పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోరాడాడు. దేవి త్రిశూలంతో అతణ్ణి పొడిచి సహస్రబాహువులతో ప్రత్యక్షమైన అతణ్ణి చంపి 'దుర్గా' నామాన్ని వహించింది.

కాళీతంత్రంలో మహాకాళీరూపాన్ని ఇలా నిరూపించారు. 'అతిభయంకర. కరాళదంష్ట్ర, చతుర్భుజ, ఒక చేత కపాలము, ఒక చేత ఖడ్గము - ఒకటి, వరదహస్తము. ఒకటి అభయహస్తము. శివశక్తి, దిగంబర, కరాళ జిహ్వ. కాలాధిదేవత మహాకాలునికి స్త్రీ మూర్తి. జగత్తు కాలంలో లయ మొందినప్పుడు సమస్తమూ శివము కాని శవము. జగన్నాశనము చేసిన ఏకైక వీరగా ఆమె భయంకర స్వరూపంతో నిలుస్తుంది. వికటాట్ట హాసము, విజయ ఘోరహాసము. నాలుగు హస్తాలు కాలంలో లయం పొందే నాలుగు దిశలు. ఖడ్గము వినాశసాధనము. తొలగిన తల విజయచిహ్నము. అమృతత్వంలో ఆనందమున్నది. వరదహస్తము కాలాధిదేవతయైన ఆమెకున్న దానయోగ్యతానిరూపణ లక్షణము. నగ్నత్వము సత్యము మాయావరణ రహితమైనదని నిరూపించు గుణము. చితి జగచ్చితి. కాలాధి దేవత ఐన ఆమె కాలకర్ణ, అంటే జగత్తులోని సమస్త రూపాలూ, వర్ణాలూ, లయ మొంది, కాలరాత్రి స్వరూపయైన ఆమెలో లయం పొందుతవని అభిప్రాయాన్ని మహాకాళీ రూపకల్పన నిరూపిస్తున్నది.

దుర్గాదేవి విగ్రహ రూపానికి కూడా ఇటువంటి అర్థాన్ని ప్రతిపాదించి పూర్వులు నిరూపించారు. దుర్గ పరబ్రహ్మము. త్రిశూలము జ్ఞానము, ఆమె వాహనమైన సింహము మహిషాసురాదులు కామక్రోధాదులు, త్రినేత్రాలు త్రికాలాలు, లక్ష్మీసరస్వతులూ, వినాయక కార్తికేయులూ చతుర్విధ పురుషార్థాలట. అందువల్ల దేవీపూజ వల్ల సాధకుడు పురుషార్థసాధన మూలాన జ్ఞానాన్ని సంపాదించుకొని, కామ క్రోధాదులను ధ్వంసం చేసి త్రిపురనాశకుడు, సర్వవ్యాపి అయిన పరమాత్మను తెలుసుకొంటాడు - అని దుర్గాపూజ అంతరార్ధము.

(శరన్నవరాత్రి పూజావిధానాన్ని గురించీ, దేవీ స్వరూపాన్ని గురించి విశేషంగా తెలుసుకోవటానికి భారతి - రక్తాక్షి ఆశ్వయుజమాసము సంచికలోని 'శరన్నవరాత్రాలూ' భారతి - ఆంగీరస అశ్వయుజమాస సంచికలోని 'నవరాత్రి పూజ', గృహలక్ష్మి ఆంగీరస సంచికలోని 'దసరా ఉత్సవము'లను చూడ గోరుతాను, దేవీ కథాదికాలను గురించి శ్రీ మాధవరామశర్మ శ్రీదేవీకథలు ఆంధ్రభాషలో విశేష పరిచయం కలిగించగల పుస్తకాలు.)

- ఆంధ్రపత్రిక - 1948 అక్టోబరు 6

338

వావిలాల సోమయాజులు సాహిత్యం-4