Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనితల్లి

వికీసోర్స్ నుండి

అనితల్లి  : కాకతీయ సామ్రాజ్య పతనానంతరము యవనఫ్లావితమైన ఆంధ్రావనియందు, ఆంధ్రసంస్కృతిని తిరిగి కొంతకాలము విలక్షణముగ నిలువగలిగిన వారిలో రెడ్డిరాజు లొకరు. ఈ రెడ్డిరాజ్యయుగమునందు ఆర్య ధర్మములను పోషించినవారు ప్రభువులగు రెడ్డివీరులే. రెడ్డి వీరుల రాణులు సయితము ధర్మసంస్కృతి సంస్థాపన యందు భాగస్వామినులై పేరొందిరి. వీరిలో పెద్దకోమటి వేమారెడ్డి భార్యయగు సూరాంబయును వేమాంబిక, మల్లాంబ, అనితల్లి అనువారలు పేర్కొనదగినవారు. అనితల్లి అల్లాడ వీరభద్రారెడ్డి రాణి. ఈమె పుణ్య గుణాభిరామ యని కీర్తి కాంచినది. సాహిత్యశౌర్య సంపద్రాశి యగు కాటయ వేమా రెడ్డికిని, కుమారగిరి రెడ్డి సోదరి యగు దొడ్డాంబికకును కూతురు. కాటయవేమునకు రాజ్యము పత్య్రముగా సంక్రమించినది కాదు. అది భార్యయగు దొడ్డాంబిక మూలమున అరణముగ లభించెను. కావున ఆ రాజ్యము అనితల్లికిని ఆమెమూలమున ఆమెభర్త యగు అల్లాడ వీరభద్రా రెడ్డికిని సంక్రమించినది. మహాకవి శ్రీనాథ విరచితమగు కాశీఖండమునందు ఈమె సాక్షాదిందిరాదేవతగ కీర్తింపబడినది. "అనితల్లి స్వనితామతల్లి నుదయాస్తాద్రీంద్ర సీమావనీ, ఘనసామ్రాజ్య సమర్థనా ప్రతిమ పాక్షాదిందిరా దేవతన్"

సచ్చరిత్ర యగు ఈ అనితల్లి ధర్మానుర క్తయై అనేకములగు వితరణములను గావించెను. అందు ముఖ్యముగ పేర్కొనదగినది 'కలువచెరువు' అను గ్రామదానము. ఈమె కలువచెరువు అను గ్రామమును పరహిత చార్యుడు అను పరహితపరాయణుడగు వైద్యవ రేణ్యునకు క్రీ. శ. 1345వ సంవత్సరమున శ్రావణ బహుళ అష్టమీదినమున దానముగావించి వైద్యవృత్తిని పోషించెను. ఈ దాన సందర్భమున వ్రాయబడిన శాసనమే నేడు చారిత్రకముగ ప్రసిద్ధివహించినది. ఈ శాసనము బయలు వెడలుటకు పూర్వము రెడ్డిరాజులందు, మీదుమిక్కిలి రాజ మహేంద్రవర రెడ్డిప్రభువులను గూర్చి కొంత పొరబడుట సంభవించెను.

ఈ శాసనమువలన రాజమహేంద్రవరమును పాలించిన ప్రథమ ప్రభువు అల్లాడ రెడ్డి కా డనియు, కాటయ వేముడే అనియు తేటపడుచున్నది. కాటయ వేముని యొక్కయు అతని కుమారుడగు కుమారగిరి యొక్కయు మరణానంతరము దేశము "కునృపతి జలరాశి మగ్నము" కాగా, కాటయవేముని బంధువగు అల్లాడ రెడ్డి రాజ్యము నుద్ధరించి, కాటయవేముని కూతురగు అనితల్లికి పట్టము కట్టినట్లు తెలియుచున్నది.

అనితల్లి కలువచేఱు శాసనమువల్లనే ప్రతాపరుద్రుడు విధివశమున బందీకృతుడై ఢిల్లీకి తీసికొనిపోబడక పూర్వమే సోమోద్భవ యగు నర్మదానదియందు స్వచ్ఛంద మరణమును పొందెనని తెలియుచున్నది. స్వేచ్ఛతో మరణించిన కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి తరువాత త్రిలింగభూమి యవనమయమైన ధనియు, మహాజలమునందు మునిగిన భూమి నుద్ధరించిన ఆదివరాహమూర్తివలె ప్రోలయనాయకుడు యవనోదస్థమగు భూమిని పై కెత్తి ప్రతిష్ఠించేననియు తెలియుచున్నది. ఇతనితరువాత ఇతని పినతండ్రి కుమారుడగు కాపయనాయకుడు ప్రభుత్వము నెరపినట్లు కానవచ్చును. ఇతని ఆధిపత్యము క్రింద 72 మంది నాయకులు సేవలొనర్చుచుండిరి.

ఈ అనితల్లి కలువచేఱు శాసనము, గోదావరిమండలమున నున్న కాకినాడ తాలూకాయందలి ఆర్యావతమను (ఆర్యవటము) గ్రామమునందు లభించినది. ఆది ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక 4వ సంపుటము యొక్క 93_112 పుటలందు ప్రచురింపబడినది. మహాసాధ్వియగు నీమె 1423 వ సంవత్సరమున దేవబ్రాహ్మణ క్షేత్రముల మీద పన్నును రద్దు కావించెను.

ఈ విధముగా నీమె రాణియై, అల్లాడ వీరభద్రా రెడ్డికి దేవియై, దేవబ్రాహ్మణ భక్తయై, సాధుశీలయై, అనేక భూరి దానముల గావించి చిరస్మరణీయ అయ్యెను.

పి. య. రె.