వేమన 126
ధర్మశాస్త్రకారుల మతము పరీక్షించిన నన్నియు స్వార్థములే యగును. పరోపకార మెందుకు చేయవలయును? అని యడిగిన నీకు పుణ్యము వచ్చునని వారందురు. పుణ్యమునకు ఫలము ఇహ పరలోకములందు సుఖము. ఇట్లే పరుల కపకారము చేసిన పాపము వచ్చును. ఫలము నరకాదులు, కావున ఇతరులకు సుఖము గలుగఁజేయుటకు తనకు దానివలన సుఖముగల్లునను నాశయు, దు:ఖము కలుగఁజేయకుండుటకు తనకు దానివలన దుఃఖము గల్లునను భయమును నీతి సామాన్యమునకు మూలముగా మనలో నేర్పడినవి. కావున పరార్థనీతులును స్వార్థములే. 'తనవలన ఇతరులు సంతోషించిన తనకు నంతోషము కలుగవలయును. దుఃఖము గలిగిన తాను దుఃఖింపవలయును" అను నుదారభావమును ప్రజలలో వ్యాపింపఁజేసిన నీతిగ్రంథములు ప్రాచీనులలో నరుదు. ఇట్టి స్వార్ధబుద్ధితోనే వారు ఘనమైన నీతి కార్యము లెన్నో చేసినారనుట సత్యమే. దానిచే సామాన్యముగా జనులలో నిప్పటికంటె నపుడు పరోపకారబుద్ధి యెక్కువగా నుండె ననుటయు నేను మఱచి పోలేదు. కాని తనపనిచే ఇతరులకుఁ గల్గు సుఖమునకంటె తసకు కలుగఁబోవు సుఖమునందే దృష్టి యొక్కువగా నుండుటచే, ఇట్టిపనులు నిష్కల్మషముగా తృప్తికరముగా నుండవు. ఇప్పుడు సర్కారివారి బిరుదుల నాశించి సత్రములు గట్టించువానికి ఆ బిరుదు లభించిన తరువాత ఆ సత్రము గోడలెప్పుడు పడిపోయినను చింత యక్కరలేదు గదా ? ఇట్లే, స్వర్గాది సుఖముల నాశించువారికి, ధర్మశాస్త్రములందే పరోపకారము చేయవలెనని చెప్పఁబడినదో యదిమాత్రము చేసినఁ జాలును, తక్కిన వక్కరలేదు. అదిగూడ ఎంతసులభము చేసికొనుటకు సాధ్యమో యంతయు చేయుదురు. గోదానముచేసిన పక్షమున, అది పాలుపిండినను, ఎండినను, మనస్వర్గలోకపు త్రోవకడ్డముగానుండు వైతరణి నదిని దాటించుటకై మనకు అక్కడి దివ్యగోపు సిద్ధముగా నిలిచియుండును. కాని గోవులే లేనప్పడు దానికి బదులు సువర్ణదానము చేయవచ్చునని ధర్మశాస్త్రములే కలవు. సువర్ణము లేనప్పడు వెండికావచ్చును. ఇంతే వెండి యీయవలయునని నిర్ణయములేదు. ఇన్నాళ్ళవఱకును రెండణాల రూకయు వెండిదే. అదిలేనప్పడు రెండణాల రాగినాణెములు. వానిలో ఒకటి రెండు తగ్గినను బాధలేదు. కట్టకడపట నది యొక బొట్టుబిల్ల క్రిందికి దిగును. కాఁబట్టి ఈ పద్ధతి ప్రకారము గోవు వెల ఒక బొట్టు ! దానిని దానమిచ్చినను గోదానము చేసినట్లే. కాని యాబొట్టును గూడ మూఁడు దమ్మిడీలుగా పగులగొట్టవచ్చును గదా ? మితవ్యయము కుల ధర్మముగాఁ గల వైశ్యశిఖామణి యొకఁడు అది మఱిచిపోలేదు. కనుక అతఁడు తాను గట్టించిన సత్రములో బోజనమైన తరువాత బ్రాహ్మణులకు తప్పక నిత్యముకు తాంబూలములో ఒకదమ్మిడీపెట్టి ' సువర్ణపుష్పదక్షిణ ' సమర్పించుచున్నాడనుట యొఱుఁగుదును ! కాఁబట్టి యిట్టి స్వార్ధపరోపకారములో ఫలమెక్కువ యుండదని చెప్పఁబనిలేదు.
వేమన పరార్ధ నీతులందు ఈ స్వార్ణదృష్టి చాల తక్కువ. 'ఇంచుకంతబోన మీశ్వనార్పణమన్న పుణ్యలోకమునకుఁ బోవునతఁడు (348). ఇత్మాదిగా నొకటి రెండుమాఱులు చెప్పినను మొత్తముమీఁద లంచమాసపెట్టియో, భయపెట్టియో, పరోపకారము చేయించుట కతనికిష్టములేదు. పుణ్యము, పాపము అను భావములు మనుష్యులు కల్పించుకొన్నవే కాని దేవుడు చేసిసవి కాదని యితని మతము