పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరుకొండ రాజుల్లో ముమ్మడి నాయకుల తమ్ముడు సింగమనాయకుడు గొప్ప సంగీత కళాభిమానిగా కనిపిస్తున్నాడు. ఒకానొక శాసనంలో ఇతన్ని గురించి

శా. 'వీణా వాదనకోవిదేన విలసల్లాస్య ప్రశస్యశ్రీయో
సారస్యాస్పదగానమానవిధినా సౌజన్యమానాత్మనా ।
నిత్యైశ్వర్యవిలాసినా నిరుపమాకారేణ కాంతాజనే
నాయంకూనయభూమిసింగతిలకః క్రీడన్ సదామోదతే!

అని ఉన్నది.

కొండవీటి పెదకోమటి వేమారెడ్డితోనూ, విజయనగర రాజన్యుడు ప్రౌఢదేవరాయలతోనూ కీర్తిస్పర్ధ వహించి కవితాపోషణం చేసిన రాచకొండ రాజు సర్వజ్ఞ సింగభూపతి సంగీత నాట్యాలకు దోహమిచ్చినట్లు కనుపించదు. కానీ ఓరుగంటి నివాసి బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'వినుము దేహధారి స్వతంత్రుడు కాడు, జంత్రకాని చేతి జంత్రబొమ్మ కైవడి నీశ్వరతంత్రపరాధీనుండై దుఃఖంబులందు నర్తనంబు సలుపు' (దశమస్కంధము ఆ 2) అని బొమ్మలాట ప్రశంస చేసినాడు.

ఇక విజయనగర రాజన్యుల సంగీత నాట్యపోషణమును గురించి ఆలోచించవలసి ఉన్నది. హరిహర బుక్కరాయల మహామంత్రి విద్యారణ్యులవారు సంగీతసారమనే ఒక శాస్త్రగ్రంథాన్ని వ్రాసినారట. అందులో 267 రాగాలు ప్రత్యేకంగా వారు సూచించినట్లు ఇతర గ్రంథాలను బట్టి తెలుస్తున్నది. బుక్కరాయల వల్ల పెంచుకలదిన్నె గ్రామాన్ని అగ్రహారంగా స్వీకరించిన నాచన సోమనాథ కవి శేఖరుడు ఉత్తర హరివంశంలోనూ, వసంత విలాసంలోనూ కొన్ని సంగీత నాట్య ప్రశంసలు చేసినాడు. ‘కమలముఖీ కటాక్ష కటకాముఖపాణి నభోపకారివిభ్రమమణి పుంఖరింఖ దభిరామరుచుల్' - ఉత్తరహరివంశము. ఆ 1. పద్యం 159; పేదలైన విన బ్రాహ్మణు వీట, జాణలు మెత్తురు జాజరపాట - ఉ. హరి. పీఠిక;

సీ. 'వడకు పన్నగరాజు పడగలమీద స
ర్వం సహాకాంత పేరణము సూప,
నుర్రూతలూగెడు నుదయాస్తగిరులతో
నాకాశలక్ష్మి కోలాటమాడ,
తెరలెత్తి సప్తసాగరములు పొరలంగ
వరుణుండు గొండిలి పరిఢవింప,