Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనపోతనాయడు

వికీసోర్స్ నుండి

అనపోతనాయడు : అనపోత నాయడు వెలమ వంశజుడు. రేచర్ల గోత్రుడు, ఉపలబ్ధములగు శిలాశాస నముల వలన వెన్నమనాయనితో ఈ వంశము ఆరంభమగుచున్నది. వెన్నమనాయునకు దాచభూపతి పుత్రుడు. అతని కుమారుడు సింగభూపతి. ఈ సింగభూపతికి అనపోతనాయడును, మాధవనాయడును ఉదయించిరి మనకథా నాయకుడగు అనపోతనాయడు మహావీరుడు. అతడు రాచకొండ (నల్లగొండ జిల్లా) రాజధానిగ జేసికొని తెలంగాణమును పాలించిన వీరచూడామణి. తమ్ముడగు మాధవనాయడు అన్న అడుగుజాడలలో నడిచి సంగర రంగములలో అతనికి బాసటగా నుండి విజయముల గడించిన శూరవర్యుడు.

వెన్నమనాయడు రాణియగు రుద్రమదేవి కాలమున ననేక సమరములలో విజయము గడించెను. దాచభూపతియు సింగమనాయడును పత్రాపరుద్రమహారాజు కడ సేనానాయకులు. దాచభూపతి కాంచీపురము భేదించి పంచ పాండ్యులను జయించి స్వర్ణమయ సింహాసనమును పెద్ద పచ్చను విజయ చిహ్నములనుగా దెచ్చి ప్రతాపరుద్రున కర్పించెను. మరల పాండ్యులు తలయెత్తగా సింగమనాయడు వారలపై కి ప్రతాపరుద్రదేవుని ఆనతిపై బోయి పాండ్యరాశ్యలక్ష్మిని రాజునకు కైవసము చేసెనని అయినవోలు శాసనమున చెప్పబడియున్నది.

సింగమనాయడు కాకతీయరాజ్య పతనానంతరము తెలంగాణములో ప్రసిద్ధివహించి రాచకొండ దుర్గమును రాజధానిగ జేసికొని పలుకుబడి గడించెను. ఇతని తమ్ముడు నాగానాయడు, రాచకొండలో ప్రధాన దుర్గమునకు చేరువలో నొక దుర్గము కట్టించి, రాజధానిని మిగులు విస్తృతముగా చేసెను. కాకతీయ రాజ్యాంతమున సింగమ నాయడు చిన్న చిన్న దుర్గములు జయించి రాజ్యము స్థాపించు ప్రయత్నము చేయుచు జల్లిపల్లికి పోయి ముట్టడించెను. గెలుపు సాధ్యము గాదని లోపలనున్న రాచవారు భావించి చుట్టుపట్టులనున్న రాజులను కూడగట్టుకుని కుట్రలన్ని సింగమనాయని భావమరదియగు చింతలపాటి. సింగమనాయని చెరలోనుంచిరి. తమ్మళ బ్రహ్మాజీ అను మోసగాడు రాచ వారి పక్షమున ' రాయబారిగ వచ్చి సింగమ నాయనితో "మీరు ముట్టడిమానిన మేము మీ బావమరదిని విడిపింతు"మని సంధి విషయములు మాటలాడుచు ఏమరుపాటుననుండగా, సింగమనాయని ఆయువు పట్టున కత్తితో పొడిచి పారిపోయెను. తన కుమారులగు అనపోతనాయని, మాధవనాయని పిలిచి సింగమనాయడు తన్ను చంప ప్రోత్సహించిన రాచవారిని చంపి వారి రక్తముతో తర్పణము లొసగుడని చెప్పి ఈ కార్యము నెరవేర్తుమని ఒట్టు పెట్టించుకొని మరణించెను. ప్రత్యర్థులగు రాచవారు ప్రాణభీతితో పారిపోయి, ములంగూరు దుర్గమున డాగియుండి, తోడి దుర్గాధిపతులను గూడ దీసికొని చెంజర్లకడ విరోధులను మడియింప కాచియుండిరి. ఇది విని ప్రతిజ్ఞా నిర్వహణమునకై అనపోతనాయడు, మాధవనాయడు సైనిక బృందముతో బయలుదేరి రాచవారిని, వారికి సాయము వచ్చినవారిని తునిమి వారి రక్తముతో పితకు తర్పణము నొసగి "సోమకుల పరశు రామ” అను బిరుదము ధరించిరి. అనపోతనాయడు భువనగిరి, సింగపురము, రాచకొండ, ఓరుగల్లు దుర్గముల నాక్రమించి దిగ్విజయమునకు బయలు వెడలి అయినవోలులోని మైలారుదేవుని సందర్శించి శా.శ 1291 (క్రీ.శ.1369) సం॥ లో అయినవోలు సమర్పించి గొప్ప శిలాశాసనములు ప్రతిష్ఠించెను. అందుగల బిరుదములు చూచిన అతడు మహావీరుడనితోచును. 'రాయబందీ విమోచక', ఇతర శాసనములలోని 'కాకతీయ రాజ్య స్థాపనాచార్య' అను బిరుదములు తండ్రియగు సింగమ నాయనివిగ తోచును. అవి కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నము నొందినపిదప రాజ్యమేలిన అనపోతనాయనివి కావు. వంశపరంపరగా రాజధానియగు రాచకొండలో దుర్గ పునరుద్ధరణము గావించి రాయసముద్రము, అనపోత సముద్రము, రామస్వామి దేవాలయము, వీరభద్రాలయము, రాజమందిరములు, బొడ్డుచౌకీ, కొలువుకూటపు బావి, సంకిళ్ళబావి నేటికి నిలిచి, అనపోత నాయని కీర్తిచిహ్నములుగ నున్నవి. నాగానాయని కొండపై గొప్ప దుర్గము గలదు. రాచకొండతో గలిపి నాగానాయని కొండకు గొప్ప ప్రాకారము కట్టి లోన మహోన్నతములగు నాలుగు ప్రాకారములను అందిమిడ్చెను. మహైశ్వర్యము ననుభవించిన రాచకొండ దుర్గమునిండ అడవులు బలిసి ప్రవేశింప రాకుండుటచే అందలి విశేషములు చరిత్రమున కెక్కకుండుటలో వింత యేమియు లేదు. అనపోతనాయడు కావ్య కథన ప్రియుడు. అతని కుమారుడు సింగభూపతి రచించినట్లున్న “రసార్ణవ సుధాకరమున” అనపోతనాయకీయ మను గ్రంథము ఉదాహరింపబడినది. అయినవోలు శాసన రచయిత పశుపతి పుత్రుడగు నాగనాథుడు. ఇతడు మదనవిలాసమను భాణమును సంస్కృతమునను, విష్ణుపురాణమును ఆంధ్రమునను రచించినట్లు వినికి. చమత్కార చంద్రికను రచించిన విశ్వేశ్వరకవి నాగనాథునికి గురువు. విశ్వేశ్వరకవి అనపోతనాయని ప్రశంసగల చమత్కార చంద్రికను సంస్కృతమున రచించెను. ఈ విధముగ అనపోతనాయనికి వాఙ్మయముతో సంబంధము కలదు. మాధవనాయడు తన అన్నయగు అనపోతనాయనికి రాచకొండ విడిచిపెట్టి దేవరకొండ దుర్గమును రాజధానిగ జేసికొనెను. మాధవనాయడు శ్రీశైలోత్తర ద్వారమగు ఉమామహేశ్వరమున గొప్ప శివాలయమును కట్టించి శాసనమును నెలకొల్పెను. మాయిభట్టారకుడు ఈతని శాసనకవి. అనపోత నాయడు హేమాద్రి పేర్కొన్న దానము లన్నియు గావించుటయే గాక శ్రీశైలము నెక్కుట కనుకూలముగ సోపానములు గట్టించెను. రాచకొండ హైద్రాబాదునకు తూర్పున 32 మైళ్ళ దూరమున నున్నది. పర్వతముల మధ్యభాగముననున్న ఈ పట్టణము 15 మైళ్ళు చుట్టు కొలతగలది. నగర చిహ్నములు ఇప్పటికిని గోచరించును. ఈ వంశమున ఇద్దరు ముగ్గురు అనపోత నామధేయులు కలరు గాని అంత ప్రసిద్ధులు గారు.

బహమనీ రాజ్యము క్రీ. శ. 1347 లో నెలకొల్ప బడెను. పిదప మహమ్మద్ షా రేచర్ల అనపోతనాయని ఏలుబడిలోనున్న ఓరుగల్లు గోలకొండ దుర్గములపై దండయాత్ర సాగించెను. ఓరుగల్లు వశముగాలేదు. గోలకొండ దుర్గమును మాత్రము అనపోతనాయడు మహమ్మద్ షాహకు ఇచ్చి తన రాజ్యమున ప్రవేశింపకుండ కట్టడి చేసికొనెను. రాచకొండ దుర్గమున గాలిబు సాహెబుగోరీ కలదు. ఇతడు రాచకొండను గెలువవచ్చిన వాడందురు. ఇతడు క్రీ. శ. 1484 న ఉండెనని తెలియుచున్నది. వెలమవీరుల యేల్పడి అంతతో నశించెను. అక్క పోలమ్మ అను వీరకాంత విగ్రహమునుగూర్చి వింతకథ యొకటి చెప్పుదురు. రాచకొండ బౌద్ధయుగమునగూడ పేరొందినది. కాకతి గణపతిదేవుని కాలమున విశ్వేశ్వరశంభువు గోళగిమఠమును నెలకొల్పెను. వెలమవీరులు అనపోతనాయనివరకు శైవులే.

అనపోతనాయడు దుర్గమున భైరవ విగ్రహముల నెక్కుడుగ నెలకొల్పెను. శివాలయములను ప్రతిష్ఠించేను.రమణీయమగు శిల్పముగల విగ్రహములీ కోటలో నెక్కుడుగనున్నవి. ఇంత దృఢతరమగు దుర్గమేలుచున్న అనపోత నాయడు ఒక వైపు విద్యానగర రాజులతోడను, ఇంకొకవైపు కొండవీటి రెడ్లతోడను, మరియొక వైపు మహమూద్ షాహ తోడను సంగ్రామములను కావించుచుండుటచేత రానురాను బలము సన్నగిల్లి తరువాత రాచకొండ దుర్గము క్రీ. శ. 1484 తో అంతరించెను. తెలంగాణమునకు రాజధాని కావలసిన రాచకొండ మహారణ్యములలో లీనమయ్యెను. ఈదుర్గమును కాకతీయులు కట్టించి వెలమవీరుల సంరక్షణమున కుంచిరి. అనపోత నాయనితో దీని వైభవ మంతరించినది. తరువాత మూడు నాలుగు తరములలో ఈ వంశము క్షీణదశకు వచ్చినది.

ది. వి. ర.

[[వర్గం:]] [[వర్గం:]]