రామాయణ విశేషములు-8
8
కవిత-గుణపోషణము
ష్లెజల్ అను జర్మన్ ప్రాచ్య విద్యాపండితుడు “రామాయణము
ప్రపంచ పురాణములన్నింటిలో గంభీరమైనది (Ramayana is the
noblest of epics)" అని అభిప్రాయమిచ్చెను.
మోనియర్ విలియమ్స అను ఇంగ్లీషు పరిశోధకుడిట్లు వ్రాసెను: “రామాయణము సంస్కృత వాఙ్మయములోని మహానిధులలో ఒకటై యున్నది. మొత్తము సంస్కృత సాహిత్యమందు రామాయణముకంటె మనోహరతరమైన కవిత మరి లేదు. ఉత్తమ సాంప్రదాయక పవిత్రత, స్పష్టత, స్వాభావికత దాని శైలిలో కలవు. కవితా సన్నివేశము అతి మనోహర భావములతో కూడినట్టిది. దానిలో శౌర్య సంఘటనల ఉదార వర్ణనలు, ప్రకృతిలోని సుందరతమమైన రంగముల ప్రదర్శనము, మానవహృదయము నందలి గంభీరోద్రేకములు, వాటి పరస్పర సంఘర్ష ణముల గాఢపరిచయము - ఇవన్నియు ఈ రామాయణమునకు సర్వ కాలములందును సర్వదేశములందును అతి సుందరమైన రచనలని ప్రఖ్యాతిగాంచిన కావ్యములలో అగ్రస్థాన మిచ్చుచున్నవి.”[1] ఇతర పాశ్చాత్య పండితులును ఇట్టి అభిప్రాయములనే యిచ్చి యున్నారు. ఇక భారతదేశమందలి హిందువులు రామాయణమును గుగించి సదభిప్రాయమే కలవారై యున్నారనుటలో ఏ సందేహమును లేదు. రామాయణము హిందువులందరికినీ ఒక పవిత్ర గ్రంథము. దానిలోని ఉ తమ కవితను గురించి హిందూ పండితు లందరును అతి ప్రాచీన కాలమునుఁడి, అనగా కనిష్ఠము 2000 ఏండ్లనుండి అత్యుత్తమ మని అభిప్రాయమిచ్చుచు వచ్చుటయే గాక నిన్న మొన్నటివరకు సంస్కృతము నభ్యసించిన ప్రతి పండితుడును ఇతర కావ్యాలను ప్రారంభించుటకు ముందు రామాయణములో కొన్ని భాగములను మొదట చదువుకొనుచుండెను. ఎంతటి మహా కవి యైనను సరే, అతడే భాష యందైనను సరే కవిత్వము వ్రాసినను, మొట్ట మొదట వాల్మీకి మహర్షికి నమస్కారము చేయనిది ముందునకు సాగకుండెడువాడు. తుదకు రామా యణమును చదువని హిందువు కవియే కానేరడు అని చెప్పిన అతిశ యోకి కాదు.
రామాయణములోని కవితా ప్రాశస్త్యమును గూర్చి మహా విద్వాం సులు నూర్లకొలదిగా ప్రాచీనము నుండియు నేటివరకు బహు విధముల తెలిపియున్నారు. అట్టి దానిని గురించి నేను మరల వ్రాయుట కాల హరణ హేతువున్నూ, పునరుక్తి దోషమున్నూ, తుదకు తలవని తలంపుగా భావ చౌర్యమున్నూ కావచ్చును. అలంకారికులు రామాయణ మహా భారతాదుల రచనానంతరము, తుదకు కాళిదాసుని యనంతరమే
[2] బయలుదేరి కొన్ని కవితా నిబంధనలను ఏర్పాటు చేసినారు. ఆ కొలత బద్దతో నేను వాల్మీకిని కొలుచుటకు పూనుకొనను. సూటిగా నాకెట్లు భావ స్ఫురణము కలిగినదో దానిని మాత్రమే నివేదించుకొందును.
కవితా ప్రయోజనము ఆనందము, లేక విజ్ఞాన ప్రదానము, లేక బోధ - రామాయణములో ఈ మూడున్నూ సంపూర్ణముగా కలవు. "ఏకో రసః కరుణ ఏవ” అని కొందరు ఆలంకారికులు తెలిపియున్నారు. రామాయణమం దీ రసము సమగ్రముగా ఉన్నది. ఒక విధముగా రామాయణము కరుణ రస పూరిత కావ్యము. దశరథునికి సంతానము లేదను చింత, కలిగిన కొన్ని యేండ్లకే పుత్రుల వియోగము. తర్వాత సీతారామలక్ష్మణుల అరణ్యావాసము, దశరథుని మరణము, భరతుని సంతాపము, అరణ్యమందు రామాదుల కష్టములు, శూర్పణఖా పరాభవము, కబంధుని మరణము, శరభంగుని మృతి, ఖరాదుల వధ, సీతాపహరణము, రాముని పరితాపము, జటాయువుయొక్క ఆత్మార్మ ణము, వాలి వధ, లంకాదహనము, రాక్షసుల వినాశము, లక్ష్మణుని మూర్ఛ, రాముని వ్యసనము, సీతాపరీక్ష, ఈ విధముగా అడుగడు గునకునూ శోకమే పాఠకుల నెదుర్కొనుచున్నది. సాంప్రదాయకముగా రామాయణమందు సుందరకాండ శ్రేష్ఠమైన దందురు. నాకు అయోధ్యా కాండయే శ్రేష్ఠతమ మైనది. ఏ భాగము చదువుకున్నను ఒక్క అయోధ్యాకాండను మాత్రము చదివితే అనేకోత్తమ కావ్యాలు చదివినట్లు అని భావింతును.
రామాయణములో కథయొక్క యైక్యత కలదు. ఇతర పురాణా లలో అది కానరాదు. మహాభారతములో ఉపాఖ్యానాలు కొల్లలుగా ఉన్నవి. మూలకథకు సంబంధము లేని శాంత్యానుశాసనికాది పర్వాలు బహు దీర్ఘమైనవి కలవు. రామాయణ మందును కొన్ని యుపాఖ్యానాలు కలవు. ఋశ్యశృంగోపాఖ్యానము, కుశనాభకోపాఖ్యానము, భగీరథో పాఖ్యానము, అహల్యాకథ, విశ్వామిత్ర చరిత్ర, ఋషికుమార వధాఖ్యా నము, ఇట్టివి. మరికొన్ని కలవు. కాని యవి మూలకథకు సంబంధించి నవై యున్నవి. పైగా ఇవి చిన్నవగుటచేత ప్రధాన విషయమునకు భంగము కలిగింపవు. కథావస్తువు యొక్క యైక్యత (Unity of plot) కావ్యానికి జీవము వంటిది.
బహు సంస్కృతాంధ్ర కావ్యాలో అష్టాదశ వర్ణనలు కలవు. ఇవన్నియు వాల్మీకిలో లేవు. అయినను రామాయణము ఇటీవల ఆలం కారికుల నిబంధనల ప్రకారము మహాకావ్యము కాజాలదని చెప్ప సాహ సించువారు కానరారు. మరి కావ్యాలలోని వర్ణలనుకూడా ఒకేవిధ మైనట్టివి. పలుమారు పాఠకులను విసిగించును. ఉత్పేక్షాతిశయోక్తుల కవి పుట్టినిండ్లు. కాని వాల్మీకి సహజకవి, ప్రకృతి కుమారుడు, ఉప మానములకు ఆది పురుషుడు, రమ్యమగు వర్ణనలకు నిధి.
రామాయణములో అయోధ్యావర్ణన (బాల. సర్గ 5) రాజవర్ణన (బాల. 6) అమాత్య వర్ణన (బా. 7) అరాజక దురవస్థావర్ణన (అయో. 67) చిత్రకూట వర్ణన (అయో. 94) వసంతము (అయో. 56) మందా కినీ వర్ణన (అయో. 95) హేమంతము (ఆర.16) రామపరితాపము (ఆర. 60) రామవిలాపము (ఆర.62) ప్రావృట్కాలము (కి. 28) శరత్కాలము (కి. 30) పుష్పక వర్ణనము (సు. 8) మధువన క్రీడలు (సు. 61, 62) అను వర్ణనలు ముఖ్యమైనవి. అరణ్య వర్ణన పలుతావులలో సుందరముగా కావింపబడినది. (ఆర. 11, కి. 1; కి. 27) పై వర్ణనలలో కొన్ని యుదాహరణార్థము ఈ క్రింద ఎత్తి చూపింపబడుచున్నవి.
"ఈ చిత్రకూటపర్వతము సెలయేరుల చేతను, ఊటల చేతను, మదపు టేనుగువలె ప్రకాశించుచున్నది. (అయో. 94-13) బొద్దు పాఠ్యంనాట్యము చేయుచు విలాసముగా పూలను చల్లు నటకునివలె ఈ చిత్రకూటములోని వృక్షములు గాలిచే పూలను మందాకినిపై విడుచు చున్నవి. (అయో. 95–8)
చలికాలమందు సూర్యుడు దక్షిణగామి యగుటచేత ఉత్తరదిశ తిలకములేని స్త్రీవలె కాంతి హీనయై యున్నది. (ఆర. 16-8)
చలికాలములో పున్నమనాడుకూడా చంద్రునివెన్నెల తుషార మలినమై ఆతపశ్యామయైన సీతవలె ప్రకాశము తగ్గియున్నది. (అర. 16-14)
శూరులు కానివారు యుద్ధములో జొరబడుటకు వెనుకముందాడి నట్లు ఈ పక్షులు శీతజలములను తాకుటకు భయపడుచున్నవి. (అర. 16-22)
వసంతర్తువునందు అంతటను నిప్పంటుకొన్నదా అన్నట్లు మోదుగుపూలు వికసించియున్నవి. (అయో. 56-6)
వానకాలమందు పర్వతములు మేఘములచే గప్పబడి జలధారలు కల సెలయేరులతో నొప్పి గుహలందు గాలిచొచ్చి ధ్వనించుచుండుట వలన కృష్ణాజినములు తాల్చి జందెములను ధరించి వేదాధ్యయనము చేయుచు (ఋషివలె) ఒప్పుచున్నది, (కి. 28-10)
నల్లని మేఘాలలో చలించుచున్న మెఱుపు, రావణుని తొడపై విడిపించుకొనుటకై పెనఁగులాడుచున్న శోచనీయయగు సీతవలె నున్నది. (కి. 28–12)
పచ్చని బయళ్లలో చిన్న యారుద్ర పురుగులు నిండియున్నవి. చిలుకవన్నె వంటి చీరపై లక్కచిత్తరువులు వ్రాసిన చీరను కట్టిన స్త్రీవలె ఆ బయలు ఒప్పుచున్నది. (కి. 28-24)
RV-12 నవసంగమసంవ్రీడలగు స్త్రీల జఘనములవలె శరత్కాలమందు నీరింకుటచేత నదులు పులినములను ప్రదర్శించుచున్నవి. (కి. 30-28)
తర్వాతికాలపు కవులందరును రామాయణములోని ఋతువర్ణన లతో తులదూగు వర్ణనలు రచింపజాలిన వారుకారు. ఋతుసంహారమును రచించిన కవి (కాళిదాసైనను సరే, మరెవ్వరైనను సరే) రామాయణము నుండియే భావములను, తుదకు శైలినిగూడా అనుకరించెను.
వాల్మీకికి ఉపమానాలు చాలా యిష్టము. తర్వాతి కాలములో కాళిదాసు ఈ పద్ధతిని బాగా అనుకరించెను. రామాయణమందేవర్ణన నైనను చదివినచో ఉపమానములందు కనబడును. కావున ప్రత్యేకముగా వాటి నుదాహరించుట అనవసరము.
రామాయణ కవితను తర్వాతి కవులు చాలామంది విశేషముగా అనుకరించుచు వచ్చిరి. కొందరు కవులు అందలి భావములను స్పష్ట ముగా గ్రహించిరి. మహాభారతమందు కొన్ని రామాయణ శ్లోకాలు కనబడుచున్నవి. మరికొన్ని భావాల అనుకరణముకూడా కనబడు చున్నది. ఎట్లనగా -
“అనార్యజుష్ట మస్వర్గ్యం కుర్యాం పాప మహం యది”
(అయో. 82–14)
“అనార్యజుష్ట మస్వర్గ్యం మకీర్తికర మర్జున" భగవద్గీత.
"యద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్
నాహం తత్ప్రతిగృహ్ణీయాం భక్షా న్విషకృతానివ."
(అయో. 97-4)
"కులక్షయకృతం దోషం మిత్రద్రోహేచ పాతకం" భగవద్గీత.
“నహిచ్ఛేయ మధర్మేణ శక్రత్వ మపి లక్ష్మణ"
అయో. 97-7
బడినది.
“మనోహి హేతు స్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే.”
సు. 11-41
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః”
ఉపనిషద్వాక్యము
వేపతే స్మాధికం సీతా విశంతీ వాంగమాత్మనః
వనే యూథపరిభ్రష్టా మృగీ కోకై రివార్దితా.
సు. 25-5
ప్రావేపత భయోద్విగ్నం సింహం దృష్ట్వేవ గోగణః
మహాభారతం భీష్మ. అ. 13 శ్లో. 10
ఇక్కడ సింహమును చూచిన ఆవులు వణకినట్లుగా భీష్మ మరణ
కాలమందు కౌరవ సైన్యము కంపించెనని వర్ణించినారు. కాని తిక్కన
సోమయాజి పూర్తిగా రామాయణ మందలి పై శ్లోకమునే అనుకరించెను.
అంగద నాథు మ్రింగిన వృకావలి తన్ వెసజుట్టుకొన్న స
ర్వాంగములం జలించి వెగ డందుచు, దిక్కులు సూచుచున్న సా
రంగియపోలె నుండె కురురాజ! భవత్సుతుసేన భీష్ము నా
జిం గబళించి పాండవులు జృంభితవిక్రమలీలఁ బొల్చుటన్.
అసంశయం హరిశ్రేష్ఠ! క్షిప్రం మా ప్రాప్స్యతే పతిః
అంతరాత్మా హి మే శుద్ధ స్తస్మింశ్చ బహవో గుణాః
సు. 37 - 12
ఈ భావమును సంపూర్ణముగా కాళిదాసు సంగ్రహించుకొనెను.
అసంశయం క్షత్రపరిగ్రహక్షమా, యదార్య మస్యా మభిలాషి మే మనః
సతాం హి సందేహపదేషు వస్తుషు, ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః.
అభిజ్ఞాన శాకుంతలం. అంకం 1, శ్లోకం 13
“ఇదం శ్రేష్ఠ మభిజ్ఞాన బ్రూయా స్త్వంతు మమప్రియం."
సు. 38-12
'నివేదయిత్వా౽భిజ్ఞానం ప్రవృత్తించని వేద్యచ" బాల. 1-74
"అభిజ్ఞాన ప్రదానంచ రావణస్యచ దర్శనం” బాల. 3-30
కాళిదాసునికి అభిజ్ఞాన శాకుంతలమేకాక రఘువంశ కుమార
సంభవ నామములు సహితము వాల్మీకి సూచితమైయుండునేమో!
“కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవచ" బాల. 37-32
"రఘువంశస్య చరితం చ కార భగవానృషిః". బాల. 3-9
అను శ్లోకాలనుబట్టి యిట్లూహించితిని.
సీతాపహరణా నంతరము రాము డాక్రోశించి చెట్లను గట్లను నా
సీతను చూచితిరాయని విచారించుటను కాళిదాసు తన విక్రమోర్వశీయ
ములో పురూరవుడు ఊర్వశి జాడను విచారించు ఘట్టమున పూర్తిగా
వినియోగించుకొనెను.
రామునికి జ్ఞాపకము చేయుటకై కాకాసురుని కథ ఒక గుర్తు అని సీత హనుమంతునితో చెప్పెను. ఈ శ్లోకములోని "అభిజ్ఞానం” కాళి దాసునకు అభిజ్ఞాన శాకుంతలము యొక్క భావము నిచ్చినట్లు కనబడు చున్నది.
యస్యార్థా స్తస్య మిత్రాణి యస్యార్థా సస్య బాంధవాః
యస్యార్థా స్స పుమాన్ లోకే యస్యార్థా స్సచ పండితః
యుద్ధ. 83-35
ఈ శ్లోకము ఉన్నదున్నట్లుగా హితోపదేశమందు ఉదాహరింప
ఋక్షేణ గీత శ్ల్శో కో మే తన్ని బోధ ప్లవంగమ. యుద్ధ, 116-42
ఇది సుప్రసిద్ధమైన “ససేమిరా” భల్లూకము కథ.
దీనిని రామాయణమందు పెంచకుండా ఒకే శ్లోకములో సూచించి
వదలినారు. అదేవిధముగా అష్టావక్రుని కథను ఒకే శ్లోకములో సూచించి
వదలినారు.
నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః
చలోర్మిమాలి తందృష్ట్వా సముద్రోపి నకంపతే. బాల. 15-10
రావణునిపై సూర్యుడు ఎండగాయడు, గాలి వీచుటకు భయ
పడును, సముద్రుడు చలింపడు అను భావమును పోతన హిరణ్య
కశిపునిచే నిట్లు చెప్పించినాడు
అస్మదీయంబగు నాదేశమునగాని మిక్కిలి రవిమింట మెరయ వెరచు
అన్ని కాలములందు ననుకూలుడై కాని, విద్వేషియై గాలి వీవవెరచు
మత్ప్రతాపానలమందీకృతార్చియై విచ్చలవిడి నగ్ని వెలుగువెరచు
అతిశాతయైన నా యాజ్ఞ నుల్లంఘించి శమనుండు ప్రాణులజంప వెరచు
ఇంద్రుడౌదల నా మ్రోల నెత్త వెఱచు
అమరకిన్నర గంధర్వయక్ష విహగ
నాగవిద్యాధరావలి నాకు వెరచు
ఏలవెరవవు పలువ నీకేది దిక్కు?
భాగవతము సప్తమస్కందము 257
అష్టావక్రేణ ధర్మాత్మా తారితో బ్రాహ్మణో యథా.
యుద్ధ. 122-7
సంస్కృత సాహిత్యమందు మంచి ప్రవేశముగల వారి కిట్టి
వింకెన్నియో కనబడకమానవు. గుణపోషణము
ఇంతవరకు కవితా విశేషములను గురించి యథామతి సంక్షిప్త ముగా తెలుపబడినది. రామాయణము కవితయందెంతటి ప్రాముఖ్యము వహించినదో అందలి పాత్రల గుణపోషణమందును అంతటి ప్రాముఖ్యము వహించినది.
రామాయణమందలి ప్రతివ్యక్తికిని ఒక ప్రత్యేకత కలదు. ఆ వ్యక్తిత్వము అంతటను ఏక విధముగా నిరూపింపబడినది ఆంగ్లదేశ మందు 400 ఏండ్ల క్రిందట జగత్ప్రసిద్ధిగాంచిన షేక్స్పియర్ మహాకవి తన నాటకములలో ఎంతటి చిన్నపాత్రయైనను సరే దానికొక విశిష్టగుణ పోషణమును (Characterisation) చేయుటలో అద్వితీయుడని పేరు పొందినాడు. రామాయణమందును అదే లక్షణము సమగ్రముగా కనబడు చున్నది. వాల్మీకి షేక్స్పియరులలో భేద మేమనిన ఒకడు ఇంచుమించు 4000 ఏండ్ల క్రిందటివాడు. ఇంకొకడు 400 ఏండ్లక్రిందటివాడు ! ఇంతే ! !
రామాయణమందలి పాత్రలన్నిఁటి గుణపోషణమును గురించి చర్చించినచో విషయవిస్తర మగును. కావున వాల్మీకి చిత్రించిన కొందరిని గురించిమాత్రమే, అదియును సంగ్రహముగానే, యిందు సూచింపబడుచున్నది
శ్రీరాముడు
ఇతడు కథానాయకుడు. ప్రధానపాత్ర. ప్రపంచ మహానాయకు లలో అగ్రగణ్యుడు. ఏమాత్రము కూడ కళంకములేని అవతారపురుషు డని హిందువుల విశ్వాసము. అందుచేతనే దేవుడై వెలసినాడు. ఇచ్చట అతనిని మానవోత్తమునిగానే గ్రహించి విచారింతును. యౌవరాజ్య పట్టాభిషేక కాలములో రాముని ఉత్తమోత్తమ గుణములు వ్యక్త మయ్యెను. గొప్ప సామ్రాజ్యమునకు పట్టాభిషేకము చేయుటకై తండ్రి, మంత్రులు, పురోహితులు, నగరవాసులు, పల్లెజనులు, తమ్ములు, తల్లులు అందరునూ హర్షించిరి. కాని కైకేయికి మంథర దుర్బోధలు చేయుటచేత బుద్ధిమారెను. దశరథుడు ఆమెకు రెండువరాలు ఇచ్చియుండెను. వాటిని పాలించవలసివచ్చెను. పట్టాభిషేకము కొన్ని గడియలలో జరుగవలసి యుండెను అప్పుడు రాముడు కైకేయీ దశరథుల సన్నిధికి పిలువ బడెను. తండ్రికి అమంగళము పలుకుటకు నోట తడిలేదు. మూర్ఛా వస్థలో నున్నాడు. గట్టి గుండెగల కైకేయి బండుగా రామునితో రాజ్య త్యాగము, వనవాసము చేయవలెనని చెప్పును. పిడుగువంటివార్త. దానిని వినిన ఇతరులందరును గట్టిగా రోదనము చేయుచుండిరి. మరి రాముడో? అభిషేక మప్పుడు ఆనందమును ప్రకటింపలేదు. ఇప్పుడు కూలబడి వాపోవలేదు.
ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం, నచైవ రామః ప్రవివేశ శోకం
ప్రవిధ్యతే చాపి మహానుభావో, రాజాతు పుత్రవ్యసనాభితప్తః
(అయో. 19-41)
పైగా వెంటనే యిట్లనెను.
ఏవ మస్తు, గమిష్యామి వనం వస్తు మహం త్వితః
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞా మనుపాలయన్.
ఇంతేనా, ఇదిగో ఇప్పుడే అడవికి వెళ్ళుచున్నాను. జడలు దాల్చి
రాజునాజ్ఞను పాలించుచున్నాను అని అన్నాడు. మరియు ఇట్లన్నాడు.
“ఇంత మాత్రపు కోరికను నాకు తెలిపి యుండరాదా? దీనికై వరములు
కోరవలెనా? వనమునకు పోవుటకు సిద్ధముగా నున్నాను కదా!" అనియు
నిశ్చింతతో పలికెను. జనులతనిపై ఏ వ్యసనచిహ్నములు కూడా చూడజాలక
పోయిరి. పైగా అతడు ప్రసన్నుడుగా కాంతియుక్తుడుగా నుండెను.
అయితే రామునిలో అంతయు నిగ్రహమే కాని కష్టకాలమందు వ్యసనపడు మానవ సహజ గుణమే లేదా అనిన అదియును కలదు. అతడెవ్వరి యెదుట నిగ్రహము, ప్రసన్నత, గాంభీర్యము చూపింపవలెనో బాగా ఎరుగును. తనతల్లి వద్దకూడా అట్లే చాలాసేపు ఆచరించుకొనెను. కాని ఎంతసేపు? ఆమె దుఃఖపరంపరలకు లోబడి-
"తాం తథా రుదతీం రామో రుదన్ వచన మబ్రవీత్.
(అయో. 42-20)
తల్లి దుఃఖాన్ని చూచి తుదకు పట్టలేక రోదనము చేసెను. ఇదే వ్యసనముతో అతడు సీతను చూడబోయెను. ఆ యమాయకురాలి కింకను తారుమారైన యీ వ్యవస్థ తెలియనే తెలియదు. ఆమె చింతావ్యాకులుడైన రాముని చూచి భయపడెను. మరి రాముడున్నూ ఆమెను చూచిన వెంటనే దుఃఖము నాపుకొనలేక రోదనము చేసెను ఇది తన ఆంతరంగికుల యెదుట. మరల సీతాలక్ష్మణులతో తుదిమారు తండ్రి సెలవు తీసుకొను నప్పుడు నిగ్రహమును, ప్రశాంతతను, గాంభీర్యమును ప్రకటించెను. ప్రజ లందరు ఏడ్చిరి కాని ఆతడేమియు సంచలించలేదు. లక్ష్మణు డేడ్చెను. రౌద్రమూర్తియయ్యెను. కాని రాముడతని నోదార్చి, శాంతునిగా జేసెను. అరణ్యా వాసమందును ఎన్నడును తండ్రిని కినియలేదు. మహా వ్యసనము ముంచుకొనివచ్చిననాడు మాత్రమే రెండుమూడు మారులు ఇక కైకేయి సంతోషపడుగాక అని జారవిడిచెను. భరతుడు తనను అడవిలో కలిసెను. అప్పుడతనితో తనతల్లి నేమాత్రమున్నూ కష్ట పెట్టవద్దని ఆజ్ఞాపించెను. ఇంకొకరైయుండిన ప్రజలు, పురోహితులు, మంత్రులు, భరతశత్రుఘ్నులు, కైకేయీదేవితో కూడవచ్చి రాజ్యము చేయుటకై మరలిరమ్మని ప్రార్థించియుండిన ఒప్పుకొని యుందురు. రాముడట్లు చేయలేదు. రామునికి హనుమంతుడు నమ్మినబంటుగా లభించెను. సుగ్రీవుడు మంచి మిత్రుడుగా దొరకెను. అయితే వాలివధ మాత్రము అంతగా సమర్థనీయము కాజాలదు. వాలిని చంపుటకు ముందు అతనికి రాయబార మంపవలసియుండెను. అతని నుండి ఏమి సమాధానము వచ్చెడిదో తెలిసికొనవలసి యుండెను. అటుపై యుద్ధయు ప్రకాశముగా చేయవలసి యుండెను. తెలియకుండా దాగియుండి కుస్తీపట్టుచున్న వాలిని బాణముతో వధించుట ఏల? వాలి మరణశయ్యపై సూటిగా పోటుమాటలతో రాముని అధిక్షేపించెను. “నేను నీకపకారము చేయలేదుకదా! యుద్ధము చేయదల చిన ఈలాటి పనియేల? నీ సీతను తెచ్చుటకు సుగ్రీవుడు సాయపడునని చేసితివా? నన్ను అడిగియుండిన అవలీలగా ఆ పనిని సాధించియుందునే? నన్ను అడవిమృగ మని వేటాడితివా? అటైతే కోతులను తినువారి నెందును చూడలేదే! మాంసాపేక్షలేని వేట యెందులకు?" ఈ విధముగా ప్రశ్న పరంపరలను రామునిపై కురిపించెను. రాముడన్నింటికిని సమా ధానమిచ్చెను. అవన్నియు తృప్తికరముగా లేవు. వ్యాఖ్యాతలందేవో పరమ రహస్యపు జాడలను తీసినారు. అవన్నియు బలవంతపు బ్రాహ్మణార్థమువలె కనిపించుచున్నవి వాల్మీకి అట్టి ద్వంద్వార్థాలు వ్రాయునట్టి మాయాకవి కాడు! ఈ భావమును నేనొక్కడనే ప్రకటించిన అపచారము చేసిన వాడ నగుదునేమో!
భవభూతి తన మహావీర చరితములో చేసిన మార్పును గమ నించవలెను. చెట్టుచాటునుండి తన కపచార మేమియు చేయని వాలిని బాణముతో కొట్టుట తన కథానాయకుని శౌర్యమునకు లోటని భవభూతి వాలికిని శ్రీరామునికిని ద్వంద్వయుద్ధమును కల్పించెను. అదేవిధముగా ఉదాత్త రాఘవమును రచించిన మూయురాజకవియు తన నాటకమందు వాలి రాముల ద్వంద్వయుద్ధమును కల్పించెను. ఈ విధముగా ప్రాచీన ప్రామాణిక పండిత కవులును వాలివధా ఘట్టములో న్యూనతను గమ నించియున్నారు. - హనుమన్నాటక మను సంస్కృత నాటకములో రాముడు వాలిని చంపుట తప్పని వాలితో నొప్పుకొన్నట్లును, అతని నన్యాయముగా జంపినందులకు ప్రాయశ్చిత్తముగా సీతావియోగమును మరొకమారు పొందుననియు చెప్పినట్లును కవి నిరూపించినాడు. (ఉత్తర కాండలోని సీతావియోగ సూచన యీ రెండవ వియోగము).
రామునికి సీత అంటే రెండవప్రాణము. కాని ఆయన లక్ష్మణుని ఎంతగాఢముగా ప్రేమించెనో ఆ ముచ్చట తుదివరకునూ వ్యక్తపరుప లేదు యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్ఛనొందినప్పుడు రాముడు నాకు రాజ్యమేల, సీతయేల ? నా కెవ్వరునూ లక్ష్మణుడు లేనిది కాబట్టరు అని విలపించెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపి వచ్చినప్పుడు అతనిని గాఢముగా కౌగలించుకొని చిన్న పిల్లవానిని వలె తన తొడపై కూర్చుండ బెట్టుకొని లాలించెను.
రావణుడు తనకు చేసినంత యపకారము మరెవ్వరును చేయ లేదుకదా! మొదటిసారి ఇరువురును పోరాడినప్పుడు రావణుని రథమును ధనుస్సును ఆయుధాలను అన్నింటిని రాముడు ధ్వంసము చేసెను. అప్పు డీతనిని చంపి యుండవచ్చును కదా! చంపలేదు. “నీవు నిరా యుధుడవు; నీ నగరములోనికి వెళ్ళి మరల క్రొత్తరథమెక్కి ఆయుధాలతో రమ్ము" అని పంపివేసెను. రావణుడు చనిపోయిన వెంటనే రాముడిట్లనెను.
మరణాంతాని వైరాణి నివృత్తం నః ప్రయోజనం
యుద్ధ. 112-26
ఇతని చావుతో నా వైరముకూడా ముగిసినది. ఇతని యుత్తర క్రియలను లోపము లేకుండా చేయవలెను అని ఆజ్ఞాపించెను
రామునికి సీతయొక్క పాతివ్రత్యము, ఆమె లోకోత్తర పవి త్రతయును తెలియును. కాని రావణునియింట ఒక ఏడు ఉండిన సీతకు, ప్రపంచము నింద లొడిగట్టుననియు రామునికి తెలియును. సీతచే అగ్నిపరీక్ష చేయించినప్పటి అతని నిగ్రహము అద్వితీయమైనది.
రాముడు మహావీరుడు. అతనికి సాటివారు లేకుండిరి. సత్య సంధుడు. జితేంద్రియుడు. ఈ కారణాలచేత అతడు దేవసముడయ్యెను.
లక్ష్మణుడు
ఇతడు ప్రీతిపాత్రుడు. రామునంతటి నిగ్రహుడుకాడు. ధర్మా గ్రహుడు. ఉత్తగా కోపించుకొనడు. మంచిదెల్లను అతనికి సన్నికర్షము. దుష్టమెల్లను అతని కసహ్యము. కోపము వచ్చెనా దానిని శాంతింప జేయువాడు రాముడొక్కడే. రామునిలోని ఉత్తమత్వము అతనికి చాలా ప్రియమైనట్టిది. అందుచేత అతనికి స్వయంసేవకు డయ్యెను. రాముని యౌవరాజ్య పట్టాభిషేకము భగ్నమైనప్పుడు, రాముని త్యాగమును మొదటిసారి చూచినప్పుడు అతడు కన్నీరు కార్చినాడు. ఎట్లో కోపము బిగబట్టినాడు. రామునివెంట నోరుమూసుకొని తిరిగినాడు. తుదకు రాముడున్నూ తల్లివద్ద ఏడ్చినప్పుడు లక్ష్మణుని క్రోధము బయట పడినది. కాలరుద్రుడైనాడు. చిన్న భార్యచే మోహితుడై పెద్దకొడుకును అడవికి పంపే తండ్రి తండ్రికాడని అన్నాడు. ఎవ్వరడ్డము వత్తురో చూచెదనుకాక, నేనొక్కడనే ధనుర్ధరుడనై ప్రపంచాన్ని ఎదిరించి రామునికి పట్టము కట్టుతానని హుంకరించినాడు. రాముడు ఆగు మాగుము, శాంతించుము అని బోధించినాడు. మదపుటేనుగునకు ఆ మాటలు సంకెళ్లైనవి. “మృదుర్హి పరిభూయతే” "మెత్తనగుచోటనే గుద్దలి వాడియౌకదా"! అని రాముని మెత్తదనాన్ని గర్హించినాడు. కర్మము ననుభవించవలెనందురా? దైవవిధి అనుల్లంఘనీయ మందురా?
"వీరా స్సంభావితాత్మానో నదైవం పర్యుపాసతే"
(అయో. 23–16)
పలికినాడు.
భరతుడు తల్లివంటి గుణాలుకలవాడై యుండునని మొదలను కొన్నాడు. దూరమందు భరతుడు అరణ్యానికి వచ్చుట చూచినాడు, అతడు దురుద్దేశముతో వచ్చినాడు. ఇదిగో ఇప్పుడే అతని పని పట్టించు తాను చూడు అని అన్నతో పలికినాడు. భరతుడు చాలా మంచివాడే అని తేలిన తర్వాత అట్టి తల్లి కిట్టి కొడుకు పుట్టినాడే అని ఆశ్చర్యపడినాడు.
రామునందే కాక సీతయందును లక్ష్మణునికి పరమభక్తి. సీతా రాములకు ఏమాత్రమున్నూ ఆయాసము, శ్రమ, కష్టము కలుగకుండా సేవించిన బంటు రాత్రులందు వారికి పహరాయిచ్చి కావలికాచినాడు. వారి ఆజ్ఞలను పాలించినాడు. కాని తన ధర్మాగ్రహమును ప్రకటించక మానలేదు. సీత కిష్కింధలో పారవేసిన ఆభరణాలను లక్ష్మణునికి చూపించినారు. అందేదియు అతడు గుర్తించ జాలినవాడుకాడు. ఒక్క నూపురమును మాత్రము వెంటనేగుర్తించినాడు.
“నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
(కి. 9-22)
ఇది సుందరమైన భావము. అతని అకల్మషత్వమును వెల్ల
డించును. సీతను తల్లికంటె ఎక్కువగా పూజించినదిందు ధ్వనింప
బడినది. అయితే గంగను దాటేకాలములో రామునాజ్ఞచేత లక్ష్మణుడు
సీతను చేతులతో ఎత్తి పడవలోని కెక్కించెను. ఆవిధముగా ఆమెను
తాకుటలో ఆ నిష్కలంకునికి దోషములేదు. నూపురములను మాత్రమే
గుర్తింతును అనుటలో అతడు సీతను పరికించి యెన్నడును చూడ
లేదని భావము. ఆమె తన దృష్టిలో అంత పవిత్ర. శౌర్యములో లక్ష్మణుడు రాముని కేమాత్రమును తీసిపోనివాడు.
రామునైనను ఇతరులు తేరిపార జూడగలరేమో, లక్ష్మణునికి కోపము
వచ్చెనా అతని నెదిరించుట కష్టము.
భరతుడు
అతనికి తన తల్లి లక్షణాలు బాగా తెలియును.
“ఆత్మ కామా, సదా చండీ, క్రోధనా ప్రాజ్ఞమానినీ”
(అయో. 69-10)
అని మొదలే అన్నాడు. అయోధ్యకు వచ్చి సంగతులు కను గొన్నాడు. తల్లిపై మండిపడినాడు. "నిన్ను చంపివేయవలెను. కాని రాముడు కోపపడునని ఊరకున్నాను". అని అన్నాడు. ప్రజలకు మొదలతనిపై మంచి భావము లేకుండెను. కాని అతని యుద్దేశములు విన్న తర్వాత వారతనిని గౌరవించిరి. అరణ్యమందలి ఋషులును అతనిని మెచ్చుకొనిరి. రాము డీతనిని ప్రథమసమాగమములోనే కౌగిలించుకొని తొడపై కూర్చుండబెట్టుకొని గాఢముగా ప్రేమను ప్రకటించెను. రాముడు తిరిగివచ్చుటకై అతడు చేయవలసినన్ని ప్రయత్నాలు చేసెను. కడప కడ్డము పండుకొనెను. లాభము లేకపోయెను. తుదకు రాముని పాదుకలు తలపై ధరించి మహావ్యసనముతో వెళ్ళెను. 14 ఏండ్లు అయోధ్యను ప్రవేశించక పోయెను. తానును తాపసియై నందిగ్రామములో రాముని పాదుకలవద్ద కూర్చుండి ధర్మపరిపాలనము చేసెను.
శత్రుఘ్నుడు
అప్రసిద్ధుడు. మంచివాడే కాని వీరుడుకాడు. వ్యపదిష్టుడుకాడు.
ఎటులో మంథరపై కోపమువచ్చి ఆమెను బాధించి చంపుటకై లేచెను.
అటుతర్వాత అతని ముచ్చట మనకు ఏమియు తెలియదు. యథాజ్ఞా
పయతి రాజా (జో హుకుం సర్కార్) ఆనునట్టి వ్యక్తిగా కానవచ్చు
చున్నాడు. కై కేయి
మొదట మొదట స్వార్థము లేనట్టిది. కాని మంథర ఆమెకు దుర్బో ధలు బాగానూరిపోయగా పోయగా ఆమెలో పూర్తిగా మార్పుకలిగెను. అటు తర్వాతఎవరేమనినాసరే ఆమె అచంచల యయ్యెను. రాజ్యమంతయును తిట్టిపోసెను. దశరథుడు చావనేచచ్చెను. అప్పటికినీ ఆమెకు మనస్తాపము కలుగలేదు. ప్రాయశ్చిత్తమన్న మాటలేదు. ఆమె పారసీక దేశపు స్త్రీయని తెలిపినాను. ఆమె చెలికత్తె మంథరకూడా అక్కడిదిగానే కనబడుచున్నది. అందుచేతనే దాని నిట్లు వర్ణించినారు.
“జ్ఞాతిదాసీ యతోజాతా, కైకేయ్యాస్తు సహోషితా"
(అయో. 7-1)
పుట్టింటివారిచే అరణముగా నియ్యబడినట్టిది; ఎక్కడనో పుట్టి నట్టిది; కైకేయివెంట పంపబడి ఆమెదగ్గరనే సదా ఉండునట్టిది అని వర్ణించుటచే కై కేయియొక్కయు మంథరయొక్కయు వైదేశికత మరింత స్పష్టమగుచున్నది. పైగా మంథర "కుబ్జ”. పర్షియాలోకూడ పూర్వ కాలమందు రాజులు తమ అంతఃపురాలవద్ద నపుంసకులను, గూని స్త్రీలను కాపలాగా ఉంచుచుండినట్లు ప్రతీతి.
కై కేయి తల్లిదండ్రులున్నూ కఠినులని తెలిపినారు. వారిజాడయే బిడ్డకును పట్టువడినది. అయినను భరతుని కన్నందున ఆమెను రాక్ష సిగా లోకము తలపజాలక పోయినది.
సీత
మహాపతివ్రత. ఆమెపేరు భారతీయస్త్రీలకు ఉత్తమోత్తమ మంత్రరాజము. హిందూస్త్రీలకు రామునకంటే సీత యెక్కువ ప్రీతిపాత్ర. పతిభక్తి ఆమెలో అచంచలము. రావణుని సామ్రాజ్యము, 5000 దాసీ జనుల సమర్పణము, రావణుడే స్వయముగా దాసుడై యుండుమాట, సకల భూలోక వైభవములు, ఆమెకు రాముని పాదధూళితో సమానము. ఘోరహింసలు ఆమెను ఆవంతయు చలింపజేయలేదు. జగద్విద్రావణుడగు రావణుడు ఆమెకు గడ్డిపుల్లతో సాటి. అతనితో మాట్లాడినప్పుడు గరికపుల్ల నడ్డముగా పెట్టి మాట్లాడినది. "నీ విలువయంతే" అని చెప్పకయే చెప్పినది. హనుమంతుడామెను తన వీపుపై ఎక్కించుకొని తీసుకొని పోదుననెను. ఆమె నీతిజ్ఞ. అట్లు చేసిన తన కపవాదము, పరపురుషునిస్పర్శ, రాముని శౌర్యమునకు భంగము, రావణునికి శిక్ష తప్పుట, ఇవన్నియు సంభవించునని నిరాకరించెను.
ఆమె ధైర్యము, కష్టములనోర్చు సహనము చాలా ప్రశంసనీయ ములు. అడవికి పోవుటకై సిద్ధమైననాడు ఆమెకు తాపసు లెట్టివారో తెలియదు. అందుచేత కైకేయి ఆమె చేతికి నారచీర లియ్యగా కంట నీరుపెట్టుకొని, రామా !
"కథన్ను బధ్నంతి మునయో వనవాసినః
ఇతి హ్యకుశలా సీతా సా ముమోహ ముహు ర్మహుః
అయో. 37-12
వనవాసినులు నారచీరలెట్లు కట్టుకొంటారు? అని సభలో అందరి
యెదుట అడిగెను. ఆమె యమాయకత్వాని కందరును విలపించిరి.
రాముడామెకు సభలోనే చీరపై చీరకట్టు విధమును తనకు వచ్చినట్టుగా చూపించెను సీత రామునికి సేవకురాలుగానే యుండలేదు. అవసరమని తోచినప్పుడు మంత్రివలె తనకు తోచిన అభిప్రాయముల నిచ్చుచుండెను. ఋషులు రాముని రాక్షసులను సంహరించుటకు ప్రేరేపించినప్పుడు చక్కని హితమును చెప్పి తుద కిట్లనెను: “రామా! స్త్రీచాపలముచే నేనిట్లు చెప్పితిని నీకు ధర్మోపదేశము చేయ సమర్థుడెవడు? నీ తమ్మునితోగూడా ఆలోచించి మీ కేది యుచితమని తోచునో దాని నాచరిఁచుడు.” హనుమంతుడు
ఒకటి చెప్పితే రెండు చేసుకొనివచ్చు రాముని నమ్మిన బంటు.
మహాసమర్థుడు. కాని నిగర్వి, మహాప్రజ్ఞా ధురీణుడు. కాని వినయ
సంపన్నుడు. సంస్కృతములో మహా పండితుడు బహుభాషల నెరిగిన
వాడు. విశ్వాసపాత్రుడు.
రావణుడు
మహాబలాఢ్యుడు. అనేక దేశాలను జయించినవాడు. శత్రు భయంకరుడు. విషయాసక్తుడు. 1000 మంది భార్యలు కలవాడు. సీతను కామించి ప్రపంచమందు శాశ్వతమగు అపకీర్తిని పొందినవాడు. ఈ సందర్భములో రావణునికి దుర్యోధనునికిని కల తారతమ్య మెరుగ వలెను. రావణుని చెల్లెలగు శూర్పణఖయొక్క ముక్కు చెవులు కోయించిన వాడు రాముడు. ఖరదూషణాదుల 14000 మందిని సంహరించినది రాముడు. దానికి ప్రతీకారము చేయదలచినది రావణుడు. రాముడు ఆర్యుడు. రావణుడు రాక్షసుడు. ఇద్దరును సంపూర్ణముగా భిన్నజాతులకు చేరినవారు. దుర్యోధనుడును ధర్మరాజును అన్నదమ్ముల కుమారులు. జ్ఞాతులు. ద్రౌపది దుర్యోధనునికి వదినెవరుస. ఆమెను జూదములో దుర్యోధనుడు గెలిచినాడు. ఆమెను తన తమ్మునిచే సభకు సిగబట్టి లాగించినాడు. నిండుసభలో ఆమెను దిగంబరనుగా చేయించినాడు. నా తొడపై కూర్చుండరమ్ము అని ద్రౌపదిని పిలిచినాడు. రావణుడు ఒల్లని సీతను బలాత్కార కామమునకు గురిచేయలేదు. రాక్షస వివాహాలలో ఒల్లని స్త్రీలకు ఒక సంవత్సరము గడువిచ్చుచుండిరి. సీతకు అదే గడువిచ్చినాడు. రావణుని జాతి నరమాంసమును తినునట్టిదని వర్ణింపబడెను. తన బలమంతయు, తన కుమారులు, బంధువులు, తమ్ములు నాశనమైనప్పుడు కూడా సీతను చంపలేదు. అయినను ఆర్యులలో బలాత్కామమును గర్హించినట్లు మరి దేనిని గూడా గర్హింపకుండిరి. దుర్యోధనునికిని, రావణునికిని ప్రాయశ్చిత్తము తప్పదయ్యెను. రావణుడు బంధుప్రీతి కలవాడు. తన తమ్ముడు చనిపోయి నప్పుడు చాలా వ్యసనపడెను. ఇంద్రజిత్తు చనిపోయినప్పుడు అతని దుర్భరదుఃఖమును వాల్మీకి బాగా వర్ణించినాడు. రావణుడు కన్నీరు జొటజొట కార్చెను. అవి కాలుచున్న నూనెబొట్లవలె నుండెను. అతనికి క్రోధముకూడా నిండియుండెను. అందరును స్తబ్ధులైరి. ఎవరికిని అతనితో మాట్లాడే ధైర్యములేకుండెను. అతని పట్టపురాణి మండోదరి. అప్పుడప్పు డామెను సలహా అడుగుచుండెను. తుదికాలములో కూడా అడిగెను. ఆమె చక్కని నీతియుక్తమగు బోధకావించెను. కాని అతని పాపము పండినందున దానిని విను బుద్ధి అతనికి పుట్టలేదు.
విభీషణుడు
దేశద్రోహి, బంధుద్రోహి అని రాక్షసులచేత గర్హింపబడినాడు. తన యన్న నీతిబాహ్యుడైనందున రాముని ఆశ్రయింపవలసి వచ్చెను. అతడు రాక్షసులలో తప్ప బుట్టినాడు. శాంతపురుషుడు. ధార్మికుడు. నీతిజ్ఞుడు. రామునికి గొప్ప సహాయము చేసినవాడు. అందుచేత కీర్త నీయుడై నాడు.
దశరథుడు
బహుకాలము బహుభార్యలతో భోగాలనుభవించెను. ముసలి ముప్పునకు కైకేయిని పెండ్లాడెను. లేక లేక నల్గురు కుమారులు కల్గిరి. అందు రామునిపై పంచప్రాణా లప్పజెప్పుచుండెను. తాను చూచు చుండగనే అతనిని రాజుగా చేసి ఆ వైభవమును చూడగోరెను. కైకేయి భగ్నపరచెను. అతడు కరుణామయమూర్తి. సత్యవాక్యపరిపాలకుడు. లోకానుభవము సంపూర్ణముగా కలిగినవాడు. కైకేయిని పరిపరివిధముల ప్రార్థించిన ఘట్టము ప్రపంచవాఙ్మయమున సాటిలేనట్టిది. శ్రోతలు కంట తడిబెట్టక మానరు. అయోధ్యాకాండమంతయు మహాపరితాపముతో చిత్రింపబడిన భాగము దశరథుని ఉత్తమగుణములు చాలా సుందరముగా ఇందు వర్ణింపబడినవి.
వసిష్ఠుడు
ఇతని ప్రతిభను గురించి చాలా వినుచుందుము. విశ్వామిత్రుని తన కామధేనువుయొక్క దివ్యశక్తిచే పరిపరి విధముల పరిభవించి ఓడించిన వాడట! అట్టి వసిష్ఠుడు రామాయణములో పనికిరాని ఒక పంచాంగ పురోహితునివలె కనబడుచున్నాడు. దశరథునికి కలిగిన చిక్కును తీర్చడు. కైకేయిని గర్హింపడు దశరథుడు చనిపోయిన తర్వాత నలుగురు పెద్దమనుష్యులలో తానును ఒకనివలె కనిపించును కాని అతని ప్రాధాన్యము కానరాదు. భరతునివెంట నలుగురితోపాటు వెళ్లును. ఇది సరి, ఇది తప్పు అని యేమియు నిర్ణయింపడు. భరద్వాజుని ఆశ్రమములో ఇతని ఖ్యాతికి తగిన మన్నన కానరాదు. భరతుడు పాదుకలతో వెళ్ళి పోయినప్పటినుండి మరల రామాయణములో వసిష్ఠుడు కానరాడు.
విశ్వామిత్రుడు
వసిష్ఠునివలెనే రామాయణములో పనికిరానివానివలే కానవచ్చును. అతని గొప్పతనాన్ని బాలరామ లక్ష్మణులకు ఇతర మునులెవ్వరో చెప్పుదురు. కాని ఆ గొప్పతనానికి తగిన చర్యలు రామాయణములో కాన రావు. రామునికి బాణవిద్యను నేర్పువాడతని సహాయమునే పొందును. కొంత కాలములోనే శ్రీరాముని మిథిలకు పిలుచుకొనిపోవును. అక్కడ సీతను రాముని కిచ్చునట్లు ఏర్పాటుచేయును. అంతటితో అతనిపని ముగిసినది. ఇక రామాయణములో ఎచ్చటను కానరాడు. ఏమైపోయినట్లు?
విశ్వామిత్ర వసిష్ఠులను గురించి ఒక అంశమును గమనింప వలెను. పురాణకర్తలు, వీరు ఓకేవ్యక్తి అనుకొని పొరపాటుపడినారు. వసిష్ఠవంశములో పలువురా పేరుతో వెలసిరి. అదేవిధముగా విశ్వామిత్ర వంశములో చాలామంది విశ్వామిత్ర నామధేయులుండిరి. ఒక్కొక్కరు కొన్ని ఘనకార్యములను చేసిపోయిరి. అవన్నియు ఒకే వ్యక్తికి తర్వాతి పౌరాణికు లంటగట్టినారు.
పర్గిటర్గారిట్లు వ్రాసినారు: “విశ్వామిత్రులు ఇద్దరుండిరి. ఒకరు శునశ్శేఫుని రక్షించినవారు. ఇంకొకరు పాంచాల రాజైన సుదాసుని పురో హితులు. వీరిద్దరిని ఒకటిగా భావించి ఇద్దరి చర్యలను కలగలిపినారు . గాధికుమారుడైన వాడు మొదటి విశ్వామిత్రుడు. రామాయణములో విశ్వామిత్రుడు రెండవవాడు. వసిష్ఠునిచేత పరాభము పొందినవాడు మొదటి విశ్వామిత్రుడేకాని రాముని కాలములో నుండిన రెండవ విశ్వామిత్రుడు కాడు. అదేవిధముగా అనేక వసిష్ఠులుండిరి. వీ రందరును ఒకే వసిష్ఠునిగా పౌరాణికులు భావించిరి. అదేవిధముగా మార్కండే యులును బృహస్పతులును పలువురుండిరని ఎరుగవలెను.” [3]పర్గిటర్ ఇంకను ఇట్లు వ్రాసినారు:
“జనకులును అనేకు లుండిరి. సీరధ్వజ జనక, ధర్మ ధ్వజ జనక, దైవరాతి జనక, ఖాండిక్య జనక అనువారెందరో యుండిరి. హరిశ్చంద్ర, సగర, కల్మాషపాద, దశరథ రాజుల సంబంధములో పేర్కొనబడిన వసిష్ఠులు, వేర్వేరు వారని ఎరుగవలెను.[4]” “పూర్వములో ఎనిమిది సుప్రసిద్ధ బ్రాహ్మణ మూలకుటుంబము లుండెను. భృగు, అంగిరస, మరీచి, అత్రి, వసిష్ఠ, పులస్త్య, పులహ, క్రతువంశములు. మొదటి అయిదు బ్రాహ్మణ వంశములుగానే నిలచెను. తక్కిన మూడింటి లోని పులస్త్యవంశములో రాక్షస, వానర, కిన్నర, యక్షులు పుట్టిరి. పులహవంశములో పిశాచాదులును క్రతువునకును వాలఖిల్యాదులును పుట్టిరి. రామాయణములోని వసిష్ఠుడు తన వంశములో ఆరవవాడు. రామాయణములో విశ్వామిత్రుడు ఉండినది అనుమానమే.”[5] ఈ సందర్భమును గమనించినచో రామాయణములో వసిష్ఠ విశ్వామిత్రులు మనము వినిన మానవాతీతశక్తులగు వారు కారనియు, వారి వంశములోని వారనియు, వారు రామాయణములో ముఖ్యస్థానములో నుండినవారు కారనియు విశదమగును.
ఈ విధముగా రామాయణములో ప్రతి పాత్రకును ఒక వ్యక్తిత్వ మున్నది ముఖ్యమగు వ్యక్తుల గుణపోషణమును లోపము లేనట్లుగా వాల్మీకి పోషించినాడు. ఇట్టి పవిత్ర గ్రంథము, చదివినకొలది ఆనంద మతిశయించుచుండును. రామాయణమందలి సహజ వర్ణనలు, సుందర భావములు, ఉత్తమ నీతివర్తనము, కేవలము హిందువులకే కాక ప్రపంచ మందలి ధార్మికాభిలాషు లందరికిని ఆదర్శప్రాయములు. ఇట్టి కావ్యము సంస్కృతమందే కాదు, ప్రపంచమందే భాషయందును నేటివరకునూ సృష్టికాలేదు. హిందువుల సంస్కృతిని, నాగరికతను, భావౌన్నత్యమును, ధార్మికోదాత్తతను, కవితాప్రాగల్భ్యమును, ప్రతిభాశక్తిని ఈ వాల్మీకి రామాయణమే సర్వకాలములందు, సర్వదేశములందును చాటుచు వచ్చినది. ఇకముందును చాటుచుండగలదు.
- ↑ Monier Williams says :- Ramayana is undoubtedly one of the greatest treasuries in Sanskrit Literature. There is not in the whole range of Sanskrit Literature a more charming poem than the Ramayana. The classi- cal purity, clearness, and simplicity of its style, the exquisite touches of true poetic feeling, with which it bounds, its graphic descriptions of heroic incidents, nature's grandest scenes, the deep acquaintance it displays with the conflicting workings and the most refined emotions of the human heart, all entitle it to rank among the most beautiful compositions that have appecred at any period or and country. P. 191.
- ↑ it bounds, its graphic descriptions of heroic incidents, nature's grandest scenes, the deep acquaintance it displays with the conflicting workings and the most refined emotions of the human heart, all entitle it to rank among the most beautiful compositions that have appecred at any period or and country. P. 191.
- ↑ Pergiter.Ancient Indian Historical tradition P 64
- ↑ Pergiter.Ancient Indian Historical tradition P 138
- ↑ Pergiter.Ancient Indian Historical tradition P 236