శ్రీ సాయిసచ్చరిత్రము /ఏబదియవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఏబదియవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ఏబదియవ అధ్యాయము 1. కాకాసాహెబు దీక్షీత్ 2. టెంబెస్వామి 3. బాలారామ్ ధురంధర్ కథలు


శ్రీసాయిసచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తముగూడ నిదియే కనుక, సచ్చరిత్రలోని 51వ అధ్యయ మిచ్చుట 50వ అధ్యాయముగా పరిగణించవలెను.

భక్తుల కాశ్రయము శ్రీసాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందన వృక్షము మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షమును గురుపించి చల్లదనము కలుగ జేయుచున్నవి. వసంతఋతువునందు పుష్ఫములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతములను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు.

కాకాసాహెబు దీక్షీత్ (1864-1926)

మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రహ్మణ కుటుంబములో హారిసీతరామ్ ఉరుఫ్ కాకాసాహెబ్ దీక్షీత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్‍ఘాట్‍లలో పూర్తి చేసెను. నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిస్‍స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్‍కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకనొక్కప్పుడు లొనావాలాలో నున్నప్పుడు, తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్‍ను జూచెను. ఇద్దరును కలసి యేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారి పడిన యపాయమును గూర్చి వర్ణించెను. వందలకొలది ఔషదములు దానిని నయము చేయలేక పోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెన్నచో అతడు సద్గురువుగు సాయిబాబా వద్దకు పోవలెనని నానాసాహెబు సలహ ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతము విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీదనుంచి గూడ పిచ్చక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొనివచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలు యొక్క కుంటితనముకంటే మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన యానందమును కలుగజేయుమని వేడుకొనెద" నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్‌నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‍లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరీకర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్‌గాంకు మామలతదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్‌నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు శిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రీ కొడుకులు వీరిని ఎవరివెంట శరిడీకి పంపవలెనా యని యాలోచించుచుండిరి. శిరిడీలో సాయిబాబా వీరిని అహ్వానించుటకు సిద్దపడుచుండెను. అహమద్‍నగరులోనున్న శ్యామా మామగారు తన భార్య అరోగ్యము బాగాలేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్‍నగరు చేసి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములొ గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు పాన్సే, అప్పాసాహెబు గద్రే శ్యామాను కలసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని శిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షీతుకు మిరీకరులకు శ్యామా అహమద్‍నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మిరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామాకు కాకాసాహెబు దిక్షిత్‍తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షిత్‍తో కోపర్‍గాం ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పొవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబా యొక్క పెద్దపటము మీద తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షీతుకు చూపెను. కాకాసాహెబు శిరిడీకి పొయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా నచట తన్ను అశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందుకు నాతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాల ద్వారా శిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటలకు లోపల స్టేషనకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండు క్లాసు క్రికిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కొపర్‍గాం దిగిరి. బండి దిగిగానే శిరిడీకి పొవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట శిరిడీకి బయలుదేరిరి. శిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకాసాహెబు మనస్సు కరిగెను. కండ్లు అనందబాష్పములచే నిండెను. అతడానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరిక తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపేను. శిరిడీలో నొక వాడను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబా వల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటి నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో " అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదిన అతడు హేమడ్‌పంతులో రైలులో ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్‍పంతు భుజముపై వాల్చి యే బాధము లేక, యెట్టి చికాకు పొందక ప్రాణములు విడచెను.

శ్రీ టెంబె స్వామి

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మక్కం చేసిరి. అయన గొప్ప నైష్ఠికుడు. పూర్వాచారపరాయణుడు. జ్ఞాని, దత్తత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లేడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రి పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు శిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి. "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువ వద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము" అయన స్వాములు సాధారణముగా నిరతులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది యొక అప్వాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును శిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబావలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహొత్రమును వెల్గించియే యుంచిరి.

ఒకనెల పిమ్మట పుండలీరావు తదితరులు శిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి. పరగడుపున నీళ్ళు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టముకొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది. శిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని, తన తప్పును అలక్ష్యమును వెలబుచ్చెను, పశ్చాత్తాపడచు, బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవున దింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా యిట్లనెను " ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని యనుకొననేల? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకార రహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును" ఎంత చక్కని వేదాంతవిషయమును బాబా బోధించెనో చూడుడు!

బాలారామ్ ధురంధర్ (1878-1925)

బొంబాయి దగ్గరనున్న శాంతాక్రజ్‍లో పఠారేప్రభుజాతికి చెందిన బాలారామ్ ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు భవచ్చింతన గలవారు. బాలారామ్ తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై యొక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టి మతము అధ్యాత్మిక విషయములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబా పరిచయము కలిగెను. 6నెలలు పూర్వము తన సోదరులగు బాబుల్జీయను, వామనరావును శిరిడీకి పోయి బాబాదర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు శిరిడీకి రాకమునుపే బాబా యిట్ల చెప్పెను. "ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచునారు." ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరులవలన విని విస్మయమొందిరి. తక్కిన వారందరు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని యుండిరి. బాబా వారి నిట్లనెను. "వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని". బాబా ధురంధర సోదరులతో నిట్లనెను "గత 60 సంవ్సతరముల నుండి మన మొండొరులము పర్చయము గలవారము." సోదరులందరు వినయధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి, బాబా పాదములవైపు దృష్టిని నిగిడించిరి. సాత్వికభావములు అనగా కండ్లనీరు కారుట, రోమంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట, మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారంద రానందించిరి. భోజనాంతరము కొంత విశ్రాంతి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారామ్ బాబాకు దగ్గరిగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారామ్ చిలుము పీల్చుట కలవాటు పడి యుండలేదు. అయినప్పటికి దాని నందుకొని కష్టముతో బీల్చెను. దాని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహసమాధి చెందెను.

వారు శిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి యువత్సవము జూచు భాగ్యము ధురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగవిఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

బాలారామ్ ధురంధర్ మరాటీ భాషలో తుకారామ్ జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందువారు శిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది.


శ్రీ సాయినాథాయ నమః ఏబదియవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథా౦ర్పణమస్తు శుభం భవతు