ప్రబంధ రత్నావళి/మనవి

వికీసోర్స్ నుండి

మనవి

శ్రీ ప్రభాకరపరిశోధకమండలి పక్షమున కీ॥ శే॥ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మున్ను రచించినవియుఁ గూర్చినవియు నగు గ్రంథములు కొన్ని నవ్యములును పునర్ముద్రణములును వెలువడినవి. అవి నేటికి చాలవఱకు చెల్లిపోయినవి కొన్ని మాత్రమే, కొలంది మాత్రమే మిగిలియున్నవి. “తెలుగు మెఱుగు' లతో (1948) నారంభమైన శ్రీ ప్రభాకరశాస్త్రి గారి వ్యాససంకలనములు పిదప 'మీగడ తఱకలు', 'సింహావలోకము' అను మఱిరెండు సంపుటములు వెలువడినవి. ఇంకను వారివి ప్రాచీనసాహిత్యమునకును, సంస్కృతాంధ్ర కవుల చరిత్రకును సంబంధించిన వ్యాసములు కొన్నియును; జానపదసాహిత్యము, చరిత్ర, శాసనములు, భాష మున్నగు విషయములకు సంబంధించిన వ్యాసములు కొన్నియును సంకలన రూపమున ప్రకటింపవలసినవి కలవు. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు 1950 కంటె పూర్వము నాలుగాశ్వాసములకుపైపడి రచించిన ఉత్తర హరివంశ వ్యాఖ్యానము, వారే పరిష్కరించియుంచిన పద్యపాఠములతో కూడ ప్రకటింపబడవలిసి యున్నది.

ఇంకను నాటకములలో వారి ప్రతిమానాటకము పునర్ముద్రణ భాగ్యమును బడసినది. శ్రీ శాస్త్రిగారు సగమే ఆంధ్రీకరింపగా మిగిలిన భాగమును డా॥ దివాకర్ల వేంకటవధానిగారిచే పూరింపఁజేసి నాగానందనాటకము ను వెలువరించు టైనది.

ఇంకను వారి భాసనాటకానువాదములు, తెలుఁగుచేసిన ప్రహసనములు, స్వతంత్రములగు నాటికలు కొన్నియును, కలిపి, నాటకసంకలన మొకటి వెలువరింపవలసియున్నది. ఇక పద్యకృతులలో 'దివ్యదర్శనము' 'కపోతకథ' 'కడుపుతీపు' మున్నగు లఘుకృతులొండు రెండు పునర్ముద్రణమందినవి. ప్రభాకర కవిచూడామణి కృతములైన కావ్యఖండికలన్నియు వారెడనెడ చెప్పిన పద్యావళితో పాటు చేర్చి కూర్చిన కావ్యసంకలన మొకటి వెలువడ వలసియున్నది. శ్రీ శాస్త్రి గారి చాటుపద్యమణిమంజరి రెండు భాగములు ముద్రింప బడినవి! విస్తరింపబడిన ద్వితీయ భాగమున ప్రథమ సంవుటము మాత్రమే నేటికి అందుబాటులో నున్నది. ద్వితీయ సంపుటముగా రావలసిన సామగ్రితో కూడి సమగ్రమైన సంకలనము చాటుపద్యమణిమంజరి తిరిగి ముద్రింపవలసిన ఆవసరమెంతేని కలదు. ఇట్లే వారి “నీతినిధి" వంటి ఉత్తమ వచన గ్రంధములు, "శృంగాశ్రీనాథము" వంటి మేటి విమర్శ గ్రంథములు పునర్ముదణ మందవలసి యున్నవి. ఇట్లే ఇంకను వారి రచనలు కథలు-గాథలు; జాబులు-జవాబులు; డైరీలు; గ్రంథపీఠికలు, టీకలు-టిప్పణములు; సమీక్షలు;ఉపన్యాసములు; వ్యాఖ్యలు-విశేషములు, ఆత్మకథ 'ప్రజ్ఞాప్రభాకరము'; జీవితము-యోగము ఆను విభాగములతో ననేక సంపుటములును;—సామెతలు - నానుళ్ళు, గాంధిరామాయణము మున్నగు సంకలనములు మఱికొన్నియును క్రమమున ముద్రింపవలసియున్నవి.

ఇట్లే ఇంకను పలువ్రాతప్రతులను పరిశీలించి పాఠనిర్ణయము గావించి ప్రకటనకు సిద్ధముచేసి యుంచిన ప్రాచీనకావ్యములు కొన్ని యున్నవి. 'లక్షణోధార' మను లక్షణగ్రంథవిషయ సంకనమునకు బ్రృహత్ర్పణాళికను రచించి, సామగ్రిని సేకరించి, విశ్లేషించి యున్నారు. అదియు వెలుగునకు రావలసియున్నది.

ఇట్లు శ్రీ వేటూరి ప్రభాకశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి ప్రణాళికాబద్ధముగ క్రమమున వెలుపరింపవలసియున్నది. ఈ రచనాసామగ్రి నంతటిని శ్రీ ప్రజాకరపరిశోధకమండలి పరిశ్రమించి సేకరించి, పైని వివరించిన విధమునే విశ్లేషించి ప్రకటించుటకు సిద్ధపఱచియున్నది. త్రత్పకటనమున కొకప్పుడు కొంత యత్నించిమి గాని ఆయత్నము ఫలింపలేదు.

గ్రంథప్రకటన మనుకొన్నంత తేలిక పనికాదని తెలియును. ఆది మాటలతో జరగునదియు కాదు. అయినను దీక్షతో వానినన్నిటి నొక క్రమప్రణాళిక ననుసరించి ప్రకటించుట కిపుడు శ్రీ ప్రభాకరపరిశోధక మండలి కృషిచేయుచున్నది.

ప్రథమ ముద్రణము జరిగిన యేఁబదియెనిమిఁదేండ్ల తరువాత నిప్పటికీ విలువగల సంకలనగ్రంథము ‘ప్రబంధరత్నావళి’ పునర్ముద్రణమందు చున్నది. దీనికై ఆర్థింపఁగా ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారు దయతో మూడువేల రూపాయలు, రెండేండ్ల వ్యవధిలో, వడ్డీ లేక తీర్చుకోవలసిన విధమున, అప్పుగా నిచ్చిరి దానికి వారికెంతో కృతజ్ఞులము. ఆ పైకముతోనే ఇప్పుడీకార్యము నారంభింపగల్గితిమి.

అప్పుతీరి, తిప్పలు దాటి, ఆరుమాసములకొక పుస్తకము చొప్పున వెలువరింప గల్గినను పదేండ్లపాటు జరుగవలసినంతపని యున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వమును, అకాడమీలును ఈ విషయమై ఉదారముగ ఉచితరీతిని అర్థిక సహాయమందించి యీ బృహత్కార్యక్రమమునకు చేదోడువాదోడు కాగలవనియు వారి తోడ్పాటుతో శ్రీ ప్రభాకరపరిశోధకమండలి తన బాధ్యతను నెరవేర్చి ఆంధ్ర పాఠకలోకముయొక్క ఆశయమును తీర్చగలదనియు ఆశించుచున్నది.

మా కోర్కి మన్నించి అడిగినంతనే విలువగల 'భూమిక'ను రచించి యొసగిన కళాప్రపూర్ణ, విద్యారత్న శ్రీ నిడుదవోలు వేంకటరావుగారికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాము.

ఈ గ్రంథమునిప్పుడు ప్రథమముద్రణము ననుసరించి యథామాతృకముగ పునర్ముద్రించుచున్నాము, అనుబంధమున చేర్పబడిన విషయములను అందలి సూచన ననుసరించి గ్రంథమున చేర్చితిమి. ఆ కారణమున పద్యసంఖ్యాక్రమము మారినదేగాని ప్రణాళిక మారలేదు. అక్కడక్కడ పుటలలో శ్రీ శాస్త్రిగారే గుర్తించిన విషయములను అధోజ్ఞాపికలలో పేర్కొంటిమి (పుటలు 5, 6, 33, 106 లోని ఆధోజ్ఞాపికలు మాత్రము మేము క్రొత్తగా చేర్చినవని మనవి.) గ్రంథమున శీర్షికల ప్రక్కనగల (ఆం); (జ); (ఇ)—అను సంకేతములు ప్రథమ ముద్రణము (పు. 185–189)లో గల సూచనల ననుసరించి సౌలభ్యమునకై కూర్పఁబడినవి. ఆ యనుబంధములను కూడ యథాపూర్వము గ్రంథాంతమున పరిశీలనార్ధముంచితిమి. ప్రథమ ద్వితీయ ముద్రణములందుగల పద్య సంఖ్యాక్రమము నెరుంగుటకై తుదిని పద్యానుక్రమణిక నకారాదిగా సంధానించితిమి భూమికారచయిత పేర్కొన్న పద్యసంఖ్యలు ప్రథమ ముద్రణము ననుసరించినవే.