పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయటం ఆచారము. దశమినాడు పూజ అయిపోయిన తరువాత మధ్యాహ్నం మంగళ వాద్యాలతో, ఉత్సవాదులతో దేవీ ప్రతిమను నదీజలంలో నిలిపివస్తారు. దీనినే మహాపూజ అంటారు. పూర్వాచార పరాయణులైన ముత్తయిదువలు 'గౌరమ్మ నీళ్లట' అని అంటుంటారు.

ఈ కల్పాలను అనుసరించి చేసే పూజ సత్త్వ, రజః, తమోగుణాలను అనుసరించి సాత్వికి, రాజసి, తామసి అనే విభేదాలతో ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ఈ పూజవల్ల, తత్తదర్ఘమైన శక్తి కలుగుతుంది. సత్వగుణ ప్రధానాలైన అవస్థలు మూడు. రజః ప్రధానాలు మూడు. తమఃప్రధానాలు మూడు. సాత్విక సాత్వికము, సాత్విక రాజసము, సాత్విక తామసములు సాత్వికావస్థలు. ఇదేరీతిగా రజస్తమస్సులలోనూ ఆయా సంబంధావస్థలు ఉన్నవి. వీటిలో శ్రేష్ఠమైన సాత్విక సాత్వికావస్థ ఉదయించి నప్పుడే వాస్తవమైన దేవీశ్రద్ధ ఉదయిస్తుందట! పూజావిధానాలలో సాత్వికము మునికోటికి, రజోయుతాలు రాజకోటికి, తామసములు నిశాచరులకు, దిద్దేశకాలాదికాలను తెలుసుకొని మంత్రద్రవ్య విప్రసంయుతంగా చేసేది సాత్వికము. ఇది అత్యుత్తమము, శాంతి దాంతి స్వభావులకు మాత్రమే ఇట్టి పూజావిధానము లభ్యము. రాజసములలో ద్రవ్య బాహుళ్యముంటుంది. సురామాంసాదులతోనూ, జంతుబలులతోనూ కూడినది తామసి. రాజసిలోనూ ఆమిషముంటుంది. సాత్వికంలో నిరామిష నైవేద్య యజ్ఞ పారాయణాదులు ఉంటవి.

దేవీపూజ విషయమున ఉత్తర హిందూస్థానమునకూ, దక్షిణ హిందూస్థానమునకూ విశేషమైన అంతరమున్నది. వారిది సప్తమ్యాది కల్పము. దాక్షిణాత్యులది ప్రతిపదాది కల్పము. ఈ రెంటికీ విశేషమైన అంతరమున్నది. వారిది తామసపూజ; అందువల్ల వారికి తుది మూడుదినాలే ప్రధానము.

ఉత్తర హిందూ దేశంలో పురాణాదులలో వర్ణితమైనట్లు దుర్గారూపమును మృత్తికాదులతో నిర్మించి ప్రతిష్ఠించి పూజ చేస్తారు. ఈ విగ్రహానికి, కుడివైపు సరస్వతీ గణేశుల ప్రతిమలూ, ఎడమవైపు లక్ష్మీకార్తికేయ ప్రతిమలూ ఉంటవి. ఉత్తరదేశంలో మహాకాళీపూజ సప్తమ్యాది కల్పాన్ని అనుసరించి జరుగుతుంది. ఇందులో తామసీవిధానము కనిపిస్తుంది. పశుబలి, మద్యపానము, అశ్లీలభాషణము విశేషము. ఇది కల్ప మన్నను క్షుద్రశక్తుల జాతరల కంటె భీకరమూ, బీభత్సమూ అని తెలుస్తున్నది. దక్షిణ దేశంలో కలశాన్ని స్థాపించి దుర్గాదేవిని ఆవాహన చేసి తొమ్మిది దినాలూ సాత్విక విధానాన్ని అనుసరిస్తారు. సరస్వతీ, లక్ష్మీ పూజలు కూడా జరుపుతారు.334 వావిలాల సోమయాజులు సాహిత్యం-4