రామాయణ విశేషములు-7
7
రాజనీతి
రామాయణమందు రెండు విధములగు నీతులు గలవు. సాధారణ నీతి, రాజనీతి హితోపదేశము చేయునట్టి నీతియే కాక, రాజులు రాజ్యాంగము నడుపుటలో ప్రత్యేకముగా నడుచు కొనవలసిన పద్ధతియు ఇందు పలుతావుల తెలుపబడియున్నది. మొదట రాజనీతిని గురించి తెలిపి తర్వాత ధర్మ నీతులను గురించి కొంత సూచింతును.
పూర్వము నుండియు హిందువులలో రాజును గౌరవించు పద్ధతి యుండెను. రాజుకు విష్ణ్వంశ కలదని హిందువులు విశ్వసించిరి. అయితే అది అంధవిశ్వాసము కాదు. హిందూరాజనీతిలో రాజు నిరంకుశుడగుటకు వీలులేదు అతడు ప్రజాభిప్రాయమునకు వశవర్తుడై యుండవలెను. అతడు ధర్మమును సక్రమముగా పరిపాలించవలెను. అతడు దుష్టుడైనచో ప్రజలు అతనిని తొలగించుచుండిరి. బుద్ధుని కాలానికి పూర్వమందే భారతదేశములో వైరాజ్యములు (Republics) వెలసియుండెను. ఈ సంగతులను దష్టియందుంచుకొని రామాయణ కాలమందలి రాజనీతి యెట్టిదో కనుగొందము.
హిందూరాజులు తాము పాలించిన రాజ్యములోని జనులు నీతి పరులై యుండిరని చెప్పుకొనుటలో గర్వించుచుండిరి. దశరథుని పరిపాలనములో ప్రజలెట్లు సుఖులై నీతిపరులై యుండిరో వాల్మీకి ఈ క్రింది విధముగా వర్ణించినాడు.
తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః
నరాస్తుష్టా ధనైః స్వైః స్వై రాలుబ్ధాః సత్యవాదినః
కామీ వా నకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్
ద్రష్టుం శక్య మయోధ్యాయాం నా విద్వాన్ నచనాస్తికః
సర్వేనరాశ్ఛ నార్యశ్చ ధర్మశీలాః సుసంయుతాః
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః
ఈ విషయములో వివరములకై బాలకాండ షష్ఠ సర్గమంతయు
చదువవలెను.
అయితే ఇదంతా కవి కపోలకల్పితమని యనవచ్చును. ఇంచు మించు అదేకాలములో నుండిన అశ్వపతి కైకేయ వృత్తాంతమునుగూర్చి ఛాందోగ్యోపనిషత్తు (5-11-5) లో ఇట్లు వ్రాసియున్నారు: ప్రాచీన శాలాదులు ఉద్దాలక ఆరుణి పురస్సరులై వైశ్వానరమునుగూర్చి తెలుసు కొనుటకై అశ్వపతి కైకేయ అను రాజునొద్దకు వెళ్ళిరి. రాజు వారికి కానుకలర్పించుకొనగా వారంగీకరించుటకు నిరాకరించిరి. తనలో ఏదో లోపమున్నదని వారట్లు సంకోచించిరేమో యని సంశయించి అశ్వపతి వారితో ఇట్లు మనవిచేసుకొనెను
“న మే స్తేనో జనపదే న కదర్యో. న మద్యపో, నా నాహితాగ్నిః,
నా విద్వాన్, నస్త్వేరీ, న స్వైరిణీ కుతో"
నా రాజ్యములో దొంగలు లేరు, పిసినిగొట్టులు లేరు, మద్య
పాయులులేరు, అగ్నిహోత్రము చేయనివారులేరు, చదువురానివారులేరు, స్త్రీ పురుషులందు వ్యభిచారు లొక్కరునులేరు.
ఇది కట్టుకథయందురేమో? అటైతే క్రీ పూ. 300 ఏండ్ల ప్రాంత మందు గ్రీకులు, రోమనులు ఏమన్నారో వినుడు. స్ట్రాబో యిట్లనెను: “హిందువులు సత్యనిరతులు. వారి యిండ్లకు తాళాలు వేయరు. వారి వ్యవహారాలకు పత్రాలవసరము లేదు." అర్రియన్ ఇట్లన్నారు: "అబద్ధ మాడు హిందువు కానరాలేదు.” మెగస్తనీసు ఇట్లనెను: “హిందువులలో అబద్ధమాడువారు, తస్కరులు, వ్యభిచారులు లేరు." ఇదికూడా కల్ల యందురా? అటైతే మరల వినుడు. క్రీ.శ. 1200 ప్రాంతపు షంషొద్దీన్ అబూఅబ్దుల్లా అను అరబిట్లు వ్రాసెను: “హిందువులు హింస చేయరు.మోసము చేయరు. వారికి మృత్యుభయము లేదు”. ఇదికూడా అబద్ధ మందురా? ఇక సర్వం కల్ల, సాగరంకల్ల అనువారితో మాకుప్రసక్తిలేదు.
ప్రజల కేది హితమో దానిని రాజులు ముఖ్యముగా ఆచరించ వలెనని బాలుడగు రామునికి విశ్వామిత్రుడు బోధించెను.
నృశంస మనృశంసంవా ప్రజారక్షణ కారణాత్
పావనంవా సదోషంవా కర్తవ్యం రక్షతా సతా.
-బాల, 25-18.
'మంచిరాజు ప్రజల రక్షించు నిమిత్తమై క్రూరము కాని,
అక్రూరముకాని, పాపముకాని, అపవాదము వచ్చునది కాని యేది
ప్రజలకు హితమో దాని నవశ్యము చేయవలెను' అని బోధించెను.
విశ్వామిత్రుడు రాజుగా నుండగా వసిష్ఠుని చూడబోయెను. వసిష్ఠు డతని నిట్లు మొట్ట మొదటి ప్రశ్నగా విచారించెను:
“రాజా, నీకు క్షేమమా? ధర్మమార్గమున చరించి ప్రజల రంజించి ధార్మికుడవై రాజవృత్తముచే పరిపాలించుచున్నావు కదా?"
(బాల 52-7)
రాజవృత్తమును గురించి పూర్వికులిట్లు నిర్వచించినారు:
న్యాయే నార్జన మర్థస్య వర్ధనం పాలనం తథా,
సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం.
న్యాయముగా ధనము సంపాదించుట, దానిని వృద్ధిపొందించుట,
రక్షించుట, సత్పాత్రమున కొసంగుట, ఇవి రాజవృత్త మనబడును. వసిష్ఠు డింకను విశ్వామిత్రు నిట్లు విచారించెను: "నీ భృత్యులను
నీవు సరిగా పోషించుచున్నావా? వారు నీ ఆజ్ఞలను సరిగా పాలింతురా? నీ శత్రువుల నందరిని గెలిచినావుకదా? నీ సైన్యబలము మొక్కపోనిదిగా ఉన్నది కదా? నీ ధనకోశము లోపము లేనిదికదా? నీ మిత్రవర్గము బలీయముగా నున్నదికదా? ” ఈ విధముగా ఆ కాలమందు రాజులను విచారించుట పరిపాటియై యుండెను.
దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము సేయ దల పెట్టెను. కాని ప్రజల అనుమతిని అతడు ముందుగా కోరెను. సామంత రాజులను నగర ప్రముఖులను పల్లె పెద్దలను అందరిని పిలిపించి వారి అనుమతిని అర్థించుచు (ఆయో. 1-51) వారితో నిట్లనెను:
“ఆర్యులారా, మా పెద్దలు ప్రజలను తమ కుమారులవలె చూచు కొనుచు పరిపాలించినది మీ రెరుగుదురు కదా! నేనును పూర్వుల జాడలలో యథాశక్తి నడిచినాను. నేను వృద్ధుడనైనాను. రాముడు నాకన్న శ్రేష్ఠుడు. అతనిని యువ రాజుగా చేయదలచితిని.
యదిదం మే౽నురూపార్థం మయా సాధు సుమంత్రితం,
భవంతో మే౽నుమన్యంతాం కథం వా కరవాణ్యహం.
(అయో. 2-15)
నా ఆలోచన సరియైనదేనా? నే నేమి చేయవలెను? నాకు సెల
వియ్యగలరా?" ఈ మాటలను విని ప్రజ లేక వాక్యముగా మాకు రామ పట్టాభిషేకము సమ్మతమే అని పలికిరి. దశరథుడు మరల ఇట్లనెను: “నేను బాగుగా పరిపాలించుచున్నా ననుకొందును. నాలో ఏ లోపము లున్నవని నన్ను కాదని ఇంకొకరిని రాజుగా చేసుకొనుచున్నారు?” అని ప్రజల నడిగెను. వారప్పుడు రాముని ఉత్తమోత్తమ గుణములను వర్ణించి చెప్పిరి. రాముడు రాజు కాబోవుచున్నాడు; అతి వృద్ధుడైన దశరథుడు
తన యనుభవమునుబట్టి రాముడు ఎట్లు రాజ్యము చేయవలెనో బోధించెను:
“రామా, సప్తవ్యసనము లందెప్పుడును లగ్నుడవు కావలదు.
“అమాత్యప్రభృతీ స్సర్వాః ప్రకృతీ శ్చానురంజయ,”
అయో. 3-44
మంత్రులను మొదలుకొని సర్వప్రజలను సంతోషపెట్టుము
కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాస్ బహూన్
తుష్టానురక్తప్రకృతి ర్యః పాలయతి మేదినీం
తస్య నందంతి మిత్రాణి, లబ్ధ్వామృత మివామరాః
అయో. 3-45
కోఠాలను, ఆయుధములను, కోశములను బాగుగా సమకూర్చు
కొని ప్రజలను బాగుగా సంతోష పెట్టి యేరాజు పాలించునో అతని
మిత్రులు అమృతము పొందిన దేవతలవలె ఆనందింతురు.”
రాముడు వనవాసమునకు పోవలసివచ్చునని విని లక్ష్మణు డతనితో నిట్లనెను: "ఆర్యా, రాజు తమ ప్రజలను పుత్రులవలె కాపాడి పూర్వరాజర్షులవలె వృద్ధులైన తర్వాత వానప్రస్థాశ్రమములో చేరవలెను. తమ కుమారులకు రాజ్యమప్పగించి పోవలెను.” రామాయణములో అడుగడుగునకు ప్రజలను పుత్రులవలె పాలించవలెనని తెలిపినారు. రాజావిధముగా ప్రజలను ప్రేమించకుండిన అతడు కటికవాడుగాను ప్రజలు పశువులుగాను ఉందురని (సౌనికి పశవో యథా - అయో. 48-28) రామాయణమే బోధించినది.
దశరథుడు చనిపోయినప్పుడు అతని నల్వురు కుమారులలో ఇద్దరు వనవాసమందును ఇద్దరు మాతామహి గృహమందును ఉండిరి. రాజు లేకుండిన దేశ మరాజక మగుననియు దానివలన నీ క్రింది నష్ట ములు కలుగుననియు అయోధ్యలోని పెద్దరు పలికిరి: “రాజులేని రాజ్యము నాశనమగును. దొంగలు ఎక్కువగుదురు. వారి భయముచే రైతులు పంటలు పండించరు. శిక్షించువాడు లేనందున తండ్రిమాట కొడుకుగాని, మగనిమాట భార్యకాని వినరు. దేశములో ధనసంపద యుండదు. స్త్రీ పురుషులలో నీతివర్తన ముండదు. సత్యము పూర్తిగా దేశమందు మాయమగును. ప్రజలు తమ సభలను చేసికొనరు. ఉద్యానములు దేవాలయములు నిర్మించువారే యుండరు. యజ్ఞయాగాలెవ్వరును సేయరు. స్త్రీలకు దుర్మార్గులనుండి భయోత్పాతములు కలుగును. వర్తకులు బాటదొంగల భయముచే వ్యాపారాలు సేయరు. విజ్ఞానము వృద్ధికాదు. ప్రజలు మత్స్యన్యాయముచే పరస్పరపీడకు లగుదురు. నాస్తికులు ప్రబలుదురు."
(అరాజకమగు దేశమందలి ప్రజల కష్టనష్టములను గురించి తెలుసుకొనుటకు అయోధ్యాకాండలోని 62 సర్గను సాంతముగా చదువ వలెను).
రామాయణ కాలములో రాజులు ప్రజలనుండి వారి ఆదాయములో ఆరవభాగమును పన్నుగా గ్రహించుచుండిరి. (బలిషడ్భాగం : - అయో.75-25). ఉత్తమ రాజనీతిని తెలుసుకొనగోరిన, పైన రాముడు అరణ్య మందుండినప్పుడు భరతుడు రాగా అతనికి బోధించిన విషయములను గమనింపవలెను. (ఈ సందర్భములో అయోధ్యాకాండ 100-వ సర్గ సాంతముగా చదువవలెను.) రాము డిట్లనుచున్నాడు: “శూరులును జితేంద్రియులును విద్వాంసులును కులీనులును ఇంగితజ్ఞులును నగు వారిని రాజు మంత్రులుగ నియోగించవలెను. మంత్రాలోచన ఇతరులకు తెలియ కుండునట్లుగా చూచుకొనవలె. ఉత్తమభృత్యులను ఏర్పాటు చేసుకొనవలెను. ప్రజలను రాజు కఠినముగా శిక్షించగూడదు. ప్రజలు భరింప రాని పన్నులను విధింపగూడదు. శూరులను సమ్మానించి చేరదీయ వలెను. భృత్యులకు సైనికులకు సకాలములో జీతముల నియ్యవలెను. చారులద్వారా 18 విధములగు అధికారవర్గమును అనగా పురోహితులు, సేనాపతి, కోశాధిపతి, నగరాధ్యక్షులు, దండపాలురు, దుర్గపాలురు, ధర్మాధికారులు, కర్మాంతికులు మున్నగువారు తమతమ కార్యములను చక్కగా నిర్వర్తించుచున్నారా లేదా యని విచారించుకొనుచుండవలెను. గ్రామములవృద్ధి, తటాకాది నిర్మాణములచే సస్యవృద్ధి, పశుసంపద, చోరభయరాహిత్యము కలుగునట్లుగా రాజు పాలింపవలెను. ప్రతిదినము ఉదయముననే రాజు ప్రజలకు దర్శన మియ్యవలెను. సైన్యమున కవసరమగు ఏనుగులను, గుఱ్ఱములను సమకూర్చుకొనవలెను. కోటలలో ధనధాన్యములను ఆయుధములను యంత్రములను ఉంచవలెను. ఆదాయము ఎక్కువగా నుండినను వ్యయము మాత్రము స్వల్పముగా చేయవలెను. న్యాయమును నిష్పక్షపాతముతో భాగ్యవంతులకును దరిద్రులకును ఒకేవిధముగా ప్రసాదించవలెను..............."
“ఏరాజు ప్రజలవద్ద ఆరవభాగము పన్ను తీసుకొని వారిని తన
కుమారులవలె రక్షించడో అతడు అధికమైన అధర్మము చేసిన
వాడగును.” (ఆర. 6–11) అని మునులు రామునికి బోధించిరి.
శూర్పణఖ రావణుని చెల్లెలు. స్వైరకామిని. తత్ఫలితముగా
ముక్కు చెవులను బోగొట్టుకొనెను. స్వార్థముతోనైనను సరే, మరే
కారణముతోనైనను సరే, శూర్పణఖ రావణుని నిందించెను. అతడు
రాజధర్మము సరిగా నిర్వర్తించలేదని కఠినముగా పలికెను. ఆమె చెప్పిన రాజనీతి అది రాక్షసులదే యైనను ఉత్తమ రాజనీతియై యున్నది. ఆమె రావణునితో ఇట్లనెను: “నీవు గ్రామ్యస్వైర కామభోగము లందు ప్రమత్తుడవై నిరంకుశుడవై యున్నావు. ఇట్టి రాజును ప్రజలు శ్మశానమును చూచినట్లుగా చూచి దూరముగా తొలగిపోదురు. స్వయముగా సకాలములో చేయవలసిన విధులను ఏ రాజు నెరవేర్పడో అతని రాజ్యము
నాశనమగును. తగని కార్యముల చేయునట్టివాడును, ప్రజలకు దర్శన
మియ్యనివాడును, పరవశుడైనవాడును అగు రాజును జూచి ప్రజలు
దూరముగా తొలగిపోదురు................... క్రూరుడును, లుబ్ధుడును,
గర్వితుడును, శఠుడును, వ్యసనాసక్తుడును నగు రాజును ప్రజలు
గౌరవింపరు.”
- (ఆర. 33-3,4,5,6,15,16)
సుగ్రీవుడు తన వాగ్దానప్రకారము ఆచరించ లేదని లక్ష్మణుడు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను: “బలవంతుడును, కులీనుడును, ఆర్తరక్ష కుడును, జితేంద్రియుడును, కృతజ్ఞుడును, సత్యవాదియు నగు రాజు లోకమందు పూజ్యుడగును అధర్ముడును, అసత్యవాదియు, కృతఘ్ను డును అగు రాజుకన్న నీచుడు మరిలేడు."
-(కిష్కి. 34-7, 8)
సీత రావణునితో ఇట్లనెను: “తెలివిలేనివాడును, నీతిహీనుడును నగు రాజుయొక్క సమృద్ధమైన రాష్ట్రములు కూడ నశించును.”
-(సుంద. 21-11)
రాక్షసులను వదలి వారి శత్రువులదగు రామవర్గమును ఆశ్ర యించిన భీషణుని ఇంద్రజిత్తు నిందించు వాక్యములు చాలా ఉత్తమ రాజనీతితో కూడినట్టివి.
శోచ్య స్త్వ మసి దుర్బద్ధే నిందనీయశ్చ సాధుభిః
యస్త్వం స్వజన ముత్సృజ్య పరభృత్యత్వ మాగతః
నై తచ్ఛిథిలయా బుద్ధ్యా త్వం వేత్సి మహదంతరం
క్వచ స్వజనసంవాసః క్వచ నీచపరాశ్రయః
గుణవాన్ వా పరజన స్స్వజనో నిర్గుణోపివా
నిర్గుణ స్స్వజన శ్శ్రేయాన్ యః పరః పరఏవ సః
య స్సపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే
స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్తై రేవ హన్యతే.
-యుద్ధ 87_ 13, 14, 15, 16.
“దుర్బుద్దీ! నీవు స్వజనమును వదలి పరులకు భృత్యుడవైతివి.
దీనిని పెద్దలు నిందింతురు. స్వజనులలో నివసించుట మంచిదా, లేక
పరుల నాశ్రయించి నీచుడై బ్రదుకుట మంచిదా? పరులు గుణవంతులే
యగుదురుగాక. స్వజనులు గుణహీను లగుదురుగాక. గుణహీనులైనను స్వజనులే శ్రేయస్కరులు, పరులు పరులేకాని తన వారెన్నటికిని కారు. ఎవడు తనవారిని పరిత్యజించి పరపక్షములో చేరి వారిని సేవించు చుండునో వాడు తన పక్షము నాశనమైన తర్వాత పరులచేత తానుగూడ నాశనము పొందును.”
హిందూస్థాన చరిత్రలో గ్రీకుదండయాత్ర నాటినుండి నేటివరకు
అడుగడుగునకు దేశద్రోహులే కానవచ్చుచున్నారు. మనకు పైశ్లోకాలు
నిత్యమననార్హములు.
ఇంతకుముందు శూర్పణఖ యొక్క యు ఇంద్రజిత్తుయొక్కయు
రాజనీతి పరిజ్ఞానమును వెల్లడించినాను. రాక్షసుల నీతికి ఆర్యుల నీతికి భేదములేదు వాల్మీకి అందరినోటను ఒకేవిధమగు రాజనీతిని ప్రకటించినాడు. కుంభకర్ణుడుకూడ తన యన్న యగు రావణునికి అతని యవసాన దశలో మంచి రాజనీతిని ఈ విధముగా బోధించెను “హితుల మాటలు వినకపోవుట దోషహేతువు. పాపకర్మములు నరకపాతము కలిగించును. ఏ రాజు ముందు చేయవలసిన కార్యములను వెనుక, వెనుక చేయవలసిన వాటిని ముందు చేయుచుండునో అతడు నయానయములను తెలియని వాడు. దేశకాల విరుద్ధములగు కార్యములు నాశనము చెందును. ఏ రాజు మంత్రులతో బాగా ఆలోచించి ఉత్తమ మధ్యమాధమ కార్యముల లక్షణముల నెరిగి పురుష ద్రవ్యసంపత్తు, దేశకాల విభాగము, వినిపాత ప్రతీకారము, కార్యసిద్ధి కార్యారంభోపాయము అను అయిదువిధాల నెరిగి యుండునో అతడు కార్యసిద్ధి పొందును. రాజు ధర్మార్థకామముల సద్వినియోగము నెరిగి యుండవలెను. పశువులవంటి బుద్ధిగలవారిని సభలో ఆలోచనకై చేర్చుకొనిన వారు వట్టి ప్రగల్భాలు ప్రకటించు చుందురు. అర్థశాస్త్రము తెలియని వారితో ఆలోచింపగూడదు. శత్రువుల వద్ద లంచములు గొన్నవారిని ఎరిగి రాజు అట్టివారిని పరిహరించవలెను.”
(యుద్ధ. 93-3 నుండి 18 వరకు)
రామాయణకాలమందు రాజ్యస్థిరత్వమునకు, అభివృద్ధికి, శత్రు
వులనుండి బాగా రక్షణచేసికొనుటకు రాజులు మంచి వ్యవస్థను ఏర్పాటు చేసియుండిరి. ప్రజాపాలనమునకు గాను 18 విధములగు అధికార వర్గమును ఏర్పాటు చేసియుండిరి. వారిని "తీర్థములు" అని వ్యవహరించిరి.
కచ్చి దష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచచ
త్రిభి స్త్రిభి రవిజ్ఞాతై ర్వేత్సి తీర్థాని చారకైః.
-అయో.100.36
ఈ 18 తీర్థా లేవనగా: (1) మంత్రులు, (2) పురోహితులు,
(3) యువరాజు, (4) సేనాపతి, (5) దౌవారికులు, (6) అంతర్వంశికులు, (7) కారాగారాధికారులు, (8) కోశాధ్యక్షులు, (9) కార్యనియోజకులు, (10) ప్రాడ్వివాకులు (Judges), (11) సేనానాయకులు, (12) నగరాధ్యక్షులు (City Profect-Kotval), (13) కర్మాంతికులు, (14) సభాధికృతులు, (15) ధర్మాధికారులు, (16) దండపాలురు(Police), (17) దుర్గపాలురు, (18) రాష్ట్రాంతపాలకులు. మొదటి మూడువర్గాలు తప్ప తక్కిన అధికారులపై చారులను
పెట్టి వారు అన్యాయములుకాని, రాజ దేశద్రోహములుకాని చేయకుండు నట్లుగా రాజులు విచారించుకొనుచుండెడివారు.
కోటలను ఎల్లప్పుడును శత్రువులనుండి భయము లేకుండు నట్లుగా రక్షించు ఏర్పాట్లు చేయుచుండిరి. అందు ధనము, ధాన్యము, ఉదకము, యంత్రములు ఉంచుచుండిరి. యంత్రములను శత్రువులపై ప్రయోగించుటలో కుశలులగు శిల్పులను, బాణములను ప్రయోగించుటలో ప్రవీణులైన ధనుర్ధరులను అందు కాపుంచుచుండిరి.
(అయో. 100-58)
రాజు కుండవలసిన లక్షణములను రామాయణమందు చాలా
తావులందు నిరూపించినారు. రాజు జితేంద్రియుడుగను, కామక్రోధాది
వర్జితుడుగను, నిష్పాక్షికత కలవాడుగను, రాజ్యాంగవేత్తగను, ధైర్య
స్థైర్యాది వీరగుణయుక్తుడుగను ఉండవలెనని తెలిపినారు.
దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్త్వతః
అష్టవర్గం త్రివర్గంచ విద్యా స్తిస్రశ్చ రాఘవ
ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం
కృత్యం వింశతివర్గంచ తథా ప్రకృతిమండలం
యాత్రాదండవిధానం చ ద్వియోనీ సంధివిగ్రహౌ
కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథావ దనుమన్యసే.
(అయో. 100-68, 69, 70)
ఈ శ్లోకాలలో కొన్ని సాంకేతికములు తెలిపినారు. రాజనీతి
"ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి" అనునట్టి దిట్టిదే.
పది, అయిదు, నాలుగు వర్గాలలో పది అంటే వేట, జూదము,
కామము, మదము మున్నగు వ్యసనాలని కొందరు, అసత్యలుబ్ధత్వాది దుర్గుణములని కొందరు చెప్పుదురు. పంచవర్గము లనగా అయిదు విధాల దుర్గములనియు, పంచవిధ వైరములనియు చెప్పుదురు. నాల్గువర్గాలనగా సామ దానాదులు, లేక చతుర్విధమిత్రులు అని చెప్పుదురు. సప్త వర్గములనగా రాజు, మంత్రులు, రాష్ట్రము, కోశము, సేన, మిత్రులు అనియు లేదా ఏడు విధములగు మిత్రులనియు చెప్పుదురు. అష్టవర్గ మనగా కృషి వాణిజ్య దుర్గములు, సేతు బంధములు (P. W. D), ఏనుగులను కూర్చుట, గనులను త్రవ్వుట, పన్నులు తీసికొనుట, క్రొత్త గ్రామాలను స్థాపించుట అనియు, లేదా పైశున్య సాహస ద్రోహాది దుర్గుణాలనియు చెప్పుదురు. త్రివర్గమనగా ధర్మార్థకామములనియు, ఉత్సాహ ప్రభుమంత్ర శక్తులనియు, లేక శత్రువుల క్షయ స్థానవృద్ధులనియు చెప్పుదురు. “విద్యాతిస్రములు” అనగా త్రయీవార్తా దండ నీతులని చెప్పుదురు. షాడ్గుణ్యం అనగా సంధి విగ్రహాది షడ్గుణములు.
వింశతి వర్గమనగా బాలుడు, వృద్ధుడు, దీర్ఘ రోగి, బంధు పరిత్యక్తుడు, భీరువు, లుబ్ధుడు, కామి, దేవబ్రాహ్మణ నిందకుడు, సత్యధర్మ రహితుడు మున్నగు 20 విధాలవారనియు, లేదా రాజద్రోహి, వనితాపహారి,పరస్వత్వావహారి, ధర్మదేవమిత్రాదివిరోధి, క్రూరుడు మున్నగు దుర్మార్గులనియు చెప్పుదురు.”
ఈ శ్లోకాలలోని రాజనీతి అస్పష్టముగా నున్నది. వ్యాఖ్యాతలు
ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించినారు. (వివరణకై పై శ్లోకాలపై
వ్రాయబడిన గోవిందరాజాది వ్యాఖ్యాతల అభిప్రాయములను చూడ
గలరు.) రామాయణమందలి రాజనీతి ఇంకను విపులముగా కలదు.
ముఖ్యవిషయాలను మాత్రమే చూపించి వదలివేయుచున్నాను. ఇక హితోపదేశ తుల్యమగు నైతికబోధ రామాయణ మందెట్లు
నిరూపింపబడినదో సంగ్రహముగా తెలిసికొందము.
జటాయువు ఆటవికుడు. రామునకు భృత్యుడు. రావణుడు సీత నెత్తుకొని దొంగయై పోవుచుండగా అతని కెదురై అనేకనీతులు బోధిం చెను."పరదారలను తాకుట నీచమైన పని. ఇతరులు గర్హించు కార్యములను బుద్ధిమంతుడు చేయరాదు.
(ఆర. 50-7)
యథాత్మన స్తథాన్యేషాం దారా రక్ష్యా విమర్శనాత్.
(ఆర. 50-8)
తన భార్యను పరపురుషులు అభిమర్శనము చేయకుండా ఎట్లు
రక్షించుకొనవలెనో పరభార్యలను అట్లే రక్షించవలెను.
రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణాం చోత్తమో నిధిః.
(అర. 50-9)
రాజు ధర్మార్థ కామములకు మూలము. రాజు పాపమాచరించిన
జనులును అదేపని చేయుదురు. ఈ విధముగా బహునీతులను బోధించెను. (వివరములకై ఆరణ్య 50 అధ్యాయము పూర్తిగా చూడుడు)
తుదకు తన స్వామిసేవలో జటాయువు రావణునితో యథాశక్తి పోరాడి
ప్రాణము లర్పించెను. ఆటవికులలో ఇట్టి విశ్వాసపాత్రమగు సేవ
రామాయణమందు పలుతావుల నిరూపింపబడినది.
లక్ష్మణుడు దశరథునిపై కోపించుకొని ఇట్లనుచున్నాడు:
గురో రప్యవలిప్తస్య కార్యాకార్య మజానతః
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అయో. 21-13
తండ్రియైనను యుక్తాయుక్త కార్యవిచక్షణ లేనివాడగుచో అతనిని
కుమారులు దండింపవలెను. ఇదే నీతి శ్లోకము భారతమున నున్నదని
లోకమాన్య తిలకుగారు తమ గీతారహస్యమందు తెలిపియున్నారు. సగర చక్రవర్తియొక్క ధార్మికపాలనమును గురించి యొక
యంశము రామాయణమందు ఒకే శ్లోకమందు సూచింపబడినది. సగరుని పెద్దకుమారుడు, అతని యనంతరము చక్రవర్తి కావలసినవాడు, యౌవనమందు పిల్లవాండ్రను సరయూనదిలోవేసి ముంచి వారి బాధల కానందించుచుండెను. ఈ వార్త సగరునికి తెలియగా తన పుత్రుని తన రాజ్యమునుండి నిర్వాసితునిగా జేసెను.
రామాయణమందు నీతివాక్యములుగా జ్ఞాపక ముంచుకొనదగిన వాక్యములు చాలా కలవు. కొన్నిటిని మాత్రమే యిందు ఉదాహరించు చున్నాను.
'అనిషిద్ధసుఖత్యాగీ పశురేవ న సంశయః' (బాల.4) శాస్త్ర నిషిద్ధములుకాని సుఖములను వదలుకొనువాడు పశువే.
పరప్రవాసే హి వదంత్యనుత్తమం
(అయో. 11-29)
సత్యమే మనుష్యులకు స్వర్గలోకప్రాప్తి హేతువని ఋషులు చెప్పినారు.
"యదాయదాహి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ
భార్యావ ద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి”
దశరథుడు కౌసల్యా ప్రాశస్త్యము నిట్లు నిరూపించెను:
'ఆమె నాకు దాసివలె, సఖివలె, భార్యవలె, చెల్లెలివలె, తల్లివలె వర్తించుకొనుచున్నది.' అయో. (12-68)
(అయో. 14-3)
"సత్య మేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః
(అయో. 14-7)
“మృదుర్హి పరిభూయతే”
(అయో. 21-11)
నగుచోటనే గుద్దలి వాడియౌకదా-చేమకూర-సారంగధర.)
“ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం”
(అయో. 21-40)
“విక్లబో వీర్యహీనో య స్సదైవ మనువర్తతే
వీరా స్సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే”
(అయో. 23-16)
ఇది లక్ష్మణుని నీతి. అతడు హిందువుల కవసరమగు నీతిని
బోధించుచున్నాడు. ఈ సర్గలో దైవము బలీయమా, పురుషకారము
బలీయమా అను చర్చచేసినాడు. “చేతకానివారు నా కర్మ మిట్లుంది అని
ఏడ్తురు. బుద్ధిమంతులైన వీరులు దైవమును లెక్క పెట్టక పురుష
ప్రయత్నము తప్పక చేసితీరుదురు” అని వాదించినాడు. (ఈ చర్చకై
అయోధ్యకాండ 22, 23 సర్గలను పూర్తిగా చదువవలెను.)
"బుద్ధియుక్తాహి పురుషా న సహంతే పరస్తవం"
(అయో. 26-25)
బుద్ధిమంతులు ఇతరులు తమ్ము స్తుతించిన సహింపరు.
“నహి నింబాత్ స్రవేత్ క్షాద్రం" వేపనుండి తేనె కారదు.
(అయో. 35-15)
"పితౄస్ సమనుజాయంతే నరాః మాతర మంగనాః”
(అయో. 35-26) తండ్రి పోలిక కొడుకులకు, తల్లి పోలిక
బిడ్డలకు
"ఆత్మాహి దారా స్సర్వేషాం దారసంగ్రహ వర్తినాం”
(అయో 37-24)
గృహస్థులకు భార్య మగనియొక్క ఆత్మయే.
"నహి తావ దతిక్రాంతా సుకరా కాచన క్రియా”
(అయో. 50-97)
ఏ కార్యమైనా చెడినపిమ్మట సవరింప నలవికాదు.
"న పరేణా౽శితం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితు మిచ్ఛతి”
అయో. 61-16
ఇతర జంతువులు తిన్న మాంసమును వ్యాఘ్రము ముట్టదు.
“గతి రేకా పతి ర్నార్యా ద్వితీయాగతి రాత్మజః
తృతీయా జ్ఞాతయో రాజం శ్చతుర్థీ నేహ విద్యతే"
(అయో. 61-24)
ఇది "పితా రక్షతి కౌమారే” వంటిది.
“శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శ్రుతం
శోకో నాశయతే సర్వం, నాస్తి శోకసమో రిపు : "
(అయో. 62-15)
“పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే"
(అయో. 96-24)
ముందుగా అపకారము చేసినవారిని శిక్షించుటలో అధర్మము
లేదు. ఇది లక్ష్మణుని నీతి.
సత్యముయొక్క ప్రాముఖ్యమును తెలుసుకొనుటకై అయోధ్యా
కాండ 109 సర్గలో 10 నుండి 22 శ్లోకములను చదువవలెను.
"యద్వృత్తా స్సంతి రాజానస్తద్వృత్తా స్సంతిహి ప్రజాః"
(అయో. 109-9)
ఇది యథా రాజా తథా ప్రజా వంటిది.
“పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః" (అర. 1-18)
"ధర్మా దర్థః ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం
(ఆర. 9-30)
“పరేతకల్పాహి గతాయుషో నరా
(ఆర. 41-21)
స్నేహితుల హితమును గ్రహించనివారు చెడినవారు. ప్రేత సమానులు.
“ఉత్సాహవంతోహి నరా న లోకే,
(ఆర. 68-19)
ఉత్సాహవంతులైనవారు అతిదుష్కరమగు కార్యములందు కూడా
పరాజయము పొందరు.
"ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు."
(ఉత్సాహ వర్ణనమును గురించి కిష్కి. 1-122 నుండి 125
వరకు చూడుడు.)
(కిష్కి. 27-34)
వ్యసనమందు లగ్నుడగు వానికి ఆనర్థములు కలుగును.
“నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పాన మేవం ప్రశస్యతే
(కిష్కి. 38-46)
మద్యపానమువలన ధర్మార్థకామములు నాశనమగును. ఇది
మితపాన సంఘ (Temperance) ప్రచారానికి పనికివచ్చు నీతి.
(సుంద. 11-41)
మనస్సే సర్వేంద్రియ ప్రవర్తనకు హేతువు. ఇది "మన ఏవ
మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అను ఉపనిషద్వాక్యమును
బోలియున్నది.
(సుంద. 22-42)
కోపము ఉండకూడదు. దానివలన నష్టములను గురించి సుందర కాండ 55 సర్గలో 4, 5, 6, 7 శ్లోకాలలో బాగా ఉపన్యసించినారు.
భృత్య లక్షణములను గురించి యుద్ధకాండ 1వ సర్గలో 7, 8,
9, 10 శ్లోకాలలో బాగా నిరూపించినారు.
(యు. 2-21)
అందరును చండునికి భయపడుదురు. ఇదివరలో చూపిన 'మృదుర్హి పరిభూయతే' అను లక్ష్మణ నీతి కిది అనుబంధము. దాయాదులు మత్సరమును గురించి యుద్ధకాండ సర్గ 16 లో 3, 4, 5, 6, 7, 8, 9 శ్లోకాలలో చక్కగా వర్ణించినారు. మరియు సర్గ 18 లో 10, 14 శ్లోకాలను చూడుడు.
“సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః."
(యుద్ధ, 16-20, 21)
ప్రియముగా మాట్లాడేవారు చాలామంది. అప్రియమైన హితవు చెప్పువారును వినువారును మాత్రమే దుర్లభులు.
పిఱికితనముయొక్క నష్టములను గురించి హిందువులు బాగా అర్థము చేసుకొనవలెను అంగదుడు చెప్పిన నీతులలో ఇవి చాలా శ్రేష్ఠ మైనట్టివి. చూడుడు:
యుద్ధకాండ. సర్గ, 66 శ్లోకాలు 19 నుండి 27 వరకు
(యుద్ధ. 71-58)
ఆత్మశ్లాఘనచే సత్పురుషులు కానేరరు.
“పౌరుషేణతు యో యుక్తః సతు శూర ఇతి స్మృతః"
(యు. 71-59)
పౌరుషము కలవాడే శూరుడు.
"యస్యార్థ సస్య మిత్రాణి, యస్యార్థ స్తస్య బాంధవాః
యస్యార్థా స్స పుమాంల్లోకే, యస్యార్థా స్సచ పండితః"
(యు. 83-35)
ఈ శ్లోకాన్ని హితోపదేశములో ఉదాహరించినారు.
(యు. 112–26)
ఈ విధముగా రామాయణము నీతులకు నిధియై యుండుటచేత కూడ పూజ్యస్థానమును పొందియున్నది.