శ్రీ సాయిసచ్చరిత్రము /ఏబదియొకటవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఏబదియొకటవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ఏబదియొకటవ అధ్యాయము శ్రీసాయి సచ్చరిత్రములోని 52,53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను.


తుదిపలుకు

ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్‍పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను కాని యది హేమడ్‍పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బి.వి. దేవు (ఠాణా వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచరించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియునట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను బోల్చుకొనుట గూడ కష్టముగా నుండెను. కాని యదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్యవిషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి.

సద్గురు సాయియొక్క గొప్పదనము

శ్రీసాయి సమర్థునకు సాష్టాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందును వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, అకాశము మొదలుగ గలవాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే, వారికి మానావమానములు లేదు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లు చేసెదరు.

ఈ సంసారమనే మహసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనెడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనెడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడి గుండములును, ఇతరసంశయములును గిఱ్ఱున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వారు (అనగా, నాశనము చేయువారు). సాయిభక్తులకు దానివల్ల భయమేమి యుండదు. ఈ మహసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు.

ప్రార్థన

మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనులకొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండగాక. నివు దప్ప మరేమియు కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతిగృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణము చేసెదము గాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవు గాక!

ఫలశ్రుతి

ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, శిరిడీలో సమాధిని దర్శించి, సాయిసచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచొ నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీసాయి కథలను అలవోకగా విన్నను అధ్యాత్మికజీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రము ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రమునుండి తప్పించుకొనవలెనన్నచో సాయిలీలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము. వారి పాదములనే యాశ్రయింపుము. వానినే భక్తితో పుజింపుము. సాయిలీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీసాయి సగుణస్వరూపమునే ధ్యానించినచొ క్రమముగా నది నిష్క్రమించి అత్మసాక్షత్కరమునకు దారి చూపును. అత్మసాక్షత్కరమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపముద్వార పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడినచో నతడు ’తాను’ అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్‍స్వప్నసుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారి యందు లీనమయినచొ సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తి నమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపదలన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారివారి భక్తి నమ్మకములపై ఫల మాధారపడి యున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీసాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురుపౌర్ణమినాడు (అనగా, అషాఢశుద్దపౌర్ణమినాడు), గోకులాష్టమినాడు, శ్రీరామనవమినాడు, విజయదశమి నాడు (అనగా, బాబా పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన యెడల వారల కొరిక లన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీసాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన యేడల రోగులు అరోగ్యవంతు లగుదురు. పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల అలోచనలన్నియు పోయి తుదకు స్థిరత్వము కలుగును.

ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా ! శ్రోతలారా!

మీకు కూడ మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరీ లీలలను ప్రతిరోజు, ప్రతినెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువద్దు. ఈ లీలలు నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సహము, సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి, మీకుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహయము చేసికొని సుఖపడవలెను.

ప్రసాదము యాచనము

ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణభక్తి శ్రీసాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారు నేత్రములందు నిలచిపోవును గాక! వారి శ్రీసాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తథాస్తు!


శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయిసచ్చరిత్రము సర్వము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు