శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదియారవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదియారవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదియారవ అధ్యాయము ఊదీ మహిమ: 1. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు 2. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్‌కర్ భార్య - వింత కథలు

ఇద్దరు పెద్దమనుష్యులు

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి, బాబా పాదములకు సాష్టాంగనమస్కరించిరి. ఇద్దరు కలసి వచ్చినప్పటికి బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ యిమ్మనెను. ఇంకొకరు ఆడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి అశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను. "ఇది యేమి? ఇద్దరు కలసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి. రెండవవానిది తిరస్కరించితివి. ఎందులకీ భేదభావము?" బాబా యిట్లు జవాబిచ్చెను. "శ్యామా! ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి, ఋణవిమోచనము పొందును. నాకిల్లుగాని, అస్తిగాని, కుటుంబముగాని కలవా? నాకేమి యక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను, ఋణము, శతృత్వము, హత్యచేసిన దోషము చేల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు." పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను. "ప్రప్రథముగ అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటినెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల యద్యోగము దొరికెను, క్రమముగా జీతము పెరిగి 15 రూపాయలనుంచి 30,60,100,200 లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యము ననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే ( 15 రూపాయలు) నేను దక్షిణరూపముగా నడిగితిని."

ఇంకొక కథ

సముద్రతీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనమువద్దకు వచ్చి, దాని వసారపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చుపి యక్కడ పరుండు మనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా ఆ మనిషి యొక రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల ప్రవేశించి నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగిలించెను.నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు కూర్చుంటిని, పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించె ననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యెను. వసారపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచు నే నేడ్చుచుండుట జూచి యెందుల కేడ్చుచుంటివని యడిగెను. నేను జరిగిన వృతాంతము చెప్పితిని. వారిట్లనిరి, "నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నే నిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈ లోగా నీకు ప్రియమైన యాహరమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జ్ఇంపుము." నేను ఫకీరు చెప్పినట్లు నడచుకొంటిని. నాపైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు పోయితిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేక పోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది యింకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి యీ మసీదుకు వచ్చితిని.

కథ పూర్తిగా కాగానే బాబా ఆ యతిథులను భోజనముకొరకు తీసికొని పొమ్మనగా శ్యామా యట్లే చేసెను. శ్యామా వారి నింటికి దీసికొనిపోయి భోజనము పెట్టెను. భోజనసమయములో శ్యామా బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనెను. బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి యుండలేదు. వారివద్ద 30,000 రూపాయ లెప్పుడు లేకుండెను. ఎన్నడు ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడును పొవుటగాని వచ్చుటగాని జరుగలేదు. కాన దాని భావము తమకేమైన దెలిసినదా? యని వారినడిగెను. అతిధుల మనస్సులు కరగెను. వారి కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు "బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే" యని నడివిరి. "బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారి చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెద" మనిరి.

భోజనసమయము పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు నిట్ల చెప్పిరి. "లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటినేలజీతము నిచ్చెదనని దత్తదేవుని మ్రొక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 రూపయల యుద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా యివ్విధముగా జ్ఞప్తికి దెచ్చి నావద్ద 15 రూపాయలు తీసికొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ; తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట."

నీతి

బాబా యెన్నడు డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా తమ భక్తులు కూడ భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు. వారి ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి యొక నిదర్శనము. అయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనవసతికి కూడ జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించులేదు; దక్షిణలో నుండి కూడ ఏమియు ఈయలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాల ద్రవ్యము బాబా సముఖమున మహల్సపతి కిచ్చెను. కాని బాబా దాని పుచ్చుకొనుటకు కనుమతించలేదు.

పిమ్మట రెండవ యతిథి తన కథ నిట్లు ప్రారంభించెను. "నా బ్రాహ్మణ వంటమనిషి నావద్ద 35 సంవత్సరములు నుండి నౌకరి చేయుచుండినను, దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి, ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్నీని దొంగిలించి పారిపోయెను. బాబా సరగ్గా ఆ మొత్తమునే యెట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు విఫలమైనవి. ఒక పక్షమువరకు చాల యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నాస్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నియు దెలిపితిని. అతడు "శిరిడీసాయి యను ఔలియా యున్నారు వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహరము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రీయమైన యాహారమును తిననని మ్రొక్కుకొనుము." అనెను. నేనట్టులే "బాబా! నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట, నేనన్నము తినెదను" అని మ్రొక్కుకొంటిని.

