రాజస్థాన కథావళి/బప్పరావుల కథ

వికీసోర్స్ నుండి

రాజస్థాన కథావళి.

(మొదటి భాగము.)


బప్పరావుల కథ.

——:(O):——

అనేక సంవత్సరములక్రిందట హిందూదేశమున వల్లభిపుర మను పట్టణమును శిలాదిత్యుం డనుమహారా జొకఁడు పాలించుచుండెను. అతఁడు చిరకాలము శత్రుదున్నిరీక్ష్యముగఁ బ్రజారంజకముగ నేలనేలెను. శిలాదిత్యుఁడు సూర్యుని కుమారుఁడనియు, నాకారణంబున నతఁడా మహారాజును సంరక్షించుననియు బ్రసిద్ధికలదు. అతని సేనలతో పోరినను వారు తప్పక పరాజయము నొందెడువారు. వల్లభినగరపుఁ గోటలో నొకదివ్యసరస్సు కలదఁట. శిలాదిత్య మహారాజు శత్రువులకు జంకినప్పు డాదివ్యసరస్సునకుఁ బోయి, యొడ్డున నిల్చి చిన్ననాడు తన తండ్రి కరపినమంత్రము నుచ్చరించు నఁట. వెంటనే యాసరోవరమధ్యమునుండి సూర్యునిరథములాగు రంగులగుఱ్ఱ మొకటి బయలు దేఱ నారాజు దాని నారోహించి, రణరంగమునకు జన శత్రుసేనలు వాని యెదుట నిలువలేక పటాపంచలై పారుచుండును. ఇట్లుండ కొంతకాలమున కుత్తరదిక్కునుండ యరులమూఁకలువచ్చి వల్లభిపురమును ముట్టడించెను. ఎన్నినాళ్లు మగంటిమిఁజూపీ పోరొనర్చినను, వారు శిలాదిత్యునిఁ గెలువఁజాలక నిరాశులైరి. అంతలో చిరకాలమునుండి రాజుపై మనస్సులో క్రోధమునిల్పియున్న యాతని మంత్రి యొకడర్థ రాత్రమున, శత్రుశిబిరముంబ్రవేశించి వారితో "నాకోరిన బహుమానమునిత్తు రేని శిలాదిత్యునిఁ గెల్చి వల్లభిపురమును బట్టుకొనునుపాయంబు మీ కుపదేశించెద" నని పలికె. ఆపలుకులు విని వారు సంతసించి వానికోరిక

2

రాజస్థానకధావళీ

తీర్చునటుల వాగ్దానముఁ జేయ, నాతఁడును దనఱేనిజ యరహస్యమును బగతుర కిట్లెఱిఁగించెను. "శిలాదిత్య మహరాజు సూర్యపుత్రుఁడు ఆతని ప్రభావమువలన కోటలోని యొక దివ్య సరస్సునుండి సూర్యాశ్వ మొకటి బయలు వెడలును. రాజు దాని పై నెక్కి కయ్యమునకుఁ బోవుటం జేసి విజయుఁడగుచున్నాఁడు. ఆ సరస్సు మైలవడిన యెడల భానుఁ డలుగును. ఆతనియలుకచే రాజున కాగుఱ్ఱము లభింపదు. అప్పుడు మీ రాతని సులభముగా జయింపవచ్చును. ” ఇట్లు పలికి వైరులను మహానందమగ్నులఁ జేసి దుష్టబుద్ధి యగు నామంత్రి నగరమునకుఁ బోయి యొక గోవును జంపించి దాని నెత్తు రాకొలంకునీటిలోఁ గలిపించి కలుషంబుగావించె. కొండొకవడికి వేగుల వాఁడొకఁడువచ్చి, దేవా ! శత్రువులు కోటపైఁ గవియుటకు 'మొనలుదీర్చియున్న వారని చెప్ప శాత్రవసేనలతోఁ బోరుమని తన బలంబుల కానతిచ్చి, యాధరణీశ్వరుఁ డెప్పటి యట్ల దివ్యసరోవరంబునకుం బోయి తనప్రియహయమును బిలిచెను. కాని తొంటియట్ల నీరొకిం చుకయుఁ గదల బారదయ్యెను. ఆ రాజేంద్రుఁడు తత్కారణ మరసి, తన మంత్రపటి మంబు చెడినదనియు, దనజనకుఁ డగుప్రభాకరునకుఁ దనవై ననుగ్రహంబు తప్పిన దనియు నిశ్చయించి సేనలం బురికొల్పికొని, మాయుధ పాణియైదుర్వార సంగ్రామం బొనర్చి దేశ సంరక్షణార్థ మై ప్రాణములు విడిచి కీతి౯ శేషుఁడయ్యెను. శత్రువుల వల్లభిపురంబును బట్టుకొని కొల్లకొనిరి. అప్పుడు దైవవశమున నగరమునందు తేమి నొక్కరితతక్క తక్కిన ఱేనికాంత లందఱుఁ జిచ్చుఱికి భర్తృసహగమనముఁ జేసిరి. ఆమె తన పుట్టినిఁటికి జని మరల భర్తృ సన్నిధికి వచ్చుచుండ దారిలో నొక సేవకుఁ డా రాణింగని శిలాదిత్యుఁడు లోకాంతరగతుఁ డగుటయు వల్ల భిపురము శత్రువులకుఁ జిక్కుటయు నాదిగాగల వృత్తాంత మెఱిఁగించెను. ఆ దేవియు గుండె లవియు తద్వార్తవిని, పిడుగడచిన తెఱంగున మూర్ఛిల్లి దరి లేని శోకాబ్ధిలో మునిగి వల్లభిపురంబునకుఁ బోవఁ గాళ్ళాడక నిండుచూలాలగుటచే

బప్పరావుల కథ.

3

నెటుబోవఁ దోఁచక దాపుననున్న యొక కొండగుహకు మెల్ల మెల్లనఁ జనియె.అందుండ కొన్ని నాళ్ల కామె కొక నందనుం డుదయించె. అనంతర మాయెలనాగ యొక బ్రాహ్మణుని బిలిచి తనకుమారుని వాని కొప్పగించి బ్రాహ్మణకుమారునట్ల వానిం బెంపవలయుననియు సంప్రాప్త యౌవనుడైన పిదప నొక రాజకన్యను వివాహము చేయవలయు ననియు, నొక్కి చెప్పి చిరభర్తృవియోగముచే నవసియున్న తనశరీరము విడిచెను. బ్రాహ్మణుఁడును శిశువు నెత్తుకొని యింటికిఁ జని యాబిడ్డకు గుహలో జన్మించిన 'కారణమున గౌహుఁ డను పేరు

పెట్టి వెనుచు మని తనకూతుఁన కొప్పగింప నామెయుఁ దన బిడ్డలతో పాటు వానికి సంరక్షణఁ జేయుచుండెను. పెంపుడు తలిదండ్రులు బిడ్డలపై నెంతయను రాగము జూపుదురో యంతయనురాగము బ్రాహ్మణుఁడును వానికూఁతురును వాని పైని జూపి వెంప రాజ కుమారుఁడును క్రమక్రమంబునం బెరిగి కడుంగడు నల్లరిబాలుఁ డయ్యె. అను దినంబును బక్షులఁ జంపుచు వనమృగంబుల వేఁటాడుచు రాజకుమారులం గలిసి యాడుచు పోరాటంబు సల్పుచు నాతఁడు దుండగీడగుటం జేసి వానిని బ్రాహ్మణకుమారునట్ల బెనుచుట వానికి నలవిగాదయ్యె. ఇట్లుండి పదునొకండేండ్ల ప్రాయమున నొకనాఁడానృపకుమారుఁడు వెంపుడు తల్లిదండ్రుల యిల్లు విడిచి, యడవులఁ గొండల, వసియించు భిల్లులమూఁకలఁ గలిసి వారలతో నిచ్చవచ్చిన తెఱంగున మెలంగుచు వేఁటలాడుచు పాటలఁ బాడుచు విహరింపఁ జొచ్చె. ఒకనాఁడు గౌహుఁడు భిల్ల బాలకులం గలిసి వేఁటలాడుచుండ నక్కు మారు లందఱు తమచుట్టు పక్కలనున్న నాగరికులవలె తాముఁ గూడ నొకరాజు 'నేర్పఱచుకొందమని పరిహాసార్థ మనుకొని గౌహుని తమ ప్రభువుగా నియమించుకొనిరి. వెంటనే యొక పిన్నవాఁడు కత్తితోఁ దన వ్రేలుం జీరికోని బొటభొటకారు కొన్నెత్తురు గౌహుని నెన్నొసట టీగావేసెను. రాచరిక ముపూనువాని కట్లు చేయుట యా దేశములో నా

4

రాజస్థానకథావళి.

దినములయం దాచారమయి యుండెను. భిల్లుల కులవృద్ధు తద్వృత్తాంతము విని సంతసించి తమ యీదూరుగ్రామ మశేషము గౌహునకు పుత్ర పౌత్ర పారంపర్య మేలుమని యర్పించి, యెల్ల బిల్లులకు వానిదొరగా నొనర్చెను. నాఁటనుండియు తద్వంశస్థులు గిహలోటు లని చెప్పఁ బడుచున్నారు. ఇట్లు గిహలోటు లీదూరిపురమును, భిల్లులను, నెనిమిదితరముల వఱకుఁ బాలించిరి. అనంతరము భిల్లులు క్రొత్త వంశపు రాజు పరిపాలనకు విసువు జెంది వారి నెట్టయిన దేశమునుండి పారఁదోలఁ దలఁచు చుండిరి. ఒకనాఁ డప్పటి రాజు వేటతమకంబున తిరుగుచుండ భిల్లులు వాని నాకస్మికముగఁ దాఁకి వధించిరి. అప్పుడు రాజకుటుంబ మెందేని తలఁ దాఁచుకొనవలసి వచ్చె. పూర్వము గౌహుని కాపాడిన బాహ్మణుని కూఁతురు సంతతివారు. వంశపారం పర్యముగ గురువులుం బురోహితు లగుటం జేసి తద్వంశజుఁ డగుబ్రాహ్మణుఁ డొకఁడు మృతినొందిన రాజకుమారుని మూడేండ్ల ప్రాయము వాని జేరఁదీసి చేరువ నట్టడవిలోనున్న యొక కొండకోటకుం దీసికొని పోవ నొక భిల్లుఁడు వానితండ్రిమిఁది విశ్వాసము చేత రహస్యముగ వాని నందు సంరక్షింపఁ జొచ్చె. అచ్చటఁ గొన్ని నాళ్ళు కడచిన పిదప పురోహితుఁడు రాజపుత్రున కచట యపాయము వాటిల్లు నని తలఁచి యిప్పటి యుదయపురమున కై దుక్రోసుల దూరమున నున్న నాగేంద్ర మను పుణ్య క్షేతమున కాకుఱ్ఱని జేర్చెను. ఈ పట్టణమున మూడు శిఖరములు గలయొక కొండ మొదట యేక లింగ స్వామి యను పేరఁ బరఁగు మహా దేవుని శివుని వానివాహన మగునందిని బ్రాహ్మణు లారాధించెడు వారు. అడవుల నేరుల నిండినయీ యేకాంత స్థలమున రాజపత్ని తనకుమారుని దాఁచి'పెంచుచుండె.అతనికి నామకరణ మేదియు జేయక తల్లి బప్పా యని పిలుచుచు యూరిపిల్లలతో పాటు పెరుగ నిచ్చెను. ఆ భాషలో బప్పయనఁ బిల్ల వాఁడని యర్థము. ఆయూరి పిల్లలవలె నాకుఱ్ఱఁడు నుదయము మొద ల స్తమయమువఱకు పశుల

బప్పరావులకథ

5

మందలం గావ నూరి బైటికిఁ బోవుచు, వారివలెనే తాను నాడుచుఁ బాడుచు వారందఱకు యజమానుఁడయి తనయాజ్ఞ వారు శిరసావహించునట్లు ప్రవరి౯ంచెను. బప్పఁడు నానాఁటికిఁ బెఱిగి నెఱజవ్వనంబుఁ బ్రాపించి యుండ నొకనాఁ డట్లతద్ది పండుగకు నాగేంద్ర గ్రామనాయకుని కూఁతురు తోడిపడుచులం గూడి పండుగదినంబున హాయిగ నుయ్యల లూగ నూరు బైట 'దేవళముచుట్టు నున్న మామిడి తోపున కరిగి యచట నుయ్యల పన్నుటకు త్రాళ్ళు దొరకమి చిన్నబోయి యుండె, దైవవశమున నాసమయంబున బప్పఁ డామావితోటలో దిరుగు చుండ బాలిక లాతనిం గాంచి తమ కొక యుయ్యలత్రాడు తెచ్చి పెట్టుమని వేఁడ బప్పఁడును దాని కియ్యకోని "సరే మీరు నాతో నొక యాట యాడుటకు నొప్పుకొందు రేని మీకు త్రాడిచ్చెదను, మీరు మనసార నూఁగ నచ్చు" నని పలుక గ్రామనాయకునికూఁతు రది యేమియాట యని యడిగెను. మరేమియు లేదు.మనము పెండ్లి యాట యాడుకొంద మని బప్పఁ డుత్తర మిచ్చెను. బాలురును బాలికలును బొమ్మల పెండ్లియాటలు తమ పెండ్లి యాటలు నాడుకొనుట లోకవిదితమేకదా! ఉయ్యెలత్రా డెక్కడ దొరకకపోవునో యని బాలిక లట్లు చేయుట కియ్యకొనిరి. గ్రామ నాయకునికూఁతురుచీర కొంగున రాజపుత్రుఁడు తన శాలువకొంగు ముడివేసి యామెయు నామెతో నున్న మణి యాఱువందల పడుచులయు చేతులు పట్టుకొని యొక వృక్షమునకుఁ బ్రదక్మిణముఁ జేసి కొండొక తడవునకు పాణిగ్రహణ మహోత్సవము నిర్వర్తించెను.

నాగరికత లేనియాపల్లెటూరిపడుచులు తమచుట్టముల యిండ్ల జరుగువివాహములలోఁ బ్రధానాంగముగాఁ జరుగుపని యదియే గావున యాపని కప్పుడు సంతసించి తనివిదీర నుయ్యలలూఁగి, సాయం కాల మిండ్లకుఁ జనియా పెండ్లియాటమాట మఱచి యుండిరి బప్పఁడు తనతోడి బాలకుల నందరఁ జేరఁబిలిచి తానాదినమునఁ గావించిన

6

రాజస్థానకధావళీ.

చిత్రకథ వారివ్వరికిం దెలుపఁ గూడ దనియును, గ్రామంబున నెప్పుడేమాట వినినప్పుడది తన కేఱుంగ జేయవలయు ననియు గట్టడి చేసి వాండ్ర నందు కొడంబరచి, వారిచేఁ బ్రమాణములు చేయించుకొని, యంతట నెల్లర వీడ్కొలిపె. బప్పఁడు పశులమందల మేపుచున్న యాకాలమున చింతపువ్వువన్నెయా వొకటి స్వభావమునఁ బరమ సాధు వయ్యు నింటికి వచ్చి పాలు చేపక యెగదన్ను చుండుటఁ జేసి కారణము దెలియక యెట్టకేలకు బప్పఁడే దానిపాలు పితికికొనుచుండ వలయు నని నిశ్చయించి వానిదొంగతనము పొంచి యుండి పట్టుకొమ్మని యూరి పెద్దలు కొందఱిని నియోగించిరి. బప్పఁ డది యెఱిఁగి కడునలిగి యావు వట్టిపోదుగుతో నింటికి వచ్చుమాట నిజమే కాని తానేపాప మెఱుఁగ ననియుఁ బొదుగుపై నెన్నఁడు జేయి యైన వేయ లేదనియుఁ జెప్పి యాగోవు జాడలు దా గని పెట్టి రహస్యము బట్టబయలు చేయుటకయి, యత్నించి మందలోనుండి యావసరము ప్రతిదినము తప్పిపోవుచుండె నని తెలిసికొని యొకనాఁడు సాయంకాలము పుంతలు పొదలు దాఁగి వెను వెంటం జని యొక కొండ చరియం జేరెను. అచ్చట నల్లి బిల్లిగ, నల్లుకొన్న పొదలనడుమ నొక వేదిక పై నమరియున్న మహాశివలింగమునకుఁ దప్పిపోయినయావు తనపొదుగునుండి పాలు చేపి యభిషేకముఁ జేయుచుండెను. చిర కాలము నుండి జపములు తపములు నుపవాసములు చేసి ముక్తి నిఁబడయు నిచ్ఛతో మనస్సు పరబ్రహ్మముతో నైక్యముఁ జేయఁ బ్రయత్నించుచు నాసమయమున సమాధిలో నున్న యొకానొక సిద్ధుఁడావేది సమీపమున నుండెను. బప్పఁ డామహాత్ముని సమాధినుండి మేలుకొలుప నాతండు తన దివ్యజ్ఞాన మహిమమున నెదుటనున్న బాలుఁ డుత్త మరాజకులసంభూతుడనియు, మహా కార్యములు చేయ నవ తరించినాఁ డనియు దెలిసికోనియె, బప్పఁ డాసిద్ధునకు సాష్టాంగనమస్కార మొనర్చి తాను నాగేంద్రగామవాసి యగు పశుల కాపరి యనియు తప్పిపోయిన యొక

బప్పరావులకథ.

7

యావును వెదకికోనుచు వచ్చె ననియుఁ జెప్పెను. సిద్ధు డాపలుకులు విని వాని సాదరించి యాగో వనుదినంబు నాకొండ చరియకు వచ్చి పాలు తనకును దేవుసకు నొసంగుచుండెనని చెప్పెను. అది మెదలాగోవు మంద నుండి తప్పిపోయిన పుడెల్ల దాని వెదకుచు బప్పఁడు సిద్ధుని నెలవునకుంబోయి వాసి దర్శించి కడుభక్తి వాని పాదములం గడిగియెడ నెడ పాలు,

పండ్లు నాహారములుగ సమర్పించుచు వానికిం బ్రియశిష్యుఁ డయ్యెను. సిద్ధుఁడును బప్పనియెడఁ బ్రసన్నుండై శైవరహస్యముల నుప దేశింప నాత్మను పరమశి భక్తుఁ డయ్యెను. ఆ ముని బప్పనికు పనయనము జేసి మంత్రోప దేశము చేయ మంత్ర మహిమ చే నాతనికొక నాడు ఈ శివుని భార్య యగు మహిషాసుర మర్దని వ్యాఘ్ర వాహన మెక్కి రక్తాంబరంబుల ధరియించి ప్రత్యక్షమై, శత్రునిర్మూలన సాధనంబగు వీటెయు, విల్లును నమ్ములపొదియు, నొసంగుటయే గాక మనుష్యకృతముగాక కేవల విశ్వకర్మ నిర్మితమై యిరుపక్కల వాఁడిగల యొక మహాఖడ్గమును గూడఁ బ్రసాదించెను. ఆఖడ్గ మతిభార మగుటచే దివ్యపురుషులు మహాశూరులు దక్క సామాన్యులు దానిం దాల్ప నోపరు. దేవి యిట్లాతని ననుగ్ర హించుటయు సిద్ధుఁడు బప్పనింజూచి “వత్సా! రేపు నీశరీరము విడిచి దివికిం బోవుదును. కావున నీ వరుణోదయము గాక మున్ను వచ్చి నా కట్టకడపటి దీవెనలం బడయు ' మని యానతిచ్చె రాజకుమారుఁడును తఱువాత తప్పక వచ్చునట్టు నచ్చఁ బలికి మునిని వీడ్కొని పోయేను. కాని పెందలకడ నిద్ర మేల్కొనంజాలక కొంత ప్రొద్దెక్కిన వెనుకఁ నతఁ డాకోండచరియకు వచ్చి చూచునప్పటికి సిద్ధుడందు లేఁ డయ్యె. ఆమహా పురుషుని కోఱకు బప్పడు పొదలు, పుంతలు, పొలములు వెదకి వేసారి యెందునుం గానక యెట్ట కేలకు నాకసము వంకఁ జూచెను. అప్పుడు మహేంద్ర లోకమునుండి వచ్చి కన్నులు మిరుమిట్లు గొలుపు దేదీప్యమాన

8

రాజస్థానకధావళీ.

ప్రభలుగల దివ్యపురుషులు మణిమయం బగు స్వణ౯ విమానంబునఁ గూర్చుండఁ బెట్టికొని పోవ నంతరాళంబున మహావాయుపధంబునం దిరుగుచు సిద్ధుఁడు పుడమి పై కడుదవ్వుల నున్న బప్పనిం, జూచి పైకి వచ్చి నాయాశీర్వచనముల నందుకొమ్మని కేక వేసెను. ఆపరమ మునీంద్రు వాక్సుద్ధివలన బప్పఁడు చూచు చుండఁగ నే యిరువది మూళ్ళ పొడు గెదిగె నఁట. అప్పుడు ముని వానిం బిలిచి నోరు తెరువుమని యానతిచ్చి బప్పఁ డట్లు చేయ తుఋక్కున మొగముపై నుమిసెను. రాజకుమారున కది కడు నసహ్యముగఁ దోఁచుటం జేసి యతఁడు సిద్ధు నియుమ్మి తననోటఁ బడకుండ నించుక యావలకుం దప్పుకొన, నది వాని కాలిపైఁ బడియె, సిద్ధు డది గనుంగోని, నీవు నే జెప్పిన చోప్పునఁ జేసితి వేని చిరంజీవివై యుందువుగద! కాని మ్మిప్పుడైన నీ కేయాయుధమువలనను భయము గలుగ దని పలికి యంతధా౯న మయ్యెను. అనంతర మాబప్పఁ డింటికరిగి జరిగిన వృత్తాంత మంతయుఁ దల్లి కెఱింగింప నామెయు, నతిలోకంబగు నయ్యద్భుతంబున కానంద పరవశయై 'నాయనా! నీ వందఱనుకొన్నట్లు పశులకాపరివి కావు; సకల మహీభరణ దక్షుండవగు రాజపుత్రుండవు; నేను రాజకన్య' నని గుట్టు వెల్లడి చేసి పూర్వవృత్తాంత మెఱిఁగించెను. బప్పఁడది విని నాఁడు మొద లావుల మండలఁ గాఁచుట మాని రాచరికము సంపాదింప దేశముల వెంట, దిరుగ నారంభించెను.ఆసమయమున బప్పఁడు నా గేంద్రగామమును విడుచుటయు నాతనికి మిక్కిలి క్షేమకరము, ఏలనన నాతని విషయమై దుర్భరమగు నొక చెడు వాడుక వ్యాపించుటం జేసి, యూరెల్ల నట్టుడికిన ట్టుడుక సాగెను. గ్రామనాయకుని కూఁతురు సంప్రాప్త యౌవనయై వివాహయోగ్యయగుటం జేసి దానికిం దగు వరుఁ డొకఁడు లభించెను. వివాహ ప్రయత్నము లన్నియు జరిగి సిద్ధముగనుండ ముహూర్తము నిశ్చయించుటకు వచ్చిన బ్రాహ్మణుఁడు బాలిక జాతకమును జూచి గ్రహసంచార

బప్పరావుల కథ.

9

మును బట్టి యామెకు నదివఱకె వివాహ మయినదని చెప్పెను.ఊరి పెద్ద లీమాట విని మితిమీరిన యలుకచే మండిపడి బాలికను నొక్కి యడుగ నామెయు భయపడుచు నెనుక నెఱపఁబడిన యాట పెండ్లి నెఱిఁగించెను. ఆ తెగవారి శాస్త్రమును బట్టియు, నాచారమును బట్టియు, గొంగులు ముడి వేయుటయుఁ జేతులు పట్టుకొనుటయుఁ జెట్టు చుట్టు తిరుగుటయు, నిజమయిన వివాహమును సూచించుటం జేసి బప్పఁడు గ్రామమునందలి యారువందల కన్యలకు విధిగా మగఁ డయ్యె నని పెద్దలలుక జెందుటకు తగినంత కారణము లేకపోలేదు. తనతోడి పసులకాపరులలో నొకనివలన నీసంగతిని బప్పఁడు విని క్రోధ పరవశు లగు మామగార్ల బారినుండి తప్పించుకొని తత్వణ మాగ్రామమును విడిచి కొంతదవ్వరిఁగి గొప్ప బయలు నేల నొక రాతి పైఁ గట్టఁబడిన చిత్తూరినగరముం బ్రవేశిం చెను, ఆకాలమున చిత్తూరునగరము మాళవ రాజవంశస్థుఁ డగు బప్పని మేనమామ పాలించుచు, చిరకాలము క్రిందటఁజూ చినతన తోఁబుట్టువును మేనయల్లుని గారవించెను. ఎవరో యెచ్చటనుండి వచ్చెనో యెవ్వరికిం దెలియని యా క్రోత్తచుట్టా లపై రాజునకుం గలయాదరంబును గారవంబునుఁజూచి 'రాజాశ్రితులందఱుఁ గడునల్లి తమపట్టణము పై నొకశత్రువుదండెత్తిరా వారందఱు నతనికి సహాయముగాఁ బోరరయిరి. రాజు వారిని సాయ మడుగ మేనమామ చేసిన యాదరంబున కెల్ల బప్పఁడు తగినవాఁడైన పక్షమున యతఁ డొక్కఁడే పగతురం దాఁకి జయింపఁగలఁడు. ఇంక మాసహాయ్య మెందుకు? కావలసినయెడల మామడిమాన్యములనైన వదలుకొని మే మెందయినఁ బోవుదుము. కాని, నీపక్షమున బోర మని రాజునకు వారు ప్రత్యుత్తర మిచ్చిరి. బప్పఁడు జంకును గొంకును లేక యొక్కఁడే యుద్ధమునకు సిద్ధ మయ్యెను. ఆతని సాహసమును

జూచి సరదారు లందఱుఁ దమతమ మనస్పర్ధలను విడిచి సిగ్గుపడి యెట్టకేలకుఁ బప్పని వెంట రణంబునకుం బోయిరి. నాటికలహంబున శత్రు

10

రాజస్థానకధావళి

రాజు బఫ్పనిచే పరాజయము నొంది యాశూరశిఖామణికి తన కూఁతు నిచ్చి వివాహము చేసెను. సరదారు లందఱు బప్పనిం జేరఁబిలిచి యారాజు దుష్పరిపాలనము చే దమకు విసువుఁ గలిగెననియు, నందుచే మామను సింహాసనభ్రష్టుని జేసి యల్లుడు గద్దెయెక్కి పాలించిన నుచితముగ నుండు ననియు, నుప దేశించి యట్లు చేయఁ బ్రోత్సాహపరచిరి. బప్పఁడు: నిశ్శంక బిరుదుం డగుటచే సరదారుల సాయమున మేనమామ యని సంశయింపక, ఱేనిం బారఁదోలి రాజ్య మాక్రమించెను. తొల్లి సిద్ధుండు', బప్పని యేకలింగస్వామికి ధర్మకర్తగా నేర్పరచెను, అదిగాక బప్పఁడు హిందూమత ప్రభాకరుఁ డని యును సర్వభూమండలాధీశ్వరుఁ డనియు బిరుదులు గ్రహించెను. అతఁడు చిత్తూరు దేశము చండశాసనుఁ డై చిర కాలము పాలించి రాజ్యము గడువృద్ధి చేసెను. అతఁ డనేక కన్యలను వివాహ మాడెను. అందు ద్వీపాంతరములనుండి వచ్చిన యొకానొక రాజకన్య తనసారెతో నొక దేవీ విగ్రహమును దెచ్చి కోటలో నుంచెను. లోక మాత యగునా దేవి బహుసంవత్సరము లాకోటను సంరక్షించెనఁట. కాని యొక పిరికి రాజు మంచి సమయమున కోటను విడిచి పోయెను. ఆద్వీపాంతరరాజ కన్యక వలన బప్పని కుదయించిననందనుఁడు పితురనంతరమున సింహాసన మెక్కెను. బప్పనిజీవిత మంతయు నెట్టియద్భుతకథలతో నిండి యుండెనో, వాని మరణము నట్టికథలతో నిండి యున్నది. అతఁ డతి వృద్ధుఁ డైన వెనుక "రాజ్యమును, భార్యలను బిడ్డలను విడిచి సేనలం గూర్చుకొని, పశ్చిమ దేశముల పయి దండువిడిసి, చూచిన తా వెల్లఁ జయించుచు, తుట్టతుదకు కొరాసానను మ్లేచ్ఛ దేశముఁ జేరి, యచ్చట నొక రాజ్యము స్థాపించెను, కాశ్మీర, గాంధార, పారశీక ప్రభువులును, కాఫరస్తాను ఇస్పహాను దొరలును, తక్కుంగల పశ్చిమ దేశాధీశ్వరులును వానికి లోబడి కప్పముఁ గట్టిరట. బాల్యమునందుఁబోలె వార్ధకమునందును నతనికి వివాహేచ్ఛ మిక్కుట మగుటఁ జేసి మ్లేచ్ఛ

బప్పరావుల కథ.

11

సామంత రాజపుత్రిక లఁ బలువుర పాణిగ్రహణము జేసికొని యాకన్నెల వలన నూటముప్పదుగురు కుమారులం గనె నని చెప్పుదురు. ఈకోడుకులే నూటముప్పది పటానుతురుక తెగలకు వంశకర్తలై యుండె నని ప్రసిద్ధి గలదు. మున్ను చిత్తూరిపై విసుకు పుట్టినయట్ల కోరాసాను పై సయిత మాతనికి విసుగు జనింప నతం డా దేశమును వైభవమును విడిచి తిరిగి పరమపావనమగు మహా మేరు శైలము నెక్కి జితేంద్రియుఁడయి సన్యసించి జపతపంబుల కాలముపుచ్చి యెట్ట కేలకు శతవృద్ధయి శరీరము విడిచెనఁట. ఈతఁడు చచ్చి లోకము విడిచినను, నద్భుతములు, మహిమలు వీనిని విడువ వయ్యె. అతని మొదటి ప్రజలకు హిందువులును, తరువాత ప్రజ లగుమ్లేచ్ఛులును వాని కళేబర విషయమై వివాదపడిరి. హిందువులు తద్దేహము నగ్ని సంస్కారముఁ జేయవలయు ననిరి. మేచ్చులు నేలం బూడ్చి పెట్టవలయు ననిరి. ఇట్లు కొంత తడవు మ్లేచ్ఛ హిందువులు కార్యనిశ్చయముఁ జేయ లేక వివాద పడు చుండ నప్పుడందులో నొకఁడు శవముమీఁదఁ గప్పినబట్ట నించుక యెత్తెను. అప్పటియద్భుత మే మని వర్ణింపను. ఆస్థానమందు బప్పరావుల శరీరముఁగాని దానిజాడఁగాని యొక్కింతయు గానఁబడక పోవుటయేగాక, శవమును పండుకోనఁ బెట్టిన చోట భూమిలోనుండి లెక్క లేని తామరపువ్వులు 'మొలక లెత్తేను. ఈవిధమునఁ బప్పఁ డద్భుతముగా,న స్తమించెను. ఈ బప్పరావు లే, మివారు సంస్థానము "నేలు శిశోదయ వంశజులగు రాజులకు మూలపురుషుడు. అతని యనంతరమున సింహాసనమునకు వచ్చిన ప్రభువులుఁ గొందఱు బప్పనివ లెనే రావులని బిరుదము వహించిరిగాని, యిటీవలవారు రాణాయను నామము ధరించిరి. బప్పరావుల కాలము మొదలు చిత్తూరు రాజు లచ్చటి శివాలయమునకు ధర్మకర్తలై వారు స్వయముగా నాలయమునకుఁ బోవునపుడు దేవునకు నర్చకులై యుండెడు నాచారము గలదు.