శ్రీ సాయిసచ్చరిత్రము /18-19వ అధ్యాయములు

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (18-19వ అధ్యాయములు )


శ్రీ సాయిసచ్చరిత్రము 18-19వ అధ్యాయములు హేమాడ్‌పంతును బాబా ఎట్లు అమోదించి యాశీర్వదించెను? సాఠేగారి కథ; దేశముఖ్‌గారి భార్యకథ; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి జూపుట; ఉపదేశములో వైవిద్యము; నిందగూర్చి బోధ; కష్టమునకు కూలి.


గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా యెట్లు అదరించెనో హేమాడ్‌పంతు వర్ణించెను. రాబోవు రెండు అధ్యాయములలో హేమాడ్‌పంతును బాబా యెట్లు అమోదించి యాశీర్వదించెనో, బాబా యెట్లు తన భక్తులలో మంచి యాలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండేనో, అత్మోన్నతి గూర్చి, పరనిందా వాక్యముల గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలము గూర్చి, బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణంతుము.

ప్రస్తావనము

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన అత్మసాక్షాత్కరమునకు దారి చూపునను విషయమందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దాని నితరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించినదానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ర్పయోజనములగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘమువంటివరు. వారు తమ యమృతతుల్యములైన బోధనలను పుష్కలముగా విశాలప్రదేశములందు కురిపించెదరు. వాని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణిపించుకొని, పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన ’రామరక్షా స్తోత్రము’ను బుధకౌశికబుషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట స్మరించవలెను.

ప్రేమగల తల్లి, గుణమిచ్చు చేదైన యౌషధములను బిడ్డ మేలుకొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు, అధ్యాత్మికవిషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి యాత్మయొక్క దైవీసౌందర్యములను జూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియవిషయవాంఛలు నిష్ర్కమించి, వివేకవైరాగ్యములను జంటఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడ అత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలిగించి, మనలను సంతోషపెట్టును. ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురుని సహయమువలననే జరుగును. సద్గురువును భగవంతునివెలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ యధ్యాయములోని ముఖ్యకథను ప్రారంభించెదము.

సాఠే

సాఠే యనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. అంతేగాక మరికొన్ని సమస్య లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను. విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడిచి చాల దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని, కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించెను. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహనిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు శిరిడీకి వెళ్ళుమని సలహ ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో శిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వతబ్రహ్మవలె స్వయంప్రకాశుడై, నిర్మలుడు, శుద్దస్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మపుణ్యమువలన బాబా యొక్క పవిత్రమయిన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలు పెట్టెను. రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను.

బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతని దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూపెను. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమునే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటివారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యానుకొనెను. అ మరసటిదినమాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము పారయణము చేయవలేనో కనుగొనుమనెను. కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లుడిగెను, "ఓ దేవా! యీ దృశ్యమువలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితిని? అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలేనా? అతడు అమాయిక భక్తుడు; అతని కోరిక నెరవేరవలెను. అతని దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు"డన బాబా, "అతడు గురుచరిత్ర మింకొక సప్తాహము పారయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును; మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును!" అనెను.

అ సమయమున హేమడ్‌పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళనొత్తుచుండెను. బాబా పలుకు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను: "సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితము పొందెనా! నేను నలుబది సంవత్సరములనుంచి పారయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదు గదా! అతడిక్కడ 7 దినముల మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా యేమి? చాతకపక్షి మేఘమునుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తన దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను అశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను." ఈ యాలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో నుండెడి యాలోచన్నలన్నియు బాబా గ్రహించెడివారు. అంతియేగాక చెడు యాలోచనలను అణుచుచు, మంచి యాలోచనలను ప్రోత్సహించువారు. హేమడ్‌పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామవద్దకు పోయి అతనివద్ద 15 రూపాయిలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయ మయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యజ్ఞను జవదాటగల వారెవరు?

హేమాడ్‌పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు పోయెను. అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్‌పంతు నిట్లడిగెను: "మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఏల యున్నారు? మీరు మసీదునుంచి వచ్చుచున్నట్లున్నాదే! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు? మీరొంటరిగా వచ్చినవారేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట అనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనెదము!" ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమాడ్‌పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథభాగవత మను ప్రసిద్ద మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యనము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబు దీక్షీతు (శ్రీకృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణారూపమైన) భగవద్గీత, దాని మరాటీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక(జ్ఞానేశ్వరీ), (శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమైన) ఏకనాథభాగవతము, మరియు భావార్థరామాయణమును నిత్యము శిరిడీలో చదువు చుండెడివాడు. భక్తులు వచ్చిన బాబాను యేదైన ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని అ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవతధర్మములోని ముఖ్యగ్రంథములు భక్తులు బాబా అజ్ఞానుసారము ఆ సత్యం గములకుపోయి, ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్‌పంతు కూడ నిత్యము ఏకనాథభాగవతమును పారాయణము చేయువాడు.

హేమాడ్‌పంతు అ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలో నున్న ఏకనాథభాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్యపారాయణము పూర్తిచేయుటకే కాబోలు బాబా తననచ్చటకు పంపెనని హేమాడ్‌పంతు యనుకొనెను. వెంటనే తన నిత్యపారయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమడ్‌పంతు: నేను బాబా వద్దనుండి యొక కబురు తీసికొని వచ్చినాను. బాబా నీ వద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని నన్ను అజ్ఞాపించి యున్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి.

శ్యామా: (అశ్చర్యముతో) నావద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగనమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము.

హేమాడ్‌పంతు: సరే నీ నమస్కారము లామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను, కథలను చెప్పుము.

శ్యామా: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని(బాబా) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరి వాడను; నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే యీ తమలపాకులు వక్క సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్‌పంతుతో మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్లనియెను: "ఈ దేవుని(బాబా) లీల కనిగోన శక్యమ కానిది. వారి లీలలు కంతులేదు. వాని నెవరు గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వాని నంటినట్లు కాన్పించరు. మావంటి జానపదల కేమి తెలియును? బాబాయే యీ కథల నెందుకు చెప్పరాదు? మీవంటి పండితులను నావంటి పామరుని వద్ద కేల పంపుచున్నరు? వారి మార్గము ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావనిచెప్పగలను." ఈ యుపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను: "నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయములో పట్టుదలతో నుండునో, బాబా యంత త్వరగా వానికి సహయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్షచేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును." ( ఇచ్చట ఉపదేశమునగా నిర్దేశము).

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమడ్‌పంత్ మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్దపడెను. ఆ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్‌పంతు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కథను చెప్పుదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశముఖ్

రాధాబాయి యను యొక ముసలమ్మ యుండెను. అమె ఖాశాబా దేశ్‌ముఖ్‌గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని అమె సంగమనేరు గ్రామప్రజలతో కలసి శిరిడీ వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తిచెందెను. అమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను. అమె కింకేమియు తెలియుకుండెను. బాబా యామే సంకల్పమును అమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. అమె తన బసలోనే యుండి భోజనము, నీరు మానివేసెను. అట్లు మూడు రోజులు గడిచెను. అమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని, "దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదసలిని నీవెరిగియే యుందువు. అమె మిక్కిలి పట్టుదల గలది. అమె నీపైన అధారపడియున్నది. అమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొని యున్నది. నీవు అమె నుగ్రహించి ఉపదేశమిచ్చునంతవరకు కామె తన నిరాహారదీక్షను మానదు. అమె కేమైన హని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన అదేశ మివ్వకపోవుటచే అమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము, అశీర్వదించుము, అమెకు తగిన దారి చూపుము!’ అమె మనోనిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించు, ఈ క్రింది విధముగా బోధించెను:

"ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నవు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము! నీకు నా వృతాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్రహృదయులు. వారికి చాల కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారేమంత్రము నూదలేదు. నాకు వారిని వదలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి; నానుండి రెండు పైసలు దక్షిణ యడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. ’మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు? అని నీవడుగవచ్చును. దానికి సమాధనము నూటిగా చెప్పగలను. వారి డబ్బు లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో గూడిన ఓరిమి! నేనీ రెంటినీ వారి కర్పించితిని. వారు ప్రసన్నులైరి.

"నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచిపోషించిరి. భోజనమునకు గాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగ జూచుచుండెడి వాడను. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారిపై దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకోటి లేకుండెను. వారేనాయాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస. ’సబూరి’(సంతోష స్థైర్యములలో గూడిన ఓరిమి) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ’సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటిని తొలిగించును; కష్టములను పారద్రోలును. అనేక విధముల అవాంతరములను తొలిగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగుజేయును. సబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడుపంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి.

"నా గురువు నానుండి యితరమేమియు అశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు, నన్ను గూడ మా గురువు తన దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యెడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్ల తాబేలుకు అహరము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టి నాయందు నిల్పి, నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లి! నా గురువు నాకు మంత్ర మేమియు నుపదేశించలేదు. అటువంటపుడు నేను నీ చేవిలో మంత్రమేట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుండి పొందుటకు ప్రయత్నించకుము. నీయాలోచనలు, నీవు చేయు పనులు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నావైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు!’

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. అమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను.

ఈ కథను జాగ్రత్తగాను, శ్రద్దగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్బమును గుర్తించి, హేమాడ్‌పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడటకు చేత కాకుండెను. శ్యామా అతని నీ స్థితిలో జూచి "ఏమి జరిగినది? ఏల యూరకున్నవు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను?" అని ఆడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యహ్నహారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమడ్‌పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు బాజా భజంత్రీలతో నొకే వరుసలో హారతి పాడుచుండిరి. బాబాకు కూడిపైపు శ్యామా ముందర హేమాడ్‌పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్‌పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను. బాబా యిట్లనెను: "సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకొంటిరా? అట్లయినచో మీరెమి మాట్లాడుకొనినారో చెప్పుము?" గంటలు చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమడ్‌పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు అతురపడెను. తాము ముచ్చటించిన దంతయు తనకు చాల అనందము కలుగజేసినధనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబాలీలలు అగోచరములని తెలిసికొంటిననియు అ కథ రూపముతో తన్ను బాబా అశీర్వదించిరని హేమడ్‌పంతు చెప్పెను. అప్పుడు బాబ "కథ చాల అధ్బుతమైనది. నీవెట్టుల అనందిచితివి? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము" అనిరి. అప్పుడు హేమాడ్‌పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి. యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. "అ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?" యని బాబా హేమాడ్‌పంతునడిగెను. "అవును, బాబా నా మనశ్చాంచల్యము నిష్ర్కమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని" అని హేమడ్‌పంతు బదులిచ్చెను.

బాబా యిట్లు చెప్పెను. "నాపద్దతి మిక్కిలి విశిష్టమైనది! ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. అత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృతులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక యెడ్డున నుండును. దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమి చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు అధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే." బాబా యీ మాటలు పూర్తి చేయుసరికి, హారతి పూర్తియాయెను. అందరు ’శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్‌కి జై’ యని జయజయధ్వానములు చేసిరి. ఓ ప్రియపాఠకులరా! యీ సయమమందు మనము కూడ మసీదులోని జనసమూహముతో కలసి యున్నట్లు భావించి, మనము కూడ ఆ జయజయధ్వనులలో పాల్గొందము.

హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగ్ బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్‌పంతు చేతిలో పెట్టి యిట్లనేను;" ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో."నీ స్థితి కలకండవలే తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు." హేమాడ్‌పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి, "ఇట్లు ఎల్లప్పుడు నన్ను అనుగ్రహించుము, అశీర్వదించుము, కాపాడుము!" అని ప్రార్థించెను. అందుకు బాబ యిట్లు జవాబిచ్చెను. " ఈ కథను వినుము. దీనిని మననము చేయుము. నిధి ధ్యానము చేయుము. ఆట్లయినచో నీవు భగవంతిని ఎల్లప్పుడు జ్ఞప్తి యందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును."

ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్‌పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దాని హృదయపూరితముగా సేవించి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు!

19వ అధ్యాయము చివర హేమాడ్‌పంతు కొన్ని యితర విషయములను జెప్పియున్నరు. అవి యీ దిగువ పొందు పరచితిమి.

మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము

ఈ దిగువ చెప్పిన బాబా పలుకు సాధారణమైన వయినప్పటికి అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో నవి మనకు మేలు చేయును. "ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వాని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గలవారికి నీరిచ్చినచో, అకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేనివారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి జెందును. ఎవరైన ధనసహయము గోరి నీవద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తల క్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్ములించుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గమేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయునిది మనకు ఐక్యత కలుగదు. ’అల్లా మాలిక్!’ భగవంతునిడే సర్వాధికారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారుకారు. భగవంతుని మార్గమసామాన్యము, మిక్కిలి విలువైనది. కనుగొన వీలులేనిది. వారి యిచ్చానుసారమే మనము నడచెదము. మనకోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. ఋణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందము గాక, ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు.

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట

సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల అసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్యశరణాగతి చేసినచో వారు నీకెట్లు పదేపదే సహయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగానే నీకేమయిన మంచి యాలోచన కలిగిన, దానిని తరువాత పగలంతయి వృద్ది చేసినచో నీ మేధాశక్తి వృద్దిపొందును. నీ మనస్సున శాంతి పొందును. హేమాడ్‌పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడు డిట్లనుకొనెను. రేపు గురువారము. శుభదినము శిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. అ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసుకొని పోయెను. దీక్షిత్‌‍వాడా విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదునుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహరాజ్ రచించిన "గురుకృపాంజన పాయో మేరే భాయి’ యనునది. గురువు కృపయను అంజనము అభించెను. దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాని శ్రీరాముని లోన, బయట, నిద్రావస్థలోను, జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలలోను నన్నిచోట్లను చూచితినని చెప్పెడు పాట యది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి యీపాట నేల పాడెను? ఇది సందర్బానుసారముగా బాబా చేసిన ఏర్పటు కాదా? హేమాడ్‌పంతు అన్నాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు గావున నాతని మనోనిశ్చయమును ధృడపరచుటకై బాబ యీ పాటను పాడించియుండును.

రామనామ స్మరణ ఫలితము గూర్చి మహత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టములనుంది కాపాడును.

ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్చి బోధ

శ్రీసాయిబోధనకు ప్రత్యేక స్థలముగాని, ప్రత్యేక సమయముగాని యక్కరలేదు. సందర్బావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించు చుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొక విధముగా భావించెదరు. మలినమును పొగొట్టుట కనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు. కావున తిట్టబడినవాడు. తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను! అట్లు పరనిందకు పాల్పడువానిని బాబా సరిదిద్దిన పద్దతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండీతోటకు పోవుచునపుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను, "చూడుము! ఈ పంది అమేథ్యమును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావముకూడ అట్టిదే! ఎంత అనందముగ నీ సాటిసోదరుని తిట్టుచున్నవు. ఎంతయో పుణ్యము జేయగ నీకి మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?" భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను.

ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించుచుండెడి వారు. ఈ యుపదేశములను మనస్సునందుచుకొని పాటించినచో అత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. "నాదేవుడున్నచో నాకు మంచముపైని కూడ బువ్వ పుట్టును." అది భోజనము, వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్కసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన నంత మేలు.

బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. అ కనిపించెడి మూడున్నర మూరల దేహమే బాబాయని అనుకున్నవారికి పాఠము చెప్పుటకే వారు ఆ రూపముతో నవతారమెత్తిరి. బాబాకు సర్వస్యశరణాగతి చేసి, అహర్నిశలు వారినే ధ్యానించినచో, చక్కెర తీపి, కెరటములు-సముద్రము, కన్ను-కాంతి, కలసి యున్నట్లే శ్రీసాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడువలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్యకర్మల నాచరించుచు. భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరలకు చెప్పెదరో, ఇతర విషయములేమియు నాలోచించరో వారు తప్పక అత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడు మనెను. ’తానెవరు’ అనుదానిని తెలిసికొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహ యిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు; అడ్డులేదు. కొందరికి స్వయముగా ఉపదేశము నిచ్చువారు. కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని అదుముచూ, ఇక యెన్నడు త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదలిరి. కొందరికి స్వప్నములో ’గురుబ్రహ్మది’ మంత్రార్ధముల బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దాని మానుమనిరి. వారి మార్గములను జెప్పుట కలవి గాదు. ప్రపంచ విషయములలో తమ అచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలో నొకటి.

పనికి తగిన ప్రతిఫలము

బాబా ఒకనాడు మిట్టమధ్యహ్నము, రాధాకృష్ణమాయి యింటి సమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోండ్‌కరో యింటి పైకప్పు ఎక్కి రాథాకృష్ణమాయి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్క దిగెను. బాబా యభిప్రాయమేమో యెవరికిని తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. అమె జ్వరమును తోలిగించుటకై బాబా యిట్లు చేసియుండునని యనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా రెండు రూపాయిలు ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహ ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పని చేయును. పని చేయించేవాడు. పని చేసేవారలు కూడ సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రుకు మనఃస్పర్ధలుండవు.


శ్రీ సాయినాథాయ నమః 18-19వ అధ్యాయములు సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు