శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదినాలుగవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదినాలుగవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదినాలుగవ అధ్యాయము బాబా హస్యము, చమత్కారము, శనగల లీల 1. హేమాడ్‌పంతు 2. సుదామ 3. అన్నా చించణీకర్ 4. మావిశీ బాయి - అనుభవములు.


ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగ అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకార రహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి యెవరయితే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హస్యము, చమత్కారభాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతపాలైనప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమడ్‌పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కథ

శిరిడీలో అదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ము చుండెడివారు. ప్రతిరోజు మధ్యహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా అదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక అదివారమునాడు హేమాడ్‌పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా యెడమపైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన బూటీ, కాకాసాహెబు దీక్షీత్ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణ్ణాసాహెబుతో, "నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము" అనెను. అట్లనుచు హేమడ్‌పంతు చొక్కచేతులను తట్టగా శనగింజలు నేల రాలెను. హేమాడ్‌పంతు తన చొక్క ఎడమచేతి ముందుభాగము సాచెను. అందరికి అశ్చర్యము కలుగున్నట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటన హస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు అశ్చర్యపడిరి. ఎవరికి తొచినట్లు వారు శనగలు చొక్కచేతిలో నెట్లు ప్రవేశించి యుండునో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కలో నెట్లు దూరి యచట నిలువగలిగినవొ హేమడ్‌పంతు కూడ గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యధ్బుతమున కాశ్చర్యపడుచుండుగా బాబా, "వీనికి (అణ్ణాసాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటి గలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది?" అనిరి. హేమాడ్‌పంతు:- బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. అయితే యీ దుర్గుణము నాపై నేల మోపెదవు? ఈ నాటికి ఎన్నడును శిరిడీలోని సంత చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర నున్నవారికి పెట్టకుండ నే నెప్పుడేమియు తిని యెరుగను. బాబా:- అవును అది నిజమే, దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవెదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?

నీతి

ఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియములకంటె ముందే, మనస్సు బుద్ది విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిదికూడ ఒక విధముగ భగవంతుని కర్పింతమగును. విషయములను విడిచి పంచేంద్రియము లుండవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియందభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఇవ్విధముగా, కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (అలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తిలన్నియు నిర్మూలనమగుటకు సహయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, ఆ వస్తువు నునుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచి పెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నియు నిష్ర్కమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధిపొందును. శుద్దజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్దిపొందినప్పుడు దేహబుద్ది నశించి, బుద్ది చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేదము లన్నింటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి అత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యేవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా ధ్యాన మెన్నొరెట్లు వృద్దిపొందును. బాబా సుగుణస్వరూపము మన కండ్లు యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము అకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.

సుదాముని కథ

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్‌పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడ ఇదే నీతి యున్నది. కనుక దానిని నిక్కడ చెప్పుచున్నాము.

శ్రీకృష్టుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదాముడనువాడును గురువగు సాందీపని యాశ్రయములో నివసించుచుండిరి. శ్రీకృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపని భార్య సుదాముని కూడ అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి "దాదా, నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది" అనెను. సుదాముడు, "ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి" దనెను. కాని తనవద్ద శనగలున్నవి, కొంచెము తినుమని యనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తల యుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లునెను. "దాదా యేమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది?" సుదాముడిట్లనెను. "తినుట కేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకట మనుచున్నవి. విష్ణుసహస్రనామమును కూడ సరిగా ఉచ్చరించలేకున్నాను." ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను. "నేనొక స్వప్ననము గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా?" యనెను. అనగా తినుట కేమియు లేదని భావము. రెండవాడు ’తథాస్తు’ అనెను. దాదా! యిది యొక స్వప్నము. నాకివ్వకుండ నీవేమియు తినవని నాకు తెలియును. స్వప్నప్రభావముచే నీవేమి తినుచుంటివని యడిగితిని." శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలుగాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసి యుండడు. కాబట్టి అతడు చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడుయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళుకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగార పట్టణము ననుభవించుటకు కిచ్చెను. ఎవరికయితే దగ్గరున్నవారి కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను.

శ్రూతికూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడ దీనినే హస్యరూపమునగా యుక్తితో బొధించెను.

అణ్ణా చించణీకరు, మావిశీబాయి

హేమాడ్‌పంతు ఇచ్చట నింకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరె వురుఫ్ అణ్ణాచించణీకర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు; ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను గాన్పించినను, వాడు మంచి హృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయునట్లే, యితడు కూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని (కఠడా పైన వేసి యున్నదానిని) తోముచుండెను. కుడియిపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. అమెను బాబా ’అమ్మా’ యని పిలిచెడివారు. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడివారు. అమె కూడ బాబాను సేవించుచుండెను. అమెది స్వచ్ఛమైన హృదయము. అమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. అమె దీనిని అతిత్రీవముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా తోముచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అణ్ణా ముఖమునునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె, "ఓహొ! అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా?" యనెను. అణ్ణాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను. "నేను ముసలివాడను దుర్మార్గుడననుచున్నవు. నేను వెఱ్ఱీవాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు." అక్కడున్నవారందరు ఈ ముసలివాండ్ర కలహము జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చివలెనని తల్చి యీ క్రింది విధముగా నేర్పుతో సమాధానముపరచిరి. బాబా ప్రేమతో "ఓ అణ్ణా! ఎందు కనవసరముగా గోల చేయుచున్నవు? తల్లిని ముద్దుపెటుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?" యనెను. బాబా మాటలు విని, యిద్దరు సంతుష్టి జెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపురితులైరి.

బాబానైజము, భక్త పరాయణత్వము

బాబా తన భక్తులకు వారివారి యిష్టనుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయి యింకొక్కప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. అమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు అతురపడిరి. వారిట్లనిరి. " అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులో ప్రేవులు, నరములు తెగిపోగలవు.’ ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పు కణములవలె ఎఱ్ఱనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటకా యంతయు పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. అశ్చర్యముతోను, భయముతోను మాట్లడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలికొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు అమెను బాబాకు హాని లేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశము బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదినాలుగవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు