శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదియొకటవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదియొకటవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదియొకటవ అధ్యాయము 1.వి.హెచ్. ఠాకూర్ 2. అనంతరావు పాటంకర్ 3. పండరీపురము ప్లీడరు - వీరి కథలు


ఈ అధ్యాయములో హేమడ్‌పంతు వినాయక హారిశ్చంద్ర ఠాకూర్ బి.ఏ., అనంతరావు పాటంకర్ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, అధ్యాత్మికమార్గమునకు దారి చూపును.

ప్రస్తావన

సామాన్యముగ మన గతజన్మపుణ్యసముపార్జనమువలన మహత్ముల సాంగత్యభాగ్యము పొంది, దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్‌పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా నున్న బాంద్రాకు ఇతడు చాలకాలము మెజిస్ట్రేటుగ నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ మహత్ముడు నివసించుచుండెను. అనేకమంది హిందువులు, పారశీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్‌పంతు పురోహితుడగు ఇనుస్, పీరుమౌలానాను దర్శించుమని అనేకసార్లు హేమాడ్‌పంతుకు చెప్పెను. కాని ఏవో కారణములచేత హేమాడ్‌పంతు అ మహత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు శిరిడీకి పోయి శ్రీసాయి దర్బారులో శాశ్వతస్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.

యోగీశ్వరుల వ్యవస్థ

అత్యంతప్రాచీనకాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమందియోగ లనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని యాజ్ఞనుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుట కొక యుదాహరణ మీ దిగువ కలదు.

వి.హెచ్. ఠాకూరు

వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపమందలి వడ్‌గాం అను పట్టణమున కొక సర్వేపార్టీతో వచ్చెను. అక్కడ ’అప్ప’ యను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. అ యోగి నిశ్చలదాసు రచించిన ’విచారసాగర’ మను వేదంత గ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. "ఈ పుస్తకము నీవు చదువవలెను. నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యొగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహత్ముని దర్శనము గలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గము చూపెదరు. నీ మనస్సునకు శాంతి అనందములు కలుగజేసెదరు." ఆ తరువాత ఠాకూరు జున్నురుకు బదలీ యయ్యెను. అచ్చటికి పోవుటకై నాన్హేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దాని దాటుట కెనుబోతు తప్ప యితర మేదియు నుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్‌కు పెద్ద యుద్యొగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందొర్కరుతో పరిచయము కలిగెను. అయన వలన సాయిబాబా గూర్చి యనేక సంగతులు తెలిసికొని వారిని దర్శింప కాంక్షించెను. అ మరుసటి దినమే నానాసాహెబు శిరిడీ పొవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడ తనతో రమ్మని యడిగెను. ఠాకూరు తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణా వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట శిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తప పడెను. అయినప్పటికి శిరిడీ వెళ్ళెను. అంతకు ముందురోజే నానాసాహెబు శిరిడీ విడిచి పెట్టెనని తెలిసెను. ఇతరు స్నేహితులు కొందరు అక్కడ కలసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి, వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు అనందభాష్పములచే నిండెను; ఒడలు గగుర్పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. " ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాటులో ఎనుబోతుపైన సవారిచేయుటకంటే కష్టము! ఈ యాధ్యాత్మమార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము." ఠాకురుకొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే యతడు యమితానంద పరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్దములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించ వలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. " అప్పా చెప్పినదంతయు నిజమే! కాని యవన్నియు అభ్యసించి అచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుటవలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగర్తగ విచారించి, అర్థము జేసుకుని, యాచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురనుగ్రహము లేని ఉత్త పుస్తకజ్ఞానము నిష్ర్పయోజనము." విచారసాగరము లోని సిద్దాంతభాగమాతడు చదివియుండెను. కాని అచరణను శిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన యింకొక కథకూడ నీ సత్యమును బలపరుచును.

అనంతరావు పాటంకర్

అనంతరావు పాటంకర్ యను పూనా పెద్దమనుష్యుడొకడు బాబాను చూడగోరెను. శిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టిచెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయి బడి, తగువిధముగ పూజించి, పిమ్మట బాబాతో ఇట్లనెను: "నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను చదివితిని. అష్టాదశపురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుట లేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తకజ్ఞానములేని నిరాడంబరభక్తులు నాకంటె మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్ధము. నీ దృష్టివలనను నీ మహత్తరమైన మాటలవలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను అశీర్వదించుము." అప్పుడు బాబా ఒక నీతికథను ఈ విధముగా చెప్పెను:

తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ (నవవిధభక్తి)

"ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుఱ్ఱము లద్దివేసెను. అది తోమ్మిది యుండలుగ పడెను. జిజ్ఞాసువైన వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిలిది యుండల నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను."

ఈ మాటలు యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే నతడు గణేశదామోదర్ పురుఫ్ దాదాకేల్కరు నిట్ల అడిగెను: " ఆ మాటలలో బాబా యుద్దేశమేమి?" కేల్కరు యిట్లు జవాబు ఇచ్చెను: "నాకు గూడ బాబా చెప్పిందతయు తెలియదుగాని, వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుఱ్ఱమునగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిదియుండల లద్ది యనగా నవవిధభక్తులు. అవి యేవన 1. శ్రవణము(వినుట) 2. కీర్తనము (ప్రార్థించుట) 3. స్మరణము (జ్ఞప్తియందుంచుకొనుట) 4. పాదసేవ (పాదసంవాహనము) 5. అర్చనము (పూజ) 6. నమస్కారము (వంగి నమస్కరించుట) 7. దాస్యము (సేవ) 8. సఖ్యత్వము (స్నేహము) 9. అత్మనివేదనము (అత్మను సమర్పించుట).

"ఇవి నవవిధభక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమును హృదయపూర్వకముగ అనుసరించిన యెడల భగవంతుడు సంతుష్టి జెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు -- అనగా జపము, తపము, యోగము, అధ్యాత్మికగ్రంథముల పారాయణము, వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొ గునవి -- నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నియు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ అ వర్తకుడ ననుకొనుము. లేదా సత్యమును దేలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలే నవవిధభక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలె నవవిధభక్తులను అచరణలో పెట్టుటకు సిద్దముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము, శాంతి కలుగును."

అ మరుసటి దినము పాటంకర్ బాబాకు సమస్కరించుటకు పోగా, "తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను ప్రోగుచేసితివా లేదా?" యని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహయుడనియు, బాబా అనుగ్రహముచే మాత్రమే వాని సులభముగా ప్రోగుచేయవచ్చు ననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని యాశీర్వదించెను. పాటంకర్ యపరిమితానంద భరితుడయ్యెను.

పండరీపురము ప్లీడరు

ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరీంచుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురమునుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను; జరుగుచున్న సంభాషణ వినుట కొక మూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. "ప్రజలెంత టక్కరులు? వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు. కాని, చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా?" అ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రము గ్రహించెను. కాని అక్కడ యేమియు మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట, ప్లీడరు కాకాసాహెబు దీక్షితుతో ఇట్లనియెను: "బాబా చెప్పినదంతయు యదార్థమే, అ బాణము నాపయి ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్‌జడ్జియగు నూల్కర్ తన యారోగ్యాభివృద్దికొరకు శిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతిగదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే భాదపడుచున్న సబ్‌జడ్జి యౌషదమును సేవించక, శిరిడీకి పోయిన మాత్రమున బాగగునా? అని మాట్లడుకొనిరి. సబ్‌జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడ అందు కొంత భాగము వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దుషించరాదు. ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసికొనరాదు."

పండరీపురమునకు శిరిడీ మూడు వందల మైళ్ళు దూరమున నున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరుగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు, వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడ గలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదవగలిగిరి. వారికి తెలియని రహాస్యమేదియు లేదు. దగ్గర నున్నవి దూరముగ నున్నవి ప్రతి వస్తువు కూడ పగటి కాంతివలె వారికి తేటతెల్లము. ఎవడయిన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనిని బట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ హ్యఖ్యనము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.

ఇది యొక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదముగాక.

సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము అట్టిదే. వారి పరబ్రహ్మముయొక్క యవతారమే.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదియొకటవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు