శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదియైదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదియైదవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదియైదవ అధ్యాయము ఊదీ మహిమ: 1. కాకామహజని స్నేహితుడు, యజమాని 2. బాంద్రా అనిద్ర రోగి 3. బాలాజీ పాటీల్ నేవాస్కర్


ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగోబడుట గూడ చెప్పడినది. బాబాను పరీక్షించు కథ మొట్టమొదట చెప్పబడును.

అధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు, శాఖలు మన యభివృద్దికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారము గలవాడని నమ్మువారిని ఖడించి యది వట్టి భ్రమ యనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే. కనుక వారుకి నమస్కరింపనేల? యందురు. ఇతర శాఖలవారు కూడ అక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇరతయోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేల? యందురు. సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. శిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము లెక్కడ? అని విమర్శించి. అనేకమంది బాబాను వెక్కిరించుటకు శిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్ధంచుట కచటనే నిలచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణలీ దిగువ నిచ్చుచున్నాము.

కాకామహాజని స్నేహితుడు

కాకామహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతు నారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు శిరిడీకి పోవనంగీకరించెను. కాని, బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము శిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజనీ స్నేహితుని మంచి మాటలతో నాహ్వనించెను. అకంఠధ్వని మిక్కిలి విచిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. అ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు అకర్షణశక్తి యేమని చెప్పుదురు? మిగుల నాశ్చర్యపడి యా స్నేహీతుడు "ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే" యనెను. వెంటనే మసీదు లోపలకు వెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.

ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మాహాజని యిచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచి పెట్టుచున్నారు?" అనెను. "నీవే బాబాను అడుగుము" అని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకామహాజని నడుగగా, తన స్నేహితుడు తాను కూడ దక్షిణ యివ్వవచ్చునా యని అడుగుచున్నాడనెను. బాబా "నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను. కాన నిన్నడుగ లేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్న యెడల ఇవ్వవచ్చు" ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడ ఇచ్చెను. బాబా యప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా నిట్ల చెప్పెను. "నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొనగలము!" పొవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. అకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమో యను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చి పడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వరా యెగిరిపోయెను. తానే కిటికీలు తెరచియుంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను.

కాకామహాజని - యజమాని

ఠక్కర్ థరమ్స్ జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు కొక కంపెని గలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా శిరిడీకి అనేక సారులు పోవుట, కొన్ని దినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగున్నవి ఠక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు అసక్తితో, ఠక్కర్ కాకాతో హొళీ సెలవులలో శిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా యెప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు. కనుక ఠక్కురింకొకరిని వెంట తీసికొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలదేరిరి. బాబా కిచ్చటకై కాకా రెండు సేర్లు యెండు ద్రాక్ష పండ్లు (గింజలతో నున్నవి) దారిలో కొనెను. వారు శిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబు తర్ఖడుండెను. ఠక్కర్ మీరెందుకు వచ్చితిరని తర్ఖడు నడిగెను. దర్శనము కొరకని తర్ఖడు జవాచిచ్చెను. మహిమలేమైన జరిగినవాయని ఠక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను.

కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచి పెట్టమని యాజ్ఞాపించెను. ఠక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహ యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టము లేదు. కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులొ గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను? ఈ యాలోచన అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. గాన నాతనిపై నీ యద్బుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సు గనిపెట్టి గింజలు గల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షీంచుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ఠక్కరు అశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము ధృడపరచుటకై బాబా యదార్థముగా యోగి యైనచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను. అతని మనస్సునందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకా వద్ద నుంచి యెండు ద్రాక్షల పంపీణీ ప్రారంభింపవలయునని యాజ్ఞపించెను. ఈ నిదర్శనముతో ఠక్కరు సంతుష్టి చెందెను.

శ్యామా ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా యిట్లనెను. "అతడెట్లు యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు." కాకా యీ జవాబుకు చాలా ప్రీతిచెందెను. తన మనోనిశ్చయము మరచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యహ్నహారతియైన పిమ్మట, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను.

"ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యుడుండెను. అతనికి అరోగ్యము ఇశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటము పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనఃశాంతి పోగోట్టు కొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నియు వదలివేయచుండెను. మరొకప్పుడు వానిని మౌయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లెకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కిష్టము వచ్చినచోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకేచోట నాశ్రయించుకొని నిలకడ నుండు" మని చెప్పెతిని.

వెంటనే ఠక్కర్ యిదియంతయి తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలె నునుకొనెను. కాని కాకాకు అంత త్వరగా శిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని యెవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞాడనుటకు ఠక్కర్ కింకొక నిదర్శనము దొరికెను.

బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను. "నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచిగాని తీసికొనినచో దాని పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరక యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయి పోవును. గతజన్మలో నీవిచ్చియుంటెనే గాని, నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననిచో, దానిని ప్రస్తుత మితరులకిచ్చుటే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.

ఈ మాటలు విని, ఠక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. శిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన అతని సంశయము లన్నియు తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను.

అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమయునది. అన్ని బాబాయే చేయుచున్నను. దేనియందుభిమాన ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా యొవరిని అవమానించలేదు. తనను పుజించినందుకు బాబా గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు.

నిద్రపట్టని రోగము

బాంద్రానివాసి, కాయస్థప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాల కాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాదు. ఇది అతని నిద్రను భంగపరుచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి యేమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబాభక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదీయే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహ ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగత పోట్లమును తలక్రింద దిండుకు దిగువ పెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము, అశ్చర్యము కలుగునట్లు అతనికి మంచినిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారమునాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను.

బాలాజీ పాటీలు నేవాస్కరు

ఇతడు బాబాకు గొప్పభక్తుడు. ఇతడు ఫలాపేక్షలేకుండ చాల మంచి సేవ చేసెను. ఇతడు శిరిడీలో బాబా యేయే మార్గములు ద్వార పొవుచుండెనో వాని నన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని యనంతరము ఈపని రాధాక్రిష్ణమాయి యతిశుభ్రముగా నెరవేర్చుచుండెను. అమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా యిచ్చినదానితో తన కుటుంబమును పోషించుకొనువాదు. ఈ ప్రకారముగా నతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దాని నవలంభించెను.

ఊదీ ప్రభావము

ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబమువారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజనసమయానికి పిలచినవారికంటె మూడురెట్లు బంధవులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్దములు వచ్చినవారికి చాలవనియు, కుటుంబగౌరవమునకు భంగము కలుగుననియు అమె భయపడెను. అమె యత్తగారు ఓదార్చుచు, "భయపడకుము. ఇది మనది కాదు. ఇది సాయి యాహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పి వేయుము. వానిలో కొంచెము ఊదీ వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండ వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును." అనెను. అమె సలహ ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజనపదార్థములు సరిపోవుటయేగాక ఇంక చాల మిగిలెను. తీవ్రముగా ప్రార్దించినచో యథప్రకారము ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది.

సాయి పామువలె గాన్పించుట

ఒకనాడు శిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో నున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. అనాడు సాయింకాలము మొకపాము అవులకొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్ని భయపడి కదలజొచ్చెను. ఇంటీలోని వారందరు భయపడిరి. కాని బాలాజీ శ్రీసాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నితో పాలు దెచ్చి సర్పము ముందు బెట్టి యిట్లనెను, "బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ యలజడి? మమ్ము భయపెట్ట దలచితివా? ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము." ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదకినా కనిపించలేదు.

బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు శిరిడీకి పొవుచుండెడివారు. బాబా వారికొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదియైదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు