శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువది మూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువది మూడవ అధ్యాయము - 4వ రోజూ పారాయణము)


శ్రీ సాయిసచ్చరిత్రము నాల్గవ రోజూ పారాయణము అదివారము ఇరువది మూడవ అధ్యాయము 1. యోగము - ఉల్లిపాయి 2. శ్యామా పాముకాటు బాగగుట 3. కలరా నియమముల నుల్లంఘించుట 4. గురుభక్తి పరీక్ష


నిజముగా నీ జీవుడు త్రీగుణములకు అనగా సత్వరజస్తమోగుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని భాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను.

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారి అవతారపురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో యేవిషయములలోనూ పోటి పడెడివారు కారు. తనకొరకేమైనచేయుమని యితరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితముగదా! ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుటగాని వరెరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. ’నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయసేవకుడనని వారు చెప్పేవారు; భగవంతుని ఎల్లప్పుడు తలచువారు ఎల్లప్పుడు ’అల్లా మాలిక్" అనగా భగవంతుడే సర్వాధికారియని యను చుండెడివారు.

మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు, బద్దజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన పుణ్యమేమైన యున్నచో మహత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచోనట్లు జరుగదు. ఇక నీ యధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము.

యోగము - ఉల్లిపాయ

ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసహెబు చాందోర్కరుతో కలసి శిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నియు చదివెను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని యనుభవమేమియు లేకుండెను. అతడు మనస్సును క్రేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను. సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు శిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక యాలోచన మెదిలెను. ’రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నాకష్టము నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్దరించగలడు?’ సాయిబాబా యతని మనస్సున మెదిలిన అలోచనను గ్రహించి, నానాసాహెబుతో నిట్లనియెను. "నానా! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను." ఇది విని యోగి యాశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్యశరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృష్టి జెంది యానందించినవాడై బాబా ఊదీ ప్రసాదముతో అశీర్వచనములతో శిరిడీ విడిచెను.

పాముకాటు నుండి శ్యామను కాపాడుట

ఈ కథను ప్రారంభించకపూర్వము హేమడ్‌పంత్, జీవుని పంజరములొ నున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింపబడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహయకుడు వచ్చి వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారి దృష్టి యన్నిటికంటె గొప్ప స్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెను వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువ నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితులాతని విరోబా గుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విరోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే కోపముతో వాని తిట్టునారంభించెను. "ఓరి పిరికి పురోహితుడా! పైకెక్కవద్దు! ఎక్కితివో నేమగునో చూడు" మని బెదిరించుచూ, తరువాత ఇట్లు గర్జించెను: "పో, వెడలి పోమ్ము, దిగువకు పొమ్ము." బాబా యిట్లు కోపోద్దీరుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మసీదును తన యిల్లుగా, బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని, యిట్లునెను: " భయపడవద్దు, ఏ మాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పొవద్దు" నాయందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిలును, కాకాసాహెబు దీక్షితుని అతని వద్దకు పంపి, తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును అజ్ఞాపించిన మాటలు, ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరముంతట వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము కాని, తీర్థముగాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితము రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి.

ఎవరైన ఈ కథగాని, యింక నితరకథలు గాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహ సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.

కలరా రోగము

ఒకప్పుడు శిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయితీవారు సభ చేసి రెండత్యవసరమైన నియమములు చేసి, కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు; 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్షపెట్టలేదు. అ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యా సంగతి తెలిసికొని, అచ్చటికి వచ్చి కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరవు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెల కొనెను. నిత్యాగ్నిహొత్రివలె బాబా తన జీవితంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందులకయి వారికి కట్టెలవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము, అనగా మసీదు, ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళముగాని చెవి లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కఱ్ఱలను తీసికొనిపోవువారు. అందుకు బాబా యెప్పుడును గొణగుకొన లేదు. ఈ ప్రపంచయంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శత్రుత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణవిరాగులైనప్పటికి సాధారణ గృహస్థులకు అదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనములులో నున్నప్పుడెవరో యొక మేకను మసీదుకు తెచ్చిరి. అ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్దముగా నుండెను. అ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరుఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తి వ్రేటుతో నరికి బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. అయనను ఎల్లప్పుడు సాయిబాబా తన కుడివయిపున కూర్చొనబెట్టుకొనెడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి యితరులకు ఇచ్చెడివారు. మధ్యహ్న భోజనసమయమందు సాయిబాబా సాదరముగ బడేబాబాను పిలిచి, యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షీణ రూపముగా వసూలయిన పైకమునుంచి అయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడెబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. ఆట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబ నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను అపని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయివద్దకు పోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను. కాని వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరిక్షీంచవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తి దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్దముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణకుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయం దిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్దుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడ నప్పుడు ఈ బ్రహ్మణుడేల సిద్దపడుచుండెనని యందురాశ్చర్య పడుచుండిరి. అతడు తన ధోవతి ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురు చూచుచుండెను. బాబా "ఏమి యాలోచించుచుంటివి? నరకుము!" అనెను. అతని చేతిలో నున్న కత్తి మేకపై పడుటకు సిద్దముగా నుండగా బాబా అగు మనెను. "ఎంతటి కఠినాత్ముడవు? బ్రహ్మణడవయి మేకను చంపెదవా?" యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందిబెట్టి బాబాతో నిట్లనియె. "నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. మీరూపమును ధ్యానించుచు రాత్రింబగళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరియైనదా కాదా? యని వాదించము, తర్కించము, గురువు అజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము."

బాబా తామే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ’తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటికి దానిని తీసికొనిపోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ యధ్యాయము హేమాడ్‌పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకము 1. ఉత్తములు, 2. మధ్యములు 3. సాధారణులు

గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞపించక పూర్వమే దానిని నేరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యజ్ఞానుసారము అలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకమువారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని అజ్ఞను వాయిదా వేసెదరు.

శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ది కుశలత యోరిమి యున్నచో అట్టివారికి అధ్యాత్మికపరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాసవిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరుచుకొన్నచో, వారు ఉత్తరోత్తరపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

వచ్చే అధ్యాయములో బాబా యొక్క హస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందము.


శ్రీ సాయినాథాయ నమః ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు