మహాపురుషుల జీవితములు/మహర్షి దేవేంద్రనాథ టాగూరు

వికీసోర్స్ నుండి


ష్కారమునకు భయపడక కష్టములను గణనసేయక తనకు ధర్మకార్యమని తోచిన దానినివిడువక కొనసాగించి "పరోపకారార్థ మిదం శరీర" మనుమాట సార్ధకముచేసిన మహాత్ము డీశ్వర చంద్రుడే. మెత్తని మనసుగలవాడయ్యు దృఢచిత్తుడు. పరమశాంతుఁడయ్యు దుష్టులకు భయంకరుఁడు; నమ్మిన ట్లాచరించుటయందును మనసులో నున్నమాట నిర్భయముగ, బలుకుటయందును పరులసౌఖ్యమునకై స్వసౌఖ్యమును మానుకొని కష్టపడుటయందును నతని కతండె సాటి యనవచ్చును. అతని యౌదార్యము నతని వినయము నతని సౌజన్యము నతని శాంతము వాని విద్యకు వన్నె వెట్టినవి. దేశమున కీతఁ డొనర్చిన మహోపకారమునకు దేశస్థులలో గొందఱు కృతజ్ఞులై వాని గుణగణంబులఁ గొనియాడుచు నెన్నియోపాటలు పద్యములు రచించిరి. అవి యిప్పటికిని బంగాళాదేశమున మారుమూలల సయితము పాడఁబడుచుండును.


మహర్షి దేవేంద్రనాథ టాగూరు


టాగూరనుమాట ఠాగూరను పదమునుండి వచ్చెను. ఈశబ్దమునకు జమీందారుఁడని యర్థము. కాఁబట్టి మహార్షి దేవేంద్రనాథ టాగూరు మిక్కిలి గౌరవముగల జమీందారుకుటుంబములోనివాఁడని మనము తెలిసికొనవచ్చును. ఈటాగూరుల సంస్థానము బంగాళాదేశములో జస్సూరుమండలమున నున్నది. దేవేంద్రనాథుని పూర్వులలో నొకఁడగు పంచాననటాగూరు స్వస్థలమును విడిచి కలకత్తానగరమునకుఁ గాపురము వచ్చెను. వానికొడుకు జయరామటాగూరు దొరతనమువారి యొద్ద గొప్పయుద్యోగముఁ జేసి సాధుర్యఘట్టమున నొక సౌధముఁగట్టి సుప్రసిద్ధుఁడయ్యెను. అతని మునిమనుమఁడగు ద్వారక
మహర్షి దేవేంద్రనాథ టాగూరు


నాథటాగూరు. దేవేంద్రనాథునితండ్రి. ఈతఁడు మిక్కిలి యైశ్వర్యముఁగలఁ జమీందారుఁడయ్యుఁ జక్కఁగనింగ్లీషు చదువుకొని న్యాయవాదియై యాపనిలో నపారముగఁ గీర్తియు ధనమును సంపాదించి యంతతో నూరుకొనక నిరువురు దొరలంగూడి వర్తకముఁ జేసి కోటీశ్వరుఁడయ్యెను. ఈయన రాజా రామమోహనరాయలకు సహకారి యయి సహగమనము నడచి వేయుటలోను హిందువుల కింగ్లీషుభాష నేర్చుటకయి హిందూకళాశాలను స్థాపించుటలోను వానికిఁ జాలఁ దోడ్పడి కుడిభుజమట్లుండెను. అంతియగాక రామమోహనుడింగ్లాండునకుఁ బోయినపిదప వానిచే నెలకొలుపఁబడిన బ్రహ్మసమాజమున కీతఁ డధ్యక్షుఁడయి దానిని నిలిపెను. ఎఱిఁగినవారందఱు నితనిని మహారాజా ద్వరకనాథటాగూ రనుచుండెడివారు. వాని యౌదార్యము మితిమీరినదగుటచే వంగ దేశమునం దేసత్కార్యమును దల పెట్టినను వీనిసాయము లేక యది నెర వేరదయ్యె. ఈయన కీర్తి యూరపుఖండమునందు హిందూ దేశమునందును సమానముగ వ్యాపించి యుండెను. ఇతఁడు 1841 వ సంవత్సరమున యూరపుఖండమునకుఁ బోయి యింగ్లాండు ఫ్రాన్సు మొదలగు దేశములకుఁ జని యచ్చటి రాజులచేత సయితము మిక్కిలి గౌరవింపఁబడెను. ఈతఁ డింగ్లాండునకుఁ బోయినతోడనే దేశోపకారార్థమై వచ్చి యచ్చట మృతినొందిన రామమోహనరాయల కొక గోరిఁ కట్టించెను. యూరపునుండి మరుచటి సంవత్సర మతఁడువచ్చి మరల 1845 వ సంవత్సరమున నింగ్లాండునకుఁ బోయి 1846 వ సంవత్సరమున తన ప్రియమిత్రుఁడగు రామమోహనునివలె నా దేశముననే లండను నగరమున మృతినొందెను. ద్వారకనాథునకుఁ గల ముగ్గురు కొడుకులలోను దేవేంద్రనాథటాగూరు జ్యేష్ఠపుత్రుఁడు. ఈతఁడు 1817 వ సంవత్సరము మెయినెలలో జన్మించెను. తండ్రి తల్లికడఁ జిన్న నాఁట నుండియుఁ జను వెక్కువగనుండుటచే నామె మనుమని ననేక పుణ్య క్షేత్రములకుఁ దనతోఁగూడఁ దీసికొనిపోయి తిప్పెను. ఇతఁడు తన పితృసఖుఁ డగు రామమోహనునిచే స్థాపింపఁబడిన హిందూకళాశాలలో విద్య నభ్యసించెను. బుద్ధిసూక్ష్మత కలవాఁ డగుటచే బాల్యమునందే యీతఁడు సంస్కృతము, పారసీ, యింగ్లీషు, బంగాళీ భాషల నేర్చుకొని వానిలోఁ బ్రవీణుఁ డయ్యెను.

చిన్ననాఁటనుండియు నితని కుపనిషత్తులపై నెంతయు నిష్టము. అదియునుగాక బ్రహ్మసమాజస్థాపకుఁడగు రామమోహనునియింటికి దఱచుగఁ బోవుచుండుటచే నేకేశ్వరారాధనవిషయములను ప్రసంగములవినుచువచ్చెను. ఆగర్భశ్త్రీమంతుఁ డగుటచే దేవేంద్రనాథుఁడు మహావైభవముల ననుభవించుచుఁ బెరిగెను. తన బాల్యమును గురించి యతఁడే యొకచోట నిట్లు వ్రాసియున్నాఁడు.

"సంపన్నులగు తల్లిదండ్రులకుం బుట్టి రాజఠీవి గల కుటుంబమున మహావైభవముతోఁ బెరుగుటంజేసి చిన్ననాట నేనెన్నఁడు భగవంతుని పేరయినఁ దలపెట్టనైతి. ప్రపంచమునందఱు నన్ను గౌరవించువారె. అందఱు నాకు సదుపాయములను జేయువారె. పిలుచుటయె తడవుగ లెక్కకుమీఱిన సేవకులు నాయెదుటఁ జేతులు కట్టుకొని నిలిచెడివారు. ద్రవ్యమన్ననో నేఁ గోరిన నిముసముననె యెడలేని సముద్రతరంగములవలె వచ్చి నాచేతులం బడుచుం డెడిది. నేనడుగుటె యాలస్యముగ నాకోరిక లెల్లఁ దీరుచువచ్చినవి. సౌఖ్య సంపదలు నన్నా దినములలో భ్రమపెట్ట నే నేమియు నెఱుఁగక మోహసముద్రమునం బడితిని. తాత్కాలికములగు సౌఖ్యములనేఁ జూచుకొంటిఁగాని నేను పరలోకమును భవిష్యత్తును దలఁపనైతిని. నేను ప్రపంచసంబంధము లగు మాయలయందుఁ దగుల్కొని యింద్రియ సుఖలోలుఁడనై నాయంతరాత్మను లెక్క సేయక భోగపరాయణ మయిన మనస్సెట్లు త్రిప్పిన నట్లు తిరిగితిని." ఈశ్వరానుగ్రహమున నీయవస్థ చిరకాల ముండదయ్యె.

దేవేంద్రనాధుడు బదునెనిమిది సంవత్సరముల ప్రాయమువాఁ డయినప్పుడు ముసలిదియగు వానితండ్రి తల్లి రోగపీడితయైమరణమునకు సిద్ధమయ్యెను. గంగాతీరమునఁ బ్రాణములు విడుచుట చాల పుణ్యమని నమ్మి యా దేశస్థు లాసన్నమరణులగు మనుష్యుల నేటి యొడ్డునకుఁ గొనిపోవుచుందురు. ఆయాచారమునుబట్టి దేవేంద్రనాథుని పితామహిని గంగయొడ్డునకుం గొనిపోవ నామె యచ్చట వెంటనే మృతినొందక మూడహోరాత్రములు బ్రతికియుండెను. ఆ సమయమున నామె బందుగులందఱు చుట్టుం గని పెట్టుకొనియుండిరి. పురోహితులు హరినామస్మరణం జేయుచుండిరి. మూడవనాఁడు పున్నమి యగుటచే నా రేయి పండు వెన్నెలలు గాయఁజొచ్చెను. శ్రమఁజెందినవారి యాయసము నపనయించుచు మందమారుతము చల్లఁగ వీచుచుండెను. అప్పుడు దేవేంద్రనాథుని మనస్సున జిత్రముగ వైరాగ్యము ప్రభవించెను. అదియెట్లు నెలకొనియెనో జిత్రముగ తెలియుట కాతని స్వవచనముల నీక్రిందఁ బొందుపఱచెదను.

"ఈసమయమున సమస్తపదార్థము లస్థిరములనియు వినశ్వరములనియు నాకుఁదోచెను. తోఁచినతోడనే నేనుమునుపటిమనుష్యుఁడనుగాక మారి క్రొత్తవాఁడనైతిని. ధనముపై రోత పుట్టెను. నే నప్పుడు కూర్చున్న ప్రాఁతవెదురుచాపయె నాకుం దగినదని తలంచితిని. వెల లేని తివాసులు మెత్తని పాన్పులు లోనగు వానిపై నేవపుట్టెను. అదివరకెన్న డెఱుఁగని మహానందము నామనస్సునం దుదయించెను. అంతకుమున్ను నే నింద్రియ సుఖలోలుఁడనై యుండినకాలమున మతమన నేమియో భగవంతుఁడన నెట్టివాఁడో తెలిసికొనుటకై యత్నించిన పాపమునఁబోవనైతిని. ఆశ్మశానభూమి ప్రశాంతమయి నిశ్శబ్దముగ నుండెను. ఆయానందము నేను పట్టఁజాలక పరవశుఁడ నైతిని. ఆయానందమును వర్ణించుట కేభాషయం దేమాటలుఁ జాలవు

అనుభవైక వేద్యమై యనిర్వచనీయమై యలోక సామాన్యమై యనన్యదుర్లభమయి యమూల్యమైన యాబ్రహ్మానందమును దేవేంద్రనాథుడు రాత్రియంతయు ననుభవించి మరునాఁటినుండియు పిచ్చివాఁడపోలె నేదియో మఱచి చింతించువాఁడపోలె దేనినోపోఁగొట్టుకొని వెదకువాడుపోలె మందమతియై తీవ్రమైన చిత్తక్షోభ మనుభవింపసాగెను. నాటిరాత్రి యానందమును మరలఁ దెచ్చుకొనవలయునని యతఁడెంత ప్రయత్నించినను సాధ్యము కాదయ్యె. మనశ్శాంతి కొఱ కాయన యింగ్లీషు తత్వ శాస్త్రములఁ జదువుకొనియెఁ గాని తానుగోరిన శాంతిరాదయ్యె. భగవంతుని సాన్నిధ్యమును బడయవలయునని యతఁడు ప్రతిదినముఁ బలుసారులు ప్రార్థనఁ జేయుచు వచ్చెను. ఒకప్పుడుదయము మొదలు మధ్యాహ్నమువఱకు నెండలో నతఁ డీశ్వరధ్యానము సేయుచుఁ బారవశ్యము జెందియుండ సేవకులు సుకుమారమగు వానిమేనెండచే బడలకుండ గొడుగులు బట్టుచు వచ్చిరఁట. ఇట్లు మూడు సంవత్సరములు గతించెను.

ఆతఁడిరువదియొక్క సంవత్సరములప్రాయముగలవాఁడైనప్పు డొకనాఁడు తనగదిలోఁ గూర్చుండఁగ వ్రాతపుస్తకములోని పత్ర మొకటి చిరిగి గాలికిఁ గొట్టుకొనివచ్చి యతని ముందటం బడియె. అందొక సంస్కృతశ్లోక ముండుటచే దనపురోహితుని దానియర్థమడిగి వానివలనం దెలియఁజాలక బ్రహ్మసమాజ ప్రధానాచార్యుఁడగు నీ రామచంద్ర విద్యావాగీశునొద్దకుఁబోయి దానియర్థమడిగెను. ఆపండిత శిఖామణియది యీశోపనిషత్తులోని మొదటి శ్లోకమనియు భగవంతుఁడు జగత్తంతయు నిండియుండును గనుకసర్వమీశ్వరమయమే యని యెంచి మనుష్యుఁడు పరులధనమున కాశఁ జేయక తనకున్న దానితోఁ దనివి నొందవలయునని దాని తాత్పర్యమనియు జెప్పెను. అది విని దేవేంద్రనాథుఁ డక్కజపడి యుపనిషత్తులలో నెంతెంత యర్థములున్నవో తెలిసికొనంగోరి యానాడు మొదలు సంస్కృతముం జదువుకొని యుపనిషత్తుల నర్థసమేతముగ నేర్చుకొనెను. ఈ వేదాంతభాగములపై నతనికి మరణమువఱకు నింతింతనరాని భక్తి గలదు. దేవేంద్రనాధు నెఱిఁగినవారు కొంద ఱతఁడు జ్ఞానియని వాని యొద్ద వేదాంతము నేర్చుకొనుచువచ్చిరి. వేదాంత విద్యాభివృద్ధికొరకాయన 1839 వ సంవత్సరమున తత్వబోధినియను నొకసభస్థాపించి దేవేంద్రనాథుఁడు తన చెలికాండ్ర బదుగుర నందుజేర్చి వారమున కొకసారి యందఱుంగలసి వేదాంతార్థములజర్చించి జ్ఞానాభివృద్ధి జేసికొనుచు నెలకొకసారి ప్రార్థనలఁ జేయుచువచ్చెను. ఈసభాసంబంధమున నతఁడు 'తత్వబోధినీ' పత్రిక నొకదానిని బయలుదేరఁదీసి దానికిఁ దనమిత్రుఁడగు నక్షయకుమారదత్తును నధిపతిగాఁ జేసెను. ఈసభలో మొదట పలువురు చేరకపోయినను కొలఁది కాలమున నవద్వీప మహారాజగు శ్రీశ్చంద్రరాయలు బర్డ్వాను మహారాజాధినీ రాజు మొదలగువారనేకులు చేరిరి. 1842 వ సంవత్సరమునం దతఁడు తత్వబోధితసభయొక్క ప్రథమసంవత్సరోత్సవమును మహావైభవముతోజరిపెను. ఆ ఉత్సవమున కాయన నగరములోనున్న వాఁరిజిన్న పెద్ద లనక నందఱఁ బిలిచెను. ఊరిలోనున్న తగుమనుష్యు లదివరకు సభ పేరయిన యెన్నఁడు వినియుండనందున నీయుత్సవమున కెవరు రారు గాఁబోలునని సామాజికులు చింతించిరి. కాని రాత్రి యెనిమిది గంటలకు సభామందిర మంతయు జనులతోనిండి క్రిక్కిరిసి కూర్చున్న వారి కూపిరి సలుపనట్లయ్యెను. సభ యెనిమిది గంటలు మొదలు రెండు గంటలవరకు జరిగినను, వచ్చినవారు నిద్రాహారములు మానుకొని జరిగిన చర్యల నెంతయు శ్రద్ధతో నాలకించిరి.

ఇట్లుండి యతఁడు బ్రహ్మసమాజమున కప్పుడప్పుడు పోయి చూచుచుండెను. రామమోహనరాయ లింగ్లాండునకుఁ బోవకమునుపు


ప్రార్థనము నిమిత్తము బ్రహ్మసమాజమున కొక మందిరమును నిర్మించి రామచంద్ర విద్యావాగీశుని బ్రధానాచార్యునిగ నేర్పఱిచి పోయెను. రామమోహనుఁడు వెళ్ళినదిమొదలు సమాజము క్రమ క్రమమున క్షీణించినందున విద్యావాగీశుఁ డిఁక సమాజము వృద్ధి పొందదని నిరాశఁజేసుకొనియెను. ఉపనిషత్తుల జదువుటచే దేవేంద్రనాథుని మనస్సు పరిపక్వమయి భక్తిజ్ఞాన వైరాగ్యములతో నిండి నందున నతఁడు పరమేశ్వరుడొక్కఁడే యనియు నతఁడు నిరాకార నిర్వికల్పనిరంజనుండనియు గ్రహించి విగ్రహారాధనము సేయగూఁడదని నిశ్చయించుకొని తనమిత్రులతో నతఁడాసమాజమునఁజేరి తన తత్వబోధినీ సమాజముఁ గూడ నందుఁ గలిపి విద్యా వాగీశున కానందముఁ గలిగించి కొనయూపిరితోనున్న బ్రహ్మసమాజమును బ్రతికించెను. ఇతఁడు చేరుటచేతనే బ్రాహ్మసమాజ మొకగొప్ప మత మయ్యెను. దానికిఁ గావలసిన ధనసహాయమంతయు నతఁడేచేయుచు దానిభారమంతయు నతఁడే వహించుచు సర్వవిధముల దానిని వృద్ధి జేసెను. మఱియు వేదాంతశాస్త్ర వృద్ధికొఱకు తత్వబోధిని పాఠశాల నొకదానిని స్థాపించి దానికిఁగావలసినధనమంతయునితఁడె యిచ్చెను. నాలుగువేదముల నర్థసమేతముగఁ జదువుటకు నలుగురు బ్రాహ్మణ కుమారులను గాశీపురమున కంపెను. బ్రహ్మసమాజములోఁ జేరిన తనమిత్రులలోఁ కొందఱప్పటికిని విగ్రహారాధనము సేయుచుండుటఁ జూచి యది మాన్పింపఁదలఁచి 1843 వ సంవత్సరమునం దాయన సమాజికులందరు ప్రమాణపత్రిక నొకదానిపై వ్రాలు చేయవలయునని తీర్మానించెను. ఆపత్రికపై సంతకములుఁ జేయువారు, తాము సృష్టి స్థితిలయకారణభూతుడఁగు పరాత్పరు నద్వితీయు మానసా రాధనము సేయుటయేగాని విగ్రహారాధనము సేయమనియు రోగ దుఃఖపీడుతు లగునప్పుడుతప్ప ననుదినము భగవంతుని సేవ జేయుదు


మనియు దుష్కార్యములఁ జేయమనియు సత్కార్యములఁ జేయఁ బ్రయత్నింతు మనియుఁ బ్రమాణముఁజేసి వ్రాలు సేయవలయు. ఇట్లు చేయుటకు దేవేంద్రనాథుఁడు మొదలగు నిరువదిమంది పడుచువాండ్రు సిద్ధమై శ్రద్ధాభక్తులఁతో బవిత్రహృదయములతో వచ్చి రామచంద్ర విద్యావాగీశునియెదుట నిలిచిరి. అప్పుడా వృద్ధబ్రాహ్మణుఁడు బ్రహ్మసమాజమత మభివృద్ధిపొందు మేలుదినములు వచ్చినవ కదాయని సంతసించి యానందపారవశ్యమున కన్నులనుండి బాష్పములు విడిచి గద్గదకంఠుఁడై చెప్పఁదలఁచుకొన్న యుపన్యాసము చెప్పనేరక "హా ! ఈసమయమున రామమోహనుఁడే యుండిన నెంత యానందించునోకదా" యని పలికి వారిని స్వమతమునం జేర్చికొనియెను.

ఇట్లు చేరిన కొలఁది కాలములోనే యతనికి క్రైస్తవమత బోధకులతో వివాదము సంభవించెను. అతని తండ్రియొద్దఁ బనిచేయు చుండిన రాజేంద్ర సర్కారను నొక బ్రాహ్మణుని భార్యయు నామె సోదరుఁడును క్రైస్తవమతమునఁ గలియుటకయి యొకబోధకుని యింటికిఁ బోయిరి. తనభార్యను తనకిప్పింపుఁడని మగఁడు కోర్టులో దావా తెచ్చెను. కాని వాని ప్రార్థన మరణ్యరోదనమయ్యెను. అతఁడంతట దేవేంద్రనాథునితో మొఱఁబెట్టుకొనఁగా నతఁడు క్రైస్తవుల దుర్ణయమునకు బిట్టలుకఁ బూని వారి యధర్మవర్తనము నివారింపఁ జేయఁ దలచి యొకసభఁ జేసి కలకత్తాలోనున్న పెద్దమనుష్యుల నందఱ రావించెను. మతవిషయముల నతనితో భిన్నాభిప్రాయులయ్యు నీయుత్తమ కార్యమున జమీందారులు, మహారాజులు, నుద్యోగస్థులు నాతనితో నేకీభవించి హిందూబాలుర నిమిత్త మొక పాఠశాలను స్థాపించుటకు నిశ్చయించిరి. ఆసభకు వచ్చినవారి యుత్సా ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది.


హ మేమని చెప్పుదు. ఆక్షణమందే యేఁబదివేల రూపాయలు పాఠశాలకు మూలధనముగ నొసఁగఁ బడెను.

ఇరువదియెనిమిది సంవత్సరముల ప్రాయముననే దేవేంద్రనాథుఁ డింతపనిఁ జేయుటచే నక్కజపడి పౌరులనేకులు బ్రహ్మసమాజము మంచిదేయని యందుఁ జేరిరి. ఈతెఱంగునఁ బనిసేయుచుండ బ్రహ్మ సమాజ మతస్థులకు నేది ప్రమాణగ్రంథముగ నుండవలయునని వారిలో వారికి సందేహములు గలిగినవి. అక్షయకుమారదత్తు వేదములు పౌరుషేయములగుటచే నప్రమాణము లనియె, కొందఱు వేదములే ప్రమాణములనిరి. కొంతకాలము వాదానువాదములు జరిగినపిదప దేవేంద్రనాథుఁడు తక్కుఁగల సమాజికులు వేదశాస్త్రములు ప్రమాణములు గావనియు, బుద్ధి నుపయోగించి చక్కఁగ విచారించి యాగ్రంథములలో మంచియున్న యెడలగ్రహించి తదితరములఁ ద్రోసివేయవలయుననియు, నిశ్చయించిరి. అనంతరము బ్రహ్మసమాజమతస్థులకు ధర్మశాస్త్ర మేదయిన నుండవలదాయని సందేహముఁ గలుగ దేవేంద్రనాథుఁడా తెగవారి యుపయోగము నిమిత్తము బ్రహ్మధర్మ మనునొకగ్రంథము నిర్మించెను. ఈ గ్రంథమును రచించుట కేండ్లును బూండ్లును బట్టక యతని కొకనాఁడు మూఁడు గంటలసేపు పట్టెనఁట. తనమిత్రు నొకని వ్రాయమని వేదముల నుండియు శాస్త్రములనుండియుఁ దనకుఁ గంఠపాఠముగ వచ్చిన కారికల నద్భుతముగఁ జెప్పెనట. ఈబ్రహ్మధర్మము మొదట సంస్కృతమున వ్రాయఁబడి పిదప నాంగ్లేయభాషలోనికి బంగాళీ మొదలగు స్వదేశభాషలలోనికిని మార్పఁబడి యిప్పుడు దేశమందంతట నుపయోగింపఁ బడుచున్నది.

ఇంతదనుక దేవేంద్రనాథుఁడు మొదలగు బ్రహ్మసమాజ మతస్థులు తమతమ వర్ణములలోనే యుండిరి. 1846 వ సంవత్సరమున


దేవేంద్రనాథుని తండ్రియగు ద్వారకనాథటాగూరు లండనునగరములో మృతినొందెను. తండ్రికుత్తరక్రియ లెట్లుచేయ వలయునని యతనికి సందేహము జనించెను. బ్రహ్మధర్మప్రకారము చేయుట యుక్తమని దేవేంద్రనాథుఁడు తలచెను. టాగూరువంశస్థులు బ్రాహ్మణులగుటచే వేదశాస్త్రముల ప్రకార ముత్తరక్రియలు జరిగింపవలసిన దనియు నట్లు జరిగింపనియెడల కుటుంబగౌరవమునకు భంగము వాటిల్లు ననియు వానిబంధువులు మిత్రులు పలుమారు నొక్కి చెప్పిరి. దేవేంద్రనాథుఁడవి యెల్లఁ బెడ చెవినిఁబెట్టి బ్రహ్మసమాజ ధర్మప్రకారముగఁ దన సైతృకమును నిర్వర్తించెను. అప్పుడు కులస్థులగు బంధుమిత్రులు వాని బహిష్కరించి పరిత్యజించిరి.

ఈ మహాత్ముని మహాధైర్యమును తెలుపుటకీ పై యంశములు చాలునుకాని యితఁడు సత్యసంధుఁడని మహర్షి శబ్దమునకుఁ దగినవాఁడనియుఁ దెలుపుట కింకొక ముఖ్యాంశము గలదు. జనకుఁడగు ద్వారకనాథుఁడు బ్రతికినన్నాళ్ళు మహారాజవైభవముతో బ్రతికి యనేక దానధర్మముల సేయుటంజేసి యాయన మృతిజెందునప్పటి కొక కోటిరూపాయలు ఋణముండెను. అతఁడులోక వ్యవహార వేదియు న్యాయవాదియు నైనందున ఋణప్రదాతలు తన పిత్రార్జితమగు సొత్తుమీదిఁకిం బోకుండ దగు కట్టుబాటులం జేసి చనిపోయెను. వాణిజ్యవ్యాపారముమీఁద నున్న యాస్తియంతయు నప్పులవాండ్ర కొప్పగింపుమనియు వారది పంచుకొని వచ్చినంతపుచ్చుకొనిపోవలయు ననియు నేర్పాటులఁజేసి బంధువులు ఋణప్రదాతల నొప్పించిరి. ఈ యేర్పాటు ధర్మస్వరూపుఁడగు దేవేంద్రనాథునకు నిష్టము లేకపోయె. అప్పు లిచ్చినవాండ్రు చెడిపోఁగూడదని చెప్పి వారిని రావించి జమీ గ్రామములను దక్కిన సొత్తును దీర్మానము నిమిత్తము వారి కొప్పగించి సంవత్సరమునకుఁ గుటుంబరక్షణము నిమిత్త మిరువది వేల


రూపాయిలఁ దమకు వారిచ్చు నట్లొడంబరచెను. అంతియకాక విలువ గల నగలు గుర్రపుబండ్లు మంచిమేడలు మొదలగునవి విక్రయించి ఋణముఁ దీర్చెను. వేదములఁ జదువుటకు గాశికానగరమునకుఁ బంపిన నలువురు బ్రాహ్మణులను చదువు చాలించి రమ్మనియెను. తాను స్థాపించిన తత్వబోధీనీ పాఠశాలను గట్టిపెట్టి యామందిరమును విక్రయించెను. ఆడువాండ్రెక్కి పోవుటకొక పల్లకి నుంచుకొని తక్కిన సామానులన్నియు విక్రయించి పూర్వవైభవమంతయు గోలుపోయి సామాన్యుఁ డట్లు బ్రతికి యతఁడు ఋణవిముక్తుఁడయ్యె. ఆహాహా! ఎగబెట్టుట కంత వీలున్నప్పుడు తాను కష్టపడుచుఁ దండ్రిచేసిన ఋణములు దీర్చుట యామహానుభావునియందుఁదక్క మఱొక్కనియందు గాంచుట యరిదిగదా, ఋణములఁ దీర్చుటయేగాక ధర్మకార్యముల నిమిత్తము తండ్రి చందాల నిచ్చెదనని వాగ్దానములఁ జేసినవారల కందఱకు వాగ్దత్తధనమును వడ్డీతోఁగూడ నిచ్చి యీ మహాత్ముఁడు పితృవాక్యపరిపాలకుఁ డయ్యెను. ఇట్టియుదారచిత్తుఁడే దేశముననుండు నా దేశము ధన్యమయినదిగదా ! ఋణప్రదాతలు కొంతకాల మితని జమీగ్రామముల స్వాధీనముఁ జేసికొని వ్యవహరించి సరిగా నప్పులు దీర్చుకొనలేక సంస్థానము మరల దేవేంద్రనాథునకే యప్పగించి యతనికిఁదోచినట్లప్పుల దీర్చుమని వేడిరి. అతని సత్యసంధతయందు బ్రజల కెంతనమ్మకముఁగలదో దీనింబట్టి తెలిసికొనుఁడు. వారివలన సంస్థానము మరలఁగైకొని దేవేంద్రనాథుఁడు జాగరూకతతో వ్యవహరించి ఋణములుదీర్చి తన యాస్తి నిలుపుకొనెను.

ఇట్లు కొంతకాలమునకు దేవేంద్రనాథునకును వాని సహకారులకును గొన్ని యభిప్రాయభేదములుఁ గలుగ మనశ్శాంతికై యతండు 1856 వ సంవత్సరమున బూర్వకాల మనేక మహర్షులకు నివాసమైన హిమాలయపర్వతములకుం బోయెను. బోయి యచ్చట


బదునెనిమిది మాసములుండి మన వేదాంతశాస్త్రమును జక్కఁగఁ జదివి కాలముఁబుచ్చుచు నెడనెడ మహోన్నతమయిన యా పర్వత రాజముయొక్క గాంభీర్యమునుంజూచి పరమేశ్వరుని మహామహిమను గొనియాడుచు మనశ్శాంతిని బడసెను. అతఁడాకొండలమీఁద నున్న కాలమునఁ గలకత్తానగరమునఁ గేశవచంద్రసేనుఁడను పందొమ్మిది యేండ్ల ప్రాయముగల కుశాగ్రబుద్ధియొకఁడు ప్రమాణపత్రికపై సంతకముఁ జేసి బ్రహ్మసమాజమునఁ జేరును. దేవేంద్రనాథుఁడు మంచుకొండమీదనుండి వచ్చి తనసమాజములోఁ జేరిన యీబాలుని చాక చక్యమునకు బాండిత్యమునకు సద్గుణసంపదకు గడుమెచ్చి వానితోఁ జెలిమిఁజేసి వానితోఁగలిసిమతాభివృద్ధికయి పనిచేయనారంభించెను. చంద్రసేనుఁడు దేవేంద్రనాథునిపైఁ బుత్రప్రేమయు శిష్యవాత్సల్యమును జూపెను. ఈగురుశిష్యు లిద్దఱు బ్రతిదినము గలిసికొని రాత్రులు ప్రొద్దుపోవువఱకు వేదాంతచర్చలు సలుపుచు పరస్పర జ్ఞానాభివృద్ధిఁ జేసికొనుచుండిరి. ఈయిరువురకూడికచే బ్రహ్మసమాజ మతము జనసమ్మతముగాఁ జొచ్చెను. కేశవచంద్రుఁ డింగ్లీషునను దేవేంద్రనాథుఁడు బంగాళీలోను మతోపన్యాసములు చేయ నారంభించిరి. బుద్ధిసంపన్నుఁడగు శిష్యుఁడు క్రొత్తక్రొత్త పద్ధతులనెన్నో యూహించి తెలుప ధనసంపన్నుఁడగు గురువు వానినిఁ గొనసాగఁ జేసెను. 1859 వ సంవత్సరమున దేవేంద్రనాధుఁడు తన కుటుంబముతోఁ బొగయోడ నెక్కి సింహళద్వీపమునకుఁ బయనము చేయదలప బాలుడు కేశవచంద్రుఁడు వారితోఁ బయనమయి పోయెను. ఈ ప్రయాణమున గురుశిష్యుల స్నేహబంధము మునుపటికన్న దృఢ మయ్యెను. సింహళమునుండి వచ్చినపిదప దేవేంద్రనాథుఁడు బ్రహ్మ ధర్మప్రకారముగఁ దనకూఁతునకుఁ బెండ్లి చేసెను.

1861 వ సంవత్సరమున వారిరువురుఁ గలిసి 'యిండియను మిఱ్ఱ' రను నాంగ్లేయపత్రిక నొక దానిని ప్రకటింపసాగిరి. అదియిప్ప


టికిని దినపత్రికయయి కలకత్తానగరమున వెలువడుచున్నది. దేవేంద్రనాథుఁడు తన ప్రియశిష్యుని వానిప్రజ్ఞకుఁ దగినంత గొప్పవానిగఁ జేయవలయునని నిశ్చయించి యొక దినమునఁ బౌరులన నేకులఁరావించి వానిసమక్షమునఁ గేశవచంద్రుని బ్రహ్మసమాజమత ప్రధానాచార్యునిగ నభిషిక్తునిఁజేసి బ్రహ్మానందుఁడను బిరుదమునిచ్చి బంగరుబందుల చట్రములో నమర్చిన యొకపటమును దంతపుముద్రయుఁదనరచించిన బ్రహ్మధర్మగ్రంథ ప్రతియు వాని కొసంగి మహావైభవముతో నుత్సవముఁ జేసెను. ఆదినము మొదలు బ్రహ్మసమాజమత మెంత మహోన్నతదశకురావలెనో యంతమహోన్నతదశకు వచ్చెను.

ఉపన్యాసములిచ్చుటలో మనహిందూదేశమునఁ గేశవచంద్రు నంతవాడు మరలజన్మింప లేదని యనేకులు యభిప్రాయపడియున్నారు. ఇతని కారణముననే బ్రహ్మసమాజమున నప్పుడనేకులు చేరిరి. కాని యాగురుశిష్యుల స్నేహ చిర కాలమునిలువదయ్యె. దేవేంద్రనాథుడు యజ్ఞోపవీతము దీసిపారవైచి మతాంతరులతో భోజనాదికముల జేయుచుండెనుకాని స్త్రీలను సభలకుఁదోడ్కొనివచ్చుట యితర వర్ణములవారితో సంబంధ బాంధవ్యములు జేసికొనుట మొదలగు కొన్ని కార్యముల కిష్టపడఁడయ్యె. కొన్ని విషయములఁ బూర్వపద్ధతుల ననుసరింపదలఁచిన గురువునకు నన్నిట నవీన పద్ధతుల నవలంబింపఁ దలఁచు శిష్యునకు నభిప్రాయభేధములు గలుగుటంజేసి వారిరువురు చిట్టచివఱకు విడిపోయిరి. దేవేంద్రనాధుఁడుతనమతమున కాదిబ్రహ్మ సమాజమని నామమిడియెను. కేశవచంద్రుఁడు తనమతమునకు హిందూదేశ బ్రహ్మసమాజమని పేరు పెట్టెను. అది మొదలు దేవేంద్రనాథమహర్షి ప్రపంచసంబంధము వదలుకొని యీశ్వర సేవయందే కాలముఁ బుచ్చుచుఁ బ్రతిసంవత్సరము హిమాలయమునకుఁ బోవుచు తన పరిశుద్ధజీవనమువలనను బవిత్ర చరిత్రమువలనను సత్ప్రవర్తనము


వలనను నిర్మలాంతఃకరణమువలనను భూతదయాపరతవలనను ప్రజలచే మహర్షి యను బిరుదమునొంది యాబిరుదమునకుఁ దగినవాఁడనిపించు కొనియెను. ఏటేట బ్రహ్మసమాజ సాంవత్సరికోత్సవముఁ జరిగెడు దినముల దక్క మరియెన్నఁడు నాతఁడు జనుల కగపడెడువాఁడు కాఁడఁట. మిక్కిలి ముదిమిలో సయితము నాతనికి బాల్యమున నున్నంత జ్ఞాపకశక్తి యుండెనఁట. పుణ్య క్షేత్రములలో దేవదర్శనము చేయుటకుఁ బోయినట్లే యీమహర్షిని హిందువు లనేకులు దర్శింప వచ్చెడివారు. ఈయన హిందూదేశమునందలి మనేక భాగములనే గాక బర్మా సింహళము, చీనా మొదలగు విదేశముల సయితము చూచెను.

ఈయనకు మరణకాలము నాటికి పలువురు కుమారులు నిరువురు కుమార్తెలు నుండిరి. అందు జ్యేష్ఠకుమారుఁడగు ద్విజేంద్రనాథు టాగూరు పండితుఁడై కొన్ని వేదాంత గ్రంథములు రచించెను. రెండవకుమారుఁడు సత్యేంథ్ర టాగూరు గొప్పయుద్యోగములఁ జేసి కొన్ని యేండ్ల క్రిందట పించను పుచ్చుకొనెను. మూడవకుమారుఁడగు జ్యోతీంద్రనాథ టాగూరును నాల్గవతనయుఁడగు రవీంద్రనాథ టాగూరును బంగాళీభాషలో మంచి మంచి గ్రంథములు వ్రాసిరి. ఈనాటి బంగాళీ కవులలో రవీంద్రనాథుఁడే మిక్కిలి గొప్పవాఁడని ప్రసిద్ధిగలదు. కుమార్తెయగు శ్రీమతి స్వర్ణకుమారి దేవియు ననేక చిత్రవచన కావ్యముల వ్రాసి ప్రసిద్ధికెక్కి యిప్పుడు బంగాళ దేశమున సివిలు సర్వీసులో గొప్ప యుద్యోగములుచేయు ఘోషాలుగారికి తల్లి యయ్యెను. ఈమహర్షి 1905 వ సంవత్సరమున జనవరినెల 19 వ తేది గురువారము మధ్యాహ్నము లోకాంతర గతుఁడయ్యెను. ఈ మహాత్ముఁడెంత జబ్బుగనున్నను భగవత్ప్రార్థనము మాని యెఱుఁగఁడు. ఇతఁడు మహారాజు బిరుదమునందుటకు మారు తన సత్ప్ర


వర్తనము చేమహర్షి బిరుదము నందెను. ఈరాజయోగి బ్రహ్మసమాజ మతస్థుఁడయినను వాని నిమిత్తమన్ని తెగలవారు నన్ని మతములవారు దుఃఖించిరి.

మరణానంతరమున వీనిని గౌరవించుటకు శవము వెంటఁ గాలి నడకను వెళ్ళిన వారిమాట యటుండఁగ గొప్పవా రెక్కిపోయిన బండ్లొక మైలుదూరమువఱకు వ్యాపించియుండెను. ఆమహాత్ముని శరీరమును గంగాతీరమున మంచిగంధపు చెక్కలతో దహనముఁ జేసిరి. ఈరాజయోగి చరిత్రముఁ జదివినప్పుడు సంసారముఁ జేయుచు దారపుత్రాదులతో సుఖించుచు నాత్మసన్యాసముఁ బుచ్చుకొని ముక్తులయిన వశిష్ఠాది మహర్షుల చరిత్రమును జనకాది రాజయోగుల చరిత్రమును జ్ఞప్తికివచ్చును.