"దీని తరువాత 15 దినముల గడచెను. బ్రహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నాశరణు వేడెను. వాడిట్లనియెను. "నేను పిచ్చి యెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము." ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన శిరిడీ సాయిబాబాను చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది. మాయింటికంత దూరము వచ్చినవారు శిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. ఎవరయితే నాకు కనపడి నా ద్రవ్యము తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయలు కొరకు పేరస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్దనుంచి యేమియు అశించక, ఎల్లప్పుడు తమ చేతనయినంతవరకు బాబా మమ్ములను అధ్యాత్మికమార్గమున నడిపింతురు.

దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. శిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడనుండి స్టీమర్ మిద బొంబాయి వెళ్ళి అటునుండి శిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హర్బరు వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కేప్టెను ఒప్పుకొనలేదు కాని, నాకు పరిచయము లేని ఒక నౌకరురొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయి తీసికొనివచ్చెను. అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, మేమెక్కడ? మా యిల్లేక్కడ? మా యదృష్టమేమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యము తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొనివచ్చెను. శిరిడీ జనులారా! మీరు మాకంటె పుణ్యాత్ములు, మాకంటె యదృష్టవంతులు. ఏలన, బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి యెన్నొ సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను శిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను అజ్ఞాపించిరి. స్టీమరులో జాగా యిప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారు సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి.

ఔరంగబాదుకర్ భార్య

షోలాపూరు నివాసియగు సఖారామ్ ఔరంగాబాద్‌కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేకదేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో శిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు రెండు నెలలు గడపెను. అమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టు భక్తమండలి మూగి యుండువారు. బాబా నొంటరిగా జూచి, వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తన కొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై అమె కనిపెట్టుకొని యుండెను. తుట్టతుదకు శ్యామా కీసంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగ జేసికొనుమనెను. శ్యామా, బాబా దర్బారెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను అమెగూర్చి ప్రయత్నించెదననియు సాయి ప్రభువు అశీర్వదించవచ్చు ననియు చెప్పెను. బాబా భోజనసమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులలో సిద్దముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదుపైకి రావలననియు చెప్పెను. ఒకనాడు శ్యామా మధ్యాహ్న భోజనాంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామ్ కోపగించి "దేవా! నా బుగ్గను గిల్లుట తగునా?" మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము?" అనెను. బాబా యిట్లనెను. "శ్యామా! 72 జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది." శ్యామా యిట్లనియెను. "ఎల్లప్పుడు ముద్దులు, మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీనుండి మాకు గౌరముగాని, స్వర్గముగాని, విమానముగాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మాకెప్పుడు నుండుగాక" బాబా యిట్లనెను. "అవును, నేను వచ్చినది యందుకే. ఇన్నాళ్ళనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి."

ఆట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపయి కూర్చొనెను. శ్యామా యామెను సైగచేసి రమ్మనెను. అమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరవత్తు లిచ్చెను. బాబా ఆ టెంకాయి నాడించెను. అది యెండుది కనుక లోపల కుడుక అడుచు శబ్దము వచ్చుచుండెను.

బాబా:- శ్యామా! యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది యేమనుచున్నదో విను!

శ్యామా:- అమె తన గర్బమందు ఒక బిడ్డ అటులే అడవలెనని వేడుచున్నది కాన, టెంకాయ నీ యాశీర్వాదముతో నిమ్ము!

బాబా:- టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు?

శ్యామా:- నీ మాటల మహిమయు, అశీర్వాదప్రభావమును నాకు దెలియును. నీ యాశీర్వాదమే అమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు అశీర్వాదమును ఇవ్వకున్నావు.

ఈ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదేపదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి " అమెకు సంతానము కలుగు" ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయ పగులగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవచిప్ప నామె కిచ్చిరి.

అప్పుడు శ్యామా యా స్త్రీవైపు తిరిగి "అమ్మా! నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని తలపై నొక టెంకాయ గొట్టి ఈ మసీదునుంచి తరమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడ గాను. మీరు దీనిని జూచెదరు గాక!" యనెను.

అమె ఒక సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసికొనివచ్చి భార్యభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయ లిచ్చెను. బాబా గుఱ్ఱము ’శ్యామాకర్ణ’కు ఈ ధనములో శాల కట్టించెను.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదియారవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు