100
నాల్గవనాడు వేల్సు యువరాజుగారు నగరమును తామొక్కరే ప్రైవేటుగా చూడదలచు కొనినారు. కొత్వాలు గారికికూడ తెలుపవద్దనినారు. కాని కొత్వాలుగారికి వారి సంకల్ప మప్పుడే తెలిసిపోయినది. నగర మంతటను పోలీసు వారికి మెలకువతో నుంచుటకై టెలిఫోను లిచ్చినారు. వేల్సు యువరాజు గారు మోటారులో ప్రైవేటుగా ఫలక్నుమా సౌధమును వదలి గుట్ట క్రిందికి వచ్చినారు. రావడములోనే కొన్ని కట్టెలబండ్లు అడ్డముగా వచ్చినవి. అవన్నియు పోవుటకుగాను పదిపదేను నిముషాలుపట్టినవి. ఇంతలో వారు వెనుకకు తిరిగి చూచినారు. వెనుక రెడ్డిగారు సిద్ధముగా నుండినాను. వారిని పిలిచినారు. “నీ నెందుకు నా వెంట వచ్చుచున్నావు. అవసరము లేదు. అని సెలవిచ్చినారు. “చిత్తము” అన్నారు రెడ్డి గారు. యువరాజు గారు చారుమినారువద్ద వెళ్ళుచున్నారు. అచ్చటి పోలీసులు దిగ్బ్రమతో నెత్తి రుమాలుల సవరించు కొనుచు తుపాకులు అపసవ్యముగా పట్టుకొనుచు కొందరు లేచి కొందరు సగము లేచి అడ్డదిడ్డి సలాములు కొట్టినారు. యువరాజు గారికి మంచి వినోద దృశ్యము కనిపించినది. బాగానవ్వుకొని తరువాత కొత్వాలుగారితో ఆ దృశ్యము వర్ణించి వర్ణించి నవ్వినారట.