సత్యశోధన/ఐదవభాగం/44. పూర్ణాహుతి

వికీసోర్స్ నుండి

44. పూర్ణాహుతి

ఇక యీ ప్రకరణాల్ని ముగించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ తరువాత నా జీవితం పూర్తి ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియని అంశం అంటూ నా జీవనంలో ఏమీ మిగలలేదు. 1921 నుండి జాతీయ కాంగ్రెసు నాయకులందరితో అమితంగా మమేకం అయిపోయాను. ఏమి రాయాలన్నా నాయకులకు సంబంధించిన ఘట్టాలను వర్ణించకుండా వుండలేని స్థితి ఏర్పడింది. వారితో నాకు బహు దగ్గర సంబంధం ఏర్పడింది. శ్రద్ధానంద్, దేశబంధు, లాలాజీ, హకీం సాహబ్ యిప్పుడు మన మధ్య లేరు. అదృష్టవశాత్తు యితర పలువురు నాయకులు మన మధ్య వున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన మార్పును గురించిన చరిత్ర యిప్పుడు వ్రాయబడుతూ వున్నది. నా ప్రధాన ప్రయోగాలన్నీ కాంగ్రెస్ ద్వారానే జరిగాయి. ఆ ప్రయోగాలను గురించి వ్రాయ పూనుకుంటే ఆ నాయకుల్ని గురించి వ్రాయక తప్పదు. శిష్టత దృష్ట్యా కూడా ఆ విషయాలను యిప్పుడు వ్రాయలేను. యిప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలను గురించిన నా నిర్ణయాలు నిర్ణయాత్మకాలుగా పరిగణింపబడవు. అందువల్ల ఈ ప్రకరణాలను తాత్కాలికంగా ఆపివేయడం అవసరమని భావిస్తున్నాను. నా కలం యిక ముందుకు సాగనంటున్నది అని చెప్పగలను. పాఠకుల దగ్గర సెలవు తీసుకోవలసి వచ్చినందుకు విచారంగా వుంది. నా ప్రయోగాలకు నా దృష్టిలో అమిత విలువ వుంది. వాటిని యధాతధంగా వర్ణించకలిగానో లేదో నాకు తెలియదు. యదార్ధ చిత్రణ చేయాలని నా మటుకు నేను అమితంగా కృషిచేశాను. సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో, ఏ రూపంలో చూచానో, ఆ రూపంలో దాన్ని వివరించడానికి సదా ప్రయత్నించాను. యీ ప్రయోగాల వల్ల పాఠకుల మనస్సులో సత్యము, అహింసల యెడ అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం. సత్యంకంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు. సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం. ఈ విషయం ఈ ప్రకరణాల ప్రతి పేజీలో వెల్లడికాకపోతే నా కృషి అంతా వ్యర్థమేనని భావిస్తున్నాను. ప్రయత్నాలు వ్యర్థం కావు కదా! నా అహింస సత్యమయం అయినా అది యింకా అపూర్ణమే, అపరిపక్వమే. వేలాది సూర్యుల్ని ప్రోగుచేసినా, సత్యమనే సూర్యుణ్ణి చూడలేము. అంత తీక్షణమైనది సత్యం. అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శించవచ్చు. అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యంకాదు. ఇప్పటివరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల నాధారంగా చేసుకొని ఈమాట చెబుతున్నాను. ఇట్టి వ్యాప్తి చెందిన సత్యపారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవిని, ప్రతిప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం. అట్టి అభిలాషగల మనిషి జీవన స్రవంతికి దూరంగా వుండలేడు. అందువల్ల సత్యారాధనయే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికీ సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని గట్టిగా చెప్పగలను. అలా చెప్పడం అవిధేయత కానేరదు. ఆత్మశుద్ధి లేనిదే ప్రతి జీవితో సమైక్యత ఏర్పడదు. ఆత్మశుద్ధిలేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అశుద్ధాత్మ పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవన నగరంలో ప్రతిభాగము పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇట్టి శుద్ధి సర్వులకు సాధ్యమే. వ్యష్టికి సమిష్టికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వున్నది. ఒక వ్యక్తి యొక్క శుద్ధి అనేకుల శుద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా ప్రయత్నించగల శక్తి సామర్థ్యాలను సత్యనారాయణుడు సర్వులకు పుట్టుక నుండి ప్రసాదించాడు.

అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకా అందుకోలేదు. ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు. అట్టి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులో గల వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. హిందూ దేశానికి వచ్చిన తరువాత కూడా నా మనస్సులో గల వికారాలను చూచాను. చూచి సిగ్గుపడ్డాను. కాని ధైర్యం మాత్రం సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను. యిప్పుడూ పొందుతూ వున్నాను. కంటకావృతమైన మార్గం దాటవలసియున్నదని నాకు తెలుసు. అందు నిమిత్తం నేను శూన్యుణ్ణి అయిపోవాలి. మానవుడు తన యిష్టప్రకారం అందరికంటే వెనుక తనను నిలబెట్టుకోవాలి. అందరి కంటే తాను బహుతక్కువ వాడనని భావించాలి. ఆ స్థితికి చేరుకోనంతవరకు ముక్తి పొందలేడు. అహింస వినమ్రతకు పరాకాష్ట. వినమ్రతను అలవరచుకోనిదే ఏ కాలంలోను ముక్తి లభించదని అనుభవం మీద చెబుతున్నాను. అట్టి వినమ్రత కోసం ప్రార్థిస్తూ, అందుకు విశ్వసహాయాన్ని యాచిస్తూ ఈ ప్రకరణాలను ముగిస్తున్నాను.


* సమాప్తం *