శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదితొమ్మిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదితొమ్మిదవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదితొమ్మిదవ అధ్యాయము 1. హరి కనోబా 2. సోమదేవస్వామి 3. నానాసాహెబు చాందోర్కరు - కథలు


వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబా ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచుచ్న్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకున్నచో మంచి పిండివంటలు కూడ రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడ అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము. స్నేహితులు, బంధువులు కలసినచో చాల బాగుగా నుండును.

ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్యశరణాగతి యొనర్చి వారియందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నిటికంటే మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు. వారి యాకారమును మనస్సును భావించుకొనుచు. వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్తకార్యములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించు కొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యము మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. ఇక నీ యధ్యాయములోని కథలవైపు మరలుదము.

హరి కానోబా

హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తన స్నేహితువల్ల బంధువులవల్ల బాబాలీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమని అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు శిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా యుండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంతదూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు బోయి సాష్టాంగనమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్త చెప్పులెచట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారము చేసి ఊదీని, ప్రసాదము బాబా చేతినుండి యందుకొని తిరిగివచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పలకొరకు వెదకెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. చాల చికాకు పడుచు బసకు వచ్చెను.

అతడు స్నానము చేసి, పూజ చేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాటీ కుఱ్ఱవాడు తనవైపు వచ్చుట చూచెను. ఆ కుఱ్ఱవాని చేతిలో నొక కఱ్ఱ యుండెను. దాని చివరన క్రొత్త చెప్పులజత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపెననియు వీథిలో "హరీకా బేటా, జరీకా ఫేటా’యని యరచుమనియు చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగ గలదా యను సంగతి పరీక్షించి తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెననెను. ఈ కుఱ్ఱవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుఱ్ఱవానివద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగను చూపెను. ఆ కుఱ్ఱవాడు సంతృప్తి జెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగ యందరికి కనిపించవచ్చుగాని, తన పేరు, తన తండ్రి పేరు బాబా కెట్లు దెలిసెను? అదియే శిరిడీకి మొదటిసారి తన రాక, అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయమువల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో నింటికి పోయెను.

సోమదేవస్వామి

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయమునకు బోయినప్పుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగ్రోతికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయిజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను శిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతని గట్టికోరిక కలిగెను. భాయీజీ వద్దనుంచి పరిచయపుటుత్తరమును దీసికొని శిరిడీకి పోయెను. మన్మాడు, కోపర్‍గాం దాటిన పిమ్మట టాంగా చేసికొని శిరిడీకి పోవుచుండెను. శిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పైపై గుర్తులను బట్టి యే యోగియొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. రెండు పతాకము లెగురుట చూడగనే తనలో తాను "ఈ యోగి జండాలయందేల మక్కువ జూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది" అనుకొనెను. ఇట్లు అలోచించుకొని, శిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. " అట్లయిన ఇంత దూరము వచ్చితి వేల? జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో శిరిడీలో రథము, పల్లకీ, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు?" సోమదేవస్వామి గాభరాపడి యిట్లనెను " గుఱ్ఱములతోను, పల్లకీతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు" అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణీకులు అతనిని తన ప్రయత్నమును మాని శిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములనుగాని కీర్తిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని అయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి శిరిడీ పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి.

సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటిలో నిండెను; గొంతుక యార్చుకొని పోయెను. అతని కుంటి యాలోచన లల్నియు నడుగంటి పోయెను. "ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పోంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము" అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా "మా వేషము మాదగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు" అనెను. ఆ స్వామి మిగుల అశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికి కిచ్చుట, యిట్లు అందరిని అనందింపజేసి, సంతృప్తి పరుచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగ జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగమున నున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధిపొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వదమే యనుకొనెను. కొన్నాళ్ళు పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

నానాసాహెబు చాందోర్కరు

ఈ యధ్యాయమును హేమడ్‍పంతు నానాసాహెబు చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని యుండగా బీజాపూరునుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో ఘషా స్త్రీ లుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేవనెంచెను. కాని బాబా యతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖసౌదర్యమును జూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును జూచి, స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట, బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చికాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు, గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియు దోషములేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నేరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి యెట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. " మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచు కొనలేము. సమయనుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రము లందమైనవానిని జూచుట కొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకుగాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావుపుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదము గ్రహించుట) సారథిగా, మనస్సు స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింపజేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచట నుండి తిరిగి వచ్చుటలేదు.



శ్రీ సాయినాథాయ నమః నలుబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు