శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదవ అధ్యాయము )


శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదవ అధ్యాయము కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగణు సమస్య పరిష్కరించుట


ఈ అధ్యాయములో దాసగణుకు గలిగిన యొక సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్‌పంతు చెప్పెను.

మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకాకారమును ధరించెను. ఈ మహజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక. శిరిడీకి పోయి యచ్చటి మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారితి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోను దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచి పెట్టుచుండిరి. భక్తులు కూడ సమానమైన ఉత్సహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి, వారి పైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లు లనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదీ పోయుచు, వారి నుదుటపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తులయెడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల నీ క్రింది విధముగా పలుకరించుచుండిరి.

"అన్నా, మధ్యహ్న భోజనముకు పోమ్ము! బాబా, నీబసకు పో, బాపూ! భోజనము చేయుము." ఈ విధముగా ప్రతి భక్తుని పల్కరించి యింటికి సాగనంపుచుండిరి. ఇప్పటికి అది యంతయు ఊహించుకొన్నచో, అ దృశ్యములను తిరిగి చూచినంత అనందము గలుగును. మనోఫలకమున సాయిని నిల్పి, వారిని అపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపైబడి సగౌరవముగ ప్రేమతో వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు, ఈ అధ్యాయములోని కథను చెప్పెదను.

ఈశావాస్యోపనిషత్తు

ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాటీభషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ యుపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము.

వేదసంహితలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడ యందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత యుండుటచే, దీనికి వాజసనేయ సంహితోపనిషత్తుని కూడ పేరు. వైదిక సంహిత లుండుటచే దీనినితర ఉపనిషతులకన్న శ్రేష్ఠమని భావించెదరు. దీనికోక యుదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్య కోపనిషత్తు యీ ఈశావాస్యోపనిషత్ పై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్‌గారు భావించుచున్నరు.

ప్రోఫెసరు రానడేగా రిట్లనుచున్నారు: "ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్‌దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శయోగీశ్వరుని వర్ణన లిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగసిద్దాంతముల ప్రతిబింబమే ఈ యుపనిషత్తు. తుదకు జ్ఞాపముకు కర్మలకు సమన్వయముగ నున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట యీ యుపనిషత్తులోని సారాంశము." ఇంకొక చోట వారిట్లనిరి: "ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము".

పై వర్ణను బట్టి యీ ఉపనిషత్తును మరాటీ భాషలోనికి అనువాదము చేయుట యెంత కష్టమో ఊహించవచ్చును దాసగణు దీనిని మరాటీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి. కావున దాసగణు కొంతవరకు వికలమనస్స్కుడయ్యెను.

సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు

ఈ యుపనిషత్తు వేదములయొక్క సారాంశము. ఇది యాత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జననమరణములనే బంధములను తెగగొట్టు అయుధము, లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరయితే యాత్మసాక్షత్కారము పొంది యున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగణు సాయిబాబా సలహ పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే శిరిడీకి పోయి, సాయిబాబాను దర్శించి, వారి పాదములకు నమస్కరించి ఈ శావాన్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టముల జెప్పి సరియైన యర్దమును భోదింపమని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను: "తొందర పడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. తిరిగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పని పిల్ల నీ సందేహమును తీర్చును." అప్పుడక్కడ నున్నవారీ మాటలు విని, బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞనము లేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగలదనిరి. కాని దాసుగణు అట్లనుకొనలేదు. బాబా పలుకుకు బ్రహ్మవాక్కు లనుకొనెను.

కాకాయొక్క పనిపిల్ల

బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసగణు శిరిడీ విడిచి విలేపార్లే చేరి, కాకాసాహెబు దీక్షిత్ ఇంటిలో బసచేసెను. అ మరుసటిదినముదయము దాసగణు నిద్రనుంచి లేవగనే, యొక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. అ పాటలోని విషయము ఎఱ్ఱచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు, దాని యంచుల చివరలు చాల సుందరముగా నుండెననియు అమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే, దాసగణు బయటకు వచ్చి వినెను. అది కాకా పనిమనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. అమె చిన్నపిల్ల. అమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, అమె సంతోషభావనము గాంచి, దాసగణు అమెపై జాలిపడెను. అ మరుసటి దినము రావుబహద్దూర్ యమ్.వి.ప్రధాన్ తనకు ధోవతుల చాపు లివ్వగ, అ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావుబహద్దుర్ ఒక మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను. అకలితో నకనకలాడుతున్నవారికి విందు భోజనము దొరికినట్లు అమె యమితానంద పరవశురాలయ్యెను. అ మరుసటిదిన మామె యా కొత్త చీరను ధరించెను. అమితోత్సహముతో తక్కిన పిల్లలతో కలసి గిఱ్ఱున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె తానే బాగుగ అడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగణు జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునది గాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతు డిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలుకొరకే యని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో అ పిల్ల యొక్క పేదరికము, అమె చినిగినచీర, క్రొత్తచీర, దాని నిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము - ఇవి యన్నియు భగవంతుని యంశములే. భగవంతుడు యీ యన్నిటియందు వ్యాపించి యున్నాడు. ఇచ్చట దాసగణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో - యది అంతయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలుకొరకే యనియు గ్రహించెను.

విశిష్టమైన బోధన విధానము

పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైన దనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియేయుందురు. బాబా శిరిడీని విడువనప్పటికిని, కొందరిని మచ్చీంద్రగఢ్‌కు, కొందరిని కొల్హాపూరుకు గాని, షోలాపూర్‍గాని సాధననిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రిగాని, పగలుగాని, కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగణును విలేపార్లే పంపకుండ శిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరనవచ్చును. కాని బాబా అవలంభించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరీ పిల్ల, యామె చీరకూడ భగవంతుని సంకల్ప రూపములే యని దాసుగణు ఎట్లు నేర్చుకొని యుండును?

ఈశావాస్యోపనిషత్తులోని నీతి

ఈశావాస్యోపనిషత్తులో నున్న ముఖ్యవిషయము అది బోధించు నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులో నున్న నీతి దానిలో చెప్పబడిన అధ్యాత్మిక విషయములపై అధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామియని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలయన భగవంతుడన్నింటియందు గలడు. కావున భగవంతుడేది యిచ్చెనో అదియెల్ల తన మేలుకొరకే యని గ్రహించవలెను. దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దాని నిచ్చియున్నడనియు, కావున నది మనకు మేలు కలుగజేయునదేయనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పు డేదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చువలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుటవలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్తజీవరాశిని అత్మలో చూచునో, అత్మ యన్నిటియందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకలవస్తువులు అత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకలవస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్తమాత్మ యగునో, అతడు మానవులు పడు సామాన్యబాధలకు, దుఃఖవికారములకు లోను గాడు.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదవ అధ్యాయములు సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు