పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గారి అభిప్రాయము. అందులోని వీణాది వాద్యజంత్రాలనూ, నాట్య భంగిమలలో నున్న స్త్రీ వేషాలనూ పరికిస్తే, ఆ నాడు కూడా సంగీత నాట్యాలు రెండూ ఆంధ్రులకు ఆదరణపాత్రాలైన కళలుగా ఉన్నవని వ్యక్తమౌతుంది.

'అందీ అందని భావరేఖల ప్రసన్నాగారతన్ లేత పూతన్ తీపారగ తీర్చి దిద్దిన అజంతాగహ్వర శ్రేణులు', వాకాటకరాజుల నాటివి. కానీ శిల్పు లాంధ్రులు. ఎల్లోరా, కైలాసము, అజంతా శిల్పఖండాలనూ, భిత్తిచిత్రాలనూ పరిశీలిస్తే సంగీత నాట్యాలకు ఆ నాటి రాజన్యులెంత ప్రాధాన్యము నిచ్చారో వ్యక్తమౌతుంది. శివ తాండవాది దేవతా నాట్య భంగిమలను నిరూపణ చేసే సందర్భంలో శిల్పులు ఉపయోగించిన వీణలనూ, సంగీత వస్తువులనూ గమనిస్తే, అజంతా శిల్ప సమ్రాట్టులకు సంగీత నాట్య శాస్త్రాలలో ఉన్న పరిచయం ద్యోతిత మౌతుంది.

క్రీ.శ. 610లో రెండవ పులకేశి పూర్వ దిగ్విజయయాత్రకు బయలుదేరి ప్రాగాంధ్రాన్ని జయించి, తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని నూతన రాజ్యాధిపతిని చేసి, తిరిగి వెళ్ళిపోయినాడు. అతని వంశస్థులు కొంతకాలం అంతఃకలహాలతో కాలం వెళ్ళబుచ్చి, తరువాత కళాపోషణకు పూనుకున్నారు. వీరితోబాటు పశ్చిమాన రాజ్యం చేస్తున్న బిల్హణమహాకవి శిష్యుడు సోమేశ్వరుడు నాట్యశాస్త్రాభిమాని. మహారాష్ట్రం నుంచి వచ్చిన ఒక గోండుకన్యకు స్వయంగా 'చరణాచారము' చెయ్యటానికి సింహాసనం దిగివచ్చేవాడు. ఆ మహారాజు నేర్పిన నాట్యభంగిమమే తరువాత కాలంలో 'గోండ్లి' అనే ప్రసిద్ధ నామాన్ని పొందింది. నృత్త రత్నావళిలో జాయపసేనాపతి ఈ విషయాన్నే -

"కల్యాణకటకే పూర్వం భూతమాతృమహోత్సవే సోమేశః కౌతుకే కాంచిద్ భిల్లవేష ముపేయషీమ్ నృత్యంతీ మథ గాయంతీం స్వయం పౌష్యమనోహరమ్ ప్రీతో నిర్మితవాన్ చిత్రగౌండినీ మిత్యయమ్ స్వతో భిల్లీ మహారాష్ట్ర గౌండినీ త్యభిధీయతే ॥”

అని పలికినాడు.

పశ్చిమ చాళుక్యులలోని సోమేశ్వరాది కళారాధకులను చూచి, కీర్తి స్పర్ధతో కొందరు పూర్వ చాళుక్యులు నాట్య సంగీత శాస్త్రాలకు చేయూత నిచ్చి పోషించారు. అందు మొదటినాడు, మొదటి చాళుక్య భీముడు. అతని మనుమడు రెండవ అమ్మరాజు. చాళుక్య భీమునికి (క్రీ.శ. 890-917) 'గాంధర్వ విద్యాప్రవీణ' బిరుదమున్నది. ఇతడుసంస్కృతి 315