పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్యానించినాడట. జ్యేష్ఠా, నీలజ్యేష్ఠ లిద్దరూ లక్ష్మి తోబుట్టువులు. 'తురంగనాసా చ లంబోష్ఠీ లంబమాన స్తసోదరీ, ఆలోహితా స్మృతా హ్యేషా జ్యేష్టాలక్ష్మీ రితిశ్రియే' - అని జ్యేష్ఠా లక్షణము. విమల వ్యాఘ్రయాన, చేతియందు కర్తరి కలది. త్రినేత్ర, హుతాశన అగ్నిలోని స్త్రీ శక్తి. విశాలాక్షీ సుందరి. హుంకార మీనవక్త్రమీనగ. బడబాముఖి బడబాగ్ని స్త్రీమూర్తి. 'తర్జన్యాభయ భృత్సోమ్యే దండకపాలినీ, కృష్ణా హాహారవా క్రూరా రాసభస్య ఖరస్థితా' ఇది హాహారవ రూపము. వంగదేశంలో దుర్గాదేవిని చండికగా భావిస్తారు. దుర్గాపూజ కేర్పరచిన స్థలాన్ని 'చండీతల' మంటారు. పూజను చండీ పూజ అంటారు. యోగేశ్వరిని వంగదేశములోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే పూజిస్తారు. కరింగిని క్రోధసుత, ఇదేరీతిగా మిగిలిన దేవతా మూర్తులును కొన్ని సాత్వికములు, కొన్ని రాజసికములు, కొన్ని తామసికములు.

ఈ సమస్త దేవతాస్వరూపాలకు మూలము ఆదిశక్తి. ఆమె ప్రథమంలో మహిషాసురుణ్ణి సంహరించటానికి అవతరించింది. రాక్షసమాత దితి కుమారుల అపజయానికి చింతించి మహిషీ రూపంతో బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి మాయావి, శూరుడైన మహిషాసురుని కన్నదట. నాడు దేవతలకు దుర్నిరీక్షుడై, బాధలు పెట్టు సమయంలో దేవతలందరూ విష్ణుదేవుని చేరుకుంటే, వారి ఆలోచనాసమయంలో వారి శరీరాలనుంచి తేజోరూపాన వారి అంశాలు బయలుదేరి, సుందరాకార, ఆభరణభూషిత, అత్యుజ్జ్వల అయిన మహాదేవి అవతరించింది. ఆమె అష్టాదశభుజ. బ్రహ్మాది దేవతలు వారి వారి ఆయుధాలను ఆమె కిచ్చారు. ఇంతలో మహిషాసురునికి రాత్రి కల ఒకటి వచ్చి అందులో దేవి తన్ను సంహరిస్తున్నట్లు తెలిసికొని, నిరంతరమూ 'నా శరీరము నీ పాదాలకు అంటి ఉండేటట్లు ప్రసాదింప మని కోరగా, అతణ్ణి మహాదేవి ఉగ్రచండ, మహాకాళి, దుర్గ - అనే మూడు మూర్తులతో రూపుమాపి మహిషాసురమర్దని ఐంది.

పూర్వం తపశ్శక్తితో ముల్లోకాలనూ జయించిన రురుని కుమారుడగు దుర్గుని శక్తికి తాళలేక, దేవతలు శివుని శరణుచొచ్చారట. శివుడు దుర్గుని సంహరించటానికి (శాంభవీశక్తిని) మహాదేవిని కోరగా ఆమె కాళరాత్రిని పంపించినది. కాళరాత్రి హుంకారాగ్ని మూలాన అతని సైన్యాన్ని నాశనం చేసింది. దుర్గుడు కాళరాత్రితో పోరాడుతూ వింధ్యాద్రివరకూ వచ్చి, దేవిని చూసి మోహించి భార్యగా కోరాడు. ఆమె క్రూరదృష్టితో అతని సేవకులను చెండాడిన తర్వాత, దుర్గుడు గజరూపాన్ని ధరించి పోరాడగా ఆ గజాన్ని ఖండించిన తరువాత, మహిషరూపాన్ని పొంది దుర్గుడుసంస్కృతి 337