూడా పెండ్లి కాలేదనే అనుకుంటాను. నాకు గుమస్తాలు, అనుచరులు, బిడ్డలు అన్నీవారే. ఆ నలుగురినీ హోమం చేసేందుకు సిద్ధపడ్డాను. కళ్యాణదాసును అడగనక్కరలేదు. మిగతావారు అడగగానే సిద్ధపడ్డారు. “ఎక్కడ మీరు వుంటే అక్కడ మేము ఉంటాం” ఇది వారు క్లుప్తంగా ఇచ్చిన సమాధానం.

మి. రీచ్ కుటుంబం పెద్దది. ఆయన స్వయంగా రావడానికి సిద్ధపడ్డాడు. కాని నేనే వారిని ఆపాను. వారిని ఈ ప్రమాదంలోకి నెట్టడానికి నేను సిద్ధం కాలేదు. నాకు ధైర్యం చాలలేదు. అయితే ఆయన బయటి కార్యమంతా చేసేందుకు నడుం బిగించాడు. ఆ రాత్రి సేవా శుశ్రూషల్లో గడిచింది. అది నిజంగా కాళరాత్రే. నేను చాలా మంది రోగులకు శుశ్రూష చేశాను. కాని ప్లేగు వాతపడిన రోగులకు శుశ్రూష నేనెన్నడూ చేసి యుండలేదు. డాక్టర్ గాడ్‌ఫ్రే ప్రదర్శించిన ధైర్యం మమ్మల్ని నిర్భయుల్ని చేసింది. రోగులకు సేవ ఎక్కువ చేయనక్కరలేదు. వాళ్ళకు మందు ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి పత్యపానాలు చూడాలి. వారు దొడ్డికి వెళితే ఆ మలం ఎత్తివేయాలి. ఇంతకంటే మించి పని లేదు. నలుగురు యువకులు నడుం వంచి చేసిన శ్రమ, వారి నిర్భీకత చూచి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

డాక్టరు గాడ్‌ఫ్రే, మదన్‌జీత్‌ల ధైర్యం మాట సరే. ఈ నలుగురు యువకుల ధైర్యం అద్భుతం. ఏదో విధంగా ఆ రాత్రి గడిచింది. నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఆ రాత్రి మేము ఒక్క రోగిని కూడా పోగొట్టుకోలేదు. కాని ఈ ఘట్టం ఎంత కరుణరసార్ద్రమైనదో, అంత మనోరంజకమైనది. నా దృష్టిలో ఇది ధార్మికమైనది కూడా.