శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదియేడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదియేడవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదియేడవ అధ్యాయము చావడి యుత్సవము


హేమడ్‌పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవమును గూర్చి వర్ణించున్నాడు.

తొలిపలుకు

శ్రీసాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మనందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు గన్పించినప్పటికి వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడువారు కారు. వారు ఎల్లప్పుడు అత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముగా తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు, కనుగొనరానివి. వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవా రెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలితబ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక! వారిని సకలజీవకోటియందు జూచెదము గాక! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక!

వేదాంతసంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడ్‌పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను.

చావడి యుత్సవము

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిశంబరు 10వ తేదినుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుప మొదలిడిరి. బాబా కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజబృందము వెనుక రథము, కుడివైపు తులసీబృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజయందు ప్రీతి గల స్త్రీపురుషులు సరిమైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజిరా, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమవద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగస్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీ నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి ’శ్రీసాయినాథ మహారాజ్‌కీ జై!’ యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుఱ్ఱము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పెడివారు. బాబా నిశ్చలముగా కూర్చునెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను ’మామా’ యని పిలచెడివాడు. నిజముగా వారి బాంధవ్యము సన్నిహితమయినది. బాబా శరీరముపై మాములు కఫనీ వేసికొని చంకలో సటకా పెట్టుకొని, చిలుమును పోగాకును తీసికొని పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్దపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారు శెల్లాను బాబా ఒడలిపై వేసెడివాడు. ఆటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతిలో మండుచున్న దీపమును నార్పి, చావడికి బయలుదేరెడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబామందుసామాను లనేకరంగులు ప్రదర్శంచుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహయముతో భజన చేయుచు ఉత్సవములో నడచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు "శ్రీసాయినాథ్ మహరాజ్‌కీ జై!’ అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడచేడువారు. తాత్యాయెడమచేతిని, మహల్సాపతి కుడిచేతిని, బాపూ సాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలకరించిన యెఱ్ఱ గుఱ్ఱము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహ ముండెడిది. హరినామస్మరణతోను, బాబా నామస్మరణతోను అకాశము బ్రద్దలగునటుల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గోనువారందరు అనందించుచుండిరి.

ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్యవలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరముపైవ్పు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగు చున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు అడించెడివారు. అట్టి సమయమున కాకా సాహెబు దీక్షీత్ ముందుకు వచ్చి, యొక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్వీగుణీకృత ప్రకాశముతోడను, సౌందర్యముతోడను, వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశము మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడానందమును భరించలేక మహల్సపతి దేవత యావేశించినవానివలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యాన మేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీల్ బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్తమహాల్సపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివారు. ఈ యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెడివారు. భక్తిప్రేమలతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడచుచుండెడివారు. వాతావరణమంతయు అనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును.

చావడిని బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పై కప్పుతోను, నిలువుటద్దముతోను, అనేక రంగుల దీపములతోను, వ్రేలాడగట్టిన గాజుబుడ్డీల తోను అలంకరించుచుండిరి. చావడీ చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి బాలిసు నుంచి బాబాను కూర్చుండబేటి మంచి యంగరఖా తొడిగించినపిమ్మట భక్తులు బాబాను వేయు విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టను పెట్టి మనఃస్పూర్తిగా బాబా వైపు హృదయనందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారి భయము. బాబా భక్తుల యంతరంగమును గ్రహించి వారి కోరికలు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి.

నానా సాహెబు నిమోన్‌కర్ గిఱ్ఱున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసులపై అనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాల్సకు ఇచ్చెడువారు. తదుపరి యితరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రోక్కుట, ఎండలో అరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు పూలదండలు బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యమోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క పెట్టువారుకారు. భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారు యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. అఖరుకు బాపూసాహెబు జోగ్ సర్వలాంఛముతో హారతి నిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రీ మేళాతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు అశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత ఒకరు తమతమ యిండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనును. "నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము." అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పొవుచుండెను. బాబా తన పరువును తానే యమర్చుకొనువారు. 50,60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.

మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి, ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదియేడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు ఐదవరోజు పారాయణము సమాప్తము