పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవీ నవరాత్రాలు - ఆచార వ్యవహారాలు

భారతీయుల సాంఘిక జీవనంలో పండుగలు విశేషమైన ప్రాధాన్యము అనాదికాలం నుంచీ వహిస్తూ ఉన్నవి. ఆ పండుగల్లోని గోష్ఠుల మూలంగానూ, ఇతరములైన కార్యకలాపాల వల్లనూ సంఘంలోని వ్యక్తులలో సమష్టి జీవనం అభివృద్ధి పొందుతూ వచ్చింది. జాతీయ జీవనాన్ని పెంపొందిస్తూ ఒకనాడు అనంతవైశిష్ట్యాన్ని చేకూర్చుకున్నవి. అందువల్ల అవి జనసామాన్య ధర్మంలోనూ, మత విషయక జీవనంలోనూ భాగాలై నేటివరకూ నిలచి ఉన్నవి.

హిందువుల ధర్మాలూ, వైజ్ఞానిక ప్రవృత్తి, నమ్మకాలూ, నిశ్చయాలూ వెల్లడి చేసే పండుగలు అనేకం ఉన్నవి. అట్టివాటిలో సంఘంలోని సమస్త వర్ణాలవారూ ప్రాచుర్యం వహించే పండుగలు కొన్ని మాత్రమే. నవరాత్రాలు అందులో ఒకటి. మకర సంక్రాంతి తరువాత దీనిని అత్యుత్తమమైన పండుగగా భారతీయ ప్రజలు భావిస్తూ ఉన్నారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకూ వచ్చునవే నవరాత్రాలు. నవరాత్రోత్సవాలు శరత్కాలంలో జరగటం వల్ల శరన్నవరాత్రాలనీ, లక్ష్మి, సరస్వతి, పార్వతి, రాజరాజేశ్వరి మొదలైన దేవీ రూపాలకు ఈ నవరాత్రాల్లో పూజ జరగటం వల్ల దేవీ నవరాత్రాలనీ వీటికి పేర్లున్నవి. సామాన్య ప్రజలు 'దశరా' అని వ్యవహరిస్తున్నారు.

రావణాసురుడు దేవీపూజ వసంతకాలంలో చేసేవాడట. శ్రీరామచంద్రుడు శరత్కాలంలో దేవీపూజ చేసి, రావణవధ చేసినట్లు మహర్షి వాల్మీకి పలికినాడు.

ఈ తొమ్మిది దినాల్లో ఆదిశక్తి మూర్త్యంతరంగా ఉన్న దుర్గాదేవీపూజ జరుగుతుంది. ఐశ్వర్యప్రద అయిన లక్ష్మిని, జ్ఞానప్రద అయిన సరస్వతిని విధియుతంగా ప్రజలు శక్తికొలదీ పూజాదికాలతో కొలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడుగానీ, అష్టమి నాడు గానీ, లేదా దశమి నాడు గానీ సర్వసామాన్యంగా సరస్వతీపూజ జరుగుతుంది. వేదికమీద గ్రంథాదులను సేకరించి భారతీదేవిని, ఆహ్వానించి,సంస్కృతి 331