శ్రీ సాయిసచ్చరిత్రము /16-17వ అధ్యాయములు

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (16-17వ అధ్యాయములు - 3వ రోజూ పారాయణము )



శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ రోజూ పారాయణము శనివారము 16-17వ అధ్యాయములు బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట!


గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కు నెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు అమోదించెనో చెప్పితిని. ఏకొంచెమైనను భక్తిప్రేమలతో నిచ్చినదానిని అమోదించెదననియు, గర్వముతోను అహంకారముతోను ఇచ్చిన దాని తిరస్కరించెదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణసచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురుసాయికంటె నుదారస్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు. ఏలన, యవి మనము కోరునవి మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునై అత్మసాక్షాత్కారము ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట చెప్పుదును.

సకలైశ్వర్యముల ననుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిండ్లను ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వాని కనేకమంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే శిరిడీకి పోయి బాబా పాదముల పైబడి బహ్మజ్ఞానము ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడిట్లనెను: "బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైనపని కాదు. ముఖ్యముగా నీవంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటివానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు?"

తన స్నేహితుని సలహలను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు శిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి యిట్లనేను: "బాబా! ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనింతదూరమునుంచి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును". బాబా యిట్ల బదులు చెప్పెను: "ప్రియమైన స్నేహితుడా! అతురపడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మను జూపెదను. నాది నగదు బేరమే గాని యరువు బేరము కాదు. అనేకమంది నా వద్దకు వచ్చి ధనము, అరోగ్యము, పలుకుబడి గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచికవిషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని యడుగువారు చాల తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. పారమార్దక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీవంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగు సమయము శుభమైనది; శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నింటిని జూపెదను."

ఇట్లు బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరుచునట్లు చేసెను. ఒక బాలుని బిలిచి నందుమార్వాడి వద్దకు బోయి 5 రూపాయిలు చేబదులు తెమ్మనెను. కుఱ్ఱవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి యున్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి యప్పు తెమ్మని బాబా యనెను. ఈ సారి కూడ కుఱ్ఱవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయెను.

సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మవతారమేయని మనకు తెలియును. అయినచో 5 రూపాయిల అప్పు చేయవలసిన యవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును. వారికి అ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తేలిసియే యుండును. ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపించి యుందురు. అ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలసి యున్నచో, బాబా యంత ప్రయాసపడుచున్నప్పు డతడూరకనే కూర్చుండడు. బాబా యా పైకమును తిరిగి యిచ్చి వేయునని కూడ వానికి తెలియును. అంత చిన్న మొత్తముయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట! నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయల తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకునివలె ఊరికే చూచుచు కూర్చుని యుండడు. ఈ పెద్దమనిషి వైఖరి శుద్ద విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞన మివ్వుమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబ యిట్లనేను: "ఓ మిత్రుడా! నేను నడుపుచున్నదాని నంతటిని గ్రహించలేకుంటివా యేమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన: - 1. పంచ ప్రాణములు 2. పంచేంద్రియములు 3. మనస్సు 4. బుద్ది 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాల కఠినమయినది. అది కత్తివాదరవలే పదునైనది.

అట్లనుచు బాబా విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను. వాని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి:

బ్రహ్మజ్ఞానము లేదా అత్మసాక్షాత్కారమునకు యోగ్యత

అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు త్రీవమయిన కోరిక

ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడివడుటకు కృతినిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు అధ్యాత్మికజీవితము కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట

ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థికరంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనికి జూచుట)

మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు కనుక మనుష్యుడెప్పుడు బయట నున్న వానిని చూచును. కాని అత్మసాక్షాత్కరము లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడవలయును.

4. పాపవిమోచన పొందుట

మనుష్యుడు దుర్మార్గమార్గమునుండి బుద్దిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడ అత్మసాక్షాత్కారము పొందలేదు.

5. సరియయిన నడవడి

ఎల్లప్పుడు సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు బ్రహ్మచారిగ నుండిగ గాని అత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవాని కంటె శ్రేయస్కరమైనవానిని కోరుట

లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది ప్రీతికరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటిదానిని అనగా శుభమైనదానిని కోరును. బుద్ది తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధినమందుంచుకొనుట

శరీరము రథము; అత్మదాని యజమాని; బుద్ది ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱముల వలె) వాడు గమ్యస్థానమును చేరలేడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించుశక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనముందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱము వలె) ఎవడు తన బుద్దిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు; విష్టుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట

మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించని యెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైన దానిని కనుగొనుట) వైరాగ్యము (అసత్యమైన దానియందభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా అత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, అత్మసాక్షత్కారమున కవకాశము లేదు. దేహమే ’నేన’ నుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమందభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీవాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో యీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత

అత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమునైనది. ఎవ్వరైన తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక అత్కసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా అధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీదనుంచి యింకొక పైమెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము

ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమునుండి తరింపజేయగలడు. "వేదము లభ్యసించుటవల్ల గాని మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానమువల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. అత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు"నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు తిరిగి "అయ్యా! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్లు రూపములో (250) నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము" అనెను. అ పెద్ద మనుష్యుడు తన జేబునుంచి నోట్లకట్టను బయటకు దీసెను. లెక్కపెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపైబడి వారి యాశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా యిట్లనేను. "నీ బ్రహ్మపు నోటుకట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమైయున్నదో, వాడా యాభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంభావమును మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్దవైరము గలవి.

ఎక్కడ పేరస గలదో యక్కడ బ్రహ్మము గూర్చి యాలోచించుటకు గాని, దానిని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని, మోక్షమును ఎట్ల సంపాదించగలడు? లోభికి శాంతిగాని సంతుష్టిగాని, దృఢ నిశ్చతముగాని యుండవు. మనస్సునందేమాత్రము పేరాసయున్నను సాధనలన్నియు (అధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ర్పయోజనములు.

ఎవడు ఫలాపేక్షారహితుడు కాడో, ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. అత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియవిషయముల గూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ర్పయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన అధ్యాత్మిక ప్రయత్నములన్నియు అడంబరము డాంబికము కొరకు చేసినట్లుగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజనా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దాని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొన యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షీంచవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అ సత్యములు పలుకను!"

ఒక యతిథిని ఇంటికి బొలిచినప్పుడు, ఇంటిలోనివారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు గూడ అతిథి తో పాటు విందులో పాల్గొందురు. కావున నప్పుడు మసీదులో నున్నవారందరు బాబా అ పెద్దమనిష్యునకు చేసిన యీ అధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును, అ పెద్ద మనిషితో సహ, మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవరై వెళ్ళిపోయిరి.

బాబావారి వైశిష్ట్యము

అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, అశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యమునుగాని, మోక్షముగాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరులగూర్చి యాచించక అత్మానుసంధానమందే మునిగి యుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులుగాని లేరు. అయిన్నప్పటికి వారు సమాజములోనే యుండెడివారు. బాబా నాలుగయిందిండ్లు నుండి భిక్షచేసి, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చునెడువారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో బోధించెడువారు. అత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజలు క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. అట్టివారులో శ్రీసాయిబాబా ప్రథమగణ్యలు.

కనుక హేమడ్‌పంతు ఇట్లు చెప్పెను. "ఏ దేశమునందు సాయిబాబా యను యీ అపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము! ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము! ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు!’


శ్రీ సాయినాథాయ నమః 16-17వ అధ్యాయములు సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు