పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశోపచారాలతో పూజించటం అనాదికాలం నుంచీ వస్తూ ఉన్న ఆచారం. నవమినాడు లక్ష్మిని ధన, ధాన్య, వస్త్ర, వృత్తి, వస్తురూపాలతో అర్చిస్తారు.

ప్రాచీన కాలంలో రారాజుల ఇళ్ళలో కల్పోక్త ప్రకారంగానే తొమ్మిది దినాలూ దేవీపూజ జరిగేది. అనుదినమూ ప్రభువులు, అమాత్య సామంతాదులతో కొలువు తీర్చి విద్వదోష్ఠులతోనూ, సంగీత నాట్యాదికాలతోనూ, కాలం గడుపుతూ విద్వద్వరేణ్యులనూ, శాస్త్రవేత్తలనూ, కళాకారులనూ శక్తిసామర్థ్యాలను అనుసరించి గౌరవించేవారు.

వ్యవసాయమూ, కంచరమూ, కమ్మరమూ మొదలైన వృత్తులు గల సామాన్య జనం, నవమి నాడు వారి వారి వృత్త్యుపకరణాలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి, అలంకరించి, శక్తి కొలదీ జాతరలు చేసుకొనేవారు.

పదవ దినము విజయదశమి. ఈ దినాన రారాజులు సింహాసన ఛత్ర చామరాది రాజలాంఛనాలనూ, గజాశ్వాది సేనాంగాలనూ, భక్తియుతులై పూజించేవారు. క్షత్రియుల ఇళ్ళల్లో సర్వసామాన్యంగా ఈ తొమ్మిది దినాలకోసం పూజావేదికను ఒకదానిని నిర్మించేవారు. పూర్వం విశేష ప్రాచుర్యం వహించిన తండుల కుసుమ జలవికారాది కళాకుశలులు ఆ వేదికను అలంకరించేవారు. దానిమీదనే యుద్ధోపకరణాలను, ఛత్రచామరాదులను నిలిపేవారు. ఆ వేదిక మీద నిర్మించిన అగ్ని కుండంలో ఆర్ష ధర్మానుసారంగా సమస్త ఆయుధ దేవతలనూ ఆవాహన చేసి, సమంత్రకంగా వారి ప్రీతికోసం పాయసహోమం చేసేవారు.

పూర్వం రాజకుటుంబాలు విజయదశమినాడు చేసే కర్మలో లోహాభిస్మార మొక చిత్రమైన కర్మ. లోహుడనే రాక్షసుడు లోకభయంకరుడై దేవతలమీద దండెత్తగా, వారు అతన్ని ముక్కలు ముక్కలుగా త్రుంచి వేశారట. అవే నేటి ఆయుధాల కుపకరించే లోహపుముక్కలు. లోహరాక్షసుని అవశిష్ట భాగాలైన లోహపుముక్కలు ఈ అభిస్మార కర్మవల్ల మొక్కపోవని వారి నమ్మకము. ఆయుధ పూజ పరిపూర్తి అయిన తరువాత, ససైన్యంగా అశ్వాలను, గజాలను అధిరోహించి నగరానికి ఈశాన్య దిక్కుగా ఉన్న శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి శమీ పూజ చేస్తారు. వీటి అవశిష్ట రూపాలే నేడు మన పిల్లలు పట్టే విల్లంబులూ, కోతులూ - 'జమ్మికొట్టటము' శమీపూజకు మారురూపంగా నిలచిన ప్రక్రియ.

శమీవృక్షం దగ్గర మొదట 'అపరాజిత' పూజ జరుగుతుంది. ఆమె దుర్గాదేవి మూర్తిభేదము. అష్టదళపద్మం మీద దక్షిణ వామ భాగాలలో జయవిజయలను332 వావిలాల సోమయాజులు సాహిత్యం-4