శుకసప్తతి/మూఁడవకథ

వికీసోర్స్ నుండి

ఏడవరాత్రి:

చ. అల యలినీలవేణి విరహాతురయై మఱునాఁటి రాత్రి రా
చిలుకపటాణి నెక్కెడి వజీరునిఁ బోలిన యా నృపాలునిం
గలయఁ దలంచి మేన నయగారము గీర్కొనఁ జేసి చేరె ని
ర్మలగుణశాలియైన శుకమండలమౌళిసమీపభూమికిన్. 343

తే. అప్పుడా రాజకీర మిట్లనుచుఁ బలికె
మగువ! మగవాని మేలు నమ్మంగఁ దగదు
మది నొకానొకయెడ రోష మొదవె నేని
నేర్పుగల దూతి యొకరీతిఁ దేర్పవలయు. 344

క. పతి నేవగించు సతికి
న్సతి నొల్లని పతికి బద్ధసఖ్యము గలుగ
న్మతి నిర్వహించి కూర్చిన
చతురిక యగు దూతికాప్రసంగము వినుమా. 345

వ. అని యిట్లనియె. 346

మూఁడవ కథ

తే. అభ్రచుంబితమణిగణాదభ్రవప్ర
మై విజయభవనమను వీ డవనిఁ గలదు
ములికినాఁ డను సీమఁ గోమలుల చూపు
ములికి నాటిన మరుఁడు దా మూర్ఛ నొంద. 347

క. ఆరాజధాని వెలయు ను
దారుం డను రాజు ప్రోవఁ దన్నృపుచెంతన్
ధీరుఁడు తన ముక్కాకలఁ
దీఱిన దళవాయి యొకఁ డతిస్థిరబలుఁడై. 348

మ. పతికిం బ్రాణపదంబు జంధులకు నాకల్పప్రకాండం బన
ల్పితశౌర్యాబ్ధికిఁ గ్రేవ రాహుతులకు న్వెన్నాసయై శత్రుసం
తతి నెంతేఁ దెగటార్చి తన్మదమహోద్దండైకవేదండచం
డతురంగంబుల నెల్ల వస్తువులు దండన్నిల్పు నాభర్తకున్. 349

తే. భీమబలశాలి దృఢవర్మనాముఁడైన
ఘనుఁ డతండు నిజస్వామి కనువుపఱచు
రాజపరమేశ్వరాష్టదిగ్రారాజకులమ
నోభయంకరబిరుదైకవైభవంబు. 350

క. ఇత్తెఱఁగున బహుమహిమో
దాత్తపరాక్రమము మెఱయఁ దగునాతనికిన్
మత్తరిపుదమనశౌర్యా
యత్తుం డొకకొమరుఁ డలరు నతినిపుణుండై. 351

చ. చదువుల మేలు సాముపన చక్కఁదనంబు తెఱంగు సంపదం
బొదలెడు మేలి్మి పేర్మిగల భూరిభుజాబలశౌర్యధైర్యము
ల్సదయతయు న్వివేకసరసస్థితు లాకృతిఁ జెందెనో యన
న్మదనమనోహరుఁడు సుకుమారవరుం డతఁ డొప్పు నప్పురిన్. 352

తే. అతని కేలిక యైన యయ్యవనిభర్త
కూర్మికొమరున కొనరించుగో మొనర్ప
దల్లిదండ్రులు లోచనోత్సవము నొంద
నవ్విభుం డొప్పు జయకేతనాహ్వయమున. 353

వ. వెండియు నమ్మహాప్రభుకుమారుండు. 354

సీ. ఒకవేళ యవనచోళకళింగశకవంగ
గూర్జరు ల్గొలువంగఁ గొలు వొసంగు

నొకవేళ విగళన్మదోద్ధండవేదండ
హయపరంపర నెక్కి యాడఁ దివురు
నొకవేళ దండనాయకచమూనాయకు
ల్హాళిమై నడువ వాహ్యాళి వెడలు
నొకవేళ రిపునృపాలకజాలసాలదు
ర్గమదుర్గహరణైకకార్య మరయు
తే. మఱియు నొకవేళ ధీరసామంతమంత్రి
పుంగవులతోడ విభునిసమ్ముఖము చేరి
తెలుపఁదగువార్తలన్నియుఁ దెలియఁజేయు
ననఘ గుణశీలుఁ డాబాలుఁ డహరహంబు. 355

క. కంతునిభరూపరేఖా
వంతుఁ డతం డిట్లు మెలఁగ వనితాజనతా
స్వాంతమనోహరకరమై
యంతట యౌవనముఁ దోఁచె నవ్విభుమేనన్. 356

ఉ. ఔర విలోచనాంబుజము లద్దిర ముద్దుల నెమ్మొగంబు సిం
గారము బాపురే బవరిగడ్డము మేలు సురఃస్థలోరువి
స్తారము చాఁగురే యెగుభుజంబులపొంక మటంచుఁ బ్రేమచె
న్నారఁగ నారు లెల్ల ననయంబుఁ గనుంగొని సంతసింపఁగన్. 357

తే. వానిఁ దనివారఁ జూడనివనజగంధి
చూచి తలయూఁచి మెచ్చని సురుచిరాంగి
మెచ్చి విరహార్తి నొందని మీననయన
గలుగ దొకతైన నవ్వీటిచెలులలోన. 358

క. ఈలీల నతఁడు వర్తిల
బాళిం దన్నృపతిమౌళి పరిణయకార్య
శ్రీలలితుని జేయుట కిది
వేళ యితని కగు నటంచు వెసఁ దలఁచుటయున్. 359

తే. అతని జననీజనకు లపు డంతరంగ
మున మహోత్సాహమునఁ బొంగి యనుపమాన
మానసంపత్కులాభిజాత్యానుకూల
మమరు సరిమన్నె దొరలయిం డ్లరసి యరసి. 360

క. లావణ్య మంగరేఖయు
శ్రీవిలసల్లక్షణంబు శృంగారకలా
ప్రావీణ్యంబును గలకుల
పావనయగు నొక్కకన్యఁ బరికించుటయున్. 361

చ. అలజయకేతనుండు రుచిరాంగతిరస్కృతమీనకేతనుం
డెలమి మదిం దలిర్ప దయనేలికయుం దలిదండ్రులయ్యెడం
దలచిన కార్యభాగ ముచితజ్ఞులచే విని నీతికార్యవ
ర్తులగు నియోగిపుంగవులతోడ రహస్య మొనర్చి యిట్లనున్. 362

ఉ .ఎక్కడిజోలి పెండ్లి యగు టెట్లు సదుఃఖతరాజవంజవం
బక్కజ మే సహింపఁగలనా లలనం గలనైనఁ జూడఁ దా
దృక్కథ లాలకించి విను టెన్నఁడు లేదిది మీ రెఱుంగరే
యక్కట భామినీజనవిహారత మానధురీణుఁ డోర్చునే. 363

సీ. కాలకూటజ్వాల గబళింప నగుఁగాని
యతివలతోడ మాటాడ నగునె

పులులమీసముల నుయ్యలలూఁగ నగుఁగాని
వారిజాక్షులచెంతఁ జేర నగునె
దంభోళిహతిసముద్ధతి కోర్వ నగుఁగాని
లేమలపల్కు లాలింప నగునె
బడబాగ్నిఁ బిడికింట నొడియంగ నగుఁగాని
కుసుమగంధులపొందుఁ గోర నగునె
తే. కటకటా మూర్ఖమర్కటకరతలస్థ
కల్పతరుసూనమాలికాకల్పుఁ డగుచు
సరసుఁ డగుమర్త్యుం డంగనాజనమహోగ్ర
ఘోరసంసారవిషధిలోఁ గూలనగునె. 364

క. అని విడనాడఁగ నాతనిఁ
గనుఁగొని యోనృపకుమారకంఠీరవ యే
యనువున నొనరింతుము నీ
మన మలర నటంచు మంత్రిమణు లవ్వేళన్. 365

సీ. గార్హస్త్య మిందిరాకాంతాకటాక్షవీ
క్షణలబ్ధికిఁ బ్రధానకారణంబు
సంసార మర్థార్థిజనమనస్సంతాప
కార్పణ్యము లడంపఁ గల్పశాఖి
దాంపత్య మతిశుభ్రతరజగత్పరిపూర్ణ
వరకీర్తిలతికాలవాలభూమి
యాజవంజవము దివ్యైకలోకానీక
పథము నందించుసోపానరేఖ
తే. ఘనతరకుటుంబ మఖిలోపకారకంబు
గాన సుచరిత్ర యగుకన్యకను వరించి

మానవిఖ్యాతిలాభసంపన్నుఁ డగుట
యెంతయిన నొప్పు నట్లు గాదేని హాని. 366

తే. హరిహరహిరణ్యగర్భాదు లగుమహాత్ము
లెల్ల నెప్పుడు సంసార మిచ్చగించి
పుత్రపౌత్రపరంపరాభ్యుదయవంతు
లగు టెఱుంగవే యేకవీరాగ్రగణ్య. 367

వ. అని యనేకప్రకారంబులం బచరించిన నమ్మనీషివరుల విశేషవచనంబు లంగీకరింపక దురంతచింతాపరతంత్రస్వాంతంబునం గొంతతడవు విచారించి యంతఃపురంబుఁ బ్రవేశించి యౌవనారంభసంరంభంబునం బొడము దురాలోచనంబున విజృంభించి దూరం బరయక యతం డర్ధరాత్రంబున. 368

తే. వేగం జనియెద నిక నొక్కవింతదేశ
మునకు భామాజనంబుల మోముఁ జూడ
నోపలేనని తీవ్రసంతాపహృదయ
మున రయోద్ధతి నయ్యంతిపురము వెడలి. 369

చ. పలుచనిదంతపుం దళుకుపాదుకల న్సడలించి కుంచితాం
ఘ్రుల వలిపంపుఁజేలమునికొం గొకయించుక యొత్తి చిత్త మిం
పలరఁగ నొక్క యందలమునందుఁ దగం జనియె న్విభుండు క్రే
వలఁ దగ నొంటరీలు గొలువం గరదీపతతు ల్వెలుంగఁగన్. 370

వ. ఇవ్విధంబున. 371

క. జనపాలునకును జననీ
జనకులకుం జెప్ప కతఁడు చని కనియెను గం

ధనిబంధనేంథనాచల
మునకు సమీపంబు పాండ్యభూమండలమున్. 372

తే. కాంచి యచ్చటఁ బాండ్యభూకాంతరత్న
పాలితంబై ననవరత్నకీలితైక
గోపురం బైనగంధవతీపురంబు
వెలయు నప్పొంత నొకదేవనిలయ మొలయ. 373

మ. కని యంతం భ్రమరస్ఫురత్కమలినీకాసారతీరంబునం
గనువిందై యనువొంది చైత్రరథశృంగారంబు గన్పట్టు ది
వ్యనవీనద్రుమపుంజరంజితమహోద్యానంబునుం గాంచి స
జ్జనమాన్యుం డతఁ డందు నిల్చె నొకద్రాక్షాకాయమానస్థలిన్. 374

తే. అప్పుడయ్యెలదోఁటలో నతనిసరసఁ
బరిజనంబులు పరిపక్వఫలసుగంధ
కుసుమరసపల్లవంబులఁ గొల్లలాడి
యుల్ల ముల్లాసమును బొంద నుండువేళ. 375

క. తుకతుక నపు డలవనపా
లిక యగు బాలిక మృగాంకలీలారేఖా
ప్రకటితోపవిశంకట
వికటనటద్భ్రూకుటీసువిభ్రమముఖియై. 376

సీ. నిండారఁ బొడమిన బొండుమల్లియతావి
క్రొవ్విరు లెవ్వరో కోసినారు
ప్రబలంపుగాడ్పుచే రాలిన యెలమావి
దోరషం డ్లెవ్వరో యేఱినారు

వాటమౌ దవనంపుఁదోఁటకంపవెలుంగుఁ
దొలఁగిపో నెవ్వరో త్రోసినారు
దట్టమై నులిగొన్న యట్టిపందిరిద్రాక్ష
తీవ లిం దెవ్వరో త్రెంచినారు
తే. కంటి మాయయ్య రావలెఁ గద యి దెవ్వ
డిందు నేనెత్తు వెలిపువ్వు టెత్తు కేలఁ
బట్టుకొనె నంచుఁ జిడిముడిపడుచుఁ గాఁపుఁ
బడుచువగలాఁడి యప్పుడప్పజ్జ గదిసి. 377

క. తనతేజీ లున్నవి యని
వనవాటిం గనుఁగొనంగ వచ్చిన లక్ష్మీ
తనయుఁ డన నొప్పు జయకే
తనవిభు నీక్షించి మోహతరలేక్షణయై. 378

క. తనతండ్రి యున్నయెడకుం
జని తద్వృత్తాంత మంత చతురతరోక్తిం
గనినట్లు తెలుప విని య
వ్వనపాలకుఁ డద్భుతైకవశమానసుఁడై. 379

ఉ. ఎచ్చట నుండునో మొదల నెవ్వఁడొ యెవ్వరివాఁడొ వీఁడు నేఁ
డిచ్చటి కేగుదేరఁ గత మెయ్యదియో యని తత్కథాక్రమం
బిచ్చజనింపఁ బాండ్యజగతీశ్వరు నీశ్వరసన్నిభు న్సము
ద్యచ్చతురాస్యుఁ గాంచి వినయంబునఁ దద్విధమెల్లఁ జెప్పినన్. 380

తే. ధన్యుఁ డారాజలోకమూర్ధన్యుఁ డతని
రూపయౌవనవిభవప్రతాపములకు

నాత్మ మెచ్చి తదాలోకనాభిలాష
నప్పు డుద్యానవనవాటి కరుగునంత. 381

చ. మితపరివారుఁడై రణసమిద్ధభుజుండు జయధ్వజుండు త
త్క్షితిపతిమౌళిసమ్ముఖముఁ జేరి విధేయత మ్రొక్కి నిల్చిన
న్మతిఁ గుతుకం బెలర్ప నసమానలసత్కుసుమానమన్మహీ
జతతియేడ న్వసించి సరసస్థితి నాతని కాతఁ డిట్లనున్. 382

క. ఓవత్స నిను మనంబున
భావింపఁగ సార్వభౌమపర్యాయశుభ
శ్రీవిభవము గననయ్యెడు
నీ వెవ్వరివాఁడవయ్య నృపకులతిలకా. 383

ఉ. నీపరిణద్ధకంధరయు నీదువిశాలవిలోచనంబులు
న్నీపటుదీర్ఘబాహువులు నీవిపులోరుకవాటవక్షమున్
బాపురె సర్వభూవలయపాలనముం గలిగించి మించఁగా
నోపుచునున్నవేల యిటు లొంటిఁ జరించెద వంచుఁ బల్కినన్. 384

తే. అప్పు డాజయకేతనుం డతనితోడఁ
దనకులాచారగోత్రసూత్రములు నొడివి
ప్రేమఁ దనతల్లిదండ్రులు పెండ్లిసేతు
మనఁగ విని యొల్ల కేవచ్చి తవనినాథ. 385

చ. అనవిని పాండ్యమండలమహాప్రభుఁ డల్లన నవ్వి యోసుధీ
జనవర పెండ్లియొల్ల మనుజాడ్యమతు ల్గలరే జగంబునన్
విన నిది వింత యిందు కొకవేఱ నిమిత్తము గల్గియున్న నె
మ్మనమున సంశయింపక క్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా. 386

వ. అని యడిగిన నప్పాండ్యమహీమండలేశ్వరున కప్పుణ్యచరిత్రుం డి ట్లనియె. 387

తే. విను పరా కింతలేక నా విన్నపంబు
పూర్వభవమున నే నొక్కభువనమోహ
నాద్భుతసరోవరంబులో నధివసించి
రాజహంసంబునై యుంటి రాజచంద్ర. 388

క. అప్పుడు మత్కులకామిని
తప్పనిప్రేమం బతివ్రతారత్నము న
న్నెప్పు డెడసనక కంటికి
ఱెప్పవలెం గాచి తిరుగు రేలుం బవలున్. 389

వ. అదియునుం గాక. 390

సీ. ఆఁకలి గొనునప్పు డబ్జనాళములలో
నూటి కొక్కటి తెచ్చి నోటి కొసఁగు
గమనించుతఱి మందగమనశృంగారాప్తి
నంటు వాయక వెంటవెంట నెయిదు
నుబుసుపోవనివేళ నుల్లోల కల్లోల
డోలికామాలికాకేళిఁ దేల్చు
బడలియుండినవేళ నొడలితాపము దీఱ
వలిఱెక్కసురటిగా డ్పలవరించు
తే. ముచ్చటలు దెల్పు రతికేళి కెచ్చరించు
సన్న దెలిపి విలాసప్రసన్నవదన
యగుచు వర్తించు నేను నావగఁ జరింతు
వరట మదికింపు దొలఁక భావజ్ఞతిలక. 391

తే. ఇట్లు వర్తించుచున్నచో నెలమి నన్నుఁ
గొలిచి విహరించు రాయంచ బలఁగమెల్ల

గెలన నొకపైఁడి నెత్తమ్మికొలను జూడ
నొప్పునని తెల్పఁ దద్వీక్షణోత్సుకమున. 392

మ. చని యద్దివ్యసరోవరంబున యథేచ్ఛాలీల వర్తించు హం
సనికాయంబులతోడఁ గొంతతడ వంచల్లీల వర్తించి త
త్కనకాంభోరుహవిభ్రమదమరఝంకారధ్వనిం దత్తటీ
వనవాటివిహారద్విచిత్రవిహగవ్యావృత్తి నీక్షించుచున్. 393

తే. మఱియు నచ్చోట విహరించుతఱిని మంద
మందగంధవహాప్తి మై మఱచియుండు
నంత నను నెచ్చరింపక యరిగె బంధు
తతి మనంబున నిల్లాండ్రఁ దలఁచికొనుచు. 394

ఉ. అంతట నాశకుంతబల మవ్వరటాతతిఁ జేరి మోహసం
క్రాంతత నంబుజోత్పలకులాయముల న్విహరింపఁ జూచి వి
భ్రాంతతనొంది మత్ప్రియుఁడు రానితెఱంగిది యేమొయంచు మ
త్కాంత ననుం గనుంగొననితాపమున న్విరహాబ్ధిమగ్నయై. 395

తే. అమ్మ నేఁజెల్ల; నెవతెయో యవలనొక్క
కొమ్మ నాప్రాణవిభు నేలుకొనియె నేమొ
కాకయుండిన ననుఁ జేరరాక యున్నె
యని ప్రలాపించి కనుమూసె నాక్షణంబ. 396

క. ఈవార్తలు సవసవగా
నే విని ప్రాణేశ్వరీ యిదే నను నొంటిం
జోవిడిచి చనుట తగదనీ
భావించి వియోగవహ్నిపరితప్తుఁడనై. 397

తే. నాఁటి యలహంసజన్మంబు వీటిఁబుచ్చి
మగుడ మానుషవేషసంభవుఁడనైన
నేటికిని దద్వధూటిపై నెనరువాయ
నైతి నిఁక నేమనందుఁ బాండ్యక్షితీంద్ర. 398

ఉ. కావున నాఁడు నేఁ డితరకాంతల నేరిఁ బరిగ్రహింపనో
భూవర యంచుఁ దెల్ప నృపపుంగవుఁ డౌనని మెచ్చి బంధుసం
భావితలీల నాఘనుని భావ మలర్చి విశేషవస్తుసం
భావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబుఁ జేరినన్. 399

వ. అంత. 400

తే. గరిమఁ దత్పాండ్యరాజన్యకన్యయైన
శాలికానామబాల య వ్వేళ నిజపు
రోపవనభూమి మునివృత్తి నొదిఁగియుండు
నలజయధ్వజవిభువార్త లాలకించి. 401

చ. నలనిభుఁ డీజయధ్వజుఁడె నావిభుఁ డంచుఁ దలంచునంతలో
వలపులఱేఁడు కెంపుజిగివంపుమొగంపుఁబటాణినూకి క
న్నులు గలవింట నప్పుడు వినూత్నశరావలు లేసి యార్చె న
మ్మెలఁత మెఱుంగుగబ్బిచనుమిట్టల హారలతల్ చలింపఁగన్. 402

క. అంత నలయింతి విరహా
క్రాంతమతి న్నిమిష మొక్కకల్పంబుగ న
త్యంతతరదురవగాహన
చింతం దంతన్యమానచిత్తాంబుజయై. 403

శా. మారుం బేర్కొనిదూఱు గంధవహుఁ బల్మాఱుం దుటారించి వే

సారుం జైత్రునిఁ గేరుఁ గేళివనసంచారార్థమై తెల్పినం

జాఱుం గేకి పికాళిసంఘములు వాచావైఖరిం బోరుఁ ద
న్నారీరత్నము తజ్జయధ్వజసముద్యన్తోహసంక్రాంతయై. 404

తే. అలహరిద్రానిభాంగి సౌధాగ్రసీమ
నుండ కవనికి డిగియె రేయెండ కళికి
ప్రాణసఖు లెల్ల నెండకుఁ బశువు దలఁకి
నట్లు నీ వేల తలఁకెద వనుచుఁ బలుక. 405

[1]క. భావ మెఱిగింప నేరక
యావెలఁదుక యున్నఁ జెలువ లవ్విధమెల్లన్
భూవల్లభునకుఁ దెలిపిన
నా వేళ నమాత్యహితకృతాలోచనుఁడై. 406

ఉ. కన్నియ యీజయధ్వజునిఁ గాని వివాహ మొనర్ప నొప్పదే
ధన్యుఁడు నైనవాఁడు వనితాజనతైకపరాఙ్ముఖుండు సా
మాన్యమనీషి కీవగ యొనర్చుట కొద్దితెఱంగు తెల్పుఁడో
మాన్యచరిత్రులార! యని మంత్రులతో విభుఁ డానతిచ్చినన్. 407

క. పొసఁగ దిది యనుచు మంత్రులు
గుసగుసలంబోవ రాజకుంజరుతోడన్
వెసమృదులవాణి యనఁదగు
బిసరుహముఖ యొకతె విన్నవించెం బ్రీతిన్. 408

ఉ. ఏలవిచార మింతుల నొకింత యెఱుంగని ఋష్యశృంగునిం
బాలికలండఁ జేరి యొకబాలికఁ బెండ్లి యొనర్చి భామినీ

లోలునిఁ జేయువార్త మహిలో నుడున న్వినరేమొ యట్లనీ
శాలిక నాసమగ్రగుణశాలికిఁ బెండ్లి యొనర్తు నావుడున్. 409

తే. ఆవిభుండు ప్రమోదసద్భావుఁ డగుచు
సెలవొసంగిన నిరుమ్రోలఁ జెలులు గొలువ
నవ్వరారోహనాందోళికాధిరోహఁ
జేసి కార్యప్రవర్తనోల్లాస మెసఁగ. 410

సీ. నేల జీరకయుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుసతు ల్గునిసి నడువ
మడమెత్తు పర్వుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభార్య లెదుర
నొక్కకీ లొరఁగుపై నునిచి యేకాంతంబుఁ
దెలుపుచుఁ గూర్మి నెచ్చెలులు సనఁగ
జయకేతనునివార్త సారె విచారించి
వచ్చి ప్రగడకత్తె లెచ్చరింప
తే. సొంపుతోఁ బౌరకామిను ల్గుంపుగూడి
యమ్మ యిదిగాక సౌభాగ్య మనుచు మెచ్చ
నప్పు డుద్యానవనవాటి కవ్వధూటి
నెలమిఁ దోతెచ్చి యాచెంత నిలుచునంత. 411

చ. పిలపిల నాజయధ్వజుని బెద్ద లెదుర్కొని రాకురాకుఁడో
యళికచలార భీతహరిణాయతనేత్రల మత్ప్రభుండు నా
వలనను జూడ నోడుననువార్త వచించిన మందహాసకం
దళవదనం బెలర్పఁగ ముదం బలర న్మృదువాణి యిట్లనున్.

క. మునుమున్న తద్రహస్యము
విని యున్నదిగానఁ బ్రౌఢవృత్తి నలసుధీ
జనములతో నను గాంతా
జనరత్నము మధురరసవచస్ఫుటఫణితిన్. 413

ఉ. ఈయెలదోఁట నుండఁదగ దింకొకచక్కి వసింపనేగుఁడో
ధీయుతులార! పాండ్యనరదేవతనూభవకేళికాగృహ
ప్రాయత నిందు నెప్డు నిరపాయమున న్విహరించుచుండు నే
డాయెలనాఁగ గ్రుమ్మరుటకై యదెవచ్చెఁ దలంగుఁ డిత్తఱిన్. 414

తే. ఇంతమాత్రంబె కాదు పూర్ణేందుముఖులు
సమ్ముఖంబునఁ గార్యప్రసంగవశతఁ
బెండ్లి యనుమాటఁ బేర్కొన్నఁ బెనిమి టనిన
మిట్టి మీనై యదల్చు నమ్మీననయన. 415

క. ఇది యేమినిమిత్తమొ యని
మది నెంచితిరేనిఁ దత్క్రమంబంతయు నీ
యదన వివరింతు వినుఁడిం
పొదవం దొల్లింటిజన్మ మొదవినవేళన్. 416

ఉ. తా నొకహంసియై సరసత న్నిజవల్లభుఁ డుల్లసిల్లఁ జి
త్తానుగుణోన్నతి న్మెలఁగు నంతటిలో నొకనాఁడు చెంత నిం
పైనసరోవరంబుఁ గని యచ్చటి కేగి విభుండు నిర్నిరో
ధానుపమానసౌఖ్యవిభవాప్తి మెయి న్వెసరాక చిక్కినన్. 417

క. మగఁ డేల రాఁడొ యొండొక
మగువం దగులుకొని నన్ను మఱిచెనొకో మనం
బగలెడు నని దిగులొందుచుఁ
దెగువం బ్రాణములు విడిచె దీనాననయై. 418

ఉ. వావరి నప్పతత్రికులవార్ధిసుధాకరరేఖ యీధరి
త్రీవరకన్యయై యవతరించి విభుం డొనరించి నయ్యుపే
క్షావిధ మెన్నుచున్నదని సారె వచించిన మంత్రు లద్భుతం
బై వెలయం జయధ్వజున కత్తెఱఁగెల్ల నెఱుంగఁ జెప్పినన్. 419

క. వినినంతఁ బెన్నిధానముఁ
గనుఁగొన్న దరిద్రుఁ బోలి ఘనుఁడా జయకే
తనుఁ డలతలోదరీమణి
తనసొమ్మని తలఁచి యతులితత్వరమతియై. 420

తే. సమ్మదాశ్చర్యమోహము ల్సందడింప
నుద్దవిడి లేచివచ్చి యమ్ముద్దుగుమ్మ
యెద్ది యెద్ది యటంచు నయ్యించుఁబోణు
లలరఁ జని పాండ్యనృషకన్య యండఁగదిసి. 421

చ. నిను నెడఁబాయఁజాల దరుణీ యని నీయనివార్యవిభ్రమం
బనిమిషులందునైనఁ గలదా యని దాయనిరూఢి నెంచి న
న్మనసిజబా కొర్వదరమా యని మాయనిమోహదాహమే
యనువున దీర్చువాఁడ నహహా యని హాయని చేరి మ్రొక్కినన్. 422

క. వనితాలలామ లజ్జా
వినమన్ముఖ కమలతం బ్రవీణత లేమిన్
గని రాజదూతి యనియెం
గనికరమున నక్కుమారకందర్పునకున్. 423

చ. పసిరికపామువంటి దని పల్కుదు రీయలివేణివేణి న
ప్పసమును నిండుఁగుండలయి భాసిలు నీలలితాంగి గుబ్బ లీ
ముసిముసినవ్వులాఁడి కరము న్వెసమూసిన ముత్తియంబు నీ
కుసుమసుగంధి కేవలము గోలసుమీ యనమీఁదలంచుమీ. 424

చ. అనుటయు దండనాథసుతుఁ డానృపకన్యక నాదరించెఁ ద
జ్జనకుఁడు సమ్మతించె సరసస్థితిఁ బెండ్లి యొనర్చి వైభవం
బెనయఘటించి యొక్క విమలేందుశిలామయసౌధమందుఁ జే
ర్చిన నెనరొప్పఁగా విడిద చేసుక యంత వసించి వేడుకన్. 425

క. మును నేనొనర్చు నేరము
మనమున నెంచంగఁ దగదు మగువా యనుచుం
గనకాంగి నూఱడిలఁగా
నని సెజ్జం గౌరవించి యధికప్రౌఢిన్. 426

సీ. కాశ్మీరపంకసంకలితాంకమై పొంక
మగు బాహుమూలంబు లంటియంటి
వరమృగీమదపత్రవల్లరీరుచి నొప్పు
నుదుటుసిబ్బెపుగుబ్బ లొత్తియొత్తి
నానావిధబహుప్రసూనైకగంధంబు
నివ్వటిల్లెడు కొప్పు దువ్విదువ్వి
తాంబూలరసరక్తిమంబైన యమృతంపు
బింబాధరము ముద్దుపెట్టిపెట్టి
తే. ఘనజఘనకంబు కంధరకదళికామృ
దూరువులవాఁడి కొనగోళ్ల నొరసియొరసి
యెలమి నలయించి మించి యయ్యలరుఁబోఁడి
నతనుసామ్రాజ్య మేలించె నవ్విభుండు. 427

క. ఈమాడ్కి నమితభోగ
శ్రీ మెఱయఁగ నొక్కనాఁడు చిత్తమున నిజ
స్వామియుఁ దలిదండ్రులుఁ దను
గోమించిననడతఁ దెలిసికొని యతఁ డెలమిన్. 423

తే. మామతోఁ దెల్పి కాంతాలలామయైన
శాలికాకన్యతోఁగూడ సకలసైన్య
మిరుగడలఁ గొల్వఁ దనపురీవరముఁ జేరె
నేలికయుఁ దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ. 429

క. పతి నేవగించుసతికిన్
సతినొల్లనిపతికి బద్ధసఖ్యము గలుగన్
మతి నిర్వహించి కూర్పఁగఁ
జతురిక యగు దూతి వలయు జలజాక్షులకున్. 430

వ. కావున నేతత్ప్రయోజనసంధానకారిణి యగు నీరాజదూతిక తాదృగ్విచక్షణలక్షణోపలక్షిత యగుఁగదా యిత్తెఱం గెఱుంగక యున్నఁ గార్యభంగం బగు ననివచియించు సమయంబున. 431

తే. విమలతరతారహారము ల్వెస నొకింత
చల్ల నగుటయు నలశరచ్చంద్రవదన
సదనసంచారమున కేగ జలజహితుఁడు
చరమగిరిఁ జేరె నంతలో నొరపుమీఱి. 432

చ. కులికెడుగుబ్బచన్పసిఁడికుండలు నిండిన కుంకుమంబు జొ
బ్బిలవలిపంపు మేల్రవిక పిక్కటిలన్ వెలిపట్టుచీర ము
ద్దులు వెలయింప వింతవగదుప్పటి పైవలెవా టమర్చి పా
వలు మునివ్రేళ్ల మెట్టి శుకవర్యునిమ్రోల లతాంగి నిల్చినన్. 433

క. ఆతఱిఁ బుండ్రేక్షురస
ఖ్యాతరుచిన్ రాజకీరకంఠీరవ మా
కాతరనేత్రకుఁ దెల్పె న
తీతంబగు నొక్కకథ యతిప్రీతి మెయిన్. 434



క. ఓనీలవేణి మదిలో
మానవుఁ డొక్కటి తలంప మఱిదైవము తాఁ
బూనుఁ బెఱకార్య మొక్కటి
కానఁ దదీయాజ్ఞవలయుఁ గార్యార్థులకున్. 435

వ. అత్తెఱంగునం బ్రవరిల్లనియట్లయినం దొల్లిటిసమయంబున గుణవల్లభుండను మహీసురవల్లభుండు భల్లూకనఖభల్లహతుండైన యట్ల యగు నది యెట్లనిన వివరింతు నాకర్ణింపు మని యిట్లనియె. 436

నాలుగవ కథ

సీ. అప్రతిమప్రభుం డగణితైశ్వర్యధు
ర్యత్వసాక్షాన్మహారాజరాజు
రూపరేఖామన్మథోపమానాంగుండు
ధరణీధరోద్దండధైర్యశాలి
యార్తరక్షణుఁడు సత్కీర్తికల్లోలినీ
డిండీరితశుధాంసుమండలుండు
నత్యుద్ధతప్రభావాంకుండు సకలస
జ్జనవర్ణనీయశోభనచరిత్రుఁ
తే. డలరు నొకరాజు కర్ణాటకాంగవంగ
నృపమకుటఘర్షితాంఘ్రినీరేరుహాగ్ర
నఖరశిఖరుండు భువిఁ గీర్తిముఖుఁ డనంగఁ
దనరి యంశుమతీపురాధ్యక్షుఁ డగుచు. 437

తే. అతఁడు కమలాక్షియను ప్రియురాలివలనఁ
గన్న లీలావతీనామకన్య నెలమిఁ

  1. క. ఆవివర మెల్లఁ బాండ్య
    క్ష్మావల్లభుఁ డెఱిఁగి శాలికాబాలికకున్
    ఠీవి వివాహ మొనర్చుట
    కావేళ నమాత్యహితళ్ళతాలోచనుఁడై.