పుట:Yogasanamulu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా మానవత్వము నుండి పైమెట్టు అయిన దివ్యత్వమును పొందుటకు సాధన చేయవలయునే గాని తనకన్నా హీన స్థితి పొందిన మృగ, పక్షి, వృక్ష, పర్వతముల వంటి జ్ఞానరహిత జీవరాశుల స్థితిని పొందుటకు సాధన చేయుట అజ్ఞానమునకు నిదర్శనము. మానవుడు సహజముగా తన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రభావమునకు లోబడి తన్నుతాను పూర్తిగా మరచి సంసార మనెడు సుడిగుండములోబడి బయటకు రాలేకపోగా తానున్న ఆ అజ్ఞాన స్థితియే నిజమగు సుఖమని నమ్మి మోసపోవు చున్నాడు. అజ్ఞాన తిమిరము జ్ఞానకాంతితో తొలగినపుడు తన పొరపాటును గుర్తెరిగి జన్మ రాహిత్యమును పొంది భగవదైక్యమును పొందుటకు సాధనము చేయుచున్నాడు. ఆ స్థితిని సాధించుట కొరకు భక్తి, కర్మ, జ్ఞాన యోగములను సాధనములను ఉపకరణములుగా ప్రసాదించబడియున్నవి. భక్తి, కర్మ, జ్ఞాన యోగముల చేత భగవత్సాక్షాత్కారమును బడయుటకు చాల కాలము అనగా ఒక్కొక్కప్పుడు జన్మ పరంపరలు కావలసి వచ్చును. కాని మార్గము సుఖతరమైనట్టిది. అదే లక్ష్యసాధనకు యోగము అనగా రాజయోగము. మరి యొక మార్గము. ఈ మార్గము కష్టతరముగా తోచినను త్వరగా భగవదైక్యము సాధించవచ్చును. యోగాభ్యాసము వలన కర్మ శేషమును దహింపజేసి జన్మ పరపరలు అవసరము లేకుండా మరియు సర్ప, వ్వాఘ్రములవంటి క్రూర జంతువులను మచ్చికతో వశపరుచుకొనిన రీతిని శాస్త్రవిహితములైన పద్ధతులను అనుసరించి, మార్గమును సుఖమైనదిగా చేసుకుని గమ్యమును సాధించవచ్చును. ఇట్టి రాజయోగసాధనకు హఠ యోగము ప్రథమ సోపానము